||సుందరకాండ ||

|| ఇరవైయ్యవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 20 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ వింశస్సర్గః

ఈ సర్గలో జరిగిన కథ టీకాత్రయములో క్లుప్తముగా ఇల చెపుతారు. "చాటువచనోపన్యాసైః సీతాం ప్రతి ప్రలోభయన్ రావణః ప్రరోచనపూర్వం స్వాఙ్గీకారం ప్రార్థయత" మధుర భాషణతో సీతను మభ్యపెట్టబోతూ తన కోరిక సీతను అంగీకరించమని ప్రార్థిస్తాడు. ఈ సర్గ అంతా రావణుని మాటలతో సాగుతుంది. రావణుడు అంటే మనస్సు అని, ఆ అదుపులేని మనస్సు ఏవిధముగా పయనిస్తుందో అది అంతా ఈ సర్గలో రావణుని మాటలలో చూస్తాము.

ఇక ఈ సర్గలో శ్లోకార్థములు.

||శ్లోకము 20.01||

స తాం పరివృతామ్ దీనాం నిరానన్దాం తపస్స్వినీమ్|
సాకారైర్మథురైర్వాక్యైః న్యదర్శయత రావణః||20.01||

స|| తాం పరివృతాం దీనాం నిరానందాం తపస్స్వినీం తాం సాకారైః మధురైః వాక్యైః న్యదర్శయత||

||శ్లోకార్థములు||

పరివృతాం దీనాం - చుట్టబడియున్నదీనమైన
నిరానందాం తపస్స్వినీం - ఆనందములేని తపస్విని అగు
తాం సాకారైః మధురైః వాక్యైః -ఆమెను హావభావచేష్ఠలతో మధురమైన మాటలతో
న్యదర్శయత - తన మనోభావమును వెల్లడించెను

||శ్లోకతాత్పర్యము||

"చుట్టబడియున్న, దీనమైన, ఆనందములేని తపస్విని అయిన సీతకు హావభావచేష్ఠలతో మధురమైన మాటలతో కూడిన వాక్యములతో రావణుడు తన మనోభావమును వెల్లడించెను." ||20.01||

||శ్లోకము 20.02||

మాం దృష్ట్వా నాగనాసోరు గూహమాన స్తనోదరమ్|
అదర్శనమివాత్మానం భయాన్నేతుం త్వ మిచ్చసి||20.02||'

స|| నాగనాసోరు మాం దృష్ట్వా స్తనోదరం గూహమానా త్వం భయాత్ ఆత్మానం నేతుమ్ అదర్శనం ఇచ్ఛసి ఇవ ||

||శ్లోకార్థములు||

నాగనాసోరు - ఓ ఏనుగు తొండమువంటి తొడలు కలదానా
మాం దృష్ట్వా స్తనోదరం గూహమానా త్వం -
నన్ను చూచి స్తనములను ఉదరమును దాచుకోని నీవు
భయాత్ ఆత్మానం నేతుమ్ -భయముతో నిన్నునా చూపుల నుంచి
అదర్శనం ఇచ్ఛసి ఇవ - మరుగుపరుచు కోవాలనుకుంటున్నావు

||శ్లోకతాత్పర్యము||

"ఓ ఏనుగు తొండమువంటి తొడలు కలదానా! నన్ను చూచి స్తనములను ఉదరమును దాచుకోని నీవు భయముతో నా చూపుల నుంచి మరుగుపరుచు కోవాలనుకుంటున్నావు." ||20.02||

||శ్లోకము 20.03||

కామయేత్వాం విశాలాక్షీ బహుమన్యస్వ మాం ప్రియే|
సర్వాఙ్గ గుణ సంపన్నే సర్వలోకమనోహరే||20.03||

స|| విశాలాక్షీ సర్వాఙ్గ గుణ సంపన్నే సర్వలోక మనోహరే త్వాం కామయే || ప్రియే మాం బహుమన్యస్వ||

||శ్లోకార్థములు||

విశాలాక్షీ సర్వాఙ్గ గుణ సంపన్నే- ఓ విశాలాక్షీ సర్వాంగసౌందర్యసంపత్తి కలదానా
సర్వలోక మనోహరే - సమస్త లోకముముయొక్క మనస్సు హరించుదానా
త్వాం కామయే - నిన్ను వాంఛిస్తున్నాను
ప్రియే మాం బహుమన్యస్వ - నన్ను అంగీకరింపుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ విశాలాక్షీ సర్వలోక మనోహరి నిన్ను నేను వాంచిస్తున్నాను. ఓ ప్రియా నన్ను అంగీకరింపుము." || ||20.03||

||శ్లోకము 20.04||

నేహ కేచిన్మనుష్యా వా రాక్షసాః కామరూపిణః|
వ్యపసర్పతు తే సీతే భయం మత్తస్సముత్థితమ్||20.04||

స||ఇహ మనుష్యా వా రాక్షసాః కామరూపిణః న | సీతే తే మత్తః సముత్థితం భయం వ్యపసర్పతు||

||శ్లోకార్థములు||

ఇహ మనుష్యా వా - ఇక్కడ మనుష్యులు కాని
రాక్షసాః కామరూపిణః న - కామరూపులైన రాక్షసులుకాని లేరు
సీతే తే మత్తః సముత్థితం - ఓ సీతా నీ మనస్సులో నా గురించి కలిగిన
భయం వ్యపసర్పతు - భయమును వదులును

||శ్లోకతాత్పర్యము||

"ఇక్కడ మనుష్యులు కాని కామరూపులైన రాక్షసులుకాని లేరు. ఓ సీతా నా గురించి కలిగిన భయమును వదిలుము". ||20.04||

ఇది రావణుని ప్రలోభము. రావణుడు అంటే మనస్సు అని మొదటి సర్గలోనే విన్నాము. ఆ మనస్సు ఎన్ని ప్రలోభములు చూపిస్తుందో, అవి అన్నీ రావణుని ఉపన్యాసములో మనకు కనపడతాయి..

భగవంతునికంటె వేరు విషయాలపై కోరిక ఉన్నప్పుడు, అంటే కోరుకోతగని విషయాలు కోరవలెనని అనిపించినపుడు ఎవరైన చూస్తారేమో అని జంకెదము. ఎవరూ చూడనప్పుడు తప్పుడు పని చేయుటకు మనస్సు జంకదు.

అందుచే భగవద్భావన లేని వారికి " ఇచట ఎవరూ లేరుగదా ! ఆ (పనికిరాని) పని చేసిననేమి?" అనిపించును. అదే సూచిస్తూ రావణుడు తనసంభాషణ "ఇక్కడ ఎవరూ లేరు" భయపడనక్కరలేదు అంటూ ప్రారంభిస్తాడు.

||శ్లోకము 20.05||

స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ నసంశయః|
గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్య వా ||20.05||

స|| హే భీరు పరస్త్రీణాం హరణం వా సంప్రమధ్య వా గమనం వా రక్షసాం సర్వథైవ స్వధర్మః| న సంశయః||

||శ్లోకార్థములు||

హే భీరు పరస్త్రీణాం సంప్రమధ్య హరణం వా -
ఓ భయస్థురాలా ! పరస్త్రీలను బలాత్కారముగా అపహరించడము
గమనం వా - రమించడము
రక్షసాం సర్వథైవ స్వధర్మః - రాక్షసుల స్వధర్మము
న సంశయః - సంశయము లేదు"

||శ్లోకతాత్పర్యము||

" ఓ భయస్థురాలా ! పరస్త్రీలను అపహరించడము, వారితో రమించడము అన్ని విధములుగా రాక్షసుల స్వధర్మము. అందులో సంశయము లేదు".||20.05||

పరుడగు సర్వేశ్వరుని స్త్రీలగు, ఆత్మలని బలాత్కరముగా హరించుట, వానిని తనవిగా చేసుకొని రమించుట మనస్సుయొక్క ధర్మము. ఆత్మ సహజముగా శుద్ధ స్వభావము కలదైననూ, కర్మవశమున ఏర్పడిన ప్రకృతి వికారమగు శరీరములో ని మనస్సుకు వశము అగును. జీవులందరూ పరమాత్మచే భరింపబడి పరమాత్మకే చెందెడివారు. కనక వారు పరస్త్రీలు. వారిని తనవశముగా చేసుకొని రమించుట స్వధర్మమని , మనస్సుకి ప్రతిరూపము అగు రావణుడు చెప్పెను.

రావణుని మాటలలో, మనస్సు మనను బంధించుటలో గల రహస్యము ఇక్కడ చెప్పబడెను. మనస్సు నకు బంధింపగలశక్తియున్ననూ, బంధించుట తన స్వభావమే అయిననూ, కామములు లేని జీవుని మనస్సు బంధింపలేదు.

||శ్లోకము 20.06||

ఏవం చైతదకామం తు న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి|
కామం కామః శరీరే మే యథా కామం ప్రవర్తతామ్||20.06||

స|| ఏతత్ ఏవం కామః కామం యథాకామం మే శరీరే ప్రవర్తతామ్ తు | అకామమ్ మైథిలీ త్వాం న స్ప్రక్ష్యామి ||

||శ్లోకార్థములు||

ఏతత్ ఏవం కామం - అది అలావుండగా
కామః యథాకామం - కామము కామములానే
మే శరీరే ప్రవర్తతామ్ తు - నాశరీరములో ప్రవర్తించుచుండగా
అకామమ్ మైథిలీ త్వాం - మైథిలి నన్ను కోరని
త్వాం న స్ప్రక్ష్యామి - నిన్ను తాకను

||శ్లోకతాత్పర్యము||

"ఈ విధముగా ఈ కామము నా శరీరములో ప్రవర్తించును. ఓ మైథిలీ కాని నన్ను కోరని నిన్ను నేను తాకను." ||20.06||

రావణుని మాటలలో, మనస్సు మనను బంధించుటలో గల రహస్యము ఇక్కడ చెప్పబడెను. మనస్సు నకు బంధింపగలశక్తియున్ననూ, బంధించుట తన స్వభావమే అయిననూ, కామములు లేని జీవుని మనస్సు బంధింపలేదు.
ఇక్కడ కామము లేని సీతను , రావణుడు తాకలేడు అన్నమాట.

అలాగే రావణుడు "అకామము గల", అంటే కామము లేని " నిన్ను(సీతను) నేను స్పృశించను" అంటాడు. కామమే బంధహేతువు. భగవంతుని కన్న ఇతర పదార్థము కోరినది సీత. అనగా బంగారులేడిని కోరినది సీత. కనకే రావణుడు ఆమెను బంధింపగలిగెను. ఇప్పుడు రాముని తప్ప ఇతర మైన దానిని కోరకుండుటచే రావణుడు ఆమెను స్పృశించలేకుండా వున్నాడు.

"అకామ" అంటే కోరికలేనిది అని. "అకామ" అంటే విష్ణువునందే కోరిక గలది అని కూడా అర్థము వుంది. విష్ణువునే కోరి, విష్ణువు కంటే ఇతరముగు విషయములపై ధ్యానము లేని వారిని మనస్సు బంధింపదు.

||శ్లోకము 20.07||

దేవీ నేహ భయం కార్యం మయి విశ్వసిహి ప్రియే|
ప్రణయస్వ చ తత్వేన మైవం భూః శోకలాలసా ||20.07||

స|| దేవీ ప్రియే మయి విశ్వసిహి ఇహ భయం న కార్యం | తత్వేన చ ప్రణయస్వ | ఏవం శోకలాలసా మా భూః||

||శ్లోకార్థములు||

దేవీ ప్రియే మయి విశ్వసిహి - ఓదేవి ! ప్రియురాలా ! నన్ను విశ్వశించుము
ఇహ భయం న కార్యం - ఇక్కడ భయమునకు తావులేదు
తత్వేన చ ప్రణయస్వ - నిజముగా ప్రేమించుము
ఏవం శోకలాలసా మా భూః - ఈ విధముగా శోకలాలసవు కావద్దు

||శ్లోకతాత్పర్యము||

"ఓదేవి ! ప్రియురాలా ! నన్ను విశ్వశించుము. ఇక్కడ భయమునకు తావులేదు. నిజముగా ప్రేమించుము. ఈ విధముగా శోకలాలసవు కావద్దు". ||20.07||

||శ్లోకము 20.08||

ఏకవేణీధరాశయ్యా ధ్యానం మలిన మంబరమ్|
అస్థానేఽప్యుపవాసశ్చ నైతా న్యౌపయికాని తే||20.08||

స|| ఏకవేణీ ధరాశయ్యా ధ్యానం మలినం అంబరం అస్థానే ఉపవాసః చ ఏతాన్ తే న ఔపయికాని ||

||శ్లోకార్థములు||

ఏకవేణీ ధరాశయ్యా -
ఓక జడతో భూమియే శయ్యగాచేసుకొని
ధ్యానం - ధ్యానము
మలినం అంబరం అస్థానే ఉపవాసః చ -
మలినమైన వస్త్రములు, అనుచిత ఉపవాసము
ఏతాన్ తే న ఔపయికాని -ఇవి నీకు తగినపనులు కావు

||శ్లోకతాత్పర్యము||

" ఓక జడతో భూమియే శయ్యగాచేసుకొని మలినమైన వస్త్రములతో ఉపవాసము చేయుట ఇవన్నీ నీకు తగని పనులు ||20.08||

రావణుడు చెప్పిన మాటలన్నీ, అంటే "ఒకే జడ", భూమి పైశయనము", "అలంకారము చేసుకొనకపోవుట", యౌవ్వనము తరిగిపోవును" అని అన్న మాటలు, మనస్సు చెప్పే మాటలు.

మనస్సు ఎప్పుడూ జీవుడు భగవత్ప్రాప్తి అనేకోరికతో సాధన చేయునప్పుడు,
ఆ జీవుని కోరికనుంచి వెనుకకు లాగుటకు మనస్సు అట్టి మాటలు చెపుతూనే యుండును.

ఇక్కడ రావణుడు విషయోపభోగములను అనుభవింపగల బాహ్యమైన శరీరసంబంధమగు యౌవనము గురించి విలపించును. శరీరమే ఆత్మ అనుకొనెడివారు, "జన్మనెత్తుట- విషయములను అనుభవించుటకొఱకే " అని భావింతురు. అట్టివారికి వయస్సుగడిచిపోతున్నదని రావణుని వలె బెంగగానుండును.

కాని ఆత్మ శరీరము కన్న భిన్నమైనది. అది శరీరములో ప్రవేశించినది భగవదనుభవము పొందుటకే. భగవదనుభవమునకు యోగ్యమైనది మానవజన్మ యొక్కటే. మానవ జన్మ యౌవ్వనము లాంటిది. ఆ జన్మ గడిచిపోవకముందు భగవదుగ్రహము పొందవలెను. పురుషుని అనుభవించక గడిచిపోయిన స్త్రీయౌవ్వనము వలె మానవ జన్మ వ్యర్థమగును.

దేవతలు నిత్య యౌవ్వనము కలవారు అనడములో రహస్యము ఇదే. నిత్యము భగవదనుభవశీలురగువారే దేవతలు. దానినే యౌవ్వనము అందురు.

మానవజన్మపొందియూ, భగవదనుభవముకోసము యత్నింపక, కర్మఫలములను అనుభవించుటలో నే మునిగి వున్నవారిపై భగవంతుడు విచారించుచుండును

||శ్లోకము 20.09||

విచిత్రాణి చ మాల్యాని చన్దనాన్యగరూణి చ|
వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణానిచ ||20.09||

స|| మైథిలి మాం ప్రాప్య విచిత్రాణి మాల్యాని చన్దనాని అగరూణి చ వివిధాని వాసాంసి దివ్యాన్ ఆభరణాని చ లభస్వ||

||శ్లోకార్థములు||

మైథిలి మాం ప్రాప్య - ఓ మైథిలీ నన్ను పొంది
విచిత్రాణి మాల్యాని - విచిత్రమైన మాలలు
చన్దనాని అగరూణి చ - అగరు చందనము
వివిధాని వాసాంసి - వివిధరకములైన వస్త్రములు
దివ్యాన్ ఆభరణాని చ లభస్వ - దివ్యమైన ఆభరణములను పొందుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ మైథిలీ నన్ను పొంది మాలలు అగరు చందనము వివిధరకములైన వస్త్రములు దివ్యమైన ఆభరణములను పొందుము." ||20.09||

||శ్లోకము 20.10||

మహార్హాణి చ పానాని శయనాన్యాసనాని చ|
గీతం నృత్తం చ వాద్యంచ లభ మాం ప్రాప్య మైథిలి ||20.10||

స|| మహార్హాణి చ పానాని శయనాని ఆసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభ||

||శ్లోకార్థములు||

మహార్హాణి చ పానాని - శ్రేష్టములైన పానీయములను
శయనాని ఆసనాని చ - శయనములను ఆసనములను
గీతం నృత్తం చ వాద్యం చ- గీత నృత్య వాద్యములను కూడా
లభ - పొందుము

||శ్లోకతాత్పర్యము||

"శ్రేష్టములైన పానీయములను, ఆసనములను, గీత నృత్య వాద్యములను పొందుము". ||20.10||

||శ్లోకము 20.11||

స్త్రీ రత్నమసి మైవం భూః కురు గాత్రేషు భూషణం|
మాం ప్రాప్య హి కథం ను స్యాత్ త్వమనర్హా సువిగ్రహే||20.11||

స|| స్త్రీ రత్నం అసి | ఏవం మాభూః | గాత్రేషు భూషణం కురు | సువిగ్రహే మాం ప్రాప్య త్వం కథం ను అనర్హా స్యాత్ ||

||శ్లోకార్థములు||

స్త్రీ రత్నం అసి - ఓ దేవీ! నీవు స్త్రీలలో రత్నము
ఏవం మాభూః - ఈ విధముగా నువ్వు ఉండకూడదు
గాత్రేషు భూషణం కురు - నీ గాత్రములలో ఆభరణములను ధరించుము
సువిగ్రహే మాం ప్రాప్య - మంచి విగ్రహము కలదానా ! నన్ను పొంది
త్వం కథం ను అనర్హా స్యాత్ - నీవు ఏమి పొందకుండా వుండగలవు

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవీ! నీవు స్త్రీలలో రత్నము. ఈ విధముగా నువ్వు ఉండకూడదు. నీ గాత్రములలో ఆభరణములను ధరించుము. మంచి విగ్రహము కలదానా ! నన్ను పొంది నీవు ఏమి పొందకుండా వుండగలవు ? ||20.11||

||శ్లోకము 20.12||

ఇదం తే చారు సంజాతం యౌవనం వ్యతివర్తతే|
యత్ అతీతం పునర్నైతి స్రోతః శీఘ్రమపామివ||20.12||

స|| చారు సంజాతం ఇదం తే యౌవనం వ్యతివర్తతే | యత్ అతీతం శీఘ్రః స్రోతః అపాం ఇవ పునః న ఇతి||

||శ్లోకార్థములు||

చారు సంజాతం - అతి సుందరమైన
ఇదం తే యౌవనం వ్యతివర్తతే - ఈ నీ యౌవ్వనము గడిచిపోవును
యత్ అతీతం శీఘ్రః - ఇది శీఘ్రముగా
స్రోతః అపాం ఇవ పునః న ఇతి - పారుచున్న నీరు వలె మరల వెనుకకు రాదు

||శ్లోకతాత్పర్యము||

"అతి సుందరమైన నీ యౌవ్వనము గడిచిపోవును. ఇది శీఘ్రముగా పారుచున్న నీరు వలె మరల వెనుకకు రాదు." ||20.12||

||శ్లోకము 20.13||

త్వాం కృత్వోపరతో మన్యే రూపకర్తా స విశ్వసృక్ |
న హి రూపోపమా త్వన్యా తవాస్తి శుభదర్శనే ||20.13||

స|| శుభదర్శనే త్వాం కృత్వా సః రూపకర్తా విశ్వసృక్ ఉపరతః మన్యే| త్వత్ అన్యా తవ రూపసమః న అస్తి ||

||శ్లోకార్థములు||

శుభదర్శనే - ఓ మంగళకరమైన రూపము కలదానా
త్వాం కృత్వా - నిన్ను సృష్టి చేసిన తరువాత
సః రూపకర్తా విశ్వసృక్- ఆ జగత్తుని సృష్ఠించిన సృష్టికర్త
ఉపరతః మన్యే - విరమింఛాడు కాబోలు
త్వత్ అన్యా తవ రూపసమః న అస్తి -
నీవు కాక నీతో సమానమైన సౌందర్యవతి లేదు".

||శ్లోకతాత్పర్యము||

"ఓ మంగళకరమైన రూపము కలదానా ! నిన్ను సృష్టి చేసిన తరువాత సృష్టికర్త సౌదర్యము సృజించడాన్ని విరమింఛాడు కాబోలు. నీతో సమానమైన సౌందర్యవతి లేదు".||20.13||

||శ్లోకము 20.14||

త్వాం సమసాద్య వైదేహీ రూపయౌవనశాలినీమ్|
కః పుమా నతివర్తేత సాక్షా దపి పితామహః||20.14||

స||వైదేహీ రూపయౌవనశాలినీం త్వాం సమాసాద్య కః పుమాన్ అతివర్తేత || సాక్షాత్ పితామహః అపి||

||శ్లోకార్థములు||

వైదేహీ రూపయౌవనశాలినీం - ఓ వైదేహీ రూపయౌవ్వనశాలియగు
త్వాం సమాసాద్య - నిన్ను చూసిన తరువాత
కః పుమాన్ అతివర్తేత - ఏ పురుషుడు ముందుకు పోగలడు
సాక్షాత్ పితామహః అపి - సాక్షాత్తు బ్రహ్మకూడా పోలేడు

||శ్లోకతాత్పర్యము||

" ఓ వైదేహీ రూపయౌవ్వనశాలియగు నిన్ను చూసిన తరువాత ఏ పురుషుడు ముందుకు పోగలడు. సాక్షాత్తు బ్రహ్మకూడా పోలేడు." ||20.14||

||శ్లోకము 20.15||

యద్యత్ పశ్యామి తే గాత్రం శీతాంశుసదృశాననే|
తస్మిం స్తస్మిన్ పృథుశ్రోణీ చక్షుర్మమ నిబధ్యతే||20.15||

స|| శీతాంశుసదృశాననే పృథుశ్రోణీ తే యద్యత్ గాత్రం పశామి తస్మిం తస్మిన్ మమ చక్షుః నిబధ్యతే||

||శ్లోకార్థములు||

శీతాంశుసదృశాననే -చంద్రబింబము తో సమానమైన అందము కలదానా
పృథుశ్రోణీ - అందమైన కటిప్రదేశము కలదానా
తే యద్యత్ గాత్రం పశ్యామి - నీ అవయవములను ఎక్కడ చూసినా
తస్మిం తస్మిన్ మమ చక్షుః నిబధ్యతే - అక్కడే నా కళ్ళు ఆగిపోతాయి

||శ్లోకతాత్పర్యము||

"చంద్రబింబము తో సమానమైన అందము కలదానా, అందమైన కటిప్రదేశము కలదానా, నీ అవయవములను ఎక్కడ చూసిన అక్కడే నా కళ్ళు ఆగిపోతాయి". ||20.15||

||శ్లోకము 20.16||

భవ మైథిలి భార్యా మే మోహ మేనం విసర్జయ|
బహ్వినాం ఉత్తమస్త్రీణాం ఆహృతానామ్ ఇతః తతః||20.16||

స|| మైథిలి మే భార్యా భవ | ఏనం మోహం విసర్జయ | ఆహృతానాం భహ్వీనామ్ మమ ఉత్తమ స్త్రీణాం సర్వాసాం ఏవ అగ్రమహిషీ భవ| తే భద్రమ్ అస్తు ||

||శ్లోకార్థములు||

మైథిలి మే భార్యా భవ - ఓ మైథిలీ ! నా భార్య అవుము
ఏనం మోహం విసర్జయ - నీ మోహమును వదులుము
ఆహృతానాం భహ్వీనామ్ - తీసుకురాబడిన అనేక స్త్రీలలో
మమ ఉత్తమ స్త్రీణాం - నా యొక్క అనేక ఉత్తమస్త్రీలలో
సర్వాసాం ఏవ అగ్రమహిషీ భవ - అందరికి పెద్ద పట్టపురాణివి అగుము.
తే భద్రమ్ అస్తు - నీకు మంగళము కూరును

||శ్లోకతాత్పర్యము||

" ఓ మైథిలీ ! నా భార్య అవుము. నీ మోహమును వదులుము. బాహుబలముతో తీసుకురాబడిన అనేక ఉత్తమ స్త్రీలలో అందరికి పెద్ద పట్టపురాణివి అగుము. నీకు మంగళము కూరును" ||20.16||

||శ్లోకము 20.17||

సర్వాసామేవ భద్రంతే మమాగ్రమహీషీభవ|
లోకేభ్యో యాని రత్నాని సంప్రమథ్యాహృతాని వై||20.17||
తాని మే భీరు సర్వాణి రాజ్యం చైతదహం చ తే|

స|| భీరుః లోకేభ్యః యాని రత్నాని సంప్రమమధ్య ఆహృతాని తాని సర్వాణి ఏతత్ రాజ్యం చ అహం చ తే||

||శ్లోకార్థములు||

భీరుః లోకేభ్యః యాని రత్నాని - ఓ భయస్థులారా లోకములనుంచి ఏ రత్నములు
సంప్రమమధ్య ఆహృతాని - జయించి తీసుకు రాబడినవో
తాని సర్వాణి - అవి అన్నీ
ఏతత్ రాజ్యం చ - ఈ రాజ్యము కూడా
అహం చ తే - నేను నేను కూడా నీ వాడనే

||శ్లోకతాత్పర్యము||

"ఓ భయస్థులారా లోకములో జయించి తీసుకువచ్చిన రత్నములన్నీ , వస్తువులన్నీ , నా రాజ్యము అన్నీ నీవే . నేనూ కూడా నీ వాడనే". ||20.17||

||శ్లోకము 20.18||

విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీమ్||20.18||
జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్విలాసినీ|

స|| పృథివీం సర్వాం నానా నగరమాలినీం విజిత్య విలాసినీ తవ హేతోః జనకాయ ప్రదాస్యామి ||

||శ్లోకార్థములు||

సర్వాం నానా నగరమాలినీం - అనేక నగరములతో కూడిన
పృథివీం విజిత్య - పృథివీ మండలము అంతా జయించి
విలాసినీ తవ హేతోః - ఓ విలాశినీ నీ కొఱకు
జనకాయ ప్రదాస్యామి - జనకునకు సమర్పిస్తాను

||శ్లోకతాత్పర్యము||

"అనేక నగరములతో కూడిన పృథివీ మండలము అంతా జయించి నీ కొఱకు జనకునకు సమర్పిస్తాను. ||20.18||

||శ్లోకము 20.19||

నేహ పశ్యామి లోకేఽన్యం యో మే ప్రతిబలో భవేత్ ||20.19||
పశ్యమే సుమహద్వీర్యం అప్రతిద్వన్ద్వమాహవే|

స|| ఇహ లోకే అన్యం మే ప్రతిబలః న | ఆహవే మే సుమహత్ వీర్యం అప్రతిద్వన్ద్వం పశ్య ||

||శ్లోకార్థములు||

ఇహ లోకే అన్యం మే ప్రతిబలః న -
ఈ లోకములో నాతో సమానమైన బలము కలవాడులేడు
ఆహవే మే సుమహత్ వీర్యం - యుద్ధరంగములో నా మహత్తరమైన వీరత్వము
అప్రతిద్వన్ద్వం పశ్య - ప్రతిద్వంద్వము లేనిది చూడుము

||శ్లోకతాత్పర్యము||

"ఈ లోకములో నాతో సమానమైన బలము కలవాడులేడు. యుద్ధరంగములో కూడా నాకు ప్రతిద్వంది లేని వీర్యమును చూడుము."||20.19||

||శ్లోకము 20.20||

అసకృత్ సంయుగే భగ్నా మయా విమృదితధ్వజాః||20.20||
అశక్తాః ప్రత్యనీకేషు స్థాతుం మమ సురాసురాః|

స||మయా అసకృత్ సురాసురాః సంయుగే భగ్నాః విమృదిత ధ్వజాః | మమ ప్రత్యనీకేషు స్థాతుమ్ అశక్తాః||

||శ్లోకార్థములు||

మయా అసకృత్ - నా చేత మళ్ళీ మళ్ళీ
సురాసురాః సంయుగే భగ్నాః -
సురాసురులు యుద్ధములో పరాజితులై
విమృదిత ధ్వజాః -
పడిపోయిన ధ్వజములతో కలవారు
మమ ప్రత్యనీకేషు స్థాతుమ్ అశక్తాః -
నా ముందు నిలబడడానికి అశక్తులు అయ్యారు

||శ్లోకతాత్పర్యము||

"నా చేత మళ్ళీ మళ్ళీసురాసురులు యుద్ధములో పరాజితులై, పడిపోయిన ధ్వజముల కలవారు అయ్యారు. నా ముందు నిలబడడానికి అశక్తులు అయ్యారు." ||20.20||

||శ్లోకము 20.21,22||

ఇచ్చ మాం క్రియతా మద్య ప్రతికర్మ తవోత్తమమ్||20.21||
సప్రభాణ్యవసజ్యన్తాం తవాఙ్గే భూషణానిచ|
సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణా||20.22||

స||మాం ఇచ్ఛ ఆద్య తవ ఉత్తమమ్ ప్రతికర్మ క్రియతామ్| తవ అఙ్గే స ప్రభాణి భూషణాని చ అవసజ్యంతాం | ప్రతికర్మణా సంయుక్తం తే సాధు రూపం పశ్యామి ||

||శ్లోకార్థములు||

మాం ఇచ్ఛ - నన్ను కోరుకొనుము
ఆద్య తవ ఉత్తమమ్ - ఇప్పుడు నీవు ఉత్తమమైన
ప్రతికర్మ క్రియతామ్ - అలంకరణలు చేసికొనవలెను
తవ అఙ్గే స ప్రభాణి భూషణాని చ - నీ అంగములలో కాంతి గల ఆభరణలు
అవసజ్యంతాం - ధరించబడుగాక
సంయుక్తం ప్రతికర్మణా - అన్నివిధములుగా అలంకరింపబడిన
సాధు పశ్యామి తే రూపం - నీ రూపమును చూచెదను గాక

||శ్లోకతాత్పర్యము||

"నా యొక్క ఇచ్ఛ నీవు ఉత్తమమైన అలంకరణలు చేసికొనవలెను. నీ అంగములలో కాంతి గల ఆభరణలు ధరించబడుగాక. ఆ విధముగా అలంకరింపబడిన నీ సాధురూపము చూచెదను". ||20.21-22||

||శ్లోకము 20.23||

ప్రతికర్మాభి సంయుక్తా దాక్షిణ్యేన వరాననే|
భుంక్ష్వభోగాన్ యథాకామం పిబ భీరు రమస్వ చ||20.23||

స|| వరాననే భీరుః దాక్షిణ్యేన ప్రతికర్మాభి సంయుక్తా యథా కామం భోగాన్ భుంక్ష్వ పిబ రమస్వ చ||

||శ్లోకార్థములు||

వరాననే భీరుః - ఓ భీరు! సుందరాంగీ
దాక్షిణ్యేన ప్రతికర్మాభి సంయుక్తా - నీకు ఇష్టమైనట్లు అలంకరించుకొని
యథా కామం భోగాన్ భుంక్ష్వ -భోగములు అనుభవించుము
పిబ రమస్వ చ - మధుపానము సేవించుము. రమించుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ భీరు! సుందరాంగీ ! నీకు ఇష్టమైనట్లు అలంకరించుకొని భోగములు అనుభవించుము. మధుపానము సేవించుము. రమించుము." ||20.23||

||శ్లోకము 20.24||

యథేష్టం చ ప్రయచ్చ త్వం పృథివీం వా ధనాని చ|
లలస్వ మయి విస్రబ్దా ధృష్ట మాజ్ఞాపయస్వ చ||20.24||

స|| త్వం పృథివీమ్ ధనాని చ యథేచ్ఛం ప్రయచ్ఛ| విస్రబ్దా మయి లలస్వ | ఘృష్టం ఆజ్ఞాపయస్వ చ||

||శ్లోకార్థములు||

త్వం పృథివీమ్ ధనాని చ - నువ్వు పృథివినీ ధనమును
యథేచ్ఛం ప్రయచ్ఛ - కోరికప్రకారము దానము చేయుము
విస్రబ్దా మయి లలస్వ - భయము లేకుండా నాతో రమించు
ఘృష్టం ఆజ్ఞాపయస్వ చ - . ధైర్యముగా నన్ను ఆజ్ఞాపించుము

||శ్లోకతాత్పర్యము||

"నువ్వు పృథివినీ ధనమును ఈ కోరికప్రకారము దానము చేయుము. భయము లేకుండా నాతో రమించు. ధైర్యముగా నన్ను ఆజ్ఞాపించుము."||20.24||

||శ్లోకము 20.25||

మత్ప్రసాదా ల్లలన్త్యాశ్చ లలన్తాం భాన్ధవా స్తవ |
బుద్ధిం మామనుపశ్య త్వం శ్రియం భద్రే యశశ్చ మే||20.25||

స|| భద్రే మత్ప్రసాదాత్ లలన్త్యాః తవ బాంధవా లలన్తాం | త్వం మమ ఋద్ధిం యశశ్చ అనుపశ్య|

||శ్లోకార్థములు||

భద్రే మత్ప్రసాదాత్ లలన్త్యాః - మంగళ స్వరూపిణీ నా వలన అనుభవింపుము
తవ బాంధవా లలన్తాం - నీ బంధువులు కూడా అనుభవించుదురు గాక
త్వం మమ ఋద్ధిం - నీవు నా ఐశ్వర్యము
యశశ్చ అనుపశ్య - కీర్తిని చూడుము.

||శ్లోకతాత్పర్యము||

" ఓ మంగళస్వరూపిణీ ! నా ప్రసాదముతో సుఖసంతోషములు పొంది నీ బంధువులను కూడా సంతోషపెట్టు. నా బుద్ధినీ యశస్సును చూడు".||20.25||

||శ్లోకము 20.26||

కిం కరిష్యసి రామేణ సుభగే చీరవాససా|
నిక్షిప్త విజయో రామో గతశ్రీః వనగోచరః||20.26||
వ్రతీ స్థణ్డిలశాయీ చ శఙ్కే జీవతి వా న వా|

స|| సుభగే చీరవాససా రామేణ కిం కరిష్యసి| నిక్షిప్త విజయః గతశ్రీః వనగోచరః వ్రతీ స్థణ్డిలశాయీ చ రామః జీవతి వా న శఙ్కే ||

||శ్లోకార్థములు||

సుభగే చీరవాససా రామేణ - ఓ సుందరీ చీరవస్త్రములు ధరించే రామునితో
కిం కరిష్యసి - ఏమి చేస్తావు
నిక్షిప్త విజయః గతశ్రీః - విజయము ఐశ్వర్యము లేని
వనగోచరః వ్రతీ - వనములో చరించు తాపసిక వ్రతములను అనుసరించు
స్థణ్డిలశాయీ చ రామః - భూమిపై నిద్రించు రాముడు
జీవతి వా న శఙ్కే - జీవిస్తున్నాడో లేదో అన్నది శంకయే

||శ్లోకతాత్పర్యము||

" ఓ సుందరీ చీరవస్త్రములు ధరించే రామునితో ఏమి చేస్తావు. విజయము ఐశ్వర్యము లేని వనములో చరించు తాపసిక వ్రతములను అనుసరించు భూమిపై నిద్రించు రాముడు జీవిస్తున్నాడో లేదో అన్నది శంకయే. ||20.26||

||శ్లోకము 20.27||

న హి వైదేహి రామ స్త్వాం ద్రష్టుం వాప్యుపలప్స్యతే||20.27||
పురో బలాకై రసితైః మేఘైః జ్యోత్స్నామివావృతమ్|

స|| వైదేహీ రామః త్వం పురోబలాకైః అసితైః మేఘైః ఆవృతాం జ్యోత్స్నాం ఇవ ద్రష్టుం వా పి న హి ఉపలప్స్యతే||

||శ్లోకార్థములు||

వైదేహీ రామః త్వం - ఓ వైదేహీ రాముడు నిన్ను
పురోబలాకైః అసితైః -
ముందు ఎగురుతున్న కొంగలు( వాన రాకను సూచిస్తూ)
మేఘైః ఆవృతాం జ్యోత్స్నాం ఇవ -
మేఘములచే కప్పబడిన వెన్నెలను చూడలేనట్లు
రామః త్వం ద్రష్టుం వా పి - రామునికి నిన్ను చూడడము కూడా
న హి ఉపలప్స్యతే - సాధ్యము కాదు.

||శ్లోకతాత్పర్యము||

" ఓ వైదేహీ మేఘములతో కప్పివేయబడిన చంద్రుని ముందు ఎగురుతున్న కొంగలు (వాన రాకను సూచిస్తూఏలాచూడలేవో) అలాగే నిన్ను రాముడు చూడలేడు". ||20.27||

||శ్లోకము 20.28||

న చాపి మమ హస్తా త్త్వామ్ ప్రాప్తు మర్హతి రాఘవః||20.28||
హిరణ్యకశిపుః కీర్తిం ఇంద్రహస్తగతామివ|

స|| హిరణ్యకశిపుః ఇన్ద్రహస్తగతాం కీర్తిం ఇవ రాఘవః మమ హస్తాత్ త్వాం ప్రాప్తుం న చాపి అర్హతి||

||శ్లోకార్థములు||

హిరణ్యకశిపుః ఇన్ద్రహస్తగతాం కీర్తిం ఇవ -
హిరణ్యకశిపుడు ఇంద్రునిచే అపహరింపబడిన కీర్తిని ( తన భార్య) పొందగలిగినట్లు
రాఘవః మమ హస్తాత్ - రాముడు నా చేతులలోంచి
త్వాం ప్రాప్తుం న చాపి అర్హతి - నిన్ను పొందుటకు సాధ్యము కాదు.

||శ్లోకతాత్పర్యము||

" హిరణ్యకశిపుడు ఇంద్రునిచే అపహరింపబడిన కీర్తిని ( తన భార్య) పొందగలగాడు. కాని నా హస్తమునుంచి రాముడు నిన్ను పొందలేడు." ||20.28||

||శ్లోకము 20.29||

చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని|| 20.29||
మనోహరసి మే భీరు సుపర్ణః పన్నగం యథా|

స||చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని భీరు సుపర్ణః పన్నగం యథా మమ మనః హరసి||

||శ్లోకార్థములు||

చారుస్మితే చారుదతి - ఓ చారుస్మితి చారుదతి
చారునేత్రే విలాసిని భీరు - చారునేత్రీ ! విలాసినీ , పిరికి దానా
సుపర్ణః పన్నగం యథా - గరుత్మంతుడు స్వర్పమును హరించినట్లుగా
మమ మనః హరసి - నామనస్సుని అపహరించినావు

||శ్లోకతాత్పర్యము||

"ఓ చారుస్మితి చారుదతి చారునేత్రీ ! విలాసినీ ! నీవు గరుత్మంతుడు స్వర్పమును హరించినట్లుగా నామనస్సుని అపహరించినావు". ||20.29||

||శ్లోకము 20.30||

క్లిష్ట కౌశేయవసనాం తన్వీ మప్యనలఙ్కృతామ్||20.30||
తాం దృష్ట్వా స్వేషు దారేషు రతిం నోపలభామ్యహమ్|

స|| క్లిష్టకౌశేయవసనాం తన్వీం త్వాం అనలంకృతాం అపి దృష్ట్వా అహం స్వేషు దారేషు రతిం న ఉపలభామి||

||శ్లోకార్థములు||

క్లిష్టకౌశేయవసనాం - నలిగిపోయిన పట్టువస్త్రము ధరించిన
అనలంకృతాం అపి - అలంకారములతో లేకపోయినా కాని
తన్వీం త్వాం దృష్ట్వా - ఓ తన్వీ నిన్ను చూచిన తరువాత
అహం స్వేషు దారేషు - నేను నా భార్యలతో
రతిం న ఉపలభామి - రతి పొందలేకపోతున్నాను

||శ్లోకతాత్పర్యము||

"ఓ తన్వీ ! నలిగిపోయిన పట్టువస్త్రము ధరించిన, అలంకారములతో లేకపోయినా కాని నిన్ను చూచిన తరువాత నా భార్యలతో రతి పొందలేకపోతున్నాను ||20.30||

||శ్లోకము 20.31||

అన్తఃపుర నివాసిన్యః స్త్రియః సర్వగుణాన్వితాః||20.31||
యావంత్యో మమ సర్వాసామ్ ఐశ్వ్వర్యం కురు జానకి|

స|| జానకీ మమ స్త్రియః అన్తఃపురనివాసిన్యః యావన్త్యః సర్వగుణాన్వితాః | సర్వాసాం ఇశ్వర్యం కురు||

||శ్లోకార్థములు||

జానకీ అన్తఃపురనివాసిన్యః - ఓ జానకీ అంతః పురములో ఉన్న
మమ స్త్రియః - నా స్త్రీలు
యావన్త్యః సర్వగుణాన్వితాః -చాలామంది సర్వగుణ సంపన్నులు
సర్వాసాం ఐశ్వర్యం కురు - వారు అందరి పై అధిపత్యము వహించుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ జానకీ నా అంతః పురములో ఉన్న స్త్రీలు చాలామంది సర్వగుణ సంపన్నులు. నీవు వారందరిపై అధిపత్యము వహించుము". ||20.31||

||శ్లోకము 20.32||

మమ హ్యసితకేశాంతే త్రైలోక్యప్రవరా స్స్త్రియః||20.32||
తాస్త్వాం పరిచరిష్యన్తి శ్రియ మప్సరసో యథా|

స|| అసితకేశాంతే మమ తాః త్రైలోక్య ప్రవరాః స్త్రియః అప్సరసః శ్రియం యథా త్వాం పరిచరిష్యన్తి||

||శ్లోకార్థములు||

అసితకేశాంతే - ఓ నల్లని కేశములు కలదానా
మమ తాః త్రైలోక్య ప్రవరాః స్త్రియః - నా యొక్క ముల్లోకములలో శ్రేష్టులైన స్త్రీలు
అప్సరసః శ్రియం యథా - అప్సరస స్త్రీలు లక్ష్మి ని సేవించినట్లు
త్వాం పరిచరిష్యన్తి - నీకు పరిచర్యలు చేస్తారు

||శ్లోకతాత్పర్యము||

"ఓ నల్లని కేశములు కలదానా! నా యొక్క ముల్లోకములలో శ్రేష్టులైన స్త్రీలు, అప్సరస స్త్రీలు లక్ష్మి ని సేవించినట్లు నీకు పరిచర్యలు చేస్తారు. ||20.32||

||శ్లోకము 20.33||

యాని వైశ్రవణే సుభ్రు రత్నాని ధనాని చ||20.33||
తాని లోకాంశ్చ సుశ్రోణి మాం చ భుఙ్‍క్ష్వ యథా సుఖమ్|

స|| సుశ్రోణి సుభృ వైశ్రవణే యాని రత్నాని ధనాని చ తాని లోకాంశ్చ మాం చ యథాసుఖం భుఙ్‍క్ష్వ||

||శ్లోకార్థములు||

సుశ్రోణి సుభృ -
ఓ చక్కని కనుబొమ్మలు, చక్కని కటి ప్రదేశము కలదానా
వైశ్రవణే యాని రత్నాని ధనాని చ -
కుబేరుని యొక్క రత్నములు ధనములు ఆన్నీ
తాని లోకాంశ్చ మాం చ - ఆ లోకములు నన్ను కూడా
యథాసుఖం భుఙ్‍క్ష్వ - యథాసుఖముగా అనుభవింపుము

||శ్లోకతాత్పర్యము||

తా|| "ఓ చక్కని కనుబొమ్మలు, చక్కని కటి ప్రదేశము కలదానా ! కుబేరుని యొక్క రత్నములు ధనములు ఆన్నీ నన్నుకూడా యథాసుఖముగా అనుభవింపుము. ||20.33||

||శ్లోకము 20.34||

న రామస్తపసా దేవి న బలేన న విక్రమైః|
న ధనేన మయా తుల్యః తేజసా యశసాఽపి వా||20.34||

స|| దేవీ రామః తపసా మయా న తుల్యః | న బలేన విక్రమైః చ|న ధనేన తేజసా యశసా అపి వా||

||శ్లోకార్థములు||

రామః తపసా మయా న తుల్యః -
రాముడు తపస్సులో నాతో సమానుడు కాడు
న బలేన విక్రమైః చ -
బలములో కాని పరాక్రమములో గాని సమానుడు కాడు
న ధనేన తేజసా యశసా అపి వా -
ధనములో తేజస్సులో యశస్సులో కూడా (సమానుడుకాడు)

||శ్లోకతాత్పర్యము||

" ఓ దేవీ రాముడు తపస్సులో నాతో సమానుడు కాడు. బలములో గాని, పరాక్రమములో గాని సమానుడు కాడు. ధనములో తేజస్సులో యశస్సులో కూడా సమానుడుకాడు". ||20.34||

||శ్లోకము 20.35||

పిబ విహర రమస్వ భుఙ్‍క్ష్వ భోగాన్
ధననిచయం ప్రదిశామి మేదినీం చ|
మయి లల లలనే యథాసుఖం త్వం
త్వయి చ సమేత్య లలన్తు బాన్ధవాస్తే || 20.35||

స||లలనే ధననిచయం మేదినీం చ త్వం ప్రదిశామి |పిబ విహర రమస్వ | భోగాన్ యథాయుక్తం మయి లల| తే బాన్ధవాః సమేత్య త్వయి లలన్తు||

||శ్లోకార్థములు||

లలనే ధననిచయం మేదినీం చ -
ఓ లలనా ! కుప్పలుగా ధనము బంగారము కూడా
త్వం ప్రదిశామి - నీకు ప్రసాదిస్తాను
పిబ విహర రమస్వ - తిని తాగి విహరించి రమించుము.
భోగాన్ యథాయుక్తం మయి లల -
భోగములను నీకు తోచినట్లు నాతో అనుభవించుము
తే బాన్ధవాః సమేత్య త్వయి లలన్తు -
నీ బంధవులు తో కలిసి అనుభవించుము"

||శ్లోకతాత్పర్యము||

"ఓ లలనా ! కుప్పలుగా ధనము బంగారము నీకు ప్రసాదిస్తాను. తిని తాగి విహరించి రమించుము. భోగములను నీకు తోచినట్లు నాతో అనుభవించుము. నీ బంధవులు తో కలిసి అనుభవించుము".||20.35||

||శ్లోకము 20.36||

కుసుమిత తరుజాల సంతతాని
భ్రమరయుతాని సముద్రతీరజాని|
కనక విమల హారభూషితాఙ్గి
విహర మయా సహ భీరు కాననాని||20.36||

స|| భీరు కనక విమల హారభూషితాంగీ కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్రతీరజాని కాననాని మయా సహ విహర||

||శ్లోకార్థములు||

భీరు కనక విమల హారభూషితాంగీ -
ఓ భీరు ! బంగారు కుసుమముల హారములతో అలంకరించుకో
కుసుమిత తరుజాల సంతతాని -
బాగుగాపుష్పించిన చెట్లు కల
భ్రమరయుతాని సముద్రతీరజాని కాననాని -
భ్రమరములు కల సముద్ర తీర ఉద్యానవనములలో
మయా సహ విహర -
నాతో కలిసి విహరించుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ భీరు ! బంగారు కుసుమముల హారములతో అలంకరించుకో. బాగుగాపుష్పించిన చెట్లు కల, భ్రమరములు కల సముద్ర తీర ఉద్యానవనములలో నాతో కలిసి విహరించుము".||20.36||

ఇక్కడ శ్లోకాలలో రావణుడు , సీతను రామునియందు మనస్సు విడిచి భోగములందు ప్రవర్తించమని అడుగుతాడు". వైదేహీ ! నిన్ను చూచి సాక్షాత్తు బ్రహ్మ అయినా వదలి వెళ్ళగలడా !" అంటూ అనేకమైన ప్రలోభములు చూపిస్తాడు. రాముని నిందిస్తాడు.

రావణుడు రామునిపై చెప్పిన మాటలు, దేహాత్మాభిమానముచే అహంకరించిన మానవుడు భగవంతునిపై చెప్పుమాటలు వలెనుండును. ఇది అంతయూ మనస్సు ప్రభావము. మనస్సు ఎఫ్ఫుడూ "నేనే గొప్ప" అనిపించును.

మనస్సు ఐశ్వర్యములు, భోగములు, భాగ్యములను చూపి, భగవంతునికి దూరము చేయ యత్నించును.

చివర రావణుని మాటలు, " త్రాగుము తిరుగుము రమించుము అనుభవించుము,
భోగములను ధనమును భూమిని నేను ఒసంగెదను. నాయందు నీవు హాయిగా రమింపుము. నిన్ను చేరి నీబంధువులు హాయిగా రమింతురుగాక" అని-
ఈ మాటలలో త్రాగి భోగలాలసుడై హేలగా తిరిగెడి మానవుని ఊపు కనపడును.

అదే ఇక్కడ ముఖ్యమైన విషయము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే వింశస్సర్గః||

||ఓమ్ తత్ సత్||

 

 

 


||ōm tat sat||