||సుందరకాండ ||

||ముప్పది మూడవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 33 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రయస్త్రింశస్సర్గః

ముప్పది రెండవ సర్గలో చలించిన మనస్సు గల సీత, బ్రహ్మ ఇంద్రాది దేవతలకు నమస్కరిస్తూ, హనుమంతుడు వినిపించిన రామకథ సత్యమే అగుగాక అని ప్రార్థిస్తుంది.

"నమోఽస్తు వాచస్పతయే సవజ్రిణే
స్వయంభువే చైవ హుతాశనాయచ|
అనేన చోక్తం యదిదం మమాగ్రతో
వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా" ||32-14||

ఎందుకు ఈ ప్రార్థన ? ఆ హనుమ పాడిన రామకథ ప్రకారము రాముడు సీతాన్వేషణలో మునిగి , కొత్త స్నేహితులను సంపాదించినట్లు, కొత్త స్నేహితుల సహాయముతో వేలకొలదీ వానరులు ఆన్ని దిశలలో సీతాన్వేషణకోసము పంపిబడినట్లు తెలుస్తుంది. అది సత్యమే అయితే సీతను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. అదే సీతకి కావలసినది. అందుకే "ఆ వానరుడు చెప్పిన మాటలు నిజమగుగాక", అని సీతమ్మ ప్రార్థిస్తుంది.

ముప్పది మూడవ సర్గలో హనుమంతుడు సీత మనస్సు స్పందిస్తునట్లు గ్రహించి, ఆ వృక్షమునుంచి దిగి సీతాదేవిని సమీపించి, శిరస్సుతో అంజలి ఘటించి, మధురమైన మాటలతో సీతమ్మతో సంభాషణ మొదలెడతాడు.

ఇక ముప్పది మూడవ సర్గలో శ్లోకాలు.

||శ్లోకము 33.01||

సోఽవతీర్య ద్రుమా త్తస్మా ద్విద్రుమప్రతిమాననః|
వినీతవేషః కృపణః ప్రణిప త్యోపసృత్య చ||1||

స||సః వినీత వేషః విద్రుమప్రతిమాననః తస్మాత్ ద్రుమాత్ అవతీర్య కృపణః ప్రణిపత్య ఉపసృత్య చ||

టిలక టీకాలో- కృపణో- మాతుః సీతాయాః దుఃఖ దర్శనాత్ దీనః

||శ్లోకార్థములు||

సః వినీత వేషః - వినయవిధేతలు గలవాని వలే వస్త్రములు ధరించినవాడు
కృపణః - సీతమ్మ దుఃఖము చూచి దీనముగా వున్న
విద్రుమప్రతిమాననః - పగడములతో సమానమైన కాంతి గలవాడు
తస్మాత్ ద్రుమాత్ అవతీర్య - ఆ వృక్షమునుంచి దిగి
ప్రణిపత్య ఉపసృత్య చ - సమీపించి నమస్కరించెను

||శ్లోకార్థ తాత్పర్యములు||

"వినయవిధేతలు గలవాని వలే వస్త్రములు ధరించినవాడు, పగడములతో సమానమైన కాంతి గలవాడు, సీతమ్మయొక్క దుఃఖము చూచి దీనభావము కలవాడు అగు మారుతాత్మజుడు ఆ వృక్షమునుంచి దిగి సీతమ్మను సమీపించి నమస్కరించెను."||33.01||

||శ్లోకము 33.02||

తా మబ్రవీన్మహాతేజా హనుమాన్ మారుతాత్మజః|
శిర స్యంజలిమాధాయ సీతాం మధురయా గిరా||33.02||

స||మహాతేజా మారుతాత్మజః హనుమాన్ శిరస్యంజలిమాధాయ మధురయా గిరా తాం సీతాం అబ్రవీత్||

||శ్లోకార్థములు||

మహాతేజా మారుతాత్మజః హనుమాన్ -
మహా తేజోవంతుడైన, మారుతాత్మజూడగు హనుమాన్
శిరస్యంజలిమాధాయ - శిరస్సుతో అంజలి ఘటించి
మధురయా గిరా - మధురమైన మాటలతో
తాం సీతాం అబ్రవీత్ - అ సీతతో ఇట్లనెను
||శ్లోకార్థ తాత్పర్యములు||

"ఆ మహా తేజోవంతుడైన, మారుతాత్మజూడగు హనుమంతుడు శిరస్సుతో అంజలి ఘటించి మధురమైన మాటలతో అ సీతతో ఇట్లనెను." ||33.02||

||శ్లోకము 33.03||

కాను పద్మ పలాశాక్షి క్లిష్టకౌశేయవాసిని|
ద్రుమస్య శాఖామాలంబ్య తిష్ఠసి త్వమనిందితే||3||

స|| పద్మపలాశాక్షి క్లిష్టకౌశేయవాసిని అనిందితే ద్రుమస్య శాఖాం ఆలంబ్య తిష్టసి | కా ను?||

||శ్లోకార్థములు||

పద్మపలాశాక్షి - పద్మరేకులవంటి కళ్ళు కలదానా,
క్లిష్టకౌశేయవాసిని - నలిగిన పట్టువస్త్రములు ధరించినదానా
అనిందితే - దోషములు లేని దానా
ద్రుమస్య శాఖాం ఆలంబ్య తిష్టసి - చెట్టుకొమ్మని పట్టుకొని నిలబడిన దానా
కా ను? - నీవు ఎవరివి?

||శ్లోకార్థ తాత్పర్యములు||

"పద్మరేకులవంటి కళ్ళు కలదానా, నలిగిన పట్టువస్త్రములు ధరించినదానా, దోషములు లేని దానా చెట్టుకొమ్మని పట్టుకొని నిలబడిన దానా, నీవు ఎవరివి?" ||33.03||

||శ్లోకము 33.04||

కిమర్థం తవ నేత్రాభ్యాం వారిస్రవతి శోకజం|
పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణ మివోదకమ్||33.04||

స|| తవ నేత్రాభ్యాం కిమర్థం వారిః పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణ ఉదకం ఇవ స్రవతి ||

||శ్లోకార్థములు||

తవ నేత్రాభ్యాం - నీ నేత్రములనుంచి
కిమర్థం వారిః - ఎందుకు కనీళ్ళు
పుండరీకపలాశాభ్యాం - తామరాకులనుంచి
విప్రకీర్ణ ఉదకం ఇవ స్రవతి - నీరు జారినట్లు జారుతున్నాయి

||శ్లోకార్థ తాత్పర్యములు||

"తామరాకులనుంచి నీరు జారినట్లు నీ నేత్రములనుంచి ఎందుకు కనీళ్ళు జారుతున్నాయి?||33.04||

||శ్లోకము 33.05||

సురాణాం అసురాణాం వా నాగగంధర్వ రక్షసామ్|
యక్షాణాం కిన్నరాణాం వా కా త్వం భవసి శోభనే||33.05||

స|| శోభనే సురాణాం వా అసురాణాం వా నాగ గంధర్వ రక్షసామ్ యక్షాణాం వా కిన్నరాణాం వా కా త్వం||

||శ్లోకార్థములు||

శోభనే - ఓ మంగళరూపిణీ
సురాణాం వా అసురాణాం వా - సురలలో గాని అసురలలోగాని
నాగ గంధర్వ రక్షసామ్ - నాగులు గంధర్వులు రాక్షసులలోగాని
యక్షాణాం వా కిన్నరాణాం వా- యక్షులలోగాని కిన్నరులలో గాని
కా త్వం - నీవు ఎవరివి?

||శ్లోకార్థ తాత్పర్యములు||

"ఓ మంగళరూపిణీ సురలలో గాని అసురలలోగాని నాగులు గంధర్వులు రాక్షసులు లేక కిన్నరులగాని వీరిలో నీవు ఎవరివి?" ||33.05||

||శ్లోకము 33.06||

కా త్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే|
వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసిమే||33.06||

స|| వరాననే రుద్రాణాం వా మరుతానాంవసూనాం వా కా త్వం| వరారోహే (త్వం) మే దేవతా ప్రతిభాసి |

||శ్లోకార్థములు||

రుద్రాణాం వా మరుతానాం - రుద్రగణములకు కాని మరుత్ గణములకు కాని
వసూనాం వా - వసువులకుగాని
కా త్వం - నీవు ఎవరివి
మే వరాననే వరారోహే - ఓ వరాననా అందమైన అవయవములు కలదానా
మే దేవతా ప్రతిభాసి - నాకు నీవు దేవతలవలే శోభిస్తున్నట్లు వున్నావు.

||శ్లోకార్థ తాత్పర్యములు||

"రుద్రగణములకు కాని మరుత్ గణములకు కాని వసువులకుగాని చెందిన దానవా ? ఓ వరాననా అందమైన అవయవములు కలదానా నీవు తప్పక దేవతలవలే శోభిస్తున్నావు." ||33.06||

||శ్లోకము 33.07||

కిన్ను చంద్రమసా హీనా పతితా విబుధాలయాత్|
రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠసర్వగుణాన్వితా||33.07||

స|| చంద్రమసా హీనా విబుధాలయాత్ పతితా జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠసర్వగుణాన్వితా రోహిణీ కిం ను?|| |

||శ్లోకార్థములు||

చంద్రమసా హీనా - చంద్రుని వదలి
విబుధాలయాత్ పతితా జ్యోతిషాం శ్రేష్ఠా - ఆకాశమునుంచి పడిన నక్షత్రములలో శ్రేష్ఠమైన
శ్రేష్ఠసర్వగుణాన్వితా రోహిణీ కిం ను? - శ్రేష్ఠమైన గుణములు కల రోహిణివా నువ్వు

||శ్లోకార్థ తాత్పర్యములు||

"చంద్రుని వదలి ఆకాశమునుంచి పడిన నక్షత్రములలో శ్రేష్ఠమైన, శ్రేష్ఠమైన గుణములు కల రోహిణివా నువ్వు?" ||33.07||

||శ్లోకము 33.08||

కా త్వం భవసి కల్యాణీ త్వ మనిందితలోచనే|
కోపాద్వా యది మోహాత్ భర్తారమసితేక్షణా||33.08||
వసిష్టం కోపయిత్వా త్వం నాసి కల్యాణ్యరుంధతీ|

స|| కల్యాణీ అనిందితలోచనే కా త్వం భవసి | అసితేక్షణా కోపాత్ వా మోహాత్ వా భర్తారం వశిష్ఠం కోపయిత్వా కల్యాణీ అరుంధతీ న అసి |

||శ్లోకార్థములు||

కల్యాణీ అనిందితలోచనే - ఓ కల్యాణీ దోషములేని నేత్రములు కలదానా
కా త్వం భవసి - ఎవరివి నీవు?
అసితేక్షణా - నల్లని కళ్ళు కలదానా
కోపాత్ వా మోహాత్ వా - కోపముతోకాని మోహముతో కాని
భర్తారం వశిష్ఠం కోపయిత్వా - భర్త అయిన వశిష్ఠుని కోపగించిన
కల్యాణీ అరుంధతీ న అసి - కల్యాణి అరుంధతివి కావు కదా?

||శ్లోకతాత్పర్యములు||

"ఓ కల్యాణీ దోషములేని నేత్రములు కలదానా ఎవరివి నీవు? కోపముతోకాని మోహముతో కాని భర్త అయిన వశిష్ఠుని కోపగించి వచ్చిన అరుంధతివా ?" ||33.08||

||శ్లోకము 33.09||

కోనుపుత్రః పితా భ్రాతా భర్తా వా తే సుమధ్యమా||33.09||
అస్మాల్లోకాదముం లోకం గతం త్వం అనుశోచసి|

స|| సుమధ్యమే తే పుత్రః పితా భ్రాతా భర్తా వా కో ను| అస్మాత్ లోకాత్ అముం లోకం గతా అనుశోచసి ||

||శ్లోకార్థములు||

సుమధ్యమే - ఓ సుమధ్యమా
తే పుత్రః పితా భ్రాతా భర్తా వా - నీ పుత్రులు, తండ్రి భర్త, సోదరులలో
కో ను అస్మాత్ లోకాత్ - ఎవరు ఈ లోకమునుంచి
అముం లోకం గతా అనుశోచసి - పరలోకమునకు పోవుటవలన నువ్వు దుఃఖములో ఉన్నావు.

||శ్లోకతాత్పర్యములు||

"ఓ సుమధ్యమా ! నీ పుత్రులు, తండ్రి భర్త, సోదరులు ఎవరు ఈ లోకమునుంచి పరలోకమునకు పోవుటవలన నువ్వు దుఃఖములో ఉన్నావు." ||33.09||

||శ్లోకము 33.10||

రోదనా దతినిశ్శ్వాసాత్ భూమిసంస్పర్శనా దపి||33.10||
న త్వాం దేవీ మహం మన్యే రాజ్ఞ స్సంజ్ఞావధారణాత్|

స|| రోదనాత్ అతినిఃశ్వాసాత్ భూమి సంస్పర్శనాత్ అపి రాజ్ఞః సంజ్ఞావధారణాత్ త్వాం దేవీం న సంజ్ఞే||

||శ్లోకార్థములు||

రోదనాత్ అతినిఃశ్వాసాత్ - రోదనములతో ఉఛ్వాస నిఃశ్వాసములతో
భూమి సంస్పర్శనాత్ అపి - భూమి మీద నిలబడడములో
రాజ్ఞః సంజ్ఞావధారణాత్ - రాజలక్షణములతో
త్వాం దేవీం న సంజ్ఞే - నీవు దేవతవు కావు అని అనుకుంటున్నాను.

||శ్లోకతాత్పర్యములు||

"నీ రోదనములో ని ఉఛ్వాస నిఃశ్వాసములతో భూమి మీద నిలబడడములో రాజలక్షణములతో నీవు దేవతవు కావు అని అనుకుంటున్నాను." ||33.10||

||శ్లోకము 33.11||

వ్యంజనాని చ తే యాని లక్షణాని చ లక్షయే||33.11||
మహిషీ భూమిపాలస్య రాజకన్యాసి మే మతా|

స|| తే యాని వ్యంజనాని లక్షణాని చ లక్షయే భూమిపాలస్య మహిషీ రాజకన్యాసి చ మే మతా||

||శ్లోకార్థములు||

తే యాని వ్యంజనాని లక్షణాని చ లక్షయే - నీ మీదయున్న లక్షణములతో
భూమిపాలస్య మహిషీ - రాజ మహిషివి
రాజకన్యాసి చ మే మతా - రాజ కన్యవు అని భావిసున్నాను

||శ్లోకతాత్పర్యములు||

"నీ మీదయున్న లక్షణములతో నువ్వు రాజ మహిషి అగు రాజ కన్యవు అని భావిసున్నాను." ||33.11||

||శ్లోకము 33.12||

రావణేన జనస్థానాత్ బలాదపహృతా యది||33.12||
సీతా త్వమసి భద్రం తే తన్మమాచక్ష్య పృచ్ఛతః|

స|| త్వం జనస్థానాత్ రావణేన బలాత్ అపహృతా సీతా అసి యది తత్ పృచ్ఛతః మమ ఆచక్ష్వ ||భద్రం తే||

||శ్లోకార్థములు||

త్వం జనస్థానాత్ - నీవు జనస్థానమునుండి
రావణేన బలాత్ - రావణుని చేత బలాత్కారముగా
అపహృతా సీతా అసి యది తత్ - అపహరింపబడిన సీత అయినచో
పృచ్ఛతః మమ ఆచక్ష్వ- అది నాకు చెప్పుము
భద్రం తే - నీకు శుభము అగుగాక

||శ్లోకతాత్పర్యములు||

"నీవు జనస్థానమునుండి రావణుని చేత బలాత్కారముగా అపహరింపబడిన సీత అయినచో అది నాకు చెప్పుము.నీకు శుభము అగుగాక." ||33.12||

||శ్లోకము 33.13||

యథా హి తవ వై దైన్యం రూపం చాప్యతిమానుషమ్||33.13||
తపసా చాన్వితో వేషః త్వం రామమహిషీ ధ్రువమ్|

స||తవ దైన్యం అతిమానుషం రూపం వ తపసా అన్వితః వేషః యథా త్వం ధ్రువం రామ మహిషీ||

||శ్లోకార్థములు||

తవ దైన్యం అతిమానుషం రూపం - నీ లోని దైన్యము, అతిమానుషరూపము
తపసా అన్వితః వేషః యథా - తపస్విని వేషము ఏ విధముగా నున్నదో
త్వం ధ్రువం రామ మహిషీ - నువ్వు తప్పక రామ మహిషి వే

||శ్లోకతాత్పర్యములు||

" నీ లోని దైన్యము, అతిమానుషరూపము, తపస్విని వేషము చూచి నువ్వు తప్పక రామ మహిషివే !" ||33.13||

ఇందులో హనుమంతుని వాక్చాతుర్యము గమనింపతగినది. త్రిజటా స్వప్నము విన్న, రావణ సీతమ్మల సంవాదము విన్న,
వేసుకున్న ఆభరణములతో ఈమె సీతయే అని నిర్ధారించుకున్న హనుమకి, తను సంబోధిస్తున్న స్త్రీ, రాముని పత్ని సీతమ్మయే అని తెలుసు.

కాని వెంటనే "నీవు సీతవా" అని అడగకుండా, ఆమె స్థితిని ముందుగా గౌరవపూరకముగా వర్ణిస్తూ,చివరికి రావణుడు ఎత్తుకు పోయిన రామ మహిషివా అని అడుగుతాడు. హనుమంతుని వాక్చాతుర్యముతో నమ్మకము కలిగిన సీత, అప్పుడు తన కథ అంతా వివరముగా చెప్పుతుంది.

||శ్లోకము 33.14||

సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షితా||33.14||
ఉవాచ వాక్యం వైదేహీ హనుమంతం ద్రుమాశ్రితమ్|

స|| సా వైదేహీ తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షితా ద్రుమాశ్రితం హనుమంతం వాక్యం ఉవాచ||

||శ్లోకార్థములు||

సా వైదేహీ తస్య వచనం శ్రుత్వా - ఆ వైదేహి అతని వచనములను విని
రామకీర్తన హర్షితా - రామకీర్తనతో హర్షితురాలై
ద్రుమాశ్రితం హనుమంతం - వృక్షమునాశ్రయించిన హనుమంతునితో
వాక్యం ఉవాచ - ఇట్లు పలికెను

||శ్లోకార్థ తాత్పర్యములు||

"ఆ వైదేహి అతని వచనములను విని రామకీర్తనతో హర్షితురాలై ఆ వృక్షమునాశ్రయించిన హనుమంతునితో ఇట్లు పలికెను." ||33.14||

||శ్లోకము 33.15||

పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః||33.15||
స్నుషా దశరథస్యాహం శత్రుసైన్యప్రతాపినః|

స||అహం పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః శత్రుసైన్య ప్రతాపినః దశరథస్య స్నుషా ||

||శ్లోకార్థములు||

అహం పృథివ్యాం - నేను భూమండలములో
రాజసింహానాం ముఖ్యస్య - రాజసింహులలో ముఖ్యులైన
విదితాత్మనః - ఆత్మను ఎరిగిన
శత్రుసైన్య ప్రతాపినః - శత్రు సైన్యములను రూపుమాపిన
దశరథస్య స్నుషా - దశరథుని కోడలిని

||శ్లోకతాత్పర్యములు||

"నేను భూమండలములో రాజసింహులలో ముఖ్యులైన , ఆత్మను ఎరిగిన, శత్రు సైన్యములను రూపుమాపిన, దశరథుని కోడలిని. "||33.15||.

||శ్లోకము 33.16||

దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః||33.16||
సీతేతి నామ నామ్నాఽహం భార్యా రామస్య ధీమతః|

స|| అహం మహాత్మనః వైదేహస్య జనకస్య దుహితా | ధీమతః రామస్య భార్యా సీత ఇతి నామ నామ్నా||

||శ్లోకార్థములు||

అహం మహాత్మనః వైదేహస్య - నేను మహాత్ముడైన విదేహమహరాజు అగు
జనకస్య దుహితా - జనకుని పుత్రికను
ధీమతః రామస్య భార్యా - ధీమంతుడైన రాముని భార్యను.
సీత ఇతి నామ నామ్నా- సీత అని పేరుగలదానిని.

||శ్లోకతాత్పర్యములు||

"నేను మహాత్ముడైన విదేహమహరాజు అగు జనకుని పుత్రికను. ధీమంతుడైన రాముని భార్యను. సీత అని పేరుగలదానిని." ||33.16||

ఇక్కడ సీత తనను గురించి తాను చెప్పుకోవడములో ఆ కాలరీతికి అనుసరిస్తూ ముందు తన మామ గారిపేరు చెప్పి,
వారి ప్రతిభను చాటి , అట్టివారి కోడలిని అని చెపుతుంది.
తరువాత తన వంశము యొక్క పేరుకూడా నిలబెడుతూ,
సాటిలేని తన తండ్రి పేరు చెప్పి, తను విదేహమహరాజు కూతురుని అని కూడా చెపుతుంది. పెద్దవారిని గురించి చెప్పి అప్పుడు తను "భార్యా రామస్య ధీమతః", అంటే ధీమంతుడైన రాముని భార్యను అని చెపుతుంది.

అలాగ చెప్పే రీతిలో అప్పటి సాంప్రదాయము కనిపిస్తుంది.

దశరథమహరాజు గారి గురించి చెప్పిన మాటలలో - అంటే 'తను శతృ సైన్యములను రూపు మాపిన దశరథుని కోడలిని' -
అన్నమాటలో, ఆయనే వుంటే నేను ఈ స్థితిలో వుండే దానిని కాదు అనే మాట స్ఫురిస్తుంది. అలా స్ఫురించినా ఆయన దివంగతులు. అది ఆయనపై గౌరవపూర్వకముగా చెప్పిన మాట. "భార్యా రామస్య ధీమతః" అని చెప్పిన మాటలో,
సీతమ్మకి తన భర్తపై కల దృఢ నమ్మకము కనిపిస్తుంది.

ఈ మాట , అంటే "భార్యా రామస్య ధీమతః" అనేమాట,ఇంతకు ముందు రాక్షస స్త్రీలకు సీతమ్మ చెప్పిన మాటతో ధ్వనిస్తుంది.
ఆ మాట " దీనో వా రాజ్య హీనోవా యోమే భర్తా స మే గురుః".
ఈ రెండు మాటలు ఒకదానికి ఒకటి అనుగుణము గా వుంటాయి.
ఈ రెండు మాటలూ కూడా సీత కు భర్తపై నున్న ధృఢ నమ్మకమును ప్రకటిస్తాయి.

ఇక్కడ అధ్యాత్మికముగా చూస్తే ఒక మాట చూడ తగినది అంటారు అప్పలాచార్యులు గారు.

ఎవరైనా తమను గురించి చెప్పుకుంటే శరీర సంబంధము కన్నా ఆత్మ సంబంధమును చెప్పుకొనవలెను. తండ్రి అయిన జనకుని "వైదేహస్య మహాత్మనః" అని వర్ణించినా , తన భర్త కు తండ్రి అయిన దశరథుడు గురుతుల్యుడు. గురువే ఆత్మ జ్ఞానము ప్రసాదించువాడు. అట్టి గురువు గురించి ముందు చెప్పాలి. తరువాత శరీరము నొసగిన తండ్రి గురించి చెప్పాలి. ఆ తరువాత ఆత్మ స్వరూపము గురించి చెప్పాలి.

సీత కూడా అదే సూత్రము పాటించింది. ముందు దశరథుని గురించి, తరువాత తండ్రి గురించి, ఆ తరువాత తన స్వరూపము గురించి - భార్యా రామస్య దీమతః" అంటూ చెపుతుంది.

తన గురించి చెప్పిన తరువాత - హనుమంతునిపై కలిగిన నమ్మకముతో, తన కథ కూడా పూర్తిగా చెప్పుతుంది.

||శ్లోకము 33.17||

సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే||33.17||
భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమృద్ధినీ|

స|| అహం తత్ర రాఘవస్య నివేసనే మానుషాన్ భోగాన్ భుంజానా సర్వకామసమృద్ధినీ ద్వాదశ సమాః||

||శ్లోకార్థములు||

అహం తత్ర రాఘవస్య నివేసనే -
నేను ఆ రాఘవుని నివాసములో
మానుషాన్ భోగాన్ భుంజానా -
మానుష భోగములను అనుభవిస్తూ
సర్వకామసమృద్ధినీ ద్వాదశ సమాః -
అన్ని సదుపాయములతో పన్నెండు సంవత్సరములు గడిపితిని

||శ్లోకతాత్పర్యములు||

"నేను ఆ రాఘవుని నివాసములో మానుష భోగములను అనుభవిస్తూ అన్ని సదుపాయములతో పన్నెండు సంవత్సరములు గడిపితిని." ||33.17||.

||శ్లోకము 33.18||

తత్ర త్రయోదశే వర్షే రాజ్యే నేక్ష్వాకునందనమ్||33.18||
అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే|

స|| తత్ర త్రయోదసే వర్షే సోపాధ్యాయః రాజా ఇక్ష్వాకుకులనందనం రాజ్యేన అభిషిక్తుం ప్రచక్రమే||

||శ్లోకార్థములు||

తత్ర త్రయోదసే వర్షే - అప్పుడు పదమూడవ సంవత్సరములో
సోపాధ్యాయః రాజా - రాజ గురువులతో కలిసి ఆ మహారాజు
ఇక్ష్వాకుకులనందనం - ఇక్ష్వాకు నందనుడగు రాముని
రాజ్యేన అభిషిక్తుం ప్రచక్రమే - రాముని పట్టాభిషేకమునకు నిర్ణయించెను

||శ్లోకతాత్పర్యములు||

"అప్పుడు పదమూడవ సంవత్సరములో రాజ గురువులతో కలిసి ఆ మహారాజు ఇక్ష్వాకు నందనుడగు రాముని పట్టాభిషేకమునకు నిర్ణయించెను."||33.18||

||శ్లోకము 33.19||

తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవస్యాభిషేచనే||33.19||
కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీత్|

స|| తస్మిన్ రాఘవస్య అభిషేచనే సంభ్రియమాణే కైకేయి నామ దేవీ భర్తారం వచనం అబ్రవీత్||

||శ్లోకార్థములు||

తస్మిన్ రాఘవస్య అభిషేచనే - ఆ రాఘవుని పట్టాభిషేకమునకు జరుగుతున్న
సంభ్రియమాణే - సంభ్రమములతో
కైకేయి నామ దేవీ - కైకేయి అనబడు దేవి
భర్తారం వచనం అబ్రవీత్ - భర్తతో ( దశరథునితో) ఇట్లు పలికెను.

||శ్లోకార్థ తాత్పర్యములు||

"ఆ రాఘవుని పట్టాభిషేకమునకు జరుగుతున్న సంభ్రమములతో కైకేయి అనబడు దేవి భర్తతో ( దశరథునితో) ఇట్లు పలికెను." ||33.19||

||శ్లోకము 33.20||

న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనమ్||33.20||
ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే|

స|| న పిబేయం ప్రత్యహం భోజనం న ఖాదేయం (యది) రామః అభిషిచ్యతే | ఏషః మే జివితం అంతః||

||శ్లోకార్థములు||

||శ్లోకతాత్పర్యములు||

" రాముని అభిషేకముతో నేను ఎమీ తాగను , ప్రతిరోజూ భోజనము చేయను. ఇది నా జీవితమునకు అంతము".||33.20||

||శ్లోకము 33.21||

యత్త దుక్తం త్వాయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమ||33.21||
తచ్ఛేన్న వితథం కార్యం వనం గచ్ఛతు రాఘవః|

స|| నృపసత్తమ త్వయా ప్రీత్యా యత్ తత్ వాక్యం ఉక్తామ్ తత్ వితథం న కార్యం యది రాఘవః వనమ్ గచ్ఛతు||

||శ్లోకార్థములు||

నృపసత్తమ త్వయా ప్రీత్యా - ఓ నృపసత్తమా నీవు ప్రేమతో
యత్ తత్ వాక్యం ఉక్తామ్ - ఏ మాటలు చెప్పితివో
తత్ వితథం న కార్యం యది - ఆవి వృధాకాకుండా వుండాలి అంటే
రాఘవః వనమ్ గచ్ఛతు - రాఘవుడు వనము నకు పోవును

||శ్లోకతాత్పర్యములు||

"ఓ నృపసత్తమా నీవు ప్రేమతో ఏ మాటలు చెప్పితివో ఆవి వృధాకాకుండా వుండాలి అంటే రాఘవుడు వనము నకు పోవును".||33.21||

||శ్లోకము 33.22||

స రాజా సత్యవాగ్దేవ్యా వరదానమనుస్మరన్||33.22||
ముమోహ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరమప్రియమ్|

స|| సత్యవాక్ స రాజా దేవ్యాః వరదానం అనుస్మరన్ కైకేయ్యాః అప్రియం వచనం శ్రుత్వా ముమోహ||

||శ్లోకార్థములు||

సత్యవాక్ స రాజా - సత్యవంతుడైనా ఆ రాజు
దేవ్యాః వరదానం అనుస్మరన్ - ఆ దేవికి ఇచ్చిన వరదానమును స్మరించి
కైకేయ్యాః అప్రియం వచనం శ్రుత్వా- కైకేయి యొక్క అప్రియమైన మాటలు విని
ముమోహ - మూర్ఛపోయెను

||శ్లోకతాత్పర్యములు||

"సత్యవంతుడైనా ఆ రాజు ఆ దేవికి ఇచ్చిన వరదానమును స్మరించి, కైకేయి యొక్క అప్రియమైన మాటలు విని మూర్ఛపోయెను." ||33.22||

||శ్లోకము 33.23||

తతస్థు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః||33.23||
జ్యేష్ఠం యశస్వినం పుత్త్రం రుదన్ రాజ్య మయాచత|

స|| తతః సత్యే ధర్మే వ్యవస్థితః స్థవీరః రాజా రుదన్ జ్యేష్ఠం పుత్రం రాజ్యం అయాచత||

||శ్లోకార్థములు||

తతః సత్యే ధర్మే వ్యవస్థితః - అప్పుడు సత్య ధర్మములో అనుష్ఠితుడైన
స్థవీరః రాజా రుదన్ - వృద్ధుడైన రాజు విలపించుచూ
జ్యేష్ఠం పుత్రం రాజ్యం అయాచత - జ్యేష్ఠపుత్రుని రాజ్యము గురించి కోరెను.

||శ్లోకతాత్పర్యములు||

"అప్పుడు సత్య ధర్మములో అనుష్ఠితుడైన వృద్ధుడైన ఆ రాజు విలపించుచూ జ్యేష్ఠపుత్రుని రాజ్యము గురించి కోరెను." ||33.23||

||శ్లోకము 33.24||

స పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్పరం ప్రియమ్||33.24||
మనసా పూర్వ మాసాద్య వాచా ప్రతిగృహీతవాన్|

స|| సః శ్రీమాన్ పితుః వచనం అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వం ఆసాద్య వాచా ప్రతిగృహీతవాన్ ||

||శ్లోకార్థములు||

సః శ్రీమాన్ పితుః వచనం - ఆ శ్రీమంతుడు పిత్రువచనములు
అభిషేకాత్ పరం ప్రియం - అభిషేకము కన్న ముఖ్యమని
మనసా పూర్వం ఆసాద్య - మనసా తలిచి
వాచా ప్రతిగృహీతవాన్ - వాక్కుతో అంగీకరించెను

||శ్లోకార్థ తాత్పర్యములు||

"ఆ శ్రీమంతుడు అభిషేకము కన్న పిత్రువచన పరిపాలన ముఖ్యమని మనసా తలిచి తన వాక్కుతో అంగీకరించెను." ||33.24||

సీతమ్మ చెప్పిన ఈ మాటలలో రాముని స్వభావము, ఆ రాముని స్వభావముపై సీత యొక్క అభిమానము కనిపిస్తాయి. ఆ స్వభావములో "పితృవాక్య పరిపాలన" ముఖ్యము. పట్టాభిషేకముకన్నా - పితృవాక్య పరిపాలనే ముఖ్యముగా భావించిన వాడు రాముడు.

ఇంకొక మాట. ఇక్కడ సత్య ధర్మములో అనుష్టితుడైన దశరథ మహారాజు, ఇచ్చిన మాటను కాదు అనని దశరథ మహారాజు, అలాగే " సత్య పరాక్రమః" అని వర్ణింపబడిన రాముడు గమనించ తగినివారు

||శ్లోకము 33.25||

దద్యాన్నప్రతిగృహ్ణీయాన్ నబ్రూయాత్ కించిదప్రియమ్||33.25||
అ పి జీవితహేతోర్వా రామః సత్యపరాక్రమః|

స||సత్యపరాక్రమః రామః దద్యాత్ నప్రతిగృహ్ణియాన్ జీవితహేతోర్వా కించిత్ అప్రియమ్ నబ్రూయాత్ ||

||శ్లోకార్థములు||

సత్యపరాక్రమః రామః దద్యాత్ -
సత్యమే పరాక్రమముగా గల ఆ రాముడు ఎప్పుడూ ఇచ్చెడి వాడు
న ప్రతిగృహ్ణియాన్ - మరల తీసుకొనువాడు కాదు
జీవితహేతోర్వా - ప్రాణసంకటములో కూడా
కించిత్ అప్రియమ్ నబ్రూయాత్ - అప్రియమైన మాటలు చెప్పువాడు కాడు

||శ్లోకతాత్పర్యములు||

"సత్యమే పరాక్రమముగా గల ఆ రాముడు ఎప్పుడూ ఇచ్చెడి వాడు మరల తీసుకొనువాడు కాదు. ప్రాణసంకటములో కూడా అప్రియమైన మాటలు చెప్పువాడు కాడు." ||33.25||

ఇక్కడ రాముని స్వభావము గురించి సీత చెప్పిన మాట వినతగినది.

రాముడు ఇంకొకరికి "దద్యాన్", ఇస్తాడే కాని , "నప్రతిగృహ్ణీయాత్" తను తీసుకోడు. "అప్రియం" అయిన మాట "న బ్రూయాత్" చెప్పడు. ఎప్పుడూ కూడా అప్రియము చెప్పడు. "అపి జీవిత హేతోః వా" - అంటే చచ్చినా అప్రియమైన మాట చెప్పడు. ఇవన్నీ రామునిపై గల అభిమానాన్ని ప్రకటిస్తాయి.

ఇక్కడ రాముడు "సత్య పరాక్రమః", అని చెప్పబడినవాడు.
సత్యపరాక్రమః అంటే
(1) సత్యమైన పరాక్రమము కలవాడు
(2) సత్యమే పరాక్రమముగా కలవాడు
(3) సత్యముచే పరలోకములను ఆక్రమించువాడు.
ఈ మూడు కూడా రామునికి తగిన వర్ణనలే

||శ్లోకము 33.26||

స విహా యోత్తరీయాణి మహార్హాణి మహాయశాః||33.26||
విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్|

స||మహాయశాః సః మహార్హాణి ఉత్తరీయాణి విహాయ మనసా రాజ్యం విశ్రుజ్య మామ్ జనన్యై సమాదిశత్||

||శ్లోకార్థములు||

మహాయశాః సః - మహాయశోవంతుడైన అతడు
మహార్హాణి ఉత్తరీయాణి విహాయ - మహత్తరమైన ఉత్తరీయములను వదిలి
మనసా రాజ్యం విశ్రుజ్య - మనసా రాజ్యము వదిలి
మామ్ జనన్యై సమాదిశత్ - నన్ను తన జననికి అప్పగించెను

||శ్లోకతాత్పర్యములు||

"మహాయశోవంతుడైన అతడు మహత్తరమైన ఉత్తరీయములను వదిలి మనసా రాజ్యము వదిలి నన్ను తన జననికి అప్పగించెను." ||33.26||

||శ్లోకము 33.27||

సాహం తస్యాగ్రతస్తూర్ణం ప్రస్థితా వనచారిణీ||33.27||
న హి మే తేన హీనయా వాసః స్వర్గేsపి రోచతే|

స|| అహం తస్య అగ్రతః వనచారినీ తూర్ణం ప్రస్థితా | తేన హీనాయాః మే స్వర్గోపి న రోచతే ||

||శ్లోకార్థములు||

అహం తస్య అగ్రతః - నేను ఆయనికి ముందే
వనచారినీ తూర్ణం ప్రస్థితా - వనచారిణి గా సిద్ధము అయితిని
తేన హీనాయాః - ఆయన లేకుండా
మే స్వర్గోపి న రోచతే - నాకు స్వర్గము కూడా ఇష్ఠము లేదు

అహం తస్య అగ్రతః - I was ahead of him
వనచారినీ తూర్ణం ప్రస్థితా - quickly started as a forest dweller
తేన హీనాయాః - without him
మే స్వర్గోపి న రోచతే - even heaven is not preferable

||శ్లోకతాత్పర్యములు||

"నేను ఆయనికి ముందే వనచారిణి గా సిద్ధము అయితిని. ఆయన లేకుండా నాకు స్వర్గము కూడా ఇష్ఠము లేదు." ||33.27||

||శ్లోకము 33.28||

ప్రాగేన తు మహాభాగః సౌమిత్రిః మిత్రనందనః||33.28||
పూర్వజ స్యానుయాత్రార్థే ద్రుమచీరై రలంకృతః|

స||మహాభాగః మిత్రనందనం సౌమిత్రి పూర్వజస్య అనుయాత్రార్థే ద్రుమచీరై రలంకృతః||

||శ్లోకార్థములు||

మహాభాగః మిత్రనందనం - మహాభాగుడు మిత్రనంద నుడు అగు
సౌమిత్రి పూర్వజస్య అనుయాత్రార్థే - సౌమిత్రి కూడా పూర్వజుని అనుసరించుటకు
ద్రుమచీరై రలంకృతః - నారచీరలతో అలంకరించుకొనెను.

||శ్లోకతాత్పర్యములు||

"మహాభాగుడు మిత్రనంద నుడు అగు సౌమిత్రి కూడా పూర్వజుని అనుసరించుటకు నారచీరలతో అలంకరించుకొనెను."||33.28||

||శ్లోకము 33.29||

తే వయం భర్తురాదేశం బహుమాన్య దృఢవ్రతాః||33.29||
ప్రవిష్టాః స్మ పురా దృష్టం వనం గంభీరదర్శనమ్|

స|| తే వయం భర్తుః ఆదేశం బహుమాన్య దృఢవ్రతాః పురా అదృష్టం గంభీరదర్శనం వనం ప్రవిష్టాః స్మ||

||శ్లోకార్థములు||

తే వయం భర్తుః ఆదేశం బహుమాన్య- మేము అందరము రాజ ఆదేశమును శిరసావహించి
దృఢవ్రతాః - ధృడమైన వ్రతముతో
పురా అదృష్టం గంభీరదర్శనం - ఎప్పుడూ చూడబడని గంభీరమైన
వనం ప్రవిష్టాః స్మ - వనమును ప్రవేశించితిమి

||శ్లోకతాత్పర్యములు||

మేము అందరము రాజ ఆదేశమును శిరసావహించి ధృడమైన వ్రతముతో ఎప్పుడూ చూడబడని గంభీరమైన అ వనమును ప్రవేశించితిమి. ||33.29||

||శ్లోకము 33.30||

వసతో దండకారణ్యే తస్యాహ మమితౌజసః||33.30||
రక్షసా పహృతా భార్యా రావణేన దురాత్మనా|

స|| అమితతేజసః తస్యాం భార్యా అహం దండకారణ్యే వసతః | దురాత్మనా రక్షసా రావణేన అపహృతా||

||శ్లోకార్థములు||

అమిత తేజసః తస్యాం భార్యా అహం -
అమితతేజస్సు కలవాడు ఆయన భార్యను అగు నేను
దండకారణ్యే వసతః - నేను దండకారణ్యములో నివశించుచుండగా
దురాత్మనా రక్షసా రావణేన అపహృతా-
దురాత్ముడైన రాక్షసుడు రావణుని చేత అపహరించబడితిని

||శ్లోకతాత్పర్యములు||

"అమితతేజస్సు కల ఆయన భార్యను అయిన నేను దండకారణ్యములో నివశించుచుండగా, దురాత్ముడైన రాక్షసుడు రావణుని చేత అపహరించబడితిని. ||33.30||

||శ్లోకము 33.31, 32||

ద్వౌమాసౌ తేన మే కాలో జీవితానుగ్రహః కృతః||33.31||
ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతస్తక్ష్యామి జీవితమ్||33.32||

స|| తేన ద్వౌమాసౌ కాలో జీవితానుగ్రహః కృతః| తతః ద్వాభ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం జివితం తక్ష్యామి||

||శ్లోకార్థములు||

ద్వౌమాసౌ కాలో - two months time
తేన జీవితానుగ్రహః కృతః - given by him to live
తతః ద్వాభ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం - after those two months
జివితం తక్ష్యామి - will be giving up my life.

||శ్లోకతాత్పర్యము||

"వానిచేత రెండు నెలల కాలము జీవితము గడువు పెట్టబడెను. ఆ రెండు నెలల తరువాత జీవితము త్యజించెదను." ||33.31,32||

సీత చివరి మాట:

" మేము అందరము రాజ ఆదేశమును శిరసావహించి ధృడమైన వ్రతముతో ఎప్పుడూ చూడబడని గంభీరమైన ఆ వనమును ప్రవేశించితిమి. అమితతేజస్సు కల ఆయన భార్యను అయిన నేను దండకారణ్యములో నివశించుచుండిని.
దురాత్ముడైన రాక్షసుడు రావణుని చేత అపహరించబడితిని.
వానిచేత రెండు నెలల కాలము జీవితము గడువు పెట్టబడెను.
ఆ రెండు నెలల తరువాత జీవితము త్యజించెదను".

ఆఖరిమాటలో, " తతః తక్ష్యామి జీవితం" , అంటే ఇంకారెండు నెలలు దాటితే జీవితమునే త్యజించెదను అని చెపుతూ,
సీతమ్మ తన స్థితిని ఒక్క మాటలో వెళ్ళడిస్తుంది.

ఆ మాటతో ముప్పది మూడవ సర్గ ముగుస్తుంది.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రయస్త్రింశస్సర్గః||

ఈవిధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది మూడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||