!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 266-267
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి 266-267 శ్లోకములు
శ్లోకము 266:
స్వం బోధమాత్రం పరిశుద్ధతత్త్వమ్
విజ్ఞాయ సంఘే నృపవత్ చ సైన్యే।
తదాత్మనైవాత్మని సర్వదా స్థితో
విలాపయ బ్రహ్మణి దృశ్య జాతమ్ ॥266॥
1 స్వం బోధమాత్రం పరిశుద్ధతత్త్వమ్ విజ్ఞాయ-
పరిశుద్ధమైన తత్త్వము గల ఆత్మను బోధించగల దానిని గా తెలిసికొని ;
బోధమాత్రం అంటే బోధించగల, అంటే అన్నింటిని ప్రకాశింపచేయు జ్ఞాన స్వరూపముగా అని ; అంటే ఆత్మని జ్ఞానస్వరూపముగా గ్రహించి
3 సంఘే నృపవత్ చ సైన్యే -
రథగజతురగ సంఘములతో కూడిన సైన్యములో రాజు వలె;
సంఘే అన్న మాట ఆత్మకి కూడా వర్తిస్తుంది - రాజుకి రథగజతురగ సంఘముల లాగా - ఆత్మకి శరీరము ఇంద్రియములు, ప్రాణము అహంకారము అన్నీ సైన్యములావుంటాయి - సైన్యములో రాజు ఎలాముఖ్యుడో అలాగే, శరీరము ఇంద్రియములు, ప్రాణము, అహంకారములలో ఆత్మ జ్ఞానస్వరూపముగా గ్రహించి ముందుకు వెళ్ళాలి అన్నమాట.
4 తదాత్మనైవ ఆత్మని సర్వదా స్థితో
ఆ ఆత్మ చేతనే ఆత్మలో ఎల్లప్పుడూ నిలిచి;
ఆ జ్ఞానస్వరూపమైన బుద్ధితో ఆత్మలో నిలిచి, ఏం చెయ్యాలి ? అంతా కనపడేది అంతా బ్రహ్మమే అని గ్రహించాలి. ఆ మాట ఆఖరి పాదములో వస్తుంది.
5 విలాపయ బ్రహ్మణి దృశ్య జాతమ్ -
దృశ్యరూపములో పుట్టిన సమస్తము బ్రహ్మములో విలీనము చేయుము;
అంటే దృశ్యరూపములో పుట్టిన సమస్తము బ్రహ్మమే అని గ్రహించుము అని.
266 శ్లోక తాత్పర్యము:
"రథగజతురగ సంఘములతో కూడిన సైన్యములో రాజు వలె, పరిశుద్ధమైన తత్త్వము గల, శరీరము, ఇంద్రియములు, ప్రాణము, అహంకారములతో కూడిన ఆత్మను అన్నింటిని ప్రకాశింపచేయు జ్ఞానస్వరూపముగా గ్రహించి; ఆ జ్ఞానస్వరూపమైన బుద్ధితో ఆత్మలో నిలిచి, దృశ్యరూపములో పుట్టిన సమస్తము బ్రహ్మముమే అని గ్రహించుము".
శ్లోకము 267:
బుద్ధౌ గుహాయాం సదసద్విలక్షణమ్
బ్రహ్మాస్తి సత్యమ్ పరమద్వితీయమ్।
తదాత్మనా యోఽత్ర వసేద్గుహాయాం
పునర్న తస్యాంగగుహాప్రవేశః॥267॥
బుద్ధౌ గుహాయాం సదసద్విలక్షణమ్-
బుద్ధి అనేగుహలో సత్ అసత్ ల కన్న భిన్నమైన
బ్రహ్మ అస్తి సత్యమ్ పరమద్వితీయమ్ -
అద్వితీయమైన, సత్యస్వరూపమైన బ్రహ్మము కలదు:
తదాత్మనా యోఽత్ర వసేద్గుహాయాం -
ఆ బ్రహ్మస్వరూపమైన ఆత్మతో ఎవరు ఆ గుహలలో నివశించునో
ఇక్కడ గుహ అంటే స్థూలసూక్ష్మదేహాత్మకము అగు శరీరములో వుండే హృదయము అనబడే గుహ అన్న మాట. ఆ బ్రహ్మమునే ధ్యానిస్తూ ఆ గుహలో వుంటే మోక్షము వస్తుంది ; ఆమాట ఆఖరి పాదములో వస్తుంది.
4 పునః న తస్య అంగగుహాప్రవేశః -
తస్య పునః న అంగగుహాప్రవేశః -
అట్టివాడికి మళ్ళీ ఆ స్థూలసూక్ష్మదేహాత్మకము అగు గుహలో ప్రవేశము వుండదు:
అంటే అట్టి వానికి మొక్షము వస్తుంది అని.
267వ శ్లోక తాత్పర్యము:
బుద్ధి అనేగుహలో సత్ అసత్ ల కన్న భిన్నమైన అద్వితీయమైన, సత్యస్వరూపమైన బ్రహ్మము కలదు; ఆ బ్రహ్మస్వరూపమైన ఆత్మతో ఎవరు, స్థూలసూక్ష్మదేహాత్మకము అగు శరీరములో వుండే హృదయము అనబడే ఆ గుహలో నివశించునో, అట్టివాడికి మళ్ళీ ఆ స్థూలసూక్ష్మదేహాత్మకము అగు గుహలో ప్రవేశము వుండదు అంటే మోక్షము వచ్చును.
॥ఓమ్ తత్ సత్॥
_____________________________________________