||సుందరకాండ ||

||ఇరువది ఏడవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 27 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ సప్తవింశస్సర్గః

ఈ సర్గ పారాయణ సర్గ అనబడుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టము త్రిజటా స్వప్నము. ఇంకొక ముఖ్యమైన మాట పన్నెండవ సహస్రములో ని మొదటి శ్లోకము ( అంటే 12001 శ్లోకము) ఈ సర్గలో వస్తుంది. ఆ శ్లోకములో గాయత్రి మంత్రములోని పదమూడవ అక్షరము వస్తుంది. ఈ రెండు విషయలు శ్లోకార్థ తాత్పర్యాల వివరణలో విశ్లేషించబడతాయి.

ఈ సర్గ కూడా, ఇరువది ఆరవ సర్గ లో శాపములతో కూడిన సీత మాటలు వినిన రాక్షస స్త్రీలు, కొపోద్రిక్తులై సీతమ్మను భయపెట్టడముతో మొదలు అవుతుంది

ఇక ఇరువది ఏడవ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో.

||శ్లోకము 27.01||

ఇత్యుక్తాః సీతయా ఘోరా రాక్షస్యః క్రోధమూర్ఛితాః|
కాశ్చిత్ జగ్ముః తదాఖ్యాతుం రావణస్య తరస్వినః||27.01||

స|| కాశ్చిత్ ఘోరా రాక్షస్యః క్రోధమూర్ఛితాః ఇత్యుక్తాః సీతాయాః తత్ ఆఖ్యాతుం కాశ్చిత్ తరస్వినః రావణస్య జగ్ముః||

||శ్లోకార్థములు||

కాశ్చిత్ ఘోరా రాక్షస్యః క్రోధమూర్ఛితాః -
క్రోధముతో నిండిన ఘోరమైన రాక్షసస్త్రీలు కొందరు
ఇత్యుక్తాః సీతాయాః -
సీతచేత చెప్పబడిన మాటలు
తత్ తరస్వినః రావణస్య ఆఖ్యాతుం -
అవి తొందరగా పనిచేయగల రావణునికి
ఆఖ్యాతుం జగ్ముః -
చెప్పుటకు వెళ్ళిరి

||శ్లోకతాత్పర్యములు||

"ఘోరమైన క్రోధముతో నిండిన రాక్షసులు కొందరు ఈ విధముగా సీతచే చెప్పబడిన మాటలు విని, ఆ విషయము చెప్పుటకు రావణుని వద్దకు పరుగిడిరి." ||27.01||

తిలక టీకా లో- ఇత్యుక్తా మరిష్య ఇత్యుక్తాః| తదాఖ్యాతుం మరణ నిశ్చయం కథయితుం|| అంటే సీతచేత చెప్పబడిన మాటలు - అవి మరణమునకు నిశ్చయించుకున్న సీతమ్మ మాటలు, - చెప్పడానికి రాక్షసులు రావణుని దగ్గరకు వెళ్ళారు అన్నమాట. ఎందుకు ? రావణుడు తొందరగా ఆలోచించి తగిన కార్యము చేయగలవాడు కనక

||శ్లోకము 27.02||

తతస్సీతా ముపాగమ్య రాక్షస్యో ఘోరదర్శనాః|
పునః పరుషమేకార్థం అనర్థార్థమ్ అథాబ్రువన్||27.02||

స|| తతః సీతాం ఉపాగమ్య రాక్షస్యః ఘోరదర్శనాః పునః పరుషం అనర్ధార్థం ఏకార్థం అథ అబ్రువన్||

||శ్లోకార్థములు||

తతః సీతాం ఉపాగమ్య -
అప్పుడు సీతను సమీపించి
రాక్షస్యః ఘోరదర్శనాః -
ఘోరరూపముకల రాక్షసస్త్రీలు
పునః పరుషం - మళ్ళీ పరుషమైన
అనర్ధార్థం ఏకార్థం -
ఒకే అర్థముగల అనర్థమైన మాటలు
అథ అబ్రువన్ - అప్పుడు చెప్పసాగిరి

||శ్లోకతాత్పర్యములు||

"అప్పుడు సీతను చేరి ఘోరరూపముకల రాక్షస స్త్రీలు పరుషమైన ఒకే అర్థముగల అనర్థమైన మాటలు మరల చెప్పసాగిరి." ||27.02||

||శ్లోకము 27.03||

అద్యేదానీం తవానార్యే సీతే పాపవినిశ్చయే|
రాక్షస్యో భక్షయిష్యంతి మాంస మేతత్ యథాసుఖమ్|27.03||

స|| అనార్యే పాపనిశ్చయే సీతే అద్య ఇదానీం తవ ఏతత్ మాంసం రాక్షస్యః యథాసుఖం భక్షయిష్యంతి ||

||శ్లోకార్థములు||

అనార్యే పాపనిశ్చయే సీతే -
ఓ అనార్యా! పాపములో నిశ్చయముగా వున్న సీతా
అద్య ఇదానీం - ఇవాళే ఈ
తవ ఏతత్ మాంసం -
నీ యొక్క మాంసము
రాక్షస్యః యథాసుఖం భక్షయిష్యంతి -
రాక్షసులందరూ సుఖముగా తినెదరు

||శ్లోకతాత్పర్యములు||

"ఓ అనార్యా! పాపములో నిశ్చయముగా వున్న నీ మాంసము ఈ దినమే రాక్షసులందరూ సుఖముగా తినెదరు."||27.03||

||శ్లోకము 27.04||

సీతాం తాభి రనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తదా|
రాక్షసీ త్రిజటా వృద్ధా శయానా వాక్యమబ్రవీత్ ||27.04||

స|| తదా అనార్యాభిః తాభిః సంతర్జితాం సీతాం దృష్ట్వా వృద్ధా త్రిజటా రాక్షసీ వాక్యం అబ్రవీత్||

తిలక టీకాలో- వృద్ధా ధర్మజ్ఞాన యోగవయోభిః వృద్ధా|
గోవిన్దరాజులవారి టీకాలో- త్రిజటా విభీషణ పుత్రీ |
వృద్ధా అంటే ధర్మము జ్ఞానము యోగము వయస్సుతో వృద్ధురాలు అని.

||శ్లోకార్థములు||

తదా అనార్యాభిః తాభిః -
అప్పుడు దుష్టులైన వారిచేత
సంతర్జితాం సీతాం దృష్ట్వా -
భయపెట్టబడుచున్న సీతను చూచి
వృద్ధా శయానా త్రిజటా రాక్షసీ -
వృద్ధురాలైన పడుకొని వున్న రాక్షసి త్రిజట
వాక్యం అబ్రవీత్ -
ఈ వాక్యములను పలికెను

||శ్లోకతాత్పర్యములు||

"దుష్టులైన వారిచేత భయపెట్టబడుచున్న సీతను చూచి వృద్ధురాలైన రాక్షసి త్రిజట అప్పుడు ఈ వాక్యములను పలికెను." ||27.04||

రాక్షస స్త్రీలు, సీతమ్మ శాపము ఇస్తున్నట్లు అనిన మాటలు విని, మరింత కోపముతో సీతను తినేస్తామని భయపెట్టుతూ వుంటే, అప్పుడే లేచిన త్రిజట ఇలా చెపుతుంది.

గోవిన్దరాజులవారు తమ టీకాలో త్రిజట విభీషణ పుత్రి అని రాశారు. కాని దీనికి అధారము ఏది చెప్పలేదు. ముప్పది ఆరవ సర్గలో మళ్ళీ నల అనే పేరుగల విభీషణుని పుత్రికమాట వస్తుంది.

||శ్లోకము 27.05||

ఆత్మానం ఖాదతా నార్యా న సీతాం భక్షయిష్యథ|
జనకస్య సుతా మిష్టాం స్నుషాం దశరథస్య చ||27.05||

స|| ఆత్మానం ఖాదతా | జనకస్య సుతాం దశరథస్య ఇష్టాం స్నుషాం సీతాం న భక్షయిష్యథ||

||శ్లోకార్థములు||

ఆత్మానం ఖాదతా - మిమ్మలిని మీరే తినుడు
జనకస్య సుతాం - జనకుని కూతురు
దశరథస్య ఇష్టాం స్నుషాం సీతాం - దశరథుని ప్రియమైన కోడలు అయిన సీతను
న భక్షయిష్యథ - తినకుడు

||శ్లోకతాత్పర్యములు||

"జనకుని కూతురు దశరథుని కోడలు అయిన సీతను తినకుడు. మిమ్మలిని మీరే తినుడు." ||27.05||

ఇక్కడ త్రిజట చెప్పిన మాట. "ఆత్మానం ఖాదతానార్యా న సీతా భక్షయిష్యథ"- "మిమ్మలిని మీరే తినండి సీతను కాదు", అని.

అలా ఎందుకు చెప్పింది? అంటే, తనకి ఒక కల వచ్చిందట. ఆ కలలో ఏమి తెలిసింది ?

"రాక్షసానాం అభావాయ
భర్తుః అస్యాః భవాయ చ"||

రాక్షసులకు భయము, సీత భర్తకి విజయము సూచిస్తూ వచ్చిన కల అది.

వెంటనే ఆ రాక్షస్త్రీలందరు త్రిజట చుట్టూ చేరి ఆ కల అంతా చెప్పమంటారు. త్రిజట ఆ కల అంతా చెపుతుంది ముందువచ్చే శ్లోకాలలో'

||శ్లోకము 27.06||

స్వప్నో హృద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః|
రాక్షసానాం అభావాయ భర్తురస్యా జయాయ చ||27.06||

స|| అద్య మయా స్వప్నః దృష్టః | దారుణః రోమహర్షణః | రాక్షసానాం అభావాయ అస్యాః భర్తృః జయాయ చ||

||శ్లోకార్థములు||

అద్య మయా స్వప్నః దృష్టః -
ఇవాళ నేను ఒక స్వప్నము చూసితిని
దారుణః రోమహర్షణః -
దారుణము రోమహర్షణము అయినది
రాక్షసానాం అభావాయ -
రాక్షసుల వినాశనమును
అస్యాః భర్తృః జయాయ చ -
అమె భర్త జయమును సూచించుచున్నది

||శ్లోకతాత్పర్యములు||

"ఇవాళ నేను ఒక స్వప్నము చూసితిని. అది దారుణము రోమహర్షణము అయినది. అది అమె భర్త జయమును రాక్షసుల వినాశనమును సూచించుచున్నది." ||27.06||

||శ్లోకము 27.07||

ఏవముక్తా త్రిజటాయా రాక్షస్యః క్రోధమూర్ఛితాః|
సర్వా ఏవాబ్రువన్ భీతాః త్రిజటాం తాం ఇదం వచః||27.07||

స|| ఏవం ఉక్తా త్రిజటయా సర్వా రాక్షస్యః క్రోధమూర్ఛితాః భీతాః తాం త్రిజటాం ఇదం వచః అబ్రువన్ ||

||శ్లోకార్థములు||

ఏవం ఉక్తా త్రిజటయా -
ఈ విధముగా త్రిజత చేత చెప్పబడిన
సర్వా రాక్షస్యః - రాక్షస స్త్రీలందరూ
క్రోధమూర్ఛితాః భీతాః -
క్రోధముతో నిండినవారు భయపడి
తాం త్రిజటాం ఇదం వచః అబ్రువన్ - ఆ త్రిజటతో ఈ వచనములను చెప్పిరి

||శ్లోకతాత్పర్యములు||

"త్రిజట చెప్పిన ఆ మాటలు వినిన రాక్షస్త్రీలందరూ భయముతో క్రోధమూర్చితులై ఈ మాటలను చెప్పిరి."||27.07||

తిలక టీకాలో - పూర్వం క్రోధమూర్ఛితాః త్రిజటావచనపశ్చాత్ భీతః - అంటే ముందు సీత శాపగ్రస్త మాటలతో క్రోధమూర్ఛితులైనా గాని, త్రిజట వాక్యములతో వారు భయగ్రస్తులైనారు అన్నమాట

త్రిజట మాటలతో భయపడి, వాళ్ళందరూ త్రిజట చుట్టూ చేరి స్వప్న వృత్తాంతము చెప్పమంటారు.

||శ్లోకము 27.08||

కథయస్వ త్వయా దృష్టః స్వప్నోఽయం కీదృశో నిశి|
తాసాం శ్రుత్వాతు వచనం రాక్షసీనాం ముఖాచ్చ్యుతమ్||27.08||
ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రితమ్|

స|| నిశి త్వయా దృష్టః అయం స్వప్నః కీ దృశః కథయస్వ | రాక్షసీనాం ముఖాచ్యుతం తాసాం వచనం శ్రుత్వా తు త్రిజటా కాలే స్వప్న సంస్థితం వచనం ఉవాచ||

||శ్లోకార్థములు||

నిశి త్వయా దృష్టః -
రాత్రి నీ చేత చూడబడిన
అయం స్వప్నః కీ దృశః కథయస్వ -
ఆ స్వప్నము ఏలాంటిదో చెప్పుము
రాక్షసీనాం ముఖాచ్యుతం -
రాక్షసస్త్రీల ముఖమునుంచి వచ్చిన
తాసాం వచనం శ్రుత్వా తు -
వారియొక్క ఆ మాటలు వినిన
త్రిజటాకాలే - త్రిజట ఉషోదయ కాలములో
స్వప్న సంశ్రితమ్ వచనం ఉవాచ -
స్వప్నము అంతయు మాటలలో చెప్పెను.

||శ్లోకతాత్పర్యములు||

."రాత్రి నీవు చూసిన స్వప్నము ఏలాంటిదో చెప్పుము"అని. రాక్షసస్త్రీల ముఖమునుంచి వచ్చిన ఆ మాటలు వినిన త్రిజట, వారికి తనకి వచ్చిన స్వప్నము గురించి చెప్పసాగెను." ||27.08||

గోవిన్దరాజులవారు తమ టీకాలో - తాసామ్ ఇతి| కాలే, ఉషః కాలే, యః స్వప్నః తత్సంశ్రితమ్| ఈ స్వప్నము ఉషోదయ కాలము లో వచ్చినది అని.

తిలక టీకాలో- కాలే ప్రాతః కాలే| స్వప్నసంశ్రితం ప్రాతః కాల దృష్ట స్వప్నదృష్టార్థవిషయకమ్ అనేన స్వప్నస్య శీఘ్రఫలదత్వం సూచితమ్| సీతాయాః పీడానివృత్తయే తత్ అభ్యుదయ సూచకం స్వప్నమ్| - అంటే ప్రాతః కాలములో వచ్చిన స్వప్న వృత్తాంతము శీఘ్రముగా ఫలము నిచ్చును అని సూచింప బడినది. ఇక్కడ త్రిజట కి వచ్చిన ప్రాతః కాల స్వప్నము పూర్తిగా నిజము అవుతుంది. అంటే ప్రాతః కాలములో వచ్చిన స్వప్నము శీఘ్రముగా ఫలము ఇస్తుంది అన్నమాట త్రిజట స్వప్న వృత్తాంతముతో బలపడినది అనుకోవచ్చు.

||శ్లోకము 27.09,10||

గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగామ్||27.09||
యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః|
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః||27.10||

స|| రాఘవః శుక్లమాల్యాంబరధరః లక్ష్మణేన సహ గజదంతమయీం అంతరిక్షగాం హంససహస్రేణ యుక్తాం శిబికాం స్వయం ఆస్థాయ ఆగతః||

||శ్లోకార్థములు||

శుక్లమాల్యాంబరధరః రాఘవః లక్ష్మణేన సహ -
తెల్లని వస్త్రములు ధరించిన రాఘవుడు లక్ష్మణుని తో
గజదంతమయీం అంతరిక్షగాం -
అంతరిక్షములో గజదంతములతో కూడిన
హంససహస్రేణ యుక్తాం -
వేయిహంసలు తో కూడిన (మోస్తున్న)
శిబికాం స్వయం ఆస్థాయ ఆగతః -
పల్లకీ ఎక్కి స్వయముగా వచ్చెను.

||శ్లోకతాత్పర్యములు||

" తెల్లని వస్త్రములు ధరించిన రాఘవుడు లక్ష్మణుని తో సహా అంతరిక్షములో గజదంతములతో కూడిన వేయిహంసలు మోస్తున్న పల్లకీమీద వచ్చెను." ||27.09||

||శ్లోకము 27.10,11||

స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృతా|
సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వత మాస్థితా||27.11||

స||అద్య స్వప్నే శుక్లాంబరావృతా సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతం ఆస్థితా సీతా చ మయా దృష్టా||

||శ్లోకార్థములు||

అద్య స్వప్నే - అప్పుడు స్వప్నములో
శుక్లాంబరావృతా సాగరేణ పరిక్షిప్తం-
తెల్లని బట్టలతో సాగరమధ్యములో నున్న
శ్వేతం పర్వతం ఆస్థితా -
తెల్లని పర్వతముపై కూర్చుని ఉన్న
సీతా చ మయా దృష్టా -
సీతాదేవిని చూచితిని

||శ్లోకతాత్పర్యములు||

"అప్పుడు స్వప్నములో తెల్లని బట్టలతో సాగరమధ్యములో నున్న పర్వతముపై కూర్చుని ఉన్న సీతాదేవిని చూచితిని." ||27.11||

||శ్లోకము 27.12||

రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభా యథా|
రాఘవశ్చ మయా దృష్ట శ్చతుర్దంతం మహాగజమ్||27.12||
ఆరూఢః శైలసంకాశం చచార సహ లక్ష్మణః|

స|| సీతా రామేణ భాస్కరేణ ప్రభా యథా సంగతా | రామశ్చ చతుర్దష్టం శైలసంకాశమ్ మహాగజం సహ లక్ష్మణః ఆరూఢః మయా దృష్టా||

||శ్లోకార్థములు||

భాస్కరేణ ప్రభా యథా -
కాంతి భాస్కరునుతో కూడినట్లు
సీతా రామేణ సంగతా -
సీత రామునితో చేరినది
రామశ్చ సహ లక్ష్మణః -
లక్ష్మణునితో కూడా వున్న రాముడు
చతుర్దష్టం శైలసంకాశమ్ -
నాలుగు దంతములుకల పర్వతములతో సమానమైన
మహాగజం ఆరూఢః మయా దృష్టా -
మహాగజముల పై ఎక్కిన వారిని నాచేత చూడబడిరి

||శ్లోకతాత్పర్యములు||

"భాస్కరునితో కాంతి కూడినట్లు, రామునితో సీత చేరినది. నాలుగు దంతములుకల పర్వతములతో సమానమైన మహాగజముల పై ఎక్కి లక్ష్మణునితో కూడా వున్న రాముని కూడా చూచితిని." ||27.12||

గొఇన్దరాజులవారు తమ టీకాలో - రాఘవశ్చేతి| మహాగజమారూఢ ఇతి శిబికాత ఇతి శేషః| తథోక్తం స్వప్నాధ్యాయే - " ఆరోహణం గోవృషకుఙ్జరాణాం ప్రాసాదశైలావనస్పతీనాం | విష్టానులేపో రుదితం మృతం చస్వప్నేష్వగమ్యగమనం చ ధన్యం' ఇతి| అంటే స్వప్నములో గోవు కుంజరము మున్నగు నవి ఎక్కుట శుభసూచకము అని చెప్పబడినది. అంటే ఈ స్వప్నము సీతమ్మకి శుభ సూచకము అని అర్థము.

||శ్లోకము 27.13||

తతస్తౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా||27.13|
శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ|

స|| తతః తౌ శుక్లమాల్యాంబరధరౌ స్వతేజసా దీప్యమానౌ నరశార్దూలౌ జానకీం పర్యుపస్థితౌ||

||శ్లోకార్థములు||

తతః తౌ శుక్లమాల్యాంబరధరౌ -
అప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరూ
స్వతేజసా దీప్యమానౌ -
తమ తేజస్సుతో వెలుగుతూ
నరశార్దూలౌ జానకీం పర్యుపస్థితౌ -
నరశార్దూలురు వారిద్దరూ సీతవద్దకు వచ్చిరి

||శ్లోకతాత్పర్యములు||

" అప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన నరశార్దూలురు వారిద్దరూ తమ తేజస్సుతో వెలుగుతూ సీతవద్దకు వచ్చిరి".||27.13||

||శ్లోకము 27.14||

తతస్తస్య స్యాగ్రే హ్యాకాశ స్థస్య దంతినః||27.14||
భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితా|

స|| తతః జానకీ తస్య నగస్య అగ్రే భర్త్రా పరిగృహీతస్య ఆకాశస్థస్య దంతినః స్కంధమ్ ఆశ్రితా||

||శ్లోకార్థములు||

తతః జానకీ తస్య నగస్య అగ్రే -
అప్పుడు పర్వతాగ్రముపై నున్న ఆ జానకి
భర్త్రా పరిగృహీతస్య -
భర్తచేత పరిగ్రహింపబడి
ఆకాశస్థస్య దంతినః -
ఆకాశములో నిలబడిన ఆ ఏనుగు
స్కంధమ్ ఆశ్రితా -
పైకి ఎక్కి చేరెను

||శ్లోకతాత్పర్యములు||

" అప్పుడు పర్వతాగ్రముపై నున్న ఆ జానకి ఆకాశములో నిలబడిన ఆ ఏనుగు పైకి ఎక్కి భర్త చేరెను."||27.14||

గోవిన్దరాజులవారు తమ టీకాలో - అత్ర ద్వాదశ శ్లోకాః గతాః | అంటే ఈ శ్లోకముతో రామాయణములో పన్నెండు వేల శ్లోకాలు పూర్తి అయినాయి అని అంటారు. ఈ శ్లోకములో గాయత్రి బీజాక్షరము వున్నది అని చెప్పబడినది. ఈ శ్లోకము గురించి, దానిలో వున్న బీజాక్షరము గురించి, ఈ సర్గ అంతములో ఇంకా విశ్లేషిస్తాము.

||శ్లోకము 27.15||

భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచనా||27.15||
చంద్రసూర్యౌ మయా దృష్టా పాణిభ్యాం పరిమార్జతీ|

స|| తతః కమలలోచనా భర్తుః అంకాత్ సముత్పత్య పాణినా చంద్రసూర్యౌ పరిమార్జతీ మయా దృష్టా||

||శ్లోకార్థములు||

తతః కమలలోచనా -
అప్పుడు ఆ కమలలోచన
భర్తుః అంకాత్ సముత్పత్య -
భర్త అంగములనుంచి లేచి
పాణినా చంద్రసూర్యౌ పరిమార్జతీ -
చేతితో చంద్ర సూర్యులను స్పృశించినట్లు
మయా దృష్టా - నాచేత చూడబడినది

||శ్లోకతాత్పర్యములు||

"అప్పుడు కమలలోచన యగు సీత ఆ భర్త అంగములనుంచి లేచి, చేతితో చంద్ర సూర్యులను స్పృశించినట్లు చూసితిని." ||27.15||

ఇక్కడ తిలక టీకాలో - ప్రథమం భర్తురఙ్కేగత్వా తతః సముత్పత్య భర్త్రా పరిగృహీతస్య గజస్య స్కంధమాశ్రితా| సూర్యచన్ద్రమసౌ పాణిభ్యాం పరిమార్జతి| తదుక్తమ్, - ఆదిత్యమణ్డలం వాపి చన్ద్రమణ్డలమేవ వా| స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యాం మహద్రాజ్యం సమాప్నుయాత్ |" ఇతి

అంటే స్వప్నములో చంద్ర సూర్యమండలములను హస్తముతో తాకుచున్నట్లు కనపడినచో దానివలన మహత్తరమైన రాజ్యము లభించును అని. ఇది కూడా శుభసూచకము అని. ఇదే విధముగా రామ టీకాలో , గోవిన్దరాజులవారి టీకాలో కూడా చెప్పబడినది.

||శ్లోకము 27.16||

తతస్తాభ్యాం కుమారాభ్యా మాస్థితః స గజోత్తమః ||27.16||
సీతయా చ విశాలాక్ష్యా లంకాయా ఉపరిస్థితః|

స|| తతః తాభ్యాం కుమారాభ్యాం విశాలాక్షాయాః సీతాయ చ ఆస్థితః సః గజోత్తమః లంకాయా ఉపరి స్థితః||

||శ్లోకార్థములు||

తతః తాభ్యాం కుమారాభ్యాం -
ఆలాగే రాజకుమారులు ఇద్దరూ
విశాలాక్షాయాః సీతాయ చ -
విశాలాక్షి అయిన సీత చేత
ఆస్థితః సః గజోత్తమః -
అధిరోహించబడిన ఆ గజోత్తముడు
లంకాయా ఉపరి స్థితః -
లంకా నగరముపైన నిలబడెను

||శ్లోకతాత్పర్యములు||

" అప్పుడు విశాలాక్షి అయిన సీత, ఆలాగే రాజకుమారులు ఇద్దరూ కూర్చుని ఉన్న ఆ గజము లంకా నగరముపైన నిలబడెను".||27.16||

||శ్లోకము 27.17||

పాణ్డురర్షభ యుక్తేన రథే నాష్టయుజా స్వయమ్||27.17||
ఇహోపయాతః కాకు‍త్ స్థః సీతయా సహ భార్యయా|

స|| కాకుత్‍స్థః భార్యయా సీతాయా సహ అష్టాయుజా పాణ్డురర్షభ యుక్తేన రథేన స్వయం ఇహ ఉపయాతః ||

||శ్లోకార్థములు||

కాకుత్‍స్థః భార్యయా సీతాయా సహ -
ఆ కాకుత్‍స్థుడు భార్య సీతతో సహా
అష్టాయుజా పాణ్డురర్షభ యుక్తేన -
ఎనిమిది వృషభములు తో కల
రథేన స్వయం ఇహ ఉపయాతః -
రథముపై స్వయముగా ఇక్కడికి వచ్చెను

||శ్లోకతాత్పర్యములు||

"ఆ కాకుత్‍స్థుడు భార్య సీతతో సహా ఎనిమిది వృషభములు కల రథముపై స్వయముగా ఇక్కడికి వచ్చెను." ||27.17||

||శ్లోకము 27.18,19||

లక్ష్మణేన సహభ్రాత్రా సీతయా సహ వీర్యవాన్ ||27.18||
ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభమ్|
ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః||27.19||

స|| వీర్యవాన్ సీతాయా సహ భ్రాత్రా లక్ష్మణేన సహ దివ్యం సూర్యసన్నిభం పుష్పకం విమానం ఆరుహ్య ఉత్తరాం దిశాం ఆలోక్యపురుషొత్తమః జగామ||

||శ్లోకార్థములు||

వీర్యవాన్ సీతాయా సహ-
ఆ వీరుడు సీత తో కూడి
భ్రాత్రా లక్ష్మణేన సహ -
తమ్ముడు లక్ష్మణునితో సహా
దివ్యం సూర్యసన్నిభం పుష్పకం విమానం ఆరుహ్య -
సూర్యునితో సమానమైనకాంతిగల దివ్యమైన పుష్పక విమానమెక్కి
ఉత్తరాం దిశాం ఆలోక్య పురుషొత్తమః జగామ -
ఉత్తరదిశను చూస్తూ సాగిపోయెను

||శ్లోకతాత్పర్యములు||

"ఆ వీరుడు సీతా లక్ష్మణులతో కలిసి సూర్యునితో సమానమైనకాంతిగల దివ్యమైన పుష్పక విమానమెక్కి ఉత్తరదిశను చూస్తూ సాగిపోయెను".||27.19||

||శ్లోకము 27.20||

ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణుపరాక్రమః|
లక్ష్మణేన సహభ్రాత్రా సీతాయ సహ భార్యయా||27.20||

స|| ఏవం రామః విష్ణుపరాక్రమః భార్యయా సీతాయా సహ లక్ష్మణేన భ్రాత్రా సహ స్వప్నే మయా దృష్టః|

||శ్లోకార్థములు||

ఏవం రామః విష్ణుపరాక్రమః -
ఈ విధముగా విష్ణు పరాక్రమము గల రాముడు
భార్యయా సీతాయా సహ -
భార్య అయిన సీతతో
లక్ష్మణేన భ్రాత్రా సహ -
అలాగే తమ్ముడు లక్ష్మణునితో కలిసి
స్వప్నే మయా దృష్టః -
స్వప్నములో నేను చూచితిని.

||శ్లోకతాత్పర్యములు||

"ఈ విధముగా విష్ణు పరాక్రమము గల రాముడు, భార్య అయిన సీతతో అలాగే తమ్ముడు లక్ష్మణునితో కలిసి ఉండడము స్వప్నములో నేను చూచితిని."||27.20||

||శ్లోకము 27.21||

న హి రామో మహాతేజా శ్శక్యో జేతుం సురాసురైః|
రాక్షసైర్వాపి చాన్యైర్వా స్వర్గం పాపజనైరివ||27.21||

స|| రామః మహాతేజః రాక్షసైః వా అన్యైః వా సురాసురైః వా జేతుం న శక్యః | స్వర్గం పాప జనైః ఇవ||

||శ్లోకార్థములు||

రామః మహాతేజః -
మహాతేజోవంతుడు అగు రాముడు
రాక్షసైః వా అన్యైః వా -
రాక్షసుల చేత గాని అన్యులచేతగాని
సురాసురైః వా జేతుం న శక్యః -
సురాసురుల చేత గాని జయింప్పబడుట శక్యముకాని పని
స్వర్గం పాప జనైః ఇవ -
పాపులకు స్వర్గము పొందుట ఎలా శక్యము కాదో అలా

||శ్లోకతాత్పర్యములు||

"పాపులకు స్వర్గము పొందుట ఎలా శక్యము కాదో అలా రాక్షసుల చేత గాని, ఇతర సురాసురుల చేత గాని, మహాతేజోవంతుడు అగు రాముడు జయింపబడుట శక్యముకాని పని". ||27.21||

||శ్లోకము 27.22||

రావణశ్చ మయాదృష్టః క్షితౌ తైలసముత్‍క్షితః |
రక్తవాసాః పిబన్మత్తః కరవీరకృత స్రజః||27.22||

స|| రక్తవాసాః పిబన్ మత్తః కరవీర కృత స్రజః తైలసముత్‍క్షితః క్షితౌ రావణః చ మయా దృష్టః|

||శ్లోకార్థములు||

రక్తవాసాః పిబన్ మత్తః -
రక్తపు రంగు వస్త్రములతో తాగి మత్తులో
కరవీర కృత స్రజః -
కరవీర పుష్పముల మాల ధరించి
తైలసముత్‍క్షితః క్షితౌ రావణః చ -
తైలము తో పూయబడి భూమి మీద పడియున్న రావణుని
మయా దృష్టః -
నాచేత చూడబడెను

||శ్లోకతాత్పర్యములు||

" రక్తపు రంగు వస్త్రములతో తాగి మత్తులో కరవీర పుష్పముల మాల ధరించి, తైలము తో పూయబడి భూమి మీద పడియున్న రావణుని కూడా నాచేత చూడబడెను." ||27.22||

||శ్లోకము 27.23||

విమానాత్ పుష్పకాదద్య రావణః పతితో భువి|
కృష్యమాణ స్త్రియా దృష్టో ముండః కృష్ణాంబరః పునః||27.23||

స|| అద్య రావణః కృష్ణాంబరః స్త్రియా కృష్యమాణః ముండః పుష్పకాత్ విమానాత్ భువి పతితః పునః దృష్టః |

||శ్లోకార్థములు||

అద్య - ఈ దినమున ( స్వప్నములో)
పుష్పకాత్ విమానాత్ భువి పతితః -
విమానము నుంచి భూమిపై పడిన
కృష్ణాంబరః ముండః -
శిరో ముండనము చేయబడి నల్లని వస్త్రములు ధరించియున్న
స్త్రియా కృష్యమాణః -
స్త్రీ చేత ఈడ్చుకు పోబడుతూవున్న
రావణః పునః దృష్టః -
రావణుడు మళ్ళీ చూడబడెను

||శ్లోకతాత్పర్యములు||

"ఈ దినమున ( స్వప్నములో), విమానము నుంచి భూమిపై పడిన, శిరో ముండనము చేయబడి నల్లని వస్త్రములు ధరించియున్న, స్త్రీ చేత ఈడ్చుకు పోతూవున్న, రావణుడు మళ్ళీ చూడబడెను." ||27.23||

||శ్లోకము 27.24||

రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపనః|
పిబం స్తైలం హసన్ నృత్యన్ భ్రాంతచిత్తకులేంద్రియః||27.24||
గర్ధభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః|

స|| రక్తమాల్యానులేపనః తైలం పిబన్ హసన్ నృత్యన్ భ్రాంతచిత్తకులేంద్రియః ఖరయుక్తేన రథేన దక్షిణాం దిశాం ఆస్థితః గర్దభేన శీఘ్రం యయౌ ||

||శ్లోకార్థములు||

రక్తమాల్యానులేపనః -
ఎఱ్ఱని పూలమాలతో మైపూతలతో
తైలం పిబన్ హసన్ నృత్యన్ -
నూనె తాగి పిచ్చిగా నవ్వుతూ నృత్యము చేస్తూ
భ్రాంతచిత్తకులేంద్రియః -
ఇన్ద్రియ నిగ్రహము కోల్పోయి
ఖరయుక్తేన రథేన -
గాడిదలు పూన్చిన రథముపై
దక్షిణాం దిశాం ఆస్థితః -
దక్షిణ దిశవైపు బయలు దేరి
గర్దభేన శీఘ్రం యయౌ-
గాడిదలచేత శీఘ్రముగా తీసుకుపోబడెను

||శ్లోకతాత్పర్యములు||

"రావణుడు ఎఱ్ఱని పూలమాలతో మైపూతలతో నూనె తాగి పిచ్చిగా నవ్వుతూ నృత్యము చేస్తూ, ఇన్ద్రియ నిగ్రహము కోల్పోయి , గాడిదలు పూన్చిన రథముపై దక్షిణ దిశవైపు బయలు దేరి, గాడిదలచేత శీఘ్రముగా తీసుకుపోబడెను." ||27.24||

||శ్లోకము 27.25||

పునరేవ మయాదృష్టో రావణో రాక్షసేశ్వరః||27.25||
పతితోఽవాక్ఛిరా భూమౌ గర్ధభాత్ భయమోహితః|

స|| రాక్షసేశ్వరః రావణః భయమోహితః గర్దభాత్ అవాక్చిరాః పతితః మయా పునరేవ దృష్టః||

||శ్లోకార్థములు||

రాక్షసేశ్వరః రావణః -
రాక్షసేశ్వరుడగు రావణుడు
భయమోహితః -
భయమోహితుడై
గర్దభాత్ అవాక్చిరాః పతితః -
గాడిదమీద నుంచి కింద పడినట్లు
మయా పునరేవ దృష్టః -
మళ్ళీ నాచేత చూడబడెను.

||శ్లోకతాత్పర్యములు||

"రాక్షసేశ్వరుడగు రావణుడు భయమోహితుడై గాడిదమీద నుంచి కింద పడినట్లు మళ్ళీ మళ్ళీ నాచేత చూడబడెను." ||27.25||

||శ్లోకము 27.26,27||

సహసోత్థాయ సంభ్రాంతో భయార్తో మదవిహ్వలః||27.26||
ఉన్మత్త ఇవ దిగ్వాసాదుర్వాక్యం ప్రలపన్ బహు|
దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమమ్||27.27||
మలపంకం ప్రవిశ్యాశు మగ్నస్తత్ర స రావణః|

స||సః రావణః సహసా ఉత్థాయ సంభ్రాంతః భయార్తః మద విహ్వలః దిగ్వాసః ఉన్మత్త ఇవ బహు దుస్సహం దుర్వాక్యం ప్రలపన్ దుర్గంధం ఘోరం తిమిరం నరకోపమమ్ మలపంకం ప్రవిశ్య ఆశు తత్ర మగ్నః||

||శ్లోకార్థములు||

సః రావణః సహసా ఉత్థాయ -
రావణుడు వెంటనే లేచి
సంభ్రాంతః భయార్తః -
భ్రాంత చిత్తుడై, భయముతో
మద విహ్వలః దిగ్వాసః -
మదముతో వివశుడై, బట్టలు లేని వాడై
ఉన్మత్త ఇవ బహు దుస్సహం -
పిచ్చివాని వలె సహించలేని
దుర్వాక్యం ప్రలపన్ -
దుర్వాక్యములను ప్రేలాపించుచూ
దుర్గంధం ఘోరం తిమిరం -
ఘోరము అంధకారమయమైన
నరకోపమమ్ మలపంకం ప్రవిశ్య -
నరకముతో సమానమైన మలపంకములో పడి
ఆశు తత్ర మగ్నః -
వెంటనే మునిగి పోయెను

||శ్లోకతాత్పర్యములు||

"రావణుడు వెంటనే లేచి భ్రాంత చిత్తుడై, భయముతో, మదముతో వివశుడై, బట్టలు లేని వాడై పిచ్చివాని వలె సహించలేని దుర్వాక్యములను ప్రేలాపించుచూ ఘోరము నరకముతో సమానమైన అంధకారమయమైన మలపంకములో పడి మునిగి పోయెను".||27.26,27||

||శ్లోకము 27.28||

కంఠే బధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసినీ ||27.28||
కాలీ కర్దమలిప్తాంగీ దిశం యామ్యాం ప్రకర్షతి

స|| దశగ్రీవం కంఠే భధ్వా రక్తవాసినీ కర్దమలిప్తాంగీ కాలీ ప్రమదా యామ్యాం దిశం ప్రకర్షతి||

||శ్లోకార్థములు||

దశగ్రీవం కంఠే భధ్వా -
దశగ్రీవుని కంఠములో తాడుకట్టి
రక్తవాసినీ కర్దమలిప్తాంగీ -
ఎఱ్ఱని వస్త్రములు ధరించియున్న అంగములపై బురదపూసుకొనిన
కాలీ ప్రమదా - ఒక నల్లని స్త్రీ
యామ్యాం దిశం ప్రకర్షతి -
యముని దిశగా (దక్షిణ దిశగా) ఈడ్చుకుపోసాగినది

||శ్లోకతాత్పర్యములు||

"ఎఱ్ఱని వస్త్రములు ధరించియున్న అంగములపై బురదపూసుకొనిన ఒక నల్లని స్త్రీ దశగ్రీవుని కంఠములో తాడుకట్టి దక్షిణ దిశగా ఈడ్చుకుపోసాగినది." ||27.28||

||శ్లోకము 27.29||

ఏవం తత్ర మయాదృష్టః కుంభకర్ణో నిశాచరః||27.29||
రావణస్య సుతాస్సర్వే దృష్టా స్తైలసముత్‍క్షితాః|

స||తత్ర నిశాచరః కుంభకర్ణః ఏవం సర్వే రావణస్య సుతాః తైల సముక్షితాః దృష్టాః||

||శ్లోకార్థములు||

తత్ర నిశాచరః కుంభకర్ణః -
అక్కడ నిశాచరుడు అగు కుంభకర్ణుడు
ఏవం సర్వే రావణస్య సుతాః -
అలాగే రావణుని పుత్రులందరూ
తైల సముక్షితాః దృష్టాః -
శరీరమునకు తైలము పూసికొని కనబడిరి

||శ్లోకతాత్పర్యములు||

"అక్కడ నిశాచరుడు అగు కుంభకర్ణుడు అలాగే రావణుని పుత్రులందరూ శరీరమునకు తైలము పూసికొని కనబడిరి." ||27.29||

||శ్లోకము 27.30||

వరాహేణ దశగ్రీవ శ్శింశుమారేణ చ ఇంద్రజిత్||27.30||
ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతో దక్షిణాం దిశమ్||

స|| దశగ్రీవః వరాహేణ ఇంద్రజిత్ శింశుమారేణ ఉష్ట్రేణ కుంభకర్ణః దక్షిణాం దిశం ప్రయాతః||

||శ్లోకార్థములు||

దశగ్రీవః వరాహేణ -
దశగ్రీవుడు వరాహముపై
ఇంద్రజిత్ శింశుమారేణ -
ఇంద్రజిత్తుమొసలిపై
ఉష్ట్రేణ కుంభకర్ణః -
కుంభకర్ణుడు ఒంటె పై
దక్షిణాం దిశం ప్రయాతః -
దక్షిణ దిశగా పోవుట కనపడినది

||శ్లోకతాత్పర్యములు||

"దశగ్రీవుడు వరాహముపై, ఇంద్రజిత్తు మొసలిపై, కుంభకర్ణుడు ఒంటెపై ఎక్కి, దక్షిణ దిశగా పోవుట కనపడినది".||27.30||

దక్షిణ దిశగా అనడములో - పరాభవము పొందిన వారు దక్షిణ దిశగాపోవుదురు అని. సీతారాములు ఉత్తర దిశగా పోవుచున్నారని అది శుభసూచకము అని ముందు శ్లోకములలో చెప్పబడినది.

||శ్లోకము 27.31||

ఏకస్తత్ర మయా దృష్టా శ్శ్వేతచ్ఛత్రో విభీషణః||27.31||
శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః|

స|| తత్ర ఏకః శ్వేత ఛత్రః శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః విభీషణః మయా దృష్టః ||

||శ్లోకార్థములు||

తత్ర ఏకః శ్వేత ఛత్రః -
అక్కడ ఒక తెల్లని చత్రముతో
శుక్లమాల్యాంబరధరః -
తెల్లని బట్టలు ధరించి
శుక్లగంధానులేపనః -
గంధములు పూసికొని
విభీషణః మయా దృష్టః -
విభీషణుడు నా చేత చూడబడెను

||శ్లోకతాత్పర్యములు||

"ఆ స్వప్నములో విభీషణుడు అక్కడ ఒక తెల్లని చత్రముతో తెల్లని బట్టలు ధరించి గంధములు పూసికొనిన విభీషణుడు నా చేత చూడబడెను." ||27.31||

ఇక్కడ తెలుపు గంధములు శుభసూచకములు.
ఇక్కడ మనము వినేది, రావణుని పరాభవముతో పాటు, విభీషణుని పట్టాభిషేకము కూడా సూచింపబడినది.

||శ్లోకము 27.32,33||

శంఖదుందుభినిర్ఘోషైః నృత్తగీతైరలంకృతః||27.32||
ఆరుహ్య శైలసంకాశం మేఘస్తనితనిస్స్వనమ్|
చతుర్దంతం గజం దివ్యమాస్తే తత్ర విభీషణః||27.33||
చతుర్భిః సచివైః సార్థం వైహాయస ముపస్థితః|

స|| విభీషణః శంఖదుందుభి నిర్ఘోషైః నృత్తగీతైరలంకృతైః శైలసంకాసం మేఘస్తనితనిస్స్వనమ్ చతుర్దంతం దివ్యం గజం ఆరుహ్య తత్ర ఆస్తే | చతుర్భిః సచివైః సార్థం వైహాయసం ఉపస్థితః||

||శ్లోకార్థములు||

విభీషణః శంఖదుందుభి నిర్ఘోషైః -
విభీషణుడు శంఖదుందుభి ఘోషలతో
నృత్తగీతైరలంకృతైః -
నృత్య గీతములతో అలంకరింపబడి
శైలసంకాసం మేఘస్తనితనిస్స్వనమ్ -
పర్వతమువలె నున్న మేఘ గర్జనలతో సమానమైన గర్జనలు చేయుచున్న
చతుర్దంతం దివ్యం గజం -
నాలుగు దంతములు కల దివ్యమైన గజములపై
ఆరుహ్య తత్ర ఆస్తే -
ఎక్కి అక్కడ వుండెను
చతుర్భిః సచివైః సార్థం-
నలుగురు సచివులతో కూడి
వైహాయసం ఉపస్థితః -
ఆకాశములో నిలబడియుండెను

||శ్లోకతాత్పర్యములు||

"విభీషణుడు శంఖదుందుభి ఘోషలతో నృత్య గీతములతో పర్వతమువలె నున్న మేఘ గర్జనలతో సమానమైన గర్జనలు చేయుచున్న నాలుగు దంతములు కల దివ్యమైన గజములపై ఎక్కి వుండెను. నలుగురు సచివులతో కూడి ఆకాశములో నిలబడియుండెను."||27.32,33||

||శ్లోకము 27.34||

సమాజశ్చ మయా దృష్టో గీతవాదిత్ర నిస్స్వనః||27.34||
పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససామ్|

స|| పిబతాం రక్తమాల్యానాం రక్తవాససాం రక్షసాం గీతవాదిత్ర నిస్స్వనః సమాజశ్చ మయా దృష్టః||

||శ్లోకార్థములు||

పిబతాం రక్తమాల్యానాం -
తాగివున్న ఎఱ్ఱని పూలమాలలు ధరించియున్న
రక్తవాససాం రక్షసాం -
ఎఱ్ఱని వస్త్రములు ధరించియున్న రాక్షసులను
గీతవాదిత్ర నిస్స్వనః -
పాటలుపాడుతూ వున్న
సమాజశ్చ మయా దృష్టః-
సమాజములను కూడా నేను చూచితిని

||శ్లోకతాత్పర్యములు||

" తాగివున్న ఎఱ్ఱని పూలమాలలు వస్త్రములు ధరించియున్న రాక్షసులను, పాటలుపాడుతూ వున్న సమాజములను కూడా నేను చూచితిని." ||27.34||

||శ్లోకము 27.35||

లంకాచేయం పురీ రమ్యా సవాజి రథకుంజరా||27.35||
సాగరే పతితా దృష్టా భగ్న గోపురతోరణా|

స|| రమ్యా ఇయం లంకాపురీ చ సవాజిరథకుంజరా భగ్నగోపుర తోరణా సాగరే పతితా మయా దృష్టః||

||శ్లోకార్థములు||

రమ్యా ఇయం లంకాపురీ చ -
రమ్యమైన ఈ లంకాపురి కూడా
సవాజిరథకుంజరా -
గుర్రములు, రథములు, ఏనుగులతో సహా
భగ్నగోపుర తోరణా -
పడిపోయిన గోపురములు తోరణములతో కూడి
సాగరే పతితా మయా దృష్టః -
సాగరములో మునిగిపోవుట నేను చూచితిని

||శ్లోకతాత్పర్యములు||

"పడిపోయిన గోపురములు తోరణములతో కూడియున్న లంకానగరము గుర్రములు ఏనుగులతో సహా సాగరములో మునిగిపోవుట నేను చూచితిని ".||27.35||

||శ్లోకము 27.36||

లంకా దృష్టా మయా స్వప్నే రావణే నాభిరక్షితా||27.36||
దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా |

స|| రావణేన అభిరక్షితా లంకా రామస్య దూతేన తరశ్వినా వానరేణ దగ్ధా మయా స్వప్నే దృష్టా||

||శ్లోకార్థములు||

రావణేన అభిరక్షితా లంకా -
రావణునిచేత రక్షింపబడిన లంక
రామస్య దూతేన -
రాముని దూత చేత
తరశ్వినా వానరేణ దగ్ధా -
వాయువేగముకల వానరుని చేత దగ్ధము చేయబడినట్లు
మయా స్వప్నే దృష్టా -
నా చేత స్వప్నములో చూడబడినది

||శ్లోకతాత్పర్యములు||

" రావణునిచేత రక్షింపబడిన లంక రాముని దూత వాయువేగముకల వానరుని చేత దగ్ధము చేయబడినట్లు చూచితిని."||27.36||

తరువాత సర్గలలో హనుమంతుని చేత లంకాదహనము జరుగుతుంది. అంటె త్రిజట సూర్యోదయము ముందర స్వప్నము యదార్థము అవుతుంది.

||శ్లోకము 27.37||

పీత్వా తైలం ప్రవృత్తాశ్చ ప్రహసంత్యో మహాస్వనాః||27.37||
లంకాయాం భస్మరూక్షాయాం ప్రవిష్టా రాక్షస స్త్రియః|

స|| భస్మరుక్షయాం లంకాయాం సర్వా రాక్షస్త్రియః తైలం పీత్వా ప్రహసంత్యః మహాస్వనాః ప్రనృతాః చ||

||శ్లోకార్థములు||

భస్మరుక్షయాం లంకాయాం -
భస్మరాసులతో నిండిన లంకలో
సర్వా రాక్షస్త్రియః తైలం పీత్వా -
రాక్షస స్త్రీలు అందరు నూనెతాగి
ప్రహసంత్యః మహాస్వనాః -
పెద్దగా ధ్వనిచేస్తూ నవ్వుతూ
ప్రనృతాః చ -
వెర్రిగంతులు వేయుచున్నవారు కూడా

||శ్లోకతాత్పర్యములు||

" భస్మరాసులతో నిండిన లంకలో, నూనెతాగి పిచ్చిగా పెద్దగా ధ్వనిచేస్తూ నవ్వుతూ వున్న రాక్షస స్త్రీలు , వెర్రిగంతులు వేయుచున్నవారు కూడా కనపడిరి." ||27.37||

||శ్లోకము 27.38||

కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షస పుంగవః||27.38||
రక్తం నివసనం గృహ్య ప్రవిష్టా గోమయహ్రదే|

స|| కుంభకర్ణాదయః ఇమే సర్వా రాక్షసపుంగవాః రక్తం నివసనం గృహ్య గోమయహృదే ప్రవిష్టాః||

||శ్లోకార్థములు||

కుంభకర్ణాదయః - కుంభకర్ణాదులు
ఇమే సర్వా రాక్షసపుంగవాః -
అలాగే అందరూ రాక్షసపుంగవులు
రక్తం నివసనం గృహ్య -
ఎరుపు రంగు వస్త్రములు వేసుకొని
గోమయహృదే ప్రవిష్టాః -
గోవుపేడగుంటలలో ప్రవేశించిరి

||శ్లోకతాత్పర్యములు||

"కుంభకర్ణాదులు అలాగే అందరూ రాక్షసపుంగవులు ఎరుపు రంగు వస్త్రములు వేసుకొని గోవుపేడగుంటలలో ప్రవేశించిరి ".||27.38||

||శ్లోకము 27.39||

అపగచ్ఛత నశ్యధ్వం సీతా మాప స రాఘవః||27.39||
ఘాతయేత్ పరమామర్షీ సర్వై స్సార్థం హి రాక్షసైః|

స|| అపగచ్ఛత నశ్యధ్వం| రాఘవః సీతాం ఆప్నోతి | పరమామర్షీ రాక్షసైః సార్థం యుష్మాన్ ఘాతయేత్||

||శ్లోకార్థములు||

అపగచ్ఛత నశ్యధ్వం -
వెళ్ళిపొండి మీరు నశించిపోయెదరు
రాఘవః సీతాం ఆప్నోతి -
రాఘవుడు సీతను పొందును
పరమామర్షీ రాక్షసైః సార్థం -
అమితమైన కోపము కల రాఘవుడు రాక్షసులందరితో
యుష్మాన్ ఘాతయేత్ -
మీ అందరినీ చంపివేయును.

||శ్లోకతాత్పర్యములు||

"ఓ రాక్షస స్త్రీలారా వెళ్ళిపొండి, మీరు నశించిపోయెదరు. రాఘవుడు సీతను పొందును. అమితమైన కోపము కల రాఘవుడు మీ అందరినీ చంపివేయును." ||27.39||

||శ్లోకము 27.40||

ప్రియాం బహుమతాం భార్యాం వనవాస మనువ్రతామ్||27.40||
భర్త్సితాం తర్జితాం వాపి నానుమంశ్యతి రాఘవః|

స|| రాఘవః ప్రియాం బహుమతాం వనవాసం అనువ్రతాం భార్యామ్ భర్త్సితాం తర్జితాం వా అపి న అనుమంశ్యతి||

||శ్లోకార్థములు||

రాఘవః ప్రియాం బహుమతాం -
రామునికి అత్యంత ప్రియమైన
వనవాసం అనువ్రతాం భార్యామ్ -
వనవాస దీక్షతీసుకున్న భార్యను
భర్త్సితాం తర్జితాం వా అపి -
భయపెట్టిన దుర్భాషలాడిన వారిని
న అనుమంశ్యతి -
సహించడు

||శ్లోకతాత్పర్యములు||

"రామునికి అత్యంత ప్రియమైన వనవాస దీక్షతీసుకున్న భార్యను భయపెట్టిన దుర్భాషలాడిన వారిని సహించడు".||27.40||

||శ్లోకము 27.41||

తదలం క్రూరవాక్యైః వః సాంత్వమేవాభిదీయతామ్||27.41||
అభియాచామ వైదేహీమేతద్ధి మమరోచతే|

స|| తత్ అలం క్రూరవాక్యైః | వః సాంత్వమేవ అభిదీయతాం| వైదేహీం అభియాచామ ఏతద్ధి మమ రోచతే||

||శ్లోకార్థములు||

తత్ అలం క్రూరవాక్యైః -
ఈ కౄర వాక్యములు చాలు
వః సాంత్వమేవ అభిదీయతాం -
ఆమెతో శాంతముగా ప్రవర్తించుడు
వైదేహీం అభియాచామ -
వైదేహిని బ్రతిమాలుటయే మంచిది
ఏతద్ధి మమ రోచతే -
నాకు అదే మంచిది అనిపించుచున్నది

||శ్లోకతాత్పర్యములు||

"అందుకని ఈ క్రూర వాక్యములు చాలు. ఆమెతో శాంతముగా ప్రవర్తించుడు. వైదేహిని బ్రతిమాలుటయే మంచిది. నాకు అదే మంచిది అనిపించుచున్నది." ||27.41||

||శ్లోకము 27.42||

యస్యాం ఏవం విధః స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే||27.42||
సా దుఃఖైః వివిధై ర్ముక్తా ప్రియం ప్రాప్నోత్యనుత్తమమ్|

స|| యస్యాం దుఃఖితాయాం ఏవం విధః స్వప్నః ప్రదృశ్యతే సా వివిధైః దుఃఖైః ముక్తా అనుత్తమం ప్రియం ప్రాప్నోతి ||

||శ్లోకార్థములు||

యస్యాం దుఃఖితాయాం -
దుఃఖములో నున్న ఎవరికి
ఏవం విధః స్వప్నః ప్రదృశ్యతే -
ఇట్టి స్వప్నము వచ్చునో
సా వివిధైః దుఃఖైః ముక్తా -
వారు అనేక రకములైన దుఃఖములనుంచి విముక్తులగుదురు
అనుత్తమం ప్రియం ప్రాప్నోతి -
అసమానమైన ప్రియమును పొందుదురు

||శ్లోకతాత్పర్యములు||

" దుఃఖములో నున్న ఎవరికి ఇట్టి స్వప్నము వచ్చునో వారు అనేక రకములైన దుఃఖములనుంచి విముక్తులగుదురు. అసమానమైన ప్రియమును పొందుదురు." ||27.42||

ఇది త్రిజట మాట. ఇది ఈ సర్గ యొక్క ఫలశృతి కూడా. ఈ సర్గ విన తగినది చదవ తగినది. సుందరకాండ అంతా చదవతగిన వినతగిన గ్రంథము. అన్నీ చదవలేని వారు కొన్ని సర్గలు చదవతలచుకుంటే, ఇది అలాగ చదవతగిన సర్గ.

ఈ త్రిజట కల తెల్లవారుజాములో ప్రాతఃకాలము ముందర వచ్చిన కల. ఈ కలలో చెప్పిన మాటలన్నీ నిజమౌతాయి.

ఆ సంగతి ముందు సర్గలలో మనకి విదితమౌతుంది.
రామాయణము కాలములో ప్రాతఃకాలము ముందర వచ్చిన కలలు,నిజమౌతాయి అని లోకోక్తి వున్నదో లేదో మనకి తెలియదు. ఆ లోకోక్తి వుంటే వాల్మీకి, శకునముల గురించి చెప్పిన కవి, ఆ లోకోక్తి గురించి కూడా చెప్పేవాడు అని ఒక ఆలోచన.

ఏది ఎమైనా ఈ కాలములో కూడా, అలా ప్రాతః కాలపు కలలు నిజమౌతాయి అని ఒక నమ్మకము. ఆ నమ్మకము బహుశః ఈ త్రిజటా స్వప్నము తో ఖరారు అయ్యాయి అనుకోవచ్చు. ఈ కలలోని విశేషాలు కొన్ని లోకోక్తులలోకి మారాయి .అవి ముందు వచ్చే కార్యములను సూచించే లోకోక్తులన్నమాట. ఈ మాట రామాయణ తిలకలో, గొవిన్దరాజులవారి వ్యాఖ్యలలో కూడా విన్నాము .

||శ్లోకము 27.43||

భర్త్సితా మపి యాచధ్వం రాక్షస్యః కిం వివక్షయా||27.43||
రాఘవాద్ధి భయం ఘోరం రాక్షసానా ముపస్థితమ్|

స|| రాక్షస్యః భర్త్సితామపి యాచధ్వం కిం వివక్షయా రాక్షసానాం రాఘవాత్ ఘోరం భయం ఉపస్థితమ్||

||శ్లోకార్థములు||

రాక్షస్యః భర్త్సితామపి - రాక్షసులారా భయపెట్టినప్పటికీ
యాచధ్వం - యాచించుడు
కిం వివక్షయా - ఇంకాచెప్పుట అనవసరము
రాక్షసానాం రాఘవాత్ - రాక్షసులకు రాఘవునుంచి
ఘోరం భయం ఉపస్థితమ్ - ఘోరమైన ఆపద సంభవించనున్నది

||శ్లోకతాత్పర్యములు||

"రాక్షసులారా భయపెట్టినప్పటికీ ఆమెను యాచించుడు. ఇంకాచెప్పుట అనవసరము. రాక్షసులకు ఘోరమైన ఆపద సంభవించనున్నది". ||27.43||

||శ్లోకము 27.44||

ప్రణిపాతప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా||27.44||
అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్ |

స|| రాక్షస్యః జనకాత్మజా ఏషా మైథిలీ ప్రణిపాతప్రసన్నా మహతః భయాత్ పరిత్రాతుం అలమ్||

||శ్లోకార్థములు||

రాక్షస్యః జనకాత్మజా ఏషా మైథిలీ -
రాక్షసులారా జనకాత్మజ అయిన ఈ మైథిలి
ప్రణిపాత ప్రసన్నా- నమస్కరించబడి ప్రసన్నురాలై
మహతః భయాత్ - మహత్తరమైన భయమునుంచి
పరిత్రాతుం అలమ్ - మనలను రక్షింపగలదు

||శ్లోకతాత్పర్యములు||

"రాక్షసులారా జనకాత్మజ అయిన ఈ మైథిలి నమస్కరించబడి ప్రసన్నురాలై మహత్తరమైన భయమునుంచి మనలను రక్షింపగలదు. "||27.44||

"నమస్కరించిన మాత్రముననే ప్రసన్నమగు సీతమ్మని వేడుకోండి, రాక్షసులకు కలిగే మహత్తరమైన భయము నుంచి ఈమె ఒక్కరితే రక్షింపకలదు" అని.

ఈ శ్లోకములో వాల్మీకి మాతృభావము లక్ష్మీ స్వభావము, సీతాస్వభావము చిత్రీకరించెను. ఆమెకే ప్రత్యక్షముగా అపరాధము చేసినవారిని కూడా క్షమింప గలిగిన ఔదార్యవతి. తాను క్షమించడమే కాదు. ఇతరులను కూడా హింసాకార్యక్రమములనుంచి నివారించకల శక్తి కలది.

యుద్ధకాండలో , యుద్ధము అయిన తరువాత, రాక్షస స్త్రీల హింసాకాండను చూచిన హనుమ , ఆ రాక్ష స్త్రీల వధకు పూనుకుంటాడు. అప్పుడు సీత చెపుతుంది. "న కశ్చిన్నాపరాధ్యతి"."తప్పు చెయని వాడు ఎవరు"?అని చెప్పి , హనుమని నివారించెను. అది సీతమ్మ మాతృభావము.

||శ్లోకము 27.45||

అపి చాస్యా విశాలాక్ష్యా న కించి దుపలక్షయే||27.45||
విరూపమపి చాంగేషు సుసూక్ష్మమపి లక్షణమ్|

స|| అపి చ విశాలాక్షయాః అస్యాః అంగేషు సుసూక్ష్మపి విరూపం లక్షణమ్ కించిదపి న ఉపలక్ష్యతే||

||శ్లోకార్థములు||

అపి చ విశాలాక్షయాః -
ఇంకా ఈ విశాలాక్షి యొక్క
అస్యాః అంగేషు -
ఆమె అంగములలో
సుసూక్ష్మపి విరూపం లక్షణమ్ -
సూక్ష్మమైనాగాని అశుభకరమైన లక్షణములు
కించిదపి న ఉపలక్ష్యతే -
ఏమీ కనపడుటలేదు

||శ్లోకతాత్పర్యములు||

"ఈ విశాలాక్షి అంగములలో సూక్ష్మమైనాగాని అశుభకరమైన లక్షణములు ఏమీ కనపడుటలేదు. "||27.45||

||శ్లోకము 27.46||

ఛాయావైగుణ్యమాత్రం తు శంకే దుఃఖముపస్థితమ్||27.46||
అదుఃఖార్హా మిమాం దేవీం వైహాయస ముపస్థితమ్|

స|| ఛాయావైగుణ్యమాత్రం చ వైహాయసం ఉపస్థితం అదుఃఖార్హం ఇమాం దేవీం దుఃఖం ఉపస్థితం శంకే||

||శ్లోకార్థములు||

ఛాయావైగుణ్యమాత్రం చ -
ఛాయమాత్రముగా తేడా వున్నది
వైహాయసం ఉపస్థితం -
ఆకాశమార్గములో ఉన్న ఆమెలో
అదుఃఖార్హం ఇమాం దేవీం -
దుఃఖము అనుభవించతగని ఆమెకు
దుఃఖం ఉపస్థితం శంకే -
అమిత దుఃఖము సంభవించినది అనుకుంటాను

||శ్లోకతాత్పర్యములు||

"ఆకాశమార్గములో ఉన్న ఆమెలో ఒక్క ఛాయమాత్రముగా తేడా వున్నది. దుఃఖము అనుభవించతగని ఆమెకు, అమిత దుఃఖము సంభవించినది".||27.46||

||శ్లోకము 27.47||

అర్థసిద్ధిం తు వైదేహ్యాః పశ్యామ్యహ ముపస్థితామ్||27.47||
రాక్షసేంద్రవినాశం చ విజయం రాఘవస్య చ|

స|| అహం వైదేహ్యాం అర్థసిద్ధిం ఉపస్థితం పశ్యామి | రాక్షసేంద్ర వినాశనం చ | రాఘవస్య విజయం చ||

||శ్లోకార్థములు||

అహం వైదేహ్యాం -
నేను వైదేహి యొక్క
అర్థసిద్ధిం ఉపస్థితం పశ్యామి -
కోరికలు నెరవేరు సూచనలు చూచుచున్నాను
రాక్షసేంద్ర వినాశనం చ -
అలాగే రాక్షసేంద్రుని వినాశము
రాఘవస్య విజయం చ - రాఘవుని జయము కూడా

||శ్లోకతాత్పర్యములు||

"నేను వైదేహి కోరికలు నెరవేరు సూచనలు చూచుచున్నాను. అలాగే రాక్షసేంద్రుని వినాశము, రాఘవుని జయము కూడా చూచుచున్నాను. " ||27.47||

||శ్లోకము 27.48||

నిమిత్తభూత మేత త్తు శ్రోతుమస్యా మహత్ప్రియమ్||27.48||
దృశ్యతే చ స్ఫురచ్ఛక్షుః పద్మ పత్ర మివాయతమ్|

స|| అస్యాం మహత్ ప్రియం శ్రోతుం నిమిత్తభూతం స్పురత్ | ఏతత్ పద్మపత్రమివ ఆయతాం చక్షుః దృశ్యతే||

||శ్లోకార్థములు||

అస్యాం మహత్ - ఈమెకు మహత్తరమైన
ప్రియం శ్రోతుం - ప్రియము వినిపించుటకు
నిమిత్తభూతం స్పురత్ - శకునములు కనపడుచున్నవి
ఏతత్ పద్మపత్రమివ - అమె పద్మపత్రములాంటి
ఆయతాం చక్షుః దృశ్యతే - ఎడమ కన్ను అదురుచున్నది.

||శ్లోకతాత్పర్యములు||

"ఈమెకు మహత్తరమైన ప్రియము వినిపించుటకు శకునములు కనపడుచున్నవి. అమె పద్మపత్రములాంటి ఎడమ కన్ను అదురుచున్నది". ||27.48||

||శ్లోకము 27.49||

ఈషచ్చ హృషితో వాస్యా దక్షిణాయా హ్యదక్షిణః||27.49||
అకస్మాదేవ వైదేహ్యా బాహురేకః ప్రకంపతే|

స||దక్షిణాయాః అస్యాః వైదేహ్యాః అదక్షిణః ఏకః బాహుః అకస్మాదేవ హృషితః ఈషత్ ప్రకంపతే||

||శ్లోకార్థములు||

దక్షిణాయాః అస్యాః వైదేహ్యాః -
దక్షత కల ఈ వైదేహి యొక్క
అదక్షిణః ఏకః బాహుః -
ఎడమ భుజము ఒక్కటే
అకస్మాదేవ హృషితః -
అకస్మాతుగా గగుర్పాటుకు లోనై
ఈషత్ ప్రకంపతే -
కొంచెము అదురుతున్నది

||శ్లోకతాత్పర్యములు||

"దక్షత కల ఈ వైదేహి యొక్క ఎడమ భుజము ఒక్కటే, అకస్మాతుగా గగుర్పాటుకు లోనై కొంచెము అదురుతున్నది."||27.49||

||శ్లోకము 27.50||

కరేణు హస్త ప్రతిమ స్సవ్య శ్చోరు రునుత్తమః||27.50||
వేపమాన స్సూచయతి రాఘవం పురతః స్థితమ్||27.51||

స|| కరేణు హస్తప్రతిమః అనుత్తమః సవ్యః ఉరుః వేపమానః రాఘవం పురతః స్థితం సూచయతి ||

||శ్లోకార్థములు||

కరేణు హస్తప్రతిమః -
ఏనుగు తొండము లాంటి
అనుత్తమః సవ్యః ఉరుః వేపమానః -
ఉత్తమమైన ఏడమ తొడ అదురుతూ
రాఘవం పురతః స్థితం -
ముందున్న రాముని చూచుట
సూచయతి - సూచించుచున్నది

||శ్లోకతాత్పర్యములు||

"ఏనుగు తొండము లాంటి ఏడమ తొడ అదురుతూ రాముని చూచుట సూచించుచున్నది". ||27.50||

||శ్లోకము 27.51||

పక్షీ చ శాఖా నిలయః ప్రహృష్టః
పునః పునశ్చోత్తమ సాంత్వవాదీ|
సుస్వాగతాం వాచ ముదీరయానః
పునః పునశ్చోదయతీవ హృష్టః||27.51||

స|| పక్షీ చ శాఖానిలయం ప్రవిష్టః పునః పునః చ ఉత్తమసాంత్వవాదీ సుస్వాగతం వాచం ఉదీరయానః| హృష్టః పునః పునఃచోదయతీవ||

||శ్లోకార్థములు||

పక్షీ చ శాఖానిలయం -
ఆ శాఖల మీద నున్న కోకిలలు
ఉత్తమసాంత్వవాదీ -
మధురమైన కూతలు
ప్రవిష్టః పునః పునః చ -
పదే పదే కూయుచూ
సుస్వాగతం వాచం ఉదీరయానః -
స్వాగతము చెపుతూ ఉన్నట్లు
హృష్టః పునః పునఃచోదయతీవ -
సంతోషముతో పదే పదే చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి

||శ్లోకతాత్పర్యములు||

"ఆ శాఖల మీద నున్న కోకిలలు మధురమైన కూతలు పదే పదే కూయుచూ అత్యంత ఆప్తునికి స్వాగతము చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి. అవి సంతోషముతో పదే పదే చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి." ||27.51||

ఈ శ్లోకము మీద గోవిన్దరాజులవారి వ్యాఖ్యలు, తిలక టీకాలో వ్యాఖ్యలు చాలావున్నాయి.

"ఆ వృక్షశాఖలలో వున్న పక్షి ఇది శోకమునకు తగిన సమయము కాదు అని సూచిస్తూ మళ్ళీ మళ్ళీ ఉత్తమము అయిన సాంత్వవచనములను పలుకుచున్నట్లు ఉంది. రామునకు సుస్వాగతము కూడా పలుకుచున్నట్లు వుంది"

ఈ శ్లోకములో "పక్షీ" అన్నమాటలో , "శాఖానిలయః" అనడములో , "ప్రహృష్టః" అనడములో అనేకమైన ధ్వనులు వినిపిస్తాయి.

ఆ చెట్టుమీద శాఖలలో ఉన్న పక్షి, అంటే మనకి వినపడే ధ్వని చెట్టు మీద దాగి ఉన్న హనుమ. ఆ హనుమ సుందరకాండలో మొదటి శ్లోకము లో చెప్పబడిన ఆచార్యుడు. రామునికి దూరముగా వున్న సీతకు రాముని సందేశము అందింపవచ్చి న వాడు, ఇంతవరకు మౌనముగా పరికీలుంచుచున్న హనుమ మాట్లాడే శుభసమయము ఆసన్నమైనది అన్నమాట.

బ్రహ్మనిష్టుడై ఆచరణముచే పరిపూర్ణుడైన ఆచార్యుడు, జ్ఞాని అగు మహాపరుషుడు "పక్షి".

పక్షి అంటే పక్షములు కలది పక్షి. ఇది ఆకాశమున విహరించును. అలా ఆకాశమున పోవుటకు సాధనములు పక్షములు - రెక్కలు. ఆకాశమే పరబ్రహ్మము. ఆకాశమున విహరించుట పరబ్రహ్మమును చేరుట.

ఆ = అంతట పూర్తిగా ; కాశ = ప్రకాశించునది. ఆకాశము అంటే స్వయం ప్రకాశమైనది. అదే పరమాత్మ స్వరూపము. రెండు రెక్కలతో పక్షి ఆకాశములో సాగునట్లే, జ్ఞాన కర్మలచే పురుషుడు పరమగతి నొందును అని.

యజ్ఞము దానము తపస్సు అనునవి ఆచరించి,
అంతఃకరణ నిర్మలత్వము పొందినప్పుడే జ్ఞానము ఆవిర్భవించును. ఆట్టి జ్ఞానముతో ఆరాధ్యుడగు పరమపురుషుని తెలిసికొని, పరమపురుషుని సమారాధనరూపముగా కర్మలను ఆచరించుటయే సిద్ధి.

అట్టి జ్ఞాన కర్మలు కలవాడే ఆచార్యుడు. ఆచార్య శబ్దమునకు నిర్వచనము కూడా అదే.

"ఆచనోతి హి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి
స్వయమాచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే" ||

శాస్త్రార్థములను తెలిసికొని, తను ఆచరించి, ఇతరులచే ఆచరింపచేయువాడే ఆచార్యుడు. ఆ చెట్టుమీద వున్న "పక్షి" -హనుమ అటువంటి అచార్యుడు.

ఆ పక్షిని - "శాఖానిలయః" అంటారు. ఆ శాఖలలో ఉన్న పక్షి అన్నమాట. వేద శాఖలే ఇక్కడి శాఖలు. ఆ వేద శాఖలలో మునిగి వున్నవాడే గురువు - ఆచార్యుడు - అదే హనుమ.

శ్లోకములో శాఖానిలయః ప్రహృష్టః అని చెపుతారు.

ప్రహృష్టః అంటే సంతుష్టమైన హృదయము కలవాడు అని. అది ఎవరు? విషయభోగముల కోరికలతో, వాటిని పొంది లాభాలాభములతో సంతుష్టుడుగా వుండడము కాదు. సదా భగవద్గుణములనే అనుభవించుచూ , ఆ అనుభవముచే కలిగిన ప్రీతితో నిండిన హృదయముకలవాడు సంతుష్టుడు. ఎల్లప్పుడూ సంతుష్టుడై వుండాలి. అలాంటి అనుభవముతో సంతుష్టుడై వున్నవాడే ఆచార్యుడు.

ఆ పక్షి ఏమి చెపుతున్నట్లు వుంది?

"పునః పునశ్చ ఉత్తమ సాంత్వవాది" మరల మరల ఉత్తమమైన సాంత్వ వచనములను చెపుతూ వున్నట్లు వుంది ఆ పక్షి. ఆ ఆచార్యుడే ఇలా సాంత్వ వచనములు చెప్పకలిగినవాడు.

ఆ ఆచార్యుడే సాంత్వ వచనములు చెప్ప తగినవాడు. ఆచార్యుడు భగంతుని చేరుట కష్టముకాదని , ఎక్కడ పొందవలెననిన అక్కడనే వుండునని, ఏమియు సమిర్పింపనక్కరలేదని ,సర్వ సులభుడని, ఆచార్యుడు శిష్యునకు సాంత్వవచనముల తో చెప్ప గలిగినవాడు.

అలాంటి ఆచార్యుడు ఏమి చెపుతున్నాడట?

"సుస్వాగతం వాచం ఉదీరయానః"

సు=చక్కగా సంప్రదాయబద్ధముగా
స్వ= తనకు
ఆగతం= వచ్చిన
వాచం = వాక్కును అంటే మంత్రమును
ఉదీరయానః = చెప్పుచున్నాడు.

భగవంతుని నుండి పూర్వచార్య పరంపరలో వచ్చిన మంత్రములను ఆచార్యుడు శిష్యులకు ఉపదేశించుచుండును. అది ఆచార్యుని మార్గము.
అచార్యుడు ఎలాగ చెపుతున్నాడు.

"పునః పునశ్చోదయతీవ", మరల మరల చెపుతున్నాడుట.
శిష్యుడు అపమార్గమునపడకుండా ప్రేరణ చేసేవాడే గురువు. అట్టి గురువగు "పక్షి" చెట్టుశాఖలలో మరల మరల దుఃఖములో ఉన్న సీతకు శాంత్వ వచనములను చెప్పిచున్నట్లు కూస్తున్నాడుట.

అంటే ఈ శ్లోకములో"జ్ఞానకర్మలు చేయువాడు, విద్యా వినయ సంపన్నుడు, భగవదనుభావ జనిత ఆనందము అనుభవించువాడు, భగవద్విషయములగు సాంత్వ వచనములు పలుకువాడు, ఆచారపరంపరాప్రాప్తమగు మంత్రములను ఉపదేశించువాడు, సదా శిష్యుని పరిశీలించువాడు , శిష్యానుభవముచే ఆనందించువాడు ,
అట్టివాడే గురువుగా ఉండతగినవాడు అని ఒక ధ్వని. "

అలాంటి పక్షి ( వానరుడు) , అంటే ఆచార్యస్వరూపుడగు హనుమంతుడు చెట్టుపై ఉన్నాడు. సాంత్వ వచనములను చెప్పుచున్నాడు అని రెండవ ధ్వని. పక్షి కూతలు ఆచార్యుని సాంత్వ వచనములు, అవి శుభ సూచకములు.

అదే ఈ స్వర్గ ఆఖరిమాటగా చెప్పబడినది. ముందున్న ఘటనలను సూచిస్తూ. శుభశకునములతో ఈ సర్గ అంతమౌతుంది.

ఈ శ్లోకముతో ఇరువది ఏడవ సర్గ సమాప్తము అవుతుంది.

ఇరువది ఆరవ సర్గలో విన్నది సీతమ్మ దుఃఖము. ఈ సర్గలో ఆ శోకము పోతుంది అనే శుభసూచకములు కనిపిస్తాయి. అందుకని ఈ సర్గ ఒక పారాయణ సర్గ.

ఈ సర్గలో ఇంకోక ముఖ్యమైన మాట వుంది. అది పదమూడవ గాయత్రీ బీజాక్షరము.

రామాయణములో 24000 శ్లోకాలని, గాయత్రీ మంత్రములోని 24 అక్షరాలు ఈ శ్లోకాలలో వున్నాయని విన్నమాటే. రామాయణములో మొదటి శ్లోకములో గాయత్రిలో మొదటి బీజాక్షరము వున్నది. అలాగ ప్రతి వెయ్యిశ్లోకాలకి ఒక బీజాక్షరము వున్నది.

సుందరకాండ మొదటి సర్గ లోమొదటి శ్లోకము లో 12వ గాయత్రీ బీజాక్షరము "వ" వున్నది. అంటే ఆ మొదటి శ్లోకము 12వ సహస్రములో మొదటి శ్లోకము (11001) అన్నమాట. ఆ శ్లోకములో గాయత్రీ మంత్రములోని 12 వ అక్షరము "వ" వున్నదని కూడా విదితమే.

గోవిందరాజులవారి టీకా తాత్పర్యము రామాయణ శిరోమణి ప్రకారము, రామాయణములోని 13వ సహస్రములో మొదటి శ్లోకము. అలాగే 13 వ బీజాక్షరము 27 వ సర్గలో వుంది. అంటే 12001 శ్లోకము 27 వసర్గలో వున్నది అన్నమాట.ఆ శ్లోకములో 13 వ బీజాక్షరము అంటే ' స్య' వున్నది.

ఆ 12001 శ్లోకము ఇక్కడ మళ్ళీ విందాము.

శ్లో|| తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్థస్యదన్తినః|
భర్త్రా పరి గృహీతస్య జానకీ స్కన్ధమాశ్రితా||(27-14)
తా|| " అప్పుడు పర్వతాగ్రముపై నున్న ఆ జానకి
ఆకాశములో నిలబడిన ఆ ఏనుగు పైకి ఎక్కి భర్త చెంత చేరెను".

ఈ శ్లోకములో గాయత్రీ మంత్రములోని పదమూడవ అక్షరము "స్య". మొదటి పాదములో నాలుగొవ అక్షరము త"స్య" లో వస్తుంది. ఈ శ్లోకములో గాయత్రీ బీజాక్షరము వుంది కనక ఇది చాలామందికి ముఖ్యమైన శ్లోకము.

గాయత్రీ బీజాక్షరము వున్న శ్లోకము ఈ సర్గలో వుండడము వలన, ఈ త్రిజటా స్వప్న వృత్తాంతము సర్గ కూడా చాలామందికి చాలా ముఖ్యము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తవింశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది ఏడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||