||సుందరకాండ ||

||నలభైరెండవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 42 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ద్విచత్వారింశస్సర్గః
"హనుమంతుని జయ ఘోష"

నలభై ఒకటవ సర్గలో ముందుకార్యక్రమముపై ఆలోచించి, అప్పటి దాకా జాగరూకతతో ఎవరికీ కనపడకుండా తిరిగిన హనుమ, రావణునితో కలవాడానికి, అశోకవనము ధ్వంశము చేయుటకు నిశ్చయించుకొని చెట్లను పడగొట్టసాగెను అని విన్నాము. అంటే కథలో అన్వేషణ కార్యక్రమము పూర్తి అయి, తరువాత కార్యక్రమము మొదలవుతుంది అన్నమాట.

ఈ సర్గలో ఆ తరువాత కథ వింటాము. దాని లోనే భాగముగా - "జయత్యతి బలోరామో" అంటూ హనుమ చెప్పే జయమంత్రము వింటాము

ఇక నలభై రెండవ సర్గ శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.

||శ్లోకము 42.01||

తతః పక్షి నినాదేన వృక్షభంగస్వనేన చ|
బభూవు స్త్రాససంభ్రాంతాః సర్వే లంకానివాసినః||42.01||

స|| తతః సర్వే లంకావాసినః పక్షి నినాదేణ వృక్షభంగస్వనేన చ త్రాస సంభ్రాంతాః బభూవుః||

రామ టీకాలో- పక్షినినాదాదినా సర్వే లంకా నివాసినః త్రాసేన భయేన సంభ్రాన్తాః ఉద్విగ్నచిత్తాః భభూవుః॥

|| శ్లోకార్థములు||

తతః సర్వే లంకావాసినః -
అప్పుడు లంకావాసులు అందరూ
పక్షి నినాదేణ -
పక్షుల నినాదములతోనూ
వృక్షభంగస్వనేన చ -
చెట్లు పడగొట్టబడుతున్న ధ్వనులతోనూ
త్రాస సంభ్రాంతాః బభూవుః -
భయపడిన మనస్సులు కలవారు అయ్యారు

||శ్లోక తాత్పర్యము||

"అప్పుడు లంకావాసులు అందరూ పక్షుల నినాదములతోనూ చెట్లు పడగొట్టబడుతున్న ధ్వనులతోనూ భయపడి భ్రాంతులు అయ్యారు." ||42.01||

||శ్లోకము 42.02||

విద్రుతాశ్చ భయత్రస్తా వినేదుర్మృగపక్షిణః|
రక్షసాం చ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే||42.02||

స|| మృగపక్షిణః విద్రుతాః భయత్రాసాః వినేదుః | రక్షసాం చ క్రూరాణి నిమిత్తాని ప్రతిపేదిరే||

|| శ్లోకార్థములు||

మృగపక్షిణః విద్రుతాః -
మృగములు పక్షులు చెల్లా చెదురై
భయత్రాసాః వినేదుః -
భయముతో శబ్దము చేసినవి
రక్షసాం చ - రాక్షసులు కూడా
క్రూరాణి నిమిత్తాని ప్రతిపేదిరే -
క్రూరమైన శకునములు చూసిరి.

||శ్లోక తాత్పర్యము||

"మృగములు పక్షులు చెల్లా చెదురై భయముతో శబ్దము చేసినవి. రాక్షసులు క్రూరమైన శకునములు చూసిరి." ||42.02||

||శ్లోకము 42.03||

తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననః|
తద్వనం దదృశుర్భగ్నం తం చ వీరం మహాకపిమ్||42.03||

స|| తతః వికృతాననః రక్షస్యః నిద్రాయాం గతాయాం తత్ భగ్నం వనం వీరం మహాకపిం చ దద్రుశుః ||

|| శ్లోకార్థములు||

తతః వికృతాననః రక్షస్యః -
అప్పుడు వికృతమైన ముఖములు కల రాక్షసులు
నిద్రాయాం గతాయాం -
నిద్రనుంచి మేలుకొని
తత్ భగ్నం వనం -
ఆ భగ్నమైన వనమును
వీరం మహాకపిం చ దద్రుశుః-
వీరుడగు మహాకపిని చూచిరి

||శ్లోక తాత్పర్యము||

"వికృతమైన ముఖములు కల రాక్షసులు నిద్రనుంచి మేలుకొని భగ్నమైన వనమును వీరుడగు మహాకపిని చూచిరి." ||42.03||

||శ్లోకము 42.04||

స తా దృష్ట్వా మహాబాహుః మహాసత్త్వో మహాబలః|
చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహమ్||42.04||

స|| మహాబలః మహాసత్త్వః సః తాః దృష్ట్వా రాక్షసీనాం భయావహం సుమహత్ రూపం చకార||

|| శ్లోకార్థములు||

మహాబలః మహాసత్త్వః సః -
మహాబలము మహాసత్త్వము గల ఆ వానరుడు
తాః దృష్ట్వా - వారిని చూచి
రాక్షసీనాం భయావహం -
రాక్షసులకు భయము కలిగించు
సుమహత్ రూపం చకార -
మహత్తరమైన రూపమును ధరించెను

||శ్లోక తాత్పర్యము||

"మహాబలము మహాసత్త్వము గల ఆ వానరుడు, వారిని చూచి రాక్షసులకు భయము కలిగించు మహత్తరమైన రూపమును ధరించెను." ||42.04||

అంటే, అన్వేషణకోసము వృషదంశకమాత్రములో తిరిగిన హనుమ , రాక్షసులను భయపెట్టె రూపము ధరించాడన్నమాట.

||శ్లోకము 42.05||

తతస్తం గిరి సంకాశం అతికాయం మహాబలమ్|
రాక్షస్యో వానరం దృష్ట్వా ప్రపచ్ఛుర్జనకాత్మజమ్||42.05||

స|| తతః తం గిరిసంకాశం అతికాయం మహాబలం వానరం దృష్ట్వా రాక్షస్యః జనకాత్మజం ప్రపచ్ఛుః||

|| శ్లోకార్థములు||

తతః తం గిరిసంకాశం -
అప్పుడు పర్వతాకారముతో సమానమైన కాయముగల
అతికాయం మహాబలం -
మహాకాయుని మహాబలుడు అగు
వానరం దృష్ట్వా -
వానరుని చూచి
రాక్షస్యః జనకాత్మజం ప్రపచ్ఛుః -
ఆ రాక్షసులు జనకాత్మజని అడిగిరి

||శ్లోక తాత్పర్యము||

"అప్పుడు పర్వతాకారముతో సమానమైన కాయముగల మహాకాయుని మహాబలుడు అగు వానరుని చూచి ఆ రాక్షసులు జనకాత్మజని అడిగిరి." ||42.05||

||శ్లోకము 42.06||

కోఽయం కస్య కుతో వాయం కిన్నిమిత్తమిహాగతః|
కథం త్వయా సహానేన సంవాదః కృత ఇత్యుత ||42.06||

స|| అయం కః| కస్య అయం| కుతః కిం నిమిత్తం ఇహ ఆగతః| త్వయా సః అనేన సంవాదః కృతః కథం ఇతి||

రామ టీకాలో- అయం కః కిం నామ ఇత్యర్థః త్వయా సః సంవాదః కథం కృతః ఇత్యాచక్ష్వా కథయ , న చ సంవాద సమయే తసాం నిద్రితాత్వేన సంవాద జ్ఞాన అభావాత్ కథం తద్విషయకః ప్రశ్న ఇతి వాచ్యం సంవాద సమయే కించిన్నిద్రాపగమేన సీతాముఖప్రసాద హేతుక తత్సంబధ అనుమానేన వా తత్ జ్ఞాన సంభవాత్॥

|| శ్లోకార్థములు||

అయం కః - ఇతడు ఎవరు?
కస్య అయం - ఎవరి వాడు?
కుతః కిం నిమిత్తం ఇహ ఆగతః -
ఎక్కడినుంచి ఎందుకు ఇక్కడికి వచ్చినవాడు?
త్వయా సః అనేన సంవాదః కృతః - నీతో అతడు మాట్లాడాడు
కథం ఇతి - ఏమిటి అని

||శ్లోక తాత్పర్యము||

"ఇతడు ఎవరు? ఎవరి వాడు?ఎక్కడినుంచి ఎందుకు ఇక్కడికి వచ్చినవాడు? నీతో అతడు ఏమి మాట్లాడినాడు?" ||42.07||

నిద్రలోనించి లేచిన రాక్షస స్త్రీలకి, హనుమ తో సీతమాట్లాడినట్లు అన్నది ఎలా తెలుసు, అన్నమాటకి గోవిన్దరాజులవారి టీకాలో, అలాగే రామ టీకాలో కూడా చిన్నవ్యాఖ్యలు వున్నాయి. ఆ రాక్షసుల మాటలు, సీతమ్మవారి ముఖములో వున్న ప్రశాంతత మీద వచ్చిన అనుమానాలు అని. సీతమ్మవారి ముఖములో ప్రశాంతత, హనుమ తన మాటలతో సీతమ్మకి శాంతి ఊరట కలిగించాను అని సుందరకాండ చివరిలో చెప్పిన మాటకి నిదర్శనము కూడా.

||శ్లోకము 42.07||

ఆచక్ష్వ నో విశాలాక్షి మాభూత్తే సుభగే భయమ్|
సంవాద మసితాపాంగే త్వయా కిం కృతవానయమ్||42.07||

స|| విశాలాక్షి నః ఆచక్ష్వ| సుభగే తే భయం మాభూత్ | అసితాపాంగే అయం త్వయా కిం సంవాదం కృతవాన్ ||

|| శ్లోకార్థములు||

విశాలాక్షి నః ఆచక్ష్వ -
ఓ విశాలాక్షీ మాతో చెప్పుము
సుభగే తే భయం మాభూత్ -
ఓ సౌభాగ్యవంతురాలా భయము వలదు
అసితాపాంగే అయం త్వయా -
ఓ అసితేక్షణా అతడు నీతో
కిం సంవాదం కృతవాన్ -
ఏమి మాట్లాడెను?

||శ్లోక తాత్పర్యము||

"ఓ విశాలాక్షీ మాతో చెప్పుము. ఓ సౌభాగ్యవంతురాలా భయము వలదు. ఓ అసితేక్షణా అతడు నీతో ఏమి మాట్లాడెను? " ||42.07||

||శ్లోకము 42.08||

అథాబ్రవీన్ మహాసాధ్వీ సీతా సర్వాంగసుందరీ|
రక్షసాం భీమరూపాణాం విజ్ఞానే మమ కా గతిః||42.08||

స|| సీతా మహాసాధ్వీ సర్వాంగసుందరీ అబ్రవీన్ | భీమరూపాణాం రక్షసాం విజ్ఞానే గతిః మమ కా||

|| శ్లోకార్థములు||

సర్వాంగసుందరీ మహాసాధ్వీ -
సర్వాంగసుందరీ మహాసాధ్వి అయిన
సీతా అబ్రవీన్ -
సీత ఇట్లు పలికెను
భీమరూపాణాం రక్షసాం గతిః-
భీమరూపులైన రాక్షసుల గతి
విజ్ఞానే మమ కా -
నాకు ఎలా తెలుయును?

||శ్లోక తాత్పర్యము||

"సర్వాంగసుందరీ మహాసాధ్వి అయిన సీత ఇట్లు పలికెను. భీమరూపులైన రాక్షసుల గతి గురించి నాకు ఎలా తెలుయును? ||42.08||

||శ్లోకము 42.09||

యూయమేవాభిజానీత యోఽయం యద్వా కరిష్యతి|
అ హి రేవ హ్యహేః పాదాన్ విజానాతి న సంశయః||42.09||

స|| యూయం ఏవ అభిజానీతా అయం యః యద్వా కరిష్యతి | అహేః పాదాన్ అహిః ఏవ విజానాతి | సంశయః న ||

|| శ్లోకార్థములు||

యూయం ఏవ అభిజానీతా -
మీకే తెలిసిఉండాలి
అయం యః యద్వా కరిష్యతి -
ఇతడు ఎవరో ఏమి చేయగోరుచున్నాడో?
అహేః పాదాన్ అహిః ఏవ విజానాతి -
పాముయొక్క గుర్తులు పాములకే తెలియును కదా
సంశయః న -
అందులో సందేహము లేదు.

||శ్లోక తాత్పర్యము||

"మీకే తెలిసిఉండాలి ఇతడు ఎవరో ఎందుకువచ్చాడో ఏమి చేయగోరుచున్నాడో? పాముయొక్క గుర్తులు పాములకే తెలియును కదా. అందులో సందేహము లేదు."||42.09||

||శ్లోకము 42.10||

అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయమ్|
వేద్మి రాక్షస మేవైన కామరూపిణ మాగతమ్||42.10||

స||అహం అపి అస్య భీతా అస్మి| ఏనం కో ను అయం న జానామి | ఏనం ఆగతం కామరూపిణం రాక్షసం ఏవ వేద్మి||

గోవిన్దరాజ టీకాలో- నైనం జానామీతి। వివాహకాలే రతిసంప్రయోగే ప్రాణత్యయే సర్వధనాపహారే । మిత్రస్యచాఽర్థేపి అనృతం వదేయుః పంచానృతాన్యాహు అపాతకాని ।ఇతి స్మరాణాదసత్యోక్తిః |

|| శ్లోకార్థములు||

అహం అపి అస్య భీతా అస్మి-
నేను కూడా భయములో ఉన్నాను
ఏనం కో ను అయం న జానామి -
ఇతడెవరో నాకు తెలియదు
ఏనం ఆగతం - ఇలావచ్చిన ఇతడు
కామరూపిణం రాక్షసం ఏవ వేద్మి -
కామరూపులు అగు రాక్షసులవాడే అని అనుకొంటాను

||శ్లోక తాత్పర్యము||

"నేను కూడా భయములో ఉన్నాను. ఇతడెవరో నాకు తెలియదు. ఇలావచ్చిన ఇతడు కామరూపులు అగు రాక్షసుడే అని అనుకొంటాను."||42.10||

ఇక్కడ సీత అసత్యము పలుకుతుంది. హనుమ తన ప్రాణరక్షకుడు. నిజము చెప్పినచో రాక్షసులు ఆ హనుమను పట్టుకొని హించించెదరు. నిజము చెప్పకున్న అసత్య దోషము వచ్చును. హనుమద్రక్షణమే ముఖ్యము అని, అసత్య మాడుటచే వచ్చిన పాపము తను పొందిననూ పరవాలేదు అని తలచి, సీత ఈ విషయములో అసత్యము పలుకుతుంది అని చెప్పవచ్చు.

హనుమ ఆచార్యుడు. సీతమ్మ శిష్యురాలు. ఆచార్యుని రక్షణకు శిష్యుడు అసత్య మాడినను దోషము లేదు. శిష్యుడు గురువుయొక్క రక్షణకు తాను జాగరూకత వహింపవలెను. అందుచే ఆమె అసత్యమాడినది అని కూడా అనవచ్చు.

రామాయణములో ఇంకోచోట కూడా ఇలా అసత్యము వింటాము. రాముడు అయోధ్యనుండి బయటపడి అరణ్యమునకు వచ్చునపుడు వెనుకనుండి దశరథుడు రథము నడుపుచున్న సుమంత్రుని ఉద్దేశించి, "ఆపుము", "ఆపుము" అంటాడు. రాముడు సుమంత్రునితో "రథము సందడిలో వినపడలేదని తండ్రిగారితో చెప్పుము. ఇప్పుడు రథము పోనిమ్ము" అంటాడు. ఒకరిని అసత్యమాడుమని చెప్పుట దోషమే కదా, మరి రాముడు ఎందుకు చేసెను అని ప్రశ్న వచ్చును.

వనవాసమునకు పోవుచున్న రాముని దశరథుడు ఆపినచో, దశరథుడు తను ఇచ్చినమాట తప్పి అధర్మమునకు పాల్పడిన వాడగును. దశరథుడు పుత్రవాత్సల్యముతో "ఆపుము ", "ఆపుము" అంటూ అధర్మమునకు పాల్పడుతున్నాడు. అది గ్రహించాడు రాముడు.

తండ్రి ధర్మాచరణమునకు సమర్థుడు కానప్పుడు, కుమారుడు తండ్రి పక్షమున ధర్మమును ఆచరింపవలెను. తన తండ్రి రాజు. రాజు దేశమునకు మూలము. అతడు అసత్యవచనుడు కారాదు. అతని సత్యమును నిలుపుటకు కుమారుడైననూ, మంత్రి అయిననూ అసత్యమాడవచ్చు. అందుచే తండ్రిని సత్యవచనుడుగా చేయుటకు సుమంత్రునుని అసత్యమాడుమని చెప్పుట ధర్మ సమ్మితమే.

ఇదే ధ్వని కథోపనిషత్తులో వింటాము. నచికేతుడు తన తండ్రి చేస్తున్న దానములను చూచి, అట్టి దానములు చేసినవారు పుణ్యలోకములకు పోరు అని గ్రహించి, తననే దానముగా ఇవ్వమని తండ్రితో అంటాడు. దానములో మునిగి వున్న తండ్రి చిరాకుతో నిన్ను యమునికి ఇస్తాను అని చెప్పుతాడు. నచికేతుడు యముని దగ్గరకు వెళ్ళడానికి సిద్దమైనప్పుడు, తండ్రి వెనకాడితే అది అధర్మమని, మళ్ళీ నచికేతుడు తండ్రిని ఒప్పించి యమలోకానికి వెళతాడు.

అంటే అధర్మము చేయబోతున్న తండ్రిని నివారించడము పుత్రుని ధర్మము. తండ్రిని ధర్మ మార్గమ్ములో ఉంచుటకు, రాముడు అసత్యము పలకమని సుమంత్రునికి చెప్పుట ధర్మ సమ్మితమే. అలాగే హనుమ రక్షణకై సీత అసత్యము పలుకుట కూడా ధర్మ సమ్మతమే.

గోవిన్దరాజులవారు తమటీకాలో ఇలా రాసారు - నైనం జానామీతి। వివాహకాలే రతిసంప్రయోగే ప్రాణత్యయే సర్వధనాపహరే । మిత్రస్యచాఽర్థేపి అనృతం వదేయుః పంచానృతాన్యాహు అపాతకాని ।ఇతి స్మరాణాదసత్యోక్తిః ॥ వివాహకాలములో రతి సంయోగ విషయములో, ప్రాణము సంకటములో, ధనము అపహరింపబడుతున్నప్పుడు మితృలకోసము ఈ నాలుగు విషయములో అనృతము చెప్పవచ్చు అని అవి పాపము కాదు అని రాస్తారు.

అసలు సీతమ్మ చెప్పినమాటలో అసత్యము లేదు అంటూ ,అప్పలాచార్యులు గారు ఇక్కడ ఇంకో మాట కూడా చెపుతారు.

ఇక్కడ అహి అంటే రెండు అర్థాలు వున్నాయి (1) పాము (2) అంతశ్శత్రువు. రాక్షస స్త్రీలు సీతమ్మకి అంతశ్శత్రువులు. హనుమ రాక్షసస్త్రీలకి అంతశ్శత్రువు. అందుచే సీతమ్మ చమత్కారముగా "అహిరేవ హ్యహేః పాదాని విజానాతి" అంటూ 'వాని జాడ మీకే తెలియును' అని చెప్పినది. ఇక్కడ అసత్యము ఏమీ లేదు.

||శ్లోకము 42.11||

వైదేహ్యా వచనం శ్రుత్వా రాక్ష్యస్యో విద్రుతా దిశః|
స్థితః కాశ్చిద్గతాః కాశ్చిత్ రావణాయ నివేదితుమ్||42.11||

స|| వైదేహ్యాః వచనం శ్రుత్వా కాశ్చిత్ రాక్షస్యః దిశః విద్రుతాః | కాశ్చిత్ స్థితః | కాశ్చిత్ రావణాయ నివేదితుం గతాః||

|| శ్లోకార్థములు||

వైదేహ్యాః వచనం శ్రుత్వా -
వైదేహి వచహనములను విని
కాశ్చిత్ రాక్షస్యః దిశః విద్రుతాః-
కొందరు రాక్షసులు అన్ని దిశలలో పోయిరి
కాశ్చిత్ స్థితః -
కొందరు అక్కడే ఉండిపోయిరి
కాశ్చిత్ రావణాయ నివేదితుం గతాః -
కొందరు రావణునికి చెప్పుటకు వెళ్ళిరి

||శ్లోక తాత్పర్యము||

"వైదేహి వచహనములను విని రాక్షసులు అన్ని దిశలలో పోయిరి. కొందరు అక్కడే ఉండిపోయిరి. కొందరు రావణునికి చెప్పుటకు వెళ్ళిరి." ||42.11||

||శ్లోకము 42.12||

రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననాః|
విరూపం వానరం భీమ మాఖ్యాతు ముపచక్రముః||42.12||

స|| వికృతాననః రాక్షస్యః రావణస్య సమీపే విరూపం భీమం వానరం ఆఖ్యాతుం ఉపవక్రముః||

|| శ్లోకార్థములు||

వికృతాననః రాక్షస్యః -
వికృతాననము గల రాక్షసులు
రావణస్య సమీపే -
రావణుని వద్దకు పోయి
విరూపం భీమం వానరం -
భయంకరరూపము గల వానరుని
ఆఖ్యాతుం ఉపవక్రముః -
గురించి చెప్పుటకు ఉపక్రమించిరి

||శ్లోక తాత్పర్యము||

"వికృతాననము గల రాక్షసులు రావణుని వద్దకు పోయి భయంకరరూపము గల వానరుని గురించి చెప్పుటకు ఉపక్రమించిరి." ||42.12||

||శ్లోకము 42.13||

అశోకవనికామధ్యే రాజన్ భీమవపుః కపిః|
సీతయా కృతసంవాదః తిష్ఠత్యమిత విక్రమః||42.13||

స|| రాజన్ అమిత విక్రమః భీమః కపిః సీతాయా కృతసంవాదః అశోకవనికా మధ్యే తిష్టతి||

|| శ్లోకార్థములు||

రాజన్ అమిత విక్రమః -
ఓ రాజన్ అమితమైన విక్రమము గల
భీమః కపిః -
భయము కలిగించు వానరుడు
సీతాయా కృతసంవాదః -
సీతతో మాట్లాడి
అశోకవనికా మధ్యే తిష్టతి -
అశోకవనిక మధ్యలో ఉన్నాడు

||శ్లోక తాత్పర్యము||

"ఓ రాజన్, అమితమైన విక్రమము గల భయము కలిగించు వానరుడు సీతతో మాట్లాడి అశోకవనిక మధ్యలో ఉన్నాడు." ||42.13||

||శ్లోకము 42.14||

న చ తం జానకీ సీతా హరిం హరిణలోచనా|
అస్మాభిర్బహుధా పృష్ఠా నివేదయితుమిచ్ఛతి||42.14||

స|| సీతా హరిణలోచనా జానకీ అస్మాభిః బహుధా పృష్ఠా తం నివేదయితుం న ఇచ్ఛతి ||

|| శ్లోకార్థములు||

సీతా హరిణలోచనా జానకీ -
లేడి కళ్ళవంటి కళ్ళు గల జానకి
అస్మాభిః బహుధా పృష్ఠా -
మా చేత అనేకవిధములుగా అడగబడినప్పటికీ
తం నివేదయితుం న ఇచ్ఛతి -
వాని గురించి చెప్పుట లేదు

||శ్లోక తాత్పర్యము||

"లేడి కళ్ళవంటి కళ్ళు గల జానకి మాచేత అనేకవిధములుగా అడగబడినప్పటికీ, వాని గురించి చెప్పుట లేదు." ||42.14||

||శ్లోకము 42.15||

వాసవస్య భవేద్దూతో దూతో వైశ్రవణస్య వా|
ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణకాంక్షయా||42.15||

స|| వాసవస్య దూతో భవేత్ | వా వైశ్రవణస్య దూతః | సీతాన్వేషణ కాంక్షయా రామేణ ప్రేషితః అపి వా భవేత్ ||

|| శ్లోకార్థములు||

వాసవస్య దూతో భవేత్ -
ఇంద్రుడి దూత అయివుండవచ్చు
వా వైశ్రవణస్య దూతః -
లేక కుబేరుని దూతయో
సీతాన్వేషణ కాంక్షయా -
సీతాన్వేషణ కోరికతో
రామేణ ప్రేషితః అపి వా భవేత్ -
రామునిచేత పంపబడిన వాడో కావచ్చు

||శ్లోక తాత్పర్యము||

"అతడు ఇంద్రుడి దూతయో కుబేరుని దూతయో సీతాన్వేషణ గురించి రాముని చేత పంపబడిన వాడో కావచ్చు." ||42.15||

||శ్లోకము 42.16||

తేన త్వద్భుతరూపేణ యత్తత్తవ మనోహరమ్|
నానామృగగణాకీర్ణమ్ ప్రమృష్టం ప్రమదావనమ్||42.16||

స|| అద్భుతరూపేణ తేన మనోహరం నానామృగాకీర్ణం యత్ తవ ప్రమదావనం ప్రమృష్టం ||

|| శ్లోకార్థములు||

అద్భుతరూపేణ తేన -
ఆద్భుతరూపము గలవానిచేత
మనోహరం నానామృగాకీర్ణం -
మనోహరమైన అనేక మృగములతో కూడి వున్న
యత్ తవ ప్రమదావనం-
నీ యొక్క ఆ ప్రమదావనము
ప్రమృష్టం -
నాశనము చేయబడినది

||శ్లోక తాత్పర్యము||

"ఆద్భుతరూపము గల వాని చేత మనోహరమైన అనేక మృగములతో కూడి వున్న ఆ ప్రమదావనము నాశనము చేయబడినది." ||42.16||

||శ్లోకము 42.17||

న తత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశితః|
యత్రా సా జానకీ సీతా స తేన న వినాశితః||42.17||

స|| తేన యః న వినాశితః ఉద్దేశః తత్ర కశ్చిత్ న | యత్ర సా జానకీ (స్థితః) సః తేన నవినాశితః||

|| శ్లోకార్థములు||

తేన యః న వినాశితః -
అతనిచేత నాశనము చేయబడని
ఉద్దేశః తత్ర కశ్చిత్ న -
స్థలము ఒక్కటి కూడా లేదు
యత్ర సా జానకీ (స్థితః) -
ఎక్కడ జానకి ఉన్నదో
సః తేన నవినాశితః -
అక్కడ మాత్రము ధ్వంసము చేయలేదు

||శ్లోక తాత్పర్యము||

"అతనిచేత నాశనము చేయబడని స్థలము లేదు. ఎక్కడ జానకి ఉన్నదో అక్కడ మాత్రము ధ్వంసము చేయలేదు." ||42.17||

||శ్లోకము 42.18||

జానకీరక్షణార్థం వా శ్రమాద్వా నోపలభ్యతే|
అథావా కః శ్రమస్తస్యసైవ తే నాభిరక్షితా||42.18||

స|| జానకీ రక్షణార్థం వా శ్రమాత్ వా న ఉపలభ్యతే| అథవా కః తేన స ఏవ అభిరక్షితా ||

|| శ్లోకార్థములు||

జానకీ రక్షణార్థం వా -
జానకీ దేవి రక్షణకోసమో లేక
శ్రమాత్ వా న ఉపలభ్యతే -
శ్రమవలనో వదిలేసెనో మాకు తెలియదు
అథవా కః తేన -
లేక వానిచేత ఎందుకు
స ఏవ అభిరక్షితా -
అది రక్షింపబడెనో తెలియదు

||శ్లోక తాత్పర్యము||

"జానకీ దేవి రక్షణకోసమో లేక శ్రమవలనో వదిలేసెనో మాకు తెలియదు. వానిచేత ఎందుకు అది రక్షింపబడెనో తెలియదు." ||42.18||

||శ్లోకము 42.19||

చారుపల్లవపుష్పాఢ్యం యం సీతా స్వయమాస్థితా|
ప్రవ్రద్ధః శింశుపావృక్షః స చ తేనాభిరక్షితః||42.19||

స|| సీతా చారుపల్లవపుష్పాఢ్యం యం స్వయం ఆస్థితా సః ప్రవృద్ధః శింశుపావృక్షః తేన అభిరక్షితః ||

|| శ్లోకార్థములు||

యం చారుపల్లవపుష్పాఢ్యం -
దేని మీద అందమైన చిగుళ్ళు కలవో
సీతా స్వయం ఆస్థితా -
సీత స్వయముగా కూర్చుని ఉన్న
సః ప్రవృద్ధః శింశుపావృక్షః -
ఆ పెద్ద శింశుపావృక్షము
తేన అభిరక్షితః -
అతనిచేత రక్షింపబడినది

||శ్లోక తాత్పర్యము||

"సీత స్వయముగా కూర్చుని ఉన్న అందమైన చిగుళ్ళు కల శింశుపావృక్షము అతనిచేత రక్షింపబడినది."

||శ్లోకము 42.20||

తస్యోగ్రరూపస్యోగ్ర త్వం దండమాజ్ఞాతు మర్హసి|
సీతా సంభాషితా యేన తద్వనం చ వినాశితమ్||42.20||

స|| యేన సీతా సంభాషితా తత్ వనం చ వినాశితం | తస్య ఉగ్రరూపస్య త్వం ఉగ్రం దణ్డం ఆజ్ఞాతుం అర్హసి ||

|| శ్లోకార్థములు||

యేన సీతా సంభాషితా -
ఎవనితో సీత సంభాషణ చేసెనో
తత్ వనం చ వినాశితం -
అతడు ఆ వనమును ధ్వంశము చేసెను
తస్య ఉగ్రరూపస్య త్వం -
ఉగ్రరూపముగల వానిని నువ్వు
ఉగ్రం దణ్డం ఆజ్ఞాతుం అర్హసి -
నువ్వు ఉగ్రమైన దండము విధించ తగును

||శ్లోక తాత్పర్యము||

"ఎవనితో సీత సంభాషణ చేసెనో అతడు ఆ వనమును ధ్వంశము చేసెను. ఆ ఉగ్రరూపముగల వానిని నువ్వు ఉగ్రమైన దండము విధించ తగును." ||42.20||

||శ్లోకము 42.21||

మనః పరిగృహీతాం తాం తవ రక్షోగణేశ్వర|
కః సీతామభిభాషేత యో న స్యాత్త్యక్తజీవితః||42.21||

స|| రక్షో గణేశ్వర మనః పరిగ్రహీతాం తాం సీతాం యః త్యక్తజీవితః నస్యాత్ అభిభాషేత ?||

|| శ్లోకార్థములు||

రక్షో గణేశ్వర మనః పరిగ్రహీతాం -
రాక్షసాధిపుని మనస్సును బంధించిన
తాం సీతాం - ఆ సీతతో
యః అభిభాషేత ? - ఎవరు మాట్లాడగలడు
త్యక్తజీవితః నస్యాత్ -
తన జీవితముపై ఆశవదిలినవాడు తప్ప

||శ్లోక తాత్పర్యము||

"తన జీవితముపై ఆశవదిలినవాడు తప్ప ఎవడు రాక్షసాధిపును మనస్సును బంధించిన ఆ సీతతో మాట్లాడగలడు." ||42.21||

||శ్లోకము 42.22||

రాక్షసీనాం వచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః|
హుతాగ్ని రివ జజ్వాల కోపసంవర్తితేక్షణః||42.22||

స|| రాక్షసీనాం వచః శ్రుత్వా రాక్షసేశ్వరః రావణః కోప సంవర్తిత ఈక్షణః హుతాగ్నిః ఇవ జజ్వాల||

|| శ్లోకార్థములు||

రాక్షసీనాం వచః శ్రుత్వా -
రాక్షసుల వచనములను విన్న
రాక్షసేశ్వరః రావణః -
రాక్షసాధిపతి రావణుడు
కోప సంవర్తిత ఈక్షణః -
కోపము గల కళ్ళతో ఉరుముతూ
హుతాగ్నిః ఇవ జజ్వాల -
హుతాగ్ని వలె మండి పడెను.

||శ్లోక తాత్పర్యము||

"రాక్షసుల వచనములను విన్నకోపము గల రాక్షసాధిపతి కళ్ళుతో ఉరుముతూ కోపము గలవాడై హుతాగ్ని వలె మండి పడెను." ||42.23||

||శ్లోకము 42.23||

తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాస్రబిందవః|
దీప్తాభ్యామివ దీపాభ్యాం సార్చిషః స్నేహబిందవః||42.23||

స|| తస్య కృద్ధస్య నేత్రాభ్యాం దీప్తాభ్యాం దీపాభ్యాం సార్చిషః స్నేహబిందవః ఇవ అస్రబిందవః ప్రాపతన్ ||

|| శ్లోకార్థములు||

తస్య కృద్ధస్య నేత్రాభ్యాం -
ఆ కోపము గలవాని కళ్ళనుండి
దీప్తాభ్యాం దీపాభ్యాం సార్చిషః స్నేహబిందవః ఇవ -
ప్రజ్వరిల్లు తున్న దీపములనుండి మంటతో కూడిన తైలబిందువులు రాలినట్లు
అస్రబిందవః ప్రాపతన్ -
అశ్రుకణములు రాలెను

||శ్లోక తాత్పర్యము||

"ఆ కోపము గలవాని కళ్ళనుండి, ప్రజ్వరిల్లు తున్న దీపముల నుండి మంటతో కూడిన తైలబిందువులు రాలినట్లు, అశ్రుకణములు రాలెను." ||42.23||

||శ్లోకము 42.24||

ఆత్మనసదృశాన్ శూరాన్ కింకరాన్నామ రాక్షసాన్ |
వ్యాదిదేశ మహాతేజా నిగ్రహార్థం హనూమతః||42.24||

స|| మహాతేజా హనూమతః నిగ్రహార్థం అత్మనః సదృశాన్ శురాన్ కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాదిదేశ ||

|| శ్లోకార్థములు||

మహాతేజా హనూమతః -
ఆ మహాతేజోవంతుడైన హనుమంతు
నిగ్రహార్థం అత్మనః సదృశాన్ శురాన్ -
నిగ్రహించుటకు తనతో సమానమైన శూరులను
కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాదిదేశ -
కింకరులు అను పేరుగల రాక్షసులకు అదేశము మిచ్చెను

||శ్లోక తాత్పర్యము||

"ఆ మహాతేజోవంతుడైన హనుమంతుని నిగ్రహించుటకు తనతో సమానమైన కింకరులు అను పేరుగల రాక్షసులకు అదేశము మిచ్చెను." ||42.24||

||శ్లోకము 42.25,26||

తేషా మశీతి సాహస్రం కింకరాణాం తరస్వినామ్|
నిర్యయుర్భవనాత్ తస్మాత్ కూటముద్గరపాణయః||42.25||
మహోదరా మహాదంష్ట్రా ఘోరరూపా మహాబలాః|
యుద్ధాభిమనసః సర్వే హనుమద్గ్రహణోన్ముఖాః||42.26||

స|| తరస్వినాం తేషాం కింకరాణాం అసీతిసహస్రం మహోదరాః మహాదంష్ట్రాః ఘోరరూపాఃమహాబలాః యుద్ధాభిమనసః సర్వే కూటముద్గరపాణయః హనుమద్గ్రహణోద్యతాః తస్మాత్ భవనాత్ నిర్యయుః||

|| శ్లోకార్థములు||

మహోదరాః మహాదంష్ట్రాః -
మహత్తరమైన ఉదరము, మహత్తరమైన పళ్ళు గల
ఘోరరూపాః మహాబలాః -
ఘోరరూపము గల భయకరరూపముగల
యుద్ధాభిమనసః -
యుద్ధము చేయుటకు మనస్సు గల
సర్వే కూటముద్గరపాణయః -
అందరూ కూటములతో ముద్గరలతో చేతిలో పట్టుకొనివున్న
హనుమద్గ్రహణోద్యతాః -
హనుమంతుని బంధించుటకు
కింకరాణాం అసీతిసహస్రం -
ఎనభైవేల కింకరుల
తరస్వినాం తేషాం -
వేగముగాపోవువారి సముదాయము
తస్మాత్ భవనాత్ నిర్యయుః -
ఆ భవనము నుండి వెడలెను

||శ్లోక తాత్పర్యము||

"మహత్తరమైన ఉదరము, మహత్తరమైన పళ్ళు గల ఘోరరూపము గల భయకరరూపముగల ఎనభైవేల కింకరుల సముదాయము , యుద్ధము చేయుటకు మనస్సు గల ఎనభైవేల కింకరుల సముదాయము హనుమంతుని బంధించుటకు ఆ భవనము నుండి వెడలెను."||42.25,26||

||శ్లోకము 42.27||

తే కపీంద్రం సమాసాద్య తోరణస్థమవస్థితమ్|
అభిపేతుర్మహావేగాః పతంగా ఇవ పావకమ్||42.27||

స|| తే తోరణస్థం అవస్థితం కపీంద్రం సమాసాద్య మహావేగాగాః పతంగాః పావకం ఇవ అభిపేతుః||

|| శ్లోకార్థములు||

తే తోరణస్థం అవస్థితం -
వారు అశోకవన తోరణము పై ఆసీనుడైన
కపీంద్రం సమాసాద్య -
కపీంద్రుని సమీపించి
మహావేగాః పతంగాః పావకం -
మహావేగముగా ప్రజ్వరిల్లు తున్న అగ్నిలోకి దూకిన కీటకుములవలే
ఇవ అభిపేతుః -
(హనుమంతుని) పై దూకిరి

||శ్లోక తాత్పర్యము||

"వారు అశోకవన తోరణము పై ఆసీనుడైన కపీంద్రుని సమీపించి, ప్రజ్వరిల్లు తున్న అగ్నిలోకి దూకిన కీటకుములవలే, హనుమంతునిపై దూకిరి." ||42.27||

||శ్లోకము 42.28||

తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః|
ఆజఘ్నుః వానరశ్రేష్ఠం శరైశ్చాదిత్య సన్నిభైః||42.28||

స||తే విచిత్రాభిః గదాభిః పరిఘైః కాంచనాంగదైః శరైః ఆదిత్యసన్నిభైః వానరశ్రేష్ఠం ఆజఘ్నుః చ ||

|| శ్లోకార్థములు||

తే విచిత్రాభిః గదాభిః -
వారు విచిత్రమైన గదలతో
పరిఘైః కాంచనాంగదైః -
పరిఘలతో బంగారు గదలతో
ఆదిత్యసన్నిభైః శరైః -
సూర్యునికిరణములవలె తేజరిల్లు తున్న శరములతో
వానరశ్రేష్ఠం ఆజఘ్నుః చ -
వానరశేష్ఠునిపై దాడిచేసిరి

||శ్లోక తాత్పర్యము||

"వారు విచిత్రమైన గదలతో పరిఘలతో బంగారు గదలతో సూర్యునికిరణములవలె తేజరిల్లు తున్న శరములతో వానరశేష్ఠునిపై దాడిచేసిరి."||42.28||

||శ్లోకము 42.29||

ముద్గరైః పట్తిసైః శూలైః ప్రాసతోమరశక్తిభిః|
పరివార్య హనూమంతం సహసా తస్థురగ్రతః||42.29||

స|| ముద్గరైః పట్టి శూలైః ప్రాసతోమరశక్తిభిః సహసా హనూమంతం పరివార్య (తస్య) అగ్రతః తస్థుః||

|| శ్లోకార్థములు||

ముద్గరైః పట్టి శూలైః -
ముద్గరములు పట్టిశములు శూలములు
ప్రాసతోమరశక్తిభిః -
ఇతర అస్త్రములతో
సహసా హనూమంతం పరివార్య -
వేగముగా హనుమంతుని చుట్టుముట్టి
(తస్య) అగ్రతః తస్థుః-
ముందు నిలబడిరి

||శ్లోక తాత్పర్యము||

"ముద్గరములు పట్టిశములు శూలములు పట్టుకొని వేగముగా హనుమంతుని చుట్టుముట్టి అతని ముందు నిలబడిరి."||42.29||

||శ్లోకము 42.30||

హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వతసన్నిభః|
క్షితవావిధ్య లాంగూలం ననాద చ మహాస్వనమ్||42.30||'

స|| తేజస్వీ పర్వతసన్నిభః హనుమాన్ అపి లాంగూలం క్షితౌ ఆవిధ్య మహాస్వనం ననాద

|| శ్లోకార్థములు||

తేజస్వీ పర్వతసన్నిభః -
తేజస్వి పర్వతాకారరూపము గల
హనుమాన్ అపి లాంగూలం క్షితౌ ఆవిధ్య -
హనుమంతుడు భూమి మీద తన తోక ఝాడించి
మహాస్వనం ననాద -
మహత్తరమైన నాదము చేసెను

||శ్లోక తాత్పర్యము||

"తేజస్వి పర్వతాకారరూపము గల హనుమంతుడు భూమి మీద తన తోక ఝాడించి మహత్తరమైన నాదము చేసెను." ||42.30||

||శ్లోకము 42.31||

స భూత్వా సుమహాకాయో హనుమాన్మారుతాత్మజః|
ధృష్ట మాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్||42.31||

స|| మారుతాత్మజః సః హనుమాన్ సుమహాకాయః భూత్వా శబ్దేన లంకాం పూరయన్ ధృష్టం అస్ఫోటయామాస||

|| శ్లోకార్థములు||

మారుతాత్మజః సః హనుమాన్ -
మారుతాత్మజుడు అయిన ఆ హనుమంతు
సుమహాకాయః భూత్వా-
తన కాయమును పెరిగించి
శబ్దేన లంకాం పూరయన్ -
లంకానగరము అంతా శబ్దముతో నిండునట్లు
ధృష్టం అస్ఫోటయామాస -
జబ్బలు చరిచెను

||శ్లోక తాత్పర్యము||

"మారుతాత్మజుడు అయిన ఆ హనుమంతుడు తన కాయమును పెరిగించి లంకానగరము అంతా శబ్దముతో నిండునట్లు జబ్బలు చరిచెను." ||42.31||

||శ్లోకము 42.32||

తస్యాస్ఫోటితశబ్దేన మహతా సానునాదినా|
పేతుర్విహంగా గగనాదుచ్చైశ్చేద మఘోషయత్ ||42.32||

స|| తస్య మహతా సానునాదినా ఆస్ఫోటితశబ్దేన విహంగాః గగనాత్ పేతుః | ఉచ్చైః ఇదం అఘోషయత్ ||

|| శ్లోకార్థములు||

తస్య మహతా సానునాదినా -
అతనియొక్క ఆ మహత్తరమైన నాదముతో
ఆస్ఫోటితశబ్దేన -
పలికిన శబ్దములతో
విహంగాః గగనాత్ పేతుః-
ఆకాశమునుండి పక్షులు నేలకు రాలినవి.
ఉచ్చైః ఇదం అఘోషయత్ -
హనుమంతుడు గట్టిగా ఇట్లు ఘోషించెను

||శ్లోక తాత్పర్యము||

"మహత్తరమైన నాదముతో అతడు పలికిన శబ్దములతో ఆకాశమునుండి పక్షులు నేలకు రాలినవి. హనుమంతుడు గట్టిగా ఇట్లు ఘోషించెను." ||42.32||

||శ్లోకము 42.33-36||

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః|
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||42.33||
దాసోsహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతామారుతాత్మజః||42.34||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||42.35||
అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||42.36||

స|| అతి బలః రామః జయతి | మహాబలః లక్ష్మణః చ (జయతి) |రామేణ అభిలాషితః రాజా సుగ్రీవః చ జయతి||శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః హనుమాన్ అహం క్లిష్టకర్మణః రామస్య కోసలేంద్రస్య దాసః ||సహస్రశః శిలాభిః పాదపైశ్చ ప్రహరతః మే యుద్ధే రావణ సహస్రం ప్రతిబలం న భవేత్ ||సర్వరక్షసాం మిషతాం లంకాం పురీం అర్దయిత్వా మైధిలీం అభివాద్య చ సమృద్ధార్థః గమిష్యామి||

|| శ్లోకార్థములు||

అతి బలః రామః జయతి -
అతిబలవంతుడైన రామునికి జయము
మహాబలః లక్ష్మణః చ (జయతి) -
మహాబలుడైన లక్ష్మణునికి జయము
రామేణ అభిలాషితః రాజా సుగ్రీవః చ జయతి -
రామునిచేత పరిపాలింపబడిన సుగ్రీవునకు జయము

శత్రుసైన్యానాం నిహంతా -
శత్రుసైన్యములను వధించగల
మారుతాత్మజః హనుమాన్ -
మారుతాత్మజుడను హనుమంతుడను
అహం క్లిష్టకర్మణః రామస్య -
నేను క్లిష్టటమైన కర్మలను సాధించ గల
కోసలేంద్రస్య దాసః -
రాముని దాసుడను

సహస్రశః శిలాభిః పాదపైశ్చ -
వేలకొలది శిలలతో వృక్షములతో
ప్రహరతః మే యుద్ధే -
తిరుగుతూ వున్న నన్ను యుద్ధములో
రావణ సహస్రం ప్రతిబలం న భవేత్ -
వేయి మంది రావణులు కూడా ఎదిరించలేరు

సర్వరక్షసాం మిషతాం -
రాక్షసులందరూ చూస్తూ ఉండగానే
లంకాం పురీం అర్దయిత్వా -
లంకను ధ్వంశము చేసి
మైధిలీం అభివాద్య చ -
మైథిలికి అభివాదము చేసి
సమృద్ధార్థః గమిష్యామి -
కృతకృత్యుడనై వెళ్ళెదను

||శ్లోక తాత్పర్యము||

"అతిబలవంతుడైన రామునికి జయము. మహాబలుడైన లక్ష్మణునికి జయము. రామునిచేత పరిపాలింపబడిన సుగ్రీవునకు జయము. శత్రుసైన్యములను వధించగల మారుతాత్మజుడను నేను క్లిష్టటమైన కర్మలను సాధించ గల రాముని దాసుడను. వేలకొలది శిలలతో వృక్షములతో తిరుగుతూ వున్న నన్ను యుద్ధములో వేయి మంది రావణులు కూడా ఎదిరించలేరు. రాక్షసులందరూ చూస్తూ ఉండగానే లంకను ధ్వంశము చేసి మైథిలికి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను". ||42.32-36||

ఇది హనుమ రాక్షసులను జయించుటకు ఉపయోగించు జయ మంత్రము. ఈ శ్లోకాలు కూడా ప్రథమ వచనములో చెప్పబడుతాయి. అందుకని ఈ శ్లోకములు మనము చదివినచో మనకు కూడా విరోధులు తొలగి విజయము చేకూరును. ఇదే ఆ జయమంత్రము.

"జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః|
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||33||
దాసోsహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతామారుతాత్మజః||34||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||35||
అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్"||36||

ఇక్కడ హనుమ తను రామదాసుడను అని ఘోషిస్తాడు. శ్లోకము చదువుతున్న మనము కూడా మనము రామదాసులము అని ఘోషిస్తున్నట్లే. శ్లోకము చదువుతున్న మనము కూడా రాముని కి జయము అని ఘోషిస్తున్నట్లే. అందుకనే దీనిని జయమంత్రము అన్నారు.

ఇంకో మాట.

సీత హనుమను రక్షించడము కోసము హనుమ ఎవరో చెప్పదు. కాని హనుమ తనంతట తానే తన గురించి చెపుతాడు.

మరింకోమాట.ఇప్పటిదాకా హనుమ ఎప్పుడూ దాసునిగా వర్ణించుకోలేదు. ఇప్పటిదాకా హనుమ తను రామదూత అని, సుగ్రీవుని సచివుడను అని చెప్పుకున్నాడు. సీతమ్మను చూచిన తరువాత హనుమంతునికి తన స్వరూపము తెలిసెను. ఆత్మకి సహజమైన రూపము భగవద్దాస్యమే

"దాసభూతాః స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః" ఆత్మలన్నియూ పరమాత్మకు సహజముగా దాసులే అని చెప్పబడినది. తాను ఏకార్యము చేయుచున్ననూ పరమాత్ముని దాసుడై వాని అతిశయనముకే చేయవలెను. సర్వ శక్తిమతి అగు సీత రామునికే చెందినదై ఉండుట చూచి, అట్టి స్వరూపమే ఆత్మగా ఎరిగి, హనుమ తనను తాను దాసుడుగా చెప్పుకొనెను.

ఆ రాముడే తను చేయు సర్వకార్యములను తన ద్వారా చేయించుచున్నాడని గ్రహించెను. ఆట్టి కర్మవలన కలుగు అతిశయము ఆయనదే అని భావించును. అలా భావించి రాక్షసులను జయించును. మనము కూడా అలాగ ఆలోచించినచో ఖేదము పొందక జయము పొందెదము.అదే జయమంత్రము.

ఇక్కడ హనుమ చేస్తున్నది విరోధి నిరసనము. అది శత్రువులను చంపుట, దానిని చేయువాడు తనుకాదనియు, ఆకర్మ తనది కాదనియు ,దాని వలన కలుగి ప్రీతి తనది కాదనియు హనుమ భావించుచుండెను. అలా భావించి కర్మ చేయుచుండెను. అదే మనము కూడా అలవరచుకొనవలసిన జయ మంత్రము

||శ్లోకము 42.37||

తస్య సన్నాదశబ్దేన తేఽభవన్భయశంకితాః|
దదృశుశ్చ హనూమంతం సంధ్యామేఘ మివోన్నతమ్ ||42.37||

స|| తే తస్య సన్నాదశబ్దేన భయశంకితాః అభవన్| సంధ్యామేఘం ఇవ ఉన్నతం హనూమంతం దదృశుః చ ||

|| శ్లోకార్థములు||

తే తస్య సన్నాదశబ్దేన -
వారందరూ అతని చే చేయబడిన నాదముతో
భయశంకితాః అభవన్ -
భయపడినవారైరి
సంధ్యామేఘం ఇవ -
సంధ్యాకాల మేఘమువలె
ఉన్నతం హనూమంతం దదృశుః చ -
ఉన్నతమైన ఆకారము గల హనుమంతుని చూచిరి

||శ్లోక తాత్పర్యము||

"వారందరూ అతని చే చేయబడిన నాదముతో భయపడినవారైరి. సంధ్యాకాల మేఘమువలె ఉన్నతమైన ఆకారము చూచిరి." ||42.37||

||శ్లోకము 42.38||

స్వామి సందేశనిశ్సంకాః తతస్తే రాక్షసాః కపిమ్|
చిత్రైః ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తః||42.38||

స||తతః తే రాక్షసాః స్వామిసందేశ నిఃశంకాః చిత్రైః ప్రహరణైః కపిం అభిపేతుః||

|| శ్లోకార్థములు||

తతః తే రాక్షసాః -
అప్పుడు ఆ రాక్షసులు
స్వామిసందేశ నిఃశంకాః -
ప్రభువు ఆదేశానుసారముఅనుమానము లేనివారై
చిత్రైః ప్రహరణైః -
విచిత్రములైన ఆయుధములతో
కపిం అభిపేతుః -
కపి పై దాడి చేసిరి

||శ్లోక తాత్పర్యము||

"ప్రభువు ఆదేశానుసారముచిత్ర విచిత్రములైన ఆయుధములతో కపి పై దాడి చేసిరి." ||42.38||

||శ్లోకము 42.39||

స తై పరివృతః శూరైః సర్వతః సుమహబలః |
అససాదాఽరగ్యసం భీమం పరిఘం తోరణాశ్రితమ్||42.39||

స|| సుమహాబలః సః తైః శూరైః సర్వతః పరివృతః తోరణాశ్రితం భీమం ఆయసం పరిఘం అససాద||

|| శ్లోకార్థములు||

సుమహాబలః సః - ఆ మహాబలుడు
తైః శూరైః సర్వతః పరివృతః -
ఆ శూరులచే అన్నివేపుల చుట్టుముట్టబడి
తోరణాశ్రితం భీమం -
తోరణముపై ఉన్న భయంకరమైన
ఆయసం పరిఘం అససాద -
భయంకరమైన పరిగెను తీసుకొనెను

||శ్లోక తాత్పర్యము||

"ఆ మహాబలుడు ఆ శూరులచే అన్నివేపుల చుట్టుముట్టబడి తోరణముపై ఉన్న భయంకరమైన పరిగెను తీసుకొనెను." ||42.39||

||శ్లోకము 42.40||

స తం పరిఘమాదాయ జఘాన రజనీచరాన్|
స పన్నగమివాదాయ స్ఫురంతం వినతాసుతః||42.40||
విచచా రాంబరే వీరః పరిగృహ్య చ మారుతిః|

స|| సః తం పరిఘం ఆదాయా రజనీచరాన్ జఘాన | వీరః సః మారుతిః వినతాసుతః స్ఫురంతం పన్నగాం ఆదాయ పరిగృహ్య అంబరే విచచార||

|| శ్లోకార్థములు||

సః తం పరిఘం ఆదాయా రజనీచరాన్ జఘాన -
అతడు ఆ పరిఘను తీసుకొని నిశాచరులను కొట్టెను
వీరః సః మారుతిః వినతాసుతః -
వీరుడు ఆ మారుతి గరుత్మంతుడు
స్ఫురంతం పన్నగాం ఆదాయ -
లేస్తున్న పామును పట్టుకొని
పరిగృహ్య అంబరే విచచార-
ఆకాశములో ( ఆపరిఘను తీసుకొని) తిరిగెను

||శ్లోక తాత్పర్యము||

"అతడు ఆ పరిఘను తీసుకొని నిశాచరులను కొట్టెను. వీరుడు ఆ మారుతి గరుత్మంతుడు మహాసర్పమును పట్టుకొని అకాశములో తిరిగినట్లు ఆపరిఘను తీసుకొని తిరిగెను." ||42.40||

||శ్లోకము 42.41||

స హత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్మారుతాత్మజః||42.41||
యుద్ధకాంక్షీ పునర్వీరః తోరణం సముపాశ్రితః|

స|| వీరః సః మారుతాత్మజః వీరాన్ కింకరాన్ రాక్షసాన్ హత్వా యుద్ధకాంక్షీ తోరణం సముపాశ్రితః||

|| శ్లోకార్థములు||

వీరః సః మారుతాత్మజః -
వీరుడైన ఆ మారుతాత్మజుడు
వీరాన్ కింకరాన్ రాక్షసాన్ హత్వా -
కింకరులు అనబడు రాక్షసులను హతమార్చి యుద్ధము
యుద్ధకాంక్షీ తోరణం సముపాశ్రితః-
యుద్ధము చేయుటకు కోరిక గలవాడై మరల అ తోరణము ఆశ్రయించెను.

||శ్లోక తాత్పర్యము||

"వీరుడైన ఆ మారుతాత్మజుడు కింకరులు అనబడు రాక్షసులను హతమార్చి యుద్ధము చేయుటకు కోరిక గలవాడై మరల అ తోరణము ఆశ్రయించెను." ||42.41||

||శ్లోకము 42.42,43||

తతః తస్మాద్భయాన్ముక్తాః
కతిచిత్తత్ర రాక్షసాః||42.42||
నిహతాన్ కింకరాన్ సర్వాన్
రావణాయ న్యవేదయన్||42.43||

స|| తతః తత్ర తస్మాత్ భయాత్ ముక్తాః కతిచిత్ రాక్షసాః సర్వాన్ కింకరాన్ నిహతాన్ (ఇతి) రావణాయ న్యవేదయన్||

|| శ్లోకార్థములు||

తతః తత్ర తస్మాత్ భయాత్ ముక్తాః -
అప్పుడు అక్కడ అయనపై భయపడి పారిపోయిన
కతిచిత్ రాక్షసాః -
కొందరు రాక్షసులు
సర్వాన్ కింకరాన్ నిహతాన్ (ఇతి)-
కింకరులు అందరూ హతమార్చబడిరి అని
రావణాయ న్యవేదయన్ -
రావణుని కి నివేదించిరి

||శ్లోక తాత్పర్యము||

"అప్పుడు అక్కడ అయనపై భయపడి పారిపోయిన కొందరు రాక్షసులు 'కింకరులు అందరూ హతమార్చబడిరి" అని రావణుని కి నివేదించిరి." ||42.42,23||

||శ్లోకము 42.44||

స రాక్షసానాం నిహతం మహద్బలం
నిశమ్య రాజా పరివృత్త లోచనః|
సమాదిదేశాప్రతిమం పరాక్రమే
ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయమ్||42.44||

స|| సః రాజా రాక్షసానాం మహత్ బలం నిహతం నిశమ్య పరివృతలోచనః పరాక్రమే అప్రతిమం సమరే సుదుర్జయం ప్రహస్త పుత్రం సమాదిదేశ||

|| శ్లోకార్థములు||

సః రాజా - ఆ రాజు
రాక్షసానాం మహత్ బలం నిహతం నిశమ్య -
రాక్షసులయొక్క మహత్తరమైన బలగము హతమార్చబడినట్లు విని
పరివృతలోచనః - కళ్ళు తిప్పుతూ
పరాక్రమే అప్రతిమం సమరే సుదుర్జయం -
అప్రతిమమైన పరాక్రమము గల జయింపబడలేని
ప్రహస్త పుత్రం సమాదిదేశ -
ప్రహస్తుని పుత్రునికి ఆదేశమిచ్చెను.

||శ్లోక తాత్పర్యము||

"ఆ రాజు రాక్షసులయొక్క మహత్తరమైన బలగము హతమార్చబడినట్లు విని , కళ్ళు తిప్పుతూ అప్రతిమమైన పరాక్రమము గల జయింపబడలేని ప్రహస్తుని పుత్రునికి ఆదేశమిచ్చెను."||42.44||

కింకరుల వధగురించి విన్న రావణుడు , జయింపబడలేని ప్రహస్తపుత్రుని పంపిస్తున్నాడు అన్న మాటతో ఈ సర్గ అంతమౌతుంది.

ఈ సర్గలో మనము ముఖ్యముగా వినేది హనుమంతుని జయఘోష

హనుమంతుని జయఘోష భక్తుని కోణములో విశదీకరిస్తూ , శ్రీభాష్యం అప్పలాచార్యులవారు ఇంకా ఇలా చెపుతారు.

మనకు మూడు విరోధులు.
(1) నేను నావాడను అని అనుకోవడము
(2) తనను తాను రక్షించుకొన యత్నించుట
(3) తాను చేయు కర్మల తనవే అని వానిప్రీతి తనదే అనుకొనుట.

ఈ మూడింటిపై జయమే విరోధి జయము. ఆ జయమునకు సాధనము మంత్రము.

అదే " రామ్ రామాయ నమః". నమః అన్న పదాన్ని ఇదివఱకు విశ్లేషణము చేయడము అయినది. మః అంటే 'నాది' , "న" అంటే కాదు అని. ఒక కార్యము ముగించి 'నమః" అనుకుంటే , అది స్వామికి అర్పించి ఇది 'నాది కాదు" అని అనుకోవడమే. చేసిన కర్మలన్నీ భగవంతునికే అర్పించినచో ఆ కర్మల బంధములు మనని బంధించవు అని భగవద్గీతలో కూడా విన్నమాటే. అదే ఇక్కడ కూడా వినపడే మాట.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ద్విచత్వారింశస్సర్గః ||

||ఓమ్ తత్ సత్||