||సుందరకాండ ||

|| నలభయ్యవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 40 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చత్వారింశస్సర్గః

'చూడామణిని తీసుకున్న హనుమంతుడు మనసా రాముని చేరెను', అని ముప్పది ఎనిమిదవ సర్గలో వింటాము. హనుమంతుడు వెళ్ళడానికి సన్నద్ధుడవుతున్నా, సీత మనస్సులో చెప్పవలసిన మాటలు ఇంకామెదలుతున్నాయి. అందుకని ముప్పది తొమ్మిదవ సర్గ లో సీత మాటలు ఇంకా విన్నాము. హనుమంతుడు సీతమ్మ యొక్క అన్ని సందేహాలు తీర్చి, "తల్లీ రామచంద్రుడు నీకోసము పరితపిస్తున్నాడు. నా మాట వినగానే తప్పక బయలుదేరి నిన్ను విడిపిస్తాడు", అని చెప్పి సీతమ్మకి ఊరట కలిగిస్తాడు. అది ముప్పది తొమ్మిదవ సర్గలో విన్నాము.

ఇప్పుడు, నలభైయ్యవ సర్గ మళ్ళీసీత మాటలతో మొదలవుతుంది

||శ్లోకము 40.01||

శ్రుత్వాతు వచనం తస్య వాయుసూనోర్మహాత్మనః|
ఉవాచ్మహితం వాక్యం సీతా సురసుతోపమా||40.01||

స|| వాయుసూనుః మహత్మనః తస్య ఆత్మహితం వాక్యం శ్రుత్వా సీతా సురసుతోపమా ఉవాచ తు ||

||శ్లోకార్థములు||

వాయుసూనుః మహత్మనః -
మహాత్ముడైన వాయుపుత్రుడు
ఆత్మహితం తస్య వాక్యం శ్రుత్వా -
తన హితము కోసమై చెప్పిన అతని వచనములు విని
సురసుతోపమా సీతా -
సురకాంతలతో సమానమైన సీత
ఉవాచ తు - ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

" సురకాంతలతో సమానమైన సీత, మహాత్ముడైన వాయుపుత్రుడు తన హితము కోసమై చెప్పిన వచనములు విని, ఇట్లు పలికెను." ||40.01||

||శ్లోకము 40.02||

త్వాం దృష్ట్వాప్రియవక్తారం సంప్ర హృష్యామి వానర|
అర్థ సంజాతసస్యేవ వృష్టిం ప్రాప్య వసుంధరా||40.02||

స|| త్వాం ప్రియవక్తారం దృష్ట్వా అర్థసంజాత సస్యః వసుంధరా వృష్టిం ప్రాప్య ఇవ సంప్రహృష్యామి||

||శ్లోకార్థములు||

త్వాం ప్రియవక్తారం దృష్ట్వా -
ప్రియమైన మాటలు చెప్పగల నిన్ను చూచి
అర్థసంజాత సస్యః -
సగము మొలకెత్తిన విత్తనము
వృష్టిం ప్రాప్య వసుంధరా ఇవ -
వర్షము పొందినప్పుడు భూమి వలె
సంప్రహృష్యామి -
ఆనందించుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరా ప్రియమైన మాటలు చెప్పగల నిన్ను చూచినతరువాత సగము మొలకెత్తిన విత్తనము వర్షము పొందినప్పుడు భూమి వలె ఆనందించుచున్నాను." ||40.02||

సస్యము మనపూర్వీకుల జీవితముతో ఇమిడిపోయిన సత్యము. జీవన మరణాలు జీవన సత్యము అని చెప్పడానికి, సస్యములాగా జీవిస్తాడు సస్యములాగ మరణిస్తాడు అని చెపుతాడు నాచికేతుడు కథోపనిషత్తులో. ఇక్కడ సీతమ్మ సగము మొలకెత్తిన సస్యము తో తన స్థితికి ఉపమానము తీసుకువస్తుంది.

సగము మొలకెత్తిన సస్యము నీళ్ళు లేక ఎండిపోయే స్థితిలో వున్నప్పుడు, వర్షము పడినంతనే ఆ ఎండిపోబోతున్న విత్తనాలు పూర్తిగా మొలిచిన సస్యము వలె పునర్జీవనము పోందినట్లవుతాయి. అలాగే సీతమ్మ కూడా దైవసంపన్నమైన కష్టాలలో ప్రాణ సంకట స్థితి పొంది , హనుమత్ దర్శనముతో పునర్జీవనము పోందినట్లు ఆనందపడుతున్నాను అంటుంది. ఆ పునర్జీవనముతో మళ్ళీ ఆశలు కూడా పెరుగుతాయి.

సీతమ్మ తన పెరుగుతున్న ఆశలు గురించి చెపుతుంది

||శ్లోకము 40.03||

యథా తం పురుషవ్యాఘ్రం గాత్రైః శోకాభికర్శితైః|
సంస్పృశేయం సకామాహం తథా కురు దయాం మయి||3||

స|| స కామం అహం శోకకర్శిభితైః గాత్రైః తం పురుషవ్యాఘ్రం యథా సంస్పృశేయం తథా మయి దయామ్ కురు |

||శ్లోకార్థములు||

స కామం అహం -
విరహముతో వున్న నేను
శోకకర్శిభితైః గాత్రైః -
శోకముముతో కృశించిపోయిన గాత్రములతో
తం పురుషవ్యాఘ్రం యథా సంస్పృశేయం -
ఆ పురుషవ్యాఘ్రముని స్పర్శానందము ఎట్లు కలుగునో
తథా మయి దయామ్ కురు -
అట్లు నాపై దయచూపుము

||శ్లోకతాత్పర్యము||

"శోకముముతో కృశించిపోయిన నా గాత్రములు ఆ పురుషవ్యాఘ్రముని స్పర్శానందము పొందనట్లు నాపై దయ కలుగునట్లు చేయుము."

||శ్లోకము 40.04||

అభిజ్ఞానం చ రామస్య దద్యా హరిగణోత్తమ|
క్షిప్తామిషికాం కాకస్య కోపాత్ ఏకాక్షి శాతనీమ్||4||

స|| హరిగణోత్తమ కోపాత్ క్షిప్తం కాకస్య ఏకాక్షిశాతనీమ్ ఇషికాం రామస్య అభిజ్ఞానం దద్యా చ ||

||శ్లోకార్థములు||

హరిగణోత్తమ -
ఓ హరిగణోత్తమా
కోపాత్ క్షిప్తం ఇషికాం -
కోపముతో వదిలిన ఇషికముతో
కాకస్య ఏకాక్షిశాతనీమ్ -
వాయసముయొక్క కంటిని హరించిన
రామస్య అభిజ్ఞానం దద్యా చ -
రామునికి అభిజ్ఞానము వలె నిమ్ము

||శ్లోకతాత్పర్యము||

"ఓ హరిగణోత్తమా ! కోపముతో వదిలిన ఇషికముతో వాయసము యొక్క కంటిని హరించిన విషయము రామునికి అభిజ్ఞానమునుగా ఇవ్వుము."

||శ్లోకము 40.05||

మనశ్శిలాయాః తిలకో గండపార్శ్వే నివేశితః|
త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి||40.05||

స|| తిలకే ప్రణష్టే త్వయా మనశ్శిలయాః తిలకః గణ్డపార్శ్వే నివేశితః కిల తం స్మర్తుం అర్హసి||

||శ్లోకార్థములు||

తిలకే ప్రణష్టే -
తిలకము చెదిరిపోగా
త్వయా మనశ్శిలయాః -
నీ చేత మణిశిలతో
తిలకః గణ్డపార్శ్వే నివేశితః కిల -
తిలకము చెక్కిలిపై దిద్దబడిన విషయము
తం స్మర్తుం అర్హసి -
అది నీవు స్మరించ తగును

||శ్లోకతాత్పర్యము||

"తిలకము చెదిరిపోగా నీచేత మణిశిలతో తిలకము చెక్కిలిపై దిద్దబడిన విషయము అది నీవు స్మరించ తగును." ||40.05||

||శ్లోకము 40.06||

స వీర్యవాన్ కథం సీతాం హృతాం స మనుమన్యసే|
వసంతీం రక్షసాం మధ్యే మహేంద్ర వరుణోపమః||40.06||

స|| వీర్యవాన్ మహేంద్రవరుణోపమః సః హృతాం రాక్షసాం మధ్యే వసంతీం సీతాం కథం సమనుమన్యసే ||

||శ్లోకార్థములు||

వీర్యవాన్ మహేంద్రవరుణోపమః సః -
ఓ వీరుడా మహేంద్రుడు వరుణులతో సమానమైన అతడు
హృతాం రాక్షసాం మధ్యే వసంతీం -
అపహరింపబడి రాక్షసులమధ్యలో నున్న
సీతాం కథం సమనుమన్యసే -
సీతను ఏట్లు ఉపేక్షించుచున్నావు?

||శ్లోకతాత్పర్యము||

"ఓ వీరుడా మహేంద్రుడు వరుణులతో సమానమైన అతడు అపహరింపబడి రాక్షసులమధ్యలో నున్న సీతను ఏట్లు ఉపేక్షించుచున్నావు? " ||40.06||

||శ్లోకము 40.07||

ఏష చూడామణిర్దివ్యో మయా సు పరిరక్షితః|
ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వాం ఇవానఘ||40.07||

స|| అనఘ దివ్యః ఏషః చూడామణీః మయా సుపరిరక్షితః | వ్యసనేఏతం దృష్ట్వా త్వాం ఇవ ప్రహృష్యామి||

||శ్లోకార్థములు||

అనఘ దివ్యః ఏషః చూడామణిః -
ఓ అనఘ దివ్యమైన ఈ చూడామణి
మయా సుపరిరక్షితః -
నాచేత రక్షింపబడినది
వ్యసనే ఏతం దృష్ట్వా -
కష్టములలో దీనిని చూచి
త్వాం ఇవ ప్రహృష్యామి -
నిన్ను చూచినట్లే సంతోషపడుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

"ఓ అనఘ దివ్యమైన ఈ చూడామణి నాచేత రక్షింపబడినది. కష్టములలో దీనిని చూచి నిన్ను చూచినట్లే సంతోష పడుచున్నాను." ||40.07||

||శ్లోకము 40.08||

ఏష నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారిసంభవః|
అతః పరం న శక్ష్యామి జీవితుం శోకలాలసా||40.08||

స|| శ్రీమాన్ వారిసంభవః ఏషః నిర్యాతితః శోకలాలసా అతః పరం జీవితుం న శక్ష్యామి ||

||శ్లోకార్థములు||

శ్రీమాన్ వారిసంభవః -
ఓ శ్రీమాన్ ఈ జలనిధిలో పుట్టిన
ఏషః నిర్యాతితః -
దీనిని అనవాలుగా పంపిస్తున్నాను
శోకలాలసా అతః పరం -
శోకములోమునిగియున్న నేను ఇంక ముందు
జీవితుం న శక్ష్యామి -
జీవించడము కష్టము

||శ్లోకతాత్పర్యము||

"ఓ శ్రీమాన్ ఈ జలనిధిలో పుట్టిన దీనిని అనవాలుగా పంపిస్తున్నాను. ఇంక ముందు జీవించడము కష్టము." ||40.08||

||శ్లోకము 40.09||

అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్ఛిదః|
రాక్షసీనాం సుఘోరాణాం త్వత్కృతే మర్షయామ్యహమ్||40.09||

స|| అహం అసహ్యాని దుఃఖాని సుఘోరాణాం రాక్షసీనాం హృదయచ్ఛిదః వాచశ్చ త్వత్ కృతే అహం మర్షయామి||

||శ్లోకార్థములు||

అహం అసహ్యాని దుఃఖాని -
నేను అసహ్యమైన దుఃఖములను
సుఘోరాణాం రాక్షసీనాం హృదయచ్ఛిదః వాచశ్చ -
ఘోరమైన రాక్షసుల హృదయము ఛేధించు వచనములను
త్వత్ కృతే - నీరాక కొరకై
మర్షయామి - సహిస్తున్నాను

||శ్లోకతాత్పర్యము||

"నేను అసహ్యమైన దుఃఖములను, ఘోరమైన రాక్షసుల వచనములను నీరాక కొరకై సహిస్తున్నాను." ||40.09||

||శ్లోకము 40.10||

ధారయిష్యామి మాసం తు జీవితం శత్రు సూదన|
ఊర్ధ్వం మాసాన్ నజీవిష్యే త్వయా హీనా నృపాత్మజ||40.10||

స|| నృపాత్మజ శత్రుసూదన జీవితం మాసం ధారయిష్యామి | త్వయా హీనా మాసాన్ ఊర్ధ్వం న జీవిష్యే ||

||శ్లోకార్థములు||

నృపాత్మజ శత్రుసూదన -
ఓ నృపాత్మజ శత్రుసూదనా
జీవితం మాసం ధారయిష్యామి -
జీవితము ఒక మాసము ధరించెదను
త్వయా హీనా - నీవు లేకుండా
మాసాన్ ఊర్ధ్వం న జీవిష్యే -
మాసము గడినచిన పిమ్మట జీవించను

||శ్లోకతాత్పర్యము||

"ఓ నృపాత్మజ శత్రుసూదనా ఈ జీవితము ఒక మాసము ధరించెదను. నీవు లేకుండా మాసము గడినచిన పిమ్మట జీవించను."||40.10||

||శ్లోకము 40.11||

ఘోరోరాక్షసరాజోఽయం దృష్టిశ్చ న సుఖామయి|
త్వాం చ శ్రుత్వా విషద్యంతం న జీవేయమహం క్షణమ్||40.11||

స|| రాక్షసరాజః ఘోరః| మయి దృష్టిః సుఖా న |త్వం విషజ్జంతం శ్రుత్వా క్షణం న జీవేయం||

గోవిన్దరాజ టీకాలో - విషజ్జన్తం విలంబమానం

||శ్లోకార్థములు||

రాక్షసరాజః ఘోరః -
రాక్షసరాజు ఘోరమైన వాడు
మయి దృష్టిః సుఖా న -
నాపై అతని దృష్టి సుఖము కలిగించదు
త్వం విషజ్జన్తం శ్రుత్వా క్షణం న జీవేయం -
నీవు రాకలో జాప్యత విని ఒక క్షణము జీవించను.

||శ్లోకతాత్పర్యము||

"రాక్షసరాజు ఘోరమైన వాడు. నాపై అతని దృష్టి సుఖము కలిగించదు. నీవు రాకలో జాప్యత విని ఒక క్షణము జీవించను. " ||40.11||

||శ్లోకము 40.12||

'వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితమ్|
అథాబ్రవీన్ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః||40.12||

స|| మహాతేజా హనుమాన్ మారుతాత్మజః వైదేహ్యాః కరుణం సాశ్రుభాషితమ్ వచనం శ్రుత్వా అథ అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

మహాతేజా హనుమాన్ మారుతాత్మజః -
మహాతేజోవంతుడైన మారుతాత్మజుడగు ఆ హనుమంతుడు
వైదేహ్యాః కరుణం -
సీతయొక్క కరుణను గలిగించు
సాశ్రుభాషితమ్ వచనం శ్రుత్వా -
కన్నీటితో చెప్పిన వచనములను విని
అథ అబ్రవీత్ - అప్పుడు చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

"మహాతేజోవంతుడైన ఆ హనుమంతుడు ఆ సీతయొక్క కరుణను గలిగించు వచనములను విని అప్పుడు సమాధానము ఇచ్చెను." ||40.12||

||శ్లోకము 40.13||

త్వచ్ఛోకవిముఖో రామో దేవి సత్యేన తే శపే|
రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే||40.13||

స|| దేవి త్వత్ రామః శోకవిముఖః| సత్యేన తే శపే| రామే దుఃఖాభిభూతే లక్ష్మణః పరితప్యతే||

||శ్లోకార్థములు||

దేవి త్వత్ రామః శోకవిముఖః -
ఓ దేవీ నీశోకముతో విముఖుడై ఉన్నాడు
సత్యేన తే శపే -
నిజము చెప్పుచున్నాను
రామే దుఃఖాభిభూతే -
రాముడు దుఖములో ఉండుటవలన
లక్ష్మణః పరితప్యతే -
లక్ష్మణుడు పరితపిస్తున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవీ నీశోకముతో విముఖుడై ఉన్నాడు. నిజము చెప్పుచున్నాను. రాముడు దుఖములో ఉండుటవలన లక్ష్మణుడు పరితపిస్తున్నాడు." ||40.13||

||శ్లోకము 40.14||

కథంచిత్ భవతీ దృష్టా న కాలః పరిశోచితుమ్|
ఇమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని||40.14||

స||భామిని కథంచిత్ భవతీ దృష్టా | పరిశోచితుం కాలః న| ఇఅమం ముహూర్తం దూఖానాం అంతం ద్రక్ష్యసి ||

||శ్లోకార్థములు||

భామిని కథంచిత్ భవతీ దృష్టా -
ఓ భామిని అదృష్టము కొలదీ నీవు చూడబడినావు
పరిశోచితుం కాలః న -
పరితపించుటకు కాలము కాదు.
ఇమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి -
ఈ ముహూర్తమే నీ శోకముల అంతము కనిపించుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఓ భామిని అదృష్టము కొలదీ నీవు చూడబడినావు. ఇప్పుడు పరితపించుటకు కాలము కాదు. ఈ ముహూర్తమే నీ శోకముల అంతము కనిపించుచున్నది." ||40.14||

||శ్లోకము 40.15||

తావుభౌ పురుషవ్యాఘ్రౌ రాజపుత్త్రావరిందమౌ|
త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః||40.15||

స|| తౌ ఉభౌ రాజపుత్రాః అరిందమౌ పురుషవ్యాఘ్రౌ త్వత్ దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీ కరిష్యతః||

||శ్లోకార్థములు||

అరిందమౌ పురుషవ్యాఘ్రౌ -
ఆ పురుషవ్యాఘ్రములైన శత్రువులను మర్దించు
తౌ ఉభౌ రాజపుత్రాః -
ఆ రాజపుత్రులిద్దరూ
త్వత్ దర్శన కృతోత్సాహౌ -
నీ దర్శనమునకై గల ఉత్సాహముతో
లంకాం భస్మీ కరిష్యతః -
లంకానగరమును భస్మము చేసెదరు

||శ్లోకతాత్పర్యము||

"ఆ పురుషవ్యాఘ్రములైన శత్రువులను మర్దించు ఆ రాజపుత్రులిద్దరూ నీ దర్శనమునకై గల ఉత్సాహముతో లంకానగరమును భస్మము చేసెదరు. "||40.15||

||శ్లోకము 40.16||

హత్వాతు సమరే క్రూరం రావణం సహబాంధవమ్|
రాఘవౌ త్వా విశాలాక్షి స్వాం పురీం ప్రాపయిష్యతః||40.16||

స|| విశాలాక్షి క్రూరం సహ బాంధవం రావణం సమరే హత్వా రాఘవౌ త్వాం స్వాం పురీం ప్రతి ప్రాపయిష్యతః||

||శ్లోకార్థములు||

విశాలాక్షి - ఓ విశాలాక్షీ
సహ బాంధవం క్రూరం రావణం -
బంధువర్గముతో కలిపి క్రూరుడైన రావణుని
సమరే హత్వా -
సమరములో హతమార్చి
రాఘవౌ త్వాం స్వాం పురీం ప్రతి ప్రాపయిష్యతః -
నిన్ను రాఘవుడు తన నగరమునకు కొనిపోవును

||శ్లోకతాత్పర్యము||

" ఓ విశాలాక్షీ రావణుని బంధువర్గముతో కలిపి రావణుని సమరములో హతమార్చి నిన్ను రాఘవుడు తన నగరమునకు కొనిపోవును." ||40.16||

||శ్లోకము 40.17||

యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే|
ప్రీతిసంజననం తస్య భూయస్త్వం దాతుమర్హసి||40.17||

స|| అనిందితే రామః యత్ అభిజ్ఞానం విజానీయాత్ తస్య ప్రీతి సంజననమ్ భూయః త్వం దాతుం అర్హసి||

||శ్లోకార్థములు||

అనిందితే - దోషరహితురాలా
రామః యత్ అభిజ్ఞానం విజానీయాత్ -
ఏ అభిజ్ఞానమును రాముడు తెలిసికొనగలడో
తస్య ప్రీతి సంజననమ్-
అతనికి ప్రేతి కలిగించునో
భూయః త్వం - మళ్ళీ అది నీవు
దాతుం అర్హసి -ఇచ్చుట తగును

||శ్లోకతాత్పర్యము||

" దోషరహితురాలా ! రామునకు ప్రీతి కలిగించు మరి ఒక అభిజ్ఞానమును ఇమ్ము".||40.17||

||శ్లోకము 40.18||

సాఽబ్రవీ ద్దత్తమేవేతి మయాభిజ్ఞాన ముత్తమమ్|
ఏతదేవ హి రామస్య దృష్ట్వా మత్కేశభూషణమ్||40.18||
శ్రద్ధేయం హనుమాన్వాక్యం తవ వీర భవిష్యతి|

స|| మయా ఉత్తమం అభిజ్ఞానం దత్తమేవ ఇతి సా అబ్రవీత్ | వీర హనుమాన్ ఏతత్ మత్కేశభూషణం దృష్ట్వా తవ వాక్యం రామస్య శ్రద్ధేయం భవిష్యతి ||

||శ్లోకార్థములు||

మయా ఉత్తమం అభిజ్ఞానం -
నాచేత ఉత్తమమైన అభిజ్ఞానము
దత్తమేవ ఇతి సా అబ్రవీత్ -
ఇవ్వబడినది' అనిచెప్పెను
వీర హనుమాన్ - ఓ వీరుడా హనుమాన్
ఏతత్ మత్కేశభూషణం దృష్ట్వా-
నాచే ఇవ్వబడిన కేశ భూషణము చూచిన వెంటనే
తవ వాక్యం రామస్య శ్రద్ధేయం భవిష్యతి -
నీ మాటలు రాముడు శ్రద్ధగా వినును

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆమె, 'నా చేత ఉత్తమమైన అభిజ్ఞానము ఇవ్వబడినది' అనిచెప్పెను. 'ఓ వీరుడా నాచే ఇవ్వబడిన కేశ భూషణము చూచిన వెంటనే నీ మాటలు రాముడు శ్రద్ధగా వినును" ||40.18||

||శ్లోకము 40.19||

స తం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవగసత్తమః||40.19||
ప్రణమ్య శిరసా దేవీం గమనాయోపచక్రమే|

స|| శ్రీమాన్ సః ప్లవగసత్తమః మణివరం గృహ్య దేవీం శిరసా ప్రణమ్య గమనాయ ఉపచక్రమే||

||శ్లోకార్థములు||

శ్రీమాన్ సః ప్లవగసత్తమః -
ఆ ప్లవగసత్తముడు
మణివరం గృహ్య -
మణివరము ను స్వీకరించి
దేవీం శిరసా ప్రణమ్య -
దేవికి శిరసా అభివాదము చేసి
గమనాయ ఉపచక్రమే -
వెళ్ళుటకు తయారు అయ్యెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ ప్లవగసత్తముడు మణివరము ను స్వీకరించి దేవికి శిరసా అభివాదము చేసి వెళ్ళుటకు తయారు అయ్యెను." ||40.19||

||శ్లోకము 40.20,21||

తముత్పాత కృతోత్సాహమ్ అవేక్ష్య హరిపుంగవమ్||40.20||
వర్థమానం మహావేగం ఉవాచ జనకాత్మజా|
అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పగద్గదయా గిరా||40.21||

స|| జనకాత్మజా ఉత్పాతకృతోత్సాహం వర్ధమానం మహావేగం తం హరిపుంగవం ఆవేక్ష్య అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పగద్గదయా గిరా ఉవాచ||

||శ్లోకార్థములు||

జనకాత్మజా - జనకాత్మజ
ఉత్పాతకృతోత్సాహం వర్ధమానం -
వెళ్ళుటకు ఉత్సాహముతో పెరిగిన
మహావేగం - మహావేగము కల
తం హరిపుంగవం ఆవేక్ష్య -
ఆ హరిపుంగవుని చూచి
అశ్రుపూర్ణముఖీ దీనా -
కన్నీళ్లతో నిండిన ముఖముతో
భాష్పగద్గదయా గిరా ఉవాచ -
గద్గద స్వరముతో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు జనకాత్మజ వెళ్ళుటకు ఉత్సాహముతో పెరిగిన , మహావేగము కల ఆ హరిపుంగవుని చూచి కన్నీళ్లతో నిండిన ముఖముతో, గద్గద స్వరముతో ఇట్లు పలికెను." ||40.20,21||

||శ్లోకము 40.22||

హనుమాన్ సింహ సంకాశౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ|
సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయా హ్యనామయమ్||40.22||

స|| హనుమాన్ భ్రాతరౌ సింహసంకాశౌ రామలక్ష్మణౌ సహామాత్యం సుగ్రీవం చ సర్వాన్ అనామయం బ్రూయాః||

||శ్లోకార్థములు||

హనుమాన్ భ్రాతరౌ సింహసంకాశౌ రామలక్ష్మణౌ-
ఓ హనుమా సింహములవంటి సోదరులు రామలక్ష్మణులను
సహామాత్యం సుగ్రీవం చ -
అమాత్యులతో కూడిన సుగ్రీవుని
సర్వాన్ అనామయం బ్రూయాః -
తక్కిన అందరినీ క్షేమము అడుగుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ హనుమా సింహములవంటి సోదరులు , అమాత్యులతో కూడిన సుగ్రీవుని , తక్కిన అందరినీ క్షేమము అడుగుము. ||40.22||

||శ్లోకము 40.23||

యథా చ మహాబాహుః మాం తారయతి రాఘవః|
అస్మాద్దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతు మర్హసి||40.23||

స|| మహాబలః సః రాఘవః అస్మాత్ దుఃఖాంబుసంరోధాత్ (మాం) యథా తారయతి త్వం సమాధాతుం అర్హసి||

||శ్లోకార్థములు||

మహాబలః సః రాఘవః -
మహాబలుడు అయిన ఆ రాఘవుడు
అస్మాత్ దుఃఖాంబుసంరోధాత్ -
ఈ దుఃఖసాగరమునుంచి
(మాం) యథా తారయతి -
నన్ను ఎట్లు రక్షించునో
త్వం సమాధాతుం అర్హసి -
అది నీవు చూడుము.

||శ్లోకతాత్పర్యము||

"మహాబలుడు అయిన ఆ రాఘవుడు నన్ను ఎట్లు ఈ దుఃఖసాగరమునుంచి రక్షించునో అది నీవు చూడుము." ||40.23||

||శ్లోకము 40.24||

ఇమం చ తీవ్రం మమ శోకవేగం
రక్షోభి రేభిః పరిభర్త్సనం చ|
బ్రూయాస్తు రామస్య గతస్సమీపం
శివశ్చ తేఽధ్వాస్తు సహరిప్రవీర||40.24||

స|| హరిప్రవీర రామస్య సమీపం గతః మమ్ ఇమం తీవ్రం శోకవేగం ఏభిః రక్షోభిః పరిభర్త్స్యనం బ్రూయాః | తే అధ్వా శివః అస్తు ||

||శ్లోకార్థములు||

హరిప్రవీర రామస్య సమీపం గతః బ్రూయాః -
హరిప్రవీర రాముని వద్దకు పోయి
మమ్ ఇమం తీవ్రం శోకవేగం -
నా తీవ్రమైన శోకమును
ఏభిః రక్షోభిః పరిభర్త్స్యనం బ్రూయాః -
రాక్షసుల బెదిరింపులు చెప్పుము
తే అధ్వా శివః అస్తు -
నీ ప్రయాణము శుభప్రదము అగుగాక

||శ్లోకతాత్పర్యము||

"హరిప్రవీర రాముని వద్దకు పోయి నా తీవ్రమైన శోకమును రాక్షసుల బెదిరింపులు చెప్పుము. నీ ప్రయాణము శుభప్రదము అగుగాక." ||40.24||

||శ్లోకము 40.25||

స రాజపుత్త్ర్యా ప్రతివేదితార్థః
కపిః కృతార్థః పరిహృష్టచేతాః|
అల్పావశేషం ప్రసమీక్ష్య కార్యం
దిశం హ్యుదీచీం మనసా జగామ||40.25||

స|| స కపిః రాజపుత్ర్యా ప్రతివేదితార్థః కృతార్థః పరిహృష్టచేతసః కార్యం అల్పావశేషం ప్రసమీక్ష్య ఉదీచీం దిశం మనసా జగామ||

గోవిన్దరాజ టీకాలో - అల్పావశేషం అలపావశిష్టమ్ ప్రసమీక్ష్య విచార్య।

రామటీకాలో - హనుమాన్ కార్యం అల్పశేషం కించిత్ అవశిష్టం ప్రసమీక్ష్య విచార్య ఉదిచీం దిశం మనసా జగామ।

||శ్లోకార్థములు||

స కపిః రాజపుత్ర్యా ప్రతివేదితార్థః-
ఆ వానరుడు రాజపుత్రికయొక్క సందేశము తీసుకొని
కృతార్థః పరిహృష్టచేతసః -
కృతార్థుడై సంతోషము కలమనస్సు కలవాడై
కార్యం అల్పావశేషం ప్రసమీక్ష్య -
మిగిలిన కార్యము గురించి ఆలోచించుచూ
ఉదీచీం దిశం మనసా జగామ -
తాను ఉత్తరదిక్కు చేరినట్లే భావించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరుడు రాజపుత్రికయొక్క సందేశము తీసుకొని కృతార్థుడై సంతోషము కలమనస్సు కలవాడై మిగిలిన కార్యము గురించి ఆలోచించుచూ తాను ఉత్తరదిక్కు చేరినట్లే భావించెను."||40.25||

అల్పశేషం అనడములో , సీతాదర్శనమే మహత్తర విషయము అని, మిగిలినవి అల్పమే అని అర్థము.

అప్పుడు ఆ వానరుడు రాజపుత్రికయొక్క సందేశము తీసుకొని కృతార్థుడై, మహత్తరమైన సీతాదర్శనము సాధించి, మిగిలిన "అల్ప" కార్యము గురించి ఆలోచించుచూ తాను ఉత్తరదిక్కు చేరినట్లే భావించెను.

ఈ విధముగా నలభయ్యవ సర్గ సమాప్తము.

ఇప్పుడు ఒక్కమాటు ఇప్పటిదాకా జరిగినది అవలోకనం చేద్దాము.

మొదటి సర్గలో 'తతోరావణ నీతాయాః సీతాయాః శతృకర్శనః' అని చదివినప్పుడు,'రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇతి రావణః' అంటే, రావణుడు అంటే ఎవరో కాదోయ్ , మన చేత అసత్ ప్రలాపములు పలికించి చేయించే మనస్సేనోయ్ అని, సీతాయాః పదం అన్వేష్టుం అంటే నాగటి చాలులో దొరికినదాని అన్వేషణలో వెళ్ళడానికి అని, అంటే కర్మక్షేత్రములో బుద్ధిచే తవ్వగా దొరకబడు ఆత్మను అన్వేషించడానికి అని విన్నాము. వెతకడానికి వెళ్ళింది ఎవరు ? శతృకర్శనుడు, అంటే ఆచార్యుడు ( హనుమ) బయలుదేరాడు అని విన్నాము.

అంటే ఆ ఆచార్యుడు జీవాత్మ పరమాత్మ కలయిక కోసము ఆత్మాన్వేషణలో బయలుదేరాడన్నమాట.

ముముక్షువు అంటే మోక్షముపై కోరిక గల జీవుడు. అలాంటి ముముక్షువు మోక్షమార్గములో పోవడానికి ఆచార్య సన్నిధిలో చేరాలి. ఆచార్య సన్నిధిలో చేరిన ముముక్షువును ఆచార్యుడు వెంటనే శిష్యుడుగా స్వీకరించడు. ముముక్షువు ఆచార్యుని సన్నిధిలో ఇతర వ్యామోహములను వదిలి, భగవంతుడే రక్ష అని భగవంతునిపై వ్యామోహము కలవాడై ఉన్నప్పుడు, ఆచార్యుడు ముముక్షువుని శిష్యుడుగా స్వీకరించును. స్వీకరించి మంత్రము ఉపదేశించును. భగవత్ప్రాప్తికై మార్గము చూపించును. భగవదనుగ్రహము లేకుండా భగవత్ప్రాపి జరగదు. అందుకని భగవదనుగ్రహము పొందిన ఆచార్యుడే భగవత్ప్రాప్తికి మార్గము చూపించును.

దీనిలో ఆచార్యుడు చేయు కార్యము ఇంకా కొంచెము వివరముగా చూద్దాము.

ఇక్కడ ఆచార్యుడు భగదనుగ్రహము పొంది, వాని ఆజ్ఞచే సంసారమున ప్రవేశించి, భగవత్ప్రాప్తికై తపించుచూ, బంధములో నున్న జీవుని అన్వేషించి ,ఆ జీవుని పరీక్షించి, భగవత్కథా ప్రసంగములచే ఆనందమును కలిగించి, భగవంతునిపై కోరిక కలిగించి, తన స్వరూపమును జీవునకు దర్శింపచేసి, భగత్ప్రాపికై మంత్రమును ఒసంగి, ధైర్యమును కలిగించి, భగవత్ప్రాప్తికి అడ్దంకులను తొలగించి, మరల భగవానునికి జీవుని భగవ్త్ప్రాప్తికై గల వ్యామోహమును విన్నవించి, జీవుని రక్షింపచేయును .ఇదే ఆచార్యుడు చేయు కార్యక్రమము.

ఈ విధానము మనసులో ఉంచుకొని, మొదటి సర్గలో మొదటి శ్లోకములో చదివిన ఆచార్యుని అన్వేషణ ఎలా జరిగిందో చూద్దాము.

ఇక్కడ హనుమంతుడు ఆచార్య స్వరూపములో ఉన్నాడు. హనుమంతుడు భగవదనుగ్రహముతో అంటే రామానుగ్రహముతో ఆనవాలుగా అంగుళీయకము తీసుకొని, రాముని ఆజ్ఞతో, అంటే భగవంతుని ఆజ్ఞతో సీతాన్వేషణకి బయలుదేరుతాడు. అశోకవనములో రాముని వియోగముతో శోకములో వున్న సీతను చూస్తాడు. సీతను శింశుపా వృక్షముపై వుండి పరిశీలిస్తాడు. సీతలో అనన్యసాధ్యత్వము అంటే రాముడే తన రక్షకుడు అనే నమ్మకము, నిరాహారముతో దైన్యముతో రామును కోసము తపించడము, రాముని పొందనిచో ప్రాణత్యాగమునకు సిద్ధపడడము, రాముని పై ఆదరాభిమానముల తో తనలోనే ఎదో తప్పులున్నాయి అని అనుకోడము చూస్తాడు. ఇది అంతా హనుమ ఆచార్యుడు శిష్యుని పరీక్షించినట్లు, సీతమ్మని చూస్తాడు.

గురువు శిష్యునిలో భగవత్కథా ప్రసంగములతో ఆనందము కలిగించినట్లు, హనుమ రామకథా గానముతో సీతలో ఆనందము కలిగిస్తాడు.రాముని దివ్యమంగళ స్వరూపమును ఆత్మ గుణములను వర్ణించి, గురువు శిష్యునిలో విశ్వాసము కలిగించినట్లు, సీతలో హనుమ నమ్మకము కలిగిస్తాడు. అలా నమ్మకము కలిగించిన శిష్యునకు జ్ఞానోపదేశానికి గురువు మంత్రము చెప్పినట్లు సీతకు నమ్మకము కలిగించి కరవిభూషణమైన రామనామాంకిత అంగుళీయకము సమర్పిస్తాడు. ఆ అంగుళీయకమే మంత్రము. ఆ అంగుళీయకమును కరవిభూషణము అంటాడు కవి

కరము పనిచేయుటకు సాయపడునది. భగవంతుడి కర విభూషణములో కరము అంటే వినపడే ధ్వని జగద్రక్షణ. భగవంతుడే రక్షకుడు అనే ఆర్తి, ఆ భగవంతునిపై భారమునుంచుట , ఆ మంత్రముద్వారా లభించును. ఆ మంత్రము మననము చేయుచున్నచో మానసికముగా భగవంతుడే కనపడినట్లే అగును. అంగుళీయకము తీసుకున్న సీతకి రాముడే ప్రత్యక్షముగా వున్నాడా అని అనిపించిందిట.

అంగుళీయకముతో విశ్వాసమేర్పడిన సీత, హనుమ అడుగగా తన చూడామణి అంటే కేశభూషణమును రామునకు గుర్తుగా ఇస్తుంది. దీని అర్థము అప్పలా చార్యులు గారు ఇలా చెపుతారు.

భగవంతుడే రక్షకుడు అనే నమ్మకము కలిగించు మంత్రము అచార్యుడి ద్వారా ముముక్షువు కు లభిస్తుంది. ఆ మంత్రము లభించిన ముముక్షువుకు మంత్రమననము ద్వారా, విషయవస్తువులపై వ్యామోహము పోయి , భగవంతునిపై వ్యామోహము కలగాలి. అదే గురువుద్వారా భగవంతునికి తెలియజేయవలసినది. ఆ భగవంతునిపై వ్యామోహము తెలియజేయడానికే తన చూడామణి అంటే కేశభూషణము ఇస్తుంది సీత. స్త్రీ యొక్క కేశపాశములే పురుషునకు వ్యామోహము కలిగించును. ఇతర విషయములపై వ్యామోహము లేదని సూచించడానికే కేశములు తీసివేయుట ఆచారమైనది.

భగవత్ సన్నిధిని కేశములు సమర్పించుట ఇతర విషయములపై వ్యామోహము విడుచుటయే. విషయములపై వ్యామోహము ఆత్మను బంధనములలో ఉంచును. భగవంతునిపై వ్యామోహము ఆత్మకే అందము. కేశభూషణము ద్వారా సీతమ్మ పంపిన సందేశము. తనకు గల భగవంతునిపై వ్యామోహమే.

సీతమ్మ కాకాసుర వృత్తాంతము కూడా అభిజ్ఞానము గా చెప్పినది. కాకాసుర వృత్తాంతము ద్వారా తను కూడా శరణాగతి కోరినదానను అనీ, శరణాగత రక్షణము కాకాసురును యందు ప్రదర్శించిన స్వామి , తనను ఉపేక్షించ తగదు అని నివేదించెను. రాముడు మనశ్శిలతో బొట్టు సరిదిద్దిన వృత్తాంతము చెప్పి, భగవత్ అనురాగము, భక్తి భగవత్ దత్తమే కాని, తన యత్నముచే లభించినది కాదు అని సూచించినట్లు ధ్వనిస్తుంది.

ఈ విషయాలన్నిటితో కలిపి, మోక్షము కోరు జీవుడు అంటే ముముక్షువు ప్రవర్తింపవలసిన విధానము సూచింపబడినది ఇందులో గురువు శిష్యుని పరీక్షించు విధానముకూడా సూచింప బడినది.

అలాగే గురువు పై నమ్మకము కుదిరే వఱకు, శిష్యుడుకూడా గురువును వరింపడు. గురువు యొక్క జ్ఞానవైభవమును వారి ఆచరణచే తాను గుర్తించి , అప్పుడు గురువు గా వరించును , వరింపవలెను కూడా.

ఇక్కడ సీత కూడా ముందు సీత రావణుడా అని అనుమానించెను. హనుమ దివ్యమంగళ విగ్రహమును గుణములను కీర్తించి సీతమ్మ కు నమ్మకము కలిగించును. ఆ పైన రామనామాంకిత అంగుళీయకముతో తన స్వస్వరూపము దర్శింపజేయును. ఇట్లు ఆచార్యస్వరూపము నెఱింగి శిష్యుడు వరింపవలెను అని సీత ఆచరణ మనకు సూచిస్తుంది.

ఆచార్యుడికి ఎంత జ్ఞానమున్ననూ అహంకారము ఉండరాదు. అహంకారమున్నచో ఎంత జ్ఞానమున్ననూ ఆ జ్ఞానము, విషము కలిసిన ద్రాక్షరసము వలె అనుపయుక్తము అగును. అందుచే ఆచార్యుడు అహంకార రహితుడై వుండవలెను.

హనుమ తన అహంకార రహిత్వము రెండు చోట్ల చూపిస్తాడు. మొదట సీతను రామునితో ఐక్యము చేయుటకు ఆ క్షణమే తనే సీతను తీసుకొని వెళ్ళగలనని ప్రతిపాదించినప్పుడు, సీత నవ్వి ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ ప్రతిపాదన నీ కపిత్వము సూచిస్తోంది అని అన్నప్పుడు. సీత అలా అన్నప్పుడు హనుమ కించపడలేదు. తనపై నమ్మకము లేదని గ్రహించిన హనుమ తన స్వస్వరూపమును సీతకి చూపిస్తాడు. సీతమ్మకి నమ్మకము కలిగిస్తాడు.

ఆ తరువాత రెండోసారి సీత తన సహచరుల సామర్థ్యము అనుమానిస్తూ అడిగిన ప్రశ్నకి, "మా వానరసైన్యములో అందరూ నా కన్న గొప్పవారే కాని, నా కన్నతక్కువవారు లేరు" అని అంటాడు. ఇది కూడా హనుమయొక్క నిరహంకారము సూచిస్తుంది.

ఇలాగ సీతా హనుమంతుల సంభాషణ లో శిష్యాచార్య సంబంధము ఎలా వుండాలో స్పష్టముగా కనిపిస్తుంది మనకి .రామదూతగా హనుమ చేసిన మహాద్భుతమైన వృత్తాంతము సుందరకాండలో వింటాము. హనుమ సీతారాముల భక్తుడుగా మనకి దర్శనమిస్తాడు.

అలాగే సీతా దేవి భగవంతునికి దూరమై, బంధములలో ఇరుక్కుని, భగవత్ప్రాపికై తపించు ముముక్షువగు జీవుడు ఎలా ప్రవర్తించాలో మనకి చూపిస్తుంది. పతివ్రతయైన స్త్రీ భర్తకు దూరముగా వున్నప్పుడు ఎలా ప్రవర్తించవలెనో, ఆ కాలపు పాతివ్రత్య మహిమ ఎలా వుండేదో సుందరకాండలో సీత మనకి చూపిస్తుంది .

సుందరకాండలో జీవితముకు ఆవశ్యకమగు విషయములను ఇలా బాహ్య అంతరార్థములతో మనము చూస్తాము.ఇది ఇప్పటిదాకా జరిగిన కథ.

ఇంతవఱకు సీతాన్వేషణ దర్శనము అయ్యాయి. ఇక మిగిలినది విరోధి నిరసనము. అదే ముందు జరగబోయేది.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చత్వారింశస్సర్గః ||

||ఓమ్ తత్ సత్||