||సుందరకాండ ||

||ఏభై ఆరవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 56 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ శ్లోకార్థ తత్త్వదీపికా సహిత
షట్పంచాశస్సర్గః||

- 'దక్షిణాత్ ఉత్తరం దిశమ్ ప్రపేదే' -

సీతమ్మ క్షేమముగా వున్నది అన్న చారణులమాట విని, కుదుటబడిన మనస్సు కల హనుమ, ఆమెను ప్రత్యక్షముగా చూచి తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను అని విన్నాము. అలాగే హనుమ సీతమ్మ ఆనతి తీసుకోడానికి అప్పుడు అశోకవనములో శింశుపావృక్షమూలములో ఉపస్థితురాలైవున్న జానకి దగ్గరకు చేరి, ఆమె సందేశము తీసుకొని, తిరుగు ప్రయాణము పడతాడు. అంటే, 'తతో రావణ నీతాయాః', అంటూ రావణునిచే అపహరింపబడిన సీతమ్మను అన్వేషించడానికి, 'చారణా చరితే పథి"- దక్షిణ దిశలో చారణులు వెళ్ళిన మార్గములో వెళ్ళిన హనుమ, 'దక్షిణాత్ ఉత్తరం దిశం ప్రపేదే' , అంటే దక్షిణము నుంచి ఉత్తరానికి తిరుగుముఖము పట్టాడన్నమాట.

లంకాదహనక్రియలో, తన తప్పువలన సీతమ్మకూడా మరణించినదేమో, అని తీవ్రమైన మనోవ్యథలో పడిన హనుమ, మళ్ళీ క్షేమముగా వున్న సీతమ్మని దర్శనము చేసుకోవడముతో ఇది కూడా ఒక సిద్ధి సర్గగా భావించవచ్చు.

ఇంకోమాట, 'తతోరావణ నీతాయాః' అంటూ, మనస్సుచేత హరింపబడి దారి తప్పిన ఆత్మ అన్వేషణకై , అచార్య రూపములో బయలు దేరిన హనుమ, తన అన్వేషణ పూర్తి చేసికొని, భగవంతునికి నివేదించుటకు ఉత్తర దిశగా బయలుదేరడముతో, ఈ సర్గతో ఆచార్యుడిగా హనుమ కార్యక్రమము పూర్తి అయినది అన్నమాట. అందువలన కూడా ఈ సర్గ సిద్ధి సర్గ అనులోవచ్చు.

ఇక ఏభై ఆరవ సర్గలో శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.

||శ్లోకము 56.01||

తతస్తు శింశుపామూలే జానకీం పర్యుపస్థితామ్ |
అభివాద్యాబ్రవీదిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతామ్ ||56.01||

స|| తతః శింశుపామూలే పర్యుపస్థితాం జానకీం అభివాద్య అబ్రవీత్ | దిష్ట్యా త్వాం అక్షతాం ఇహ పశ్యామి ||

||శ్లోకార్థములు||

తతః శింశుపామూలే పర్యుపస్థితాం -
అప్పుడు శింశుపావృక్షమూలములో ఉపస్థితురాలైవున్న
జానకీం అభివాద్య బ్రవీత్ -
జానకికి అభివాదము చేసి ఇట్లు పలికెను.
దిష్ట్యా త్వాం అక్షతాం ఇహ పశ్యామి-
అదృష్టము కొలదీ నిన్ను క్షేమముగా ఇక్కడ చూచుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు శింశుపావృక్షమూలములో ఉపస్థితురాలైవున్న జానకికి అభివాదము చేసి ఇట్లు పలికెను. ' అమ్మా అదృష్టము కొలదీ నిన్ను క్షేమముగా ఇక్కడ చూచుచున్నాను'. ||56.01||

లంకాదహనములో సీత కూడా మరణించినదేమో అని మనోవ్యథ పొందిన హనుమ, తను పడిన అతి తీవ్రమైన మనో వ్యథ అంతా, 'అదృష్టము కొలదీ' అని అన్న ఒక్కమాటలో ఇమిడ్చాడు.

||శ్లోకము 56.02||

తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః |
భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతం అభాషత ||56.02||'

స|| తతః ప్రస్థితం హనుమంతం వీక్షమాణా సీతా భర్తృస్నేహాన్వితం వాక్యం అభాషత||

||శ్లోకార్థములు||

తతః ప్రస్థితం హనుమంతం -
అప్పుడు బయలుదేరుటకు సిద్ధముగా నున్న హనుమంతుని
వీక్షమాణా సీతా - చూచుచూ, సీత
భర్తృస్నేహాన్వితం వాక్యం -
భర్తపై తనకు గల స్నేహము ఉట్టిపడేటటట్టుగా
అభాషత - పలికెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు బయలుదేరుటకు సిద్ధముగా నున్న హనుమంతుని చూచుచూ, సీత భర్తపై తనకు గల స్నేహము ఉట్టిపడేటటట్టు గా ఇలా పలికెను. ||56.02||

||శ్లోకము 56.03||

కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే |
పర్యాప్తః పరవీరఘ్నః యశస్యః తే బలోదయః ||56.03||

స|| అస్య కార్యస్య పరిసాధనే కామం త్వం ఏకం ఏవ పర్యాప్తః | అస్య తే బలోదయః యశస్యః ||

గోవిన్దరాజ టీకాలో - వనభఙ్గాక్ష వధాధినా హనుమత్ శక్తిం విజ్ఞాయ అసౌ రామాయ నివేద్య స్వయమేవ సకల రాక్షస సంహారక పూర్వం మమ నేతా మా భూత్ ఇతి అభిప్రాయేణ ఆహ కామం ఇతి।అస్య కార్యస్య సర్వ రాక్షస వధ పూర్వకమత్ప్రాపణ రూప కార్యస్య తే యశస్యః యశస్కరః। నతు రామస్య ఇతి భావః।

||శ్లోకార్థములు||

అస్య కార్యస్య పరిసాధనే -
ఈ కార్యము సాధించుటలో
కామం త్వం ఏకం ఏవ పర్యాప్తః -
బహుశ నీవు ఒక్కడివే చాలును
అస్య తే బలోదయః యశస్యః -
అలాచేసినచో నీ బలములు కీర్తి పెరుగును

||శ్లోకతాత్పర్యము||

'ఈ కార్యము సాధించుటలో బహుశ నీవు ఒక్కడివే చాలును. అలా చేసినచో నీ బలములు కీర్తి పెరుగును'. ||56.03||

సముద్ర లంఘనముతో, వనభంగముతో, అక్షకుమారుని వధతో, హనుమంతుని ప్రజ్ఞ తెలిసికొనిన సీతమ్మ కి , చేయవలసిన కార్యక్రమానికి హనుమ ఒక్కడే చాలును అని. కాని సీతమ్మకి కావలసినది, చేయవలసిన కార్యక్రమము చేయతగిన విధముగా రాముని ద్వారానే చేయబడాలి అని.

||శ్లోకము 56.04||

శరైస్తు సంకులాం కృత్వా లంకామ్ పరబలార్దనః |
మాం నయేద్యది కాకుత్‍స్థః తత్ తస్య సదృశం భవేత్ ||56.04||

స|| పరబలార్దనః కాకుత్‍స్థః శరైస్తు లంకాం సంకులాం కృత్వా యది మాం నయేత్ తత్ తస్య సదృశం భవేత్ ||

గోవిన్దరాజ టీకాలో - తర్హి రామస్య కిం యశస్కరమ్ ఇతి ఆహ శరైః ఇతి।తత్ స్వపరాక్రమేణ మన్నయం॥ తస్య కాకుత్ స్థస్య సదృశం। ఏతదేవ మమ అభిలషితం।అన్యథా మే కథం వీరపత్నీత్వం ఇతి భావః।

||శ్లోకార్థములు||

పరబలార్దనః కాకుత్‍స్థః -
పరశత్రువుల చీల్చి చెండాడగల రాముడు
శరైస్తు లంకాం సంకులాం కృత్వా -
శరములతో సమస్త లంకానగరమును సంకులము చేసి
యది మాం నయేత్ -
నన్ను తీసుకు పోయినచో
తత్ తస్య సదృశం భవేత్ -
అది ఆయనకు తగినట్లు ఉండును

||శ్లోకతాత్పర్యము||

'పరశత్రువుల చీల్చి చెండాడగల రాముడు సమస్త లంకానగరమును సంకులము చేసి నన్ను తీసుకు పోయినచో అది ఆయనకు తగినట్లు ఉండును'. ||56.04||

'తత్ తస్య సదృశం భవేత్', అన్నది సీతమ్మ కోరిక.

||శ్లోకము 56.05||

తద్యథా తస్య విక్రాన్తమనురూపం మహాత్మనః |
భవత్యాహవశూరస్య తథా త్వముపపాదయ ||56.05||

స|| తత్ మహాత్మనః ఆహవశూరస్య తస్య విక్రాంతం అనురూపం యథా భవతి తథా త్వం ఉపపాదయ ||

||శ్లోకార్థములు||

తత్ మహాత్మనః - అ మహాత్ముడు
ఆహవశూరస్య తస్య విక్రాంతం అనురూపం -
శూరాగ్రేసరుడు అయనయొక్క పరాక్రముమునకు అనుగుణముగా
యథా భవతి - ఎలా అగునో
తథా త్వం ఉపపాదయ -
ఆలాగ నీవు చేయుము

||శ్లోకతాత్పర్యము||

'అ మహాత్ముడు శూరాగ్రేసరుడు తన పరాక్రమమునకు అనుగుణమైన తీరుగా ఎట్లు చేయువలెనో దానికి తగు రీతిగా నీవు చేయుము'. ||56.05||

||శ్లోకము 56.06||

తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతుసంహితమ్ |
నిశమ్య హనుమాంస్తస్యా వాక్య ముత్తరమబ్రవీత్ ||56.06||

స|| హనుమాన్ ప్రశ్రితం తత్ హేతుసంహితం అర్థోపహితం తస్యాః వాక్యం నిశమ్య హనుమాన్ వాక్యం ఉత్తరం అబ్రవీత్ |

||శ్లోకార్థములు||

తత్ హేతుసంహితం అర్థోపహితం -
అప్పుడు అర్థవంతముగా వున్న హేతువులతో కూడి యున్న
ప్రశ్రితం తస్యాః వాక్యం నిశమ్య -
ప్రేమాస్పదమైన ఆమె వాక్యములను విని
హనుమాన్ వాక్యం ఉత్తరం అబ్రవీత్
హనుమంతుడు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు సీతాదేవిచే పలకబడిన అర్థవంతముగా వున్న హేతువులతో కూడి యున్న వచనములను విని హనుమంతుడు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. ||56.06||

|||శ్లోకము 56.07||

క్షిప్రమేష్యతి కాకు‍త్‍స్థో హర్యృక్షప్రవరైర్వృతః |
యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి ||56.07||

స|| కాకుత్‍స్థః హర్యక్షు ప్రవరైః వృతః క్షిప్రం ఏష్యతి | యః యుధి అరీన్ విజిత్య తే శోకమ్ వ్యపనయిష్యతి ||

||శ్లోకార్థములు||

కాకుత్‍స్థః హర్యక్షు ప్రవరైః వృతః -
కాకుత్‍స్థుడు వానర భల్లూక సేనలతో కలిసి
క్షిప్రం ఏష్యతి - త్వరలో వచ్చును
యః యుధి అరీన్ విజిత్య -
యుద్ధములో శత్రువులను జయించి
తే శోకమ్ వ్యపనయిష్యతి -
నీ శోకమును తీర్చును

||శ్లోకతాత్పర్యము||

'అమ్మా! కాకుత్‍స్థుడు వానర భల్లూక సేనలతో త్వరలో వచ్చును. యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తీర్చును'. ||56.07||

||శ్లోకము 56.08||

ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః |
గమనాయ మతిం కృత్వా వైదేహీం అభ్యవాదయత్ ||56.08||

స|| వైదేహీం ఏవం అశ్వాస్య హనుమాన్ మారుతాత్మజః గమనాయ మతిం కృత్వా వైదేహీం అభ్యవాదయత్ ||

||శ్లోకార్థములు||

వైదేహీం ఏవం అశ్వాస్య -
వైదేహి కి ఈ విధముగా అశ్వాసనము ఇచ్చి
హనుమాన్ మారుతాత్మజః -
మారుతాత్మజుడైన హనుమంతుడు
గమనాయ మతిం కృత్వా -
వెళ్ళుటకు నిశ్చయించుకొని
వైదేహీం అభ్యవాదయత్ -
వైదేహికి నమస్కరించెను

||శ్లోకతాత్పర్యము||

వైదేహి కి ఈ విధముగా అశ్వాసనము ఇచ్చి హనుమంతుడు వెళ్ళుటకు నిశ్చయించుకొని వైదేహికి నమస్కరించెను. ||56.08||

||శ్లోకము 56.09||

తతస్స కపిశార్దూలః స్వామి సందర్శనోత్సుకః |
ఆరురోహ గిరిశ్రేష్ఠం అరిష్ఠం అరిమర్దనః ||56.09||

స|| తతః కపిశార్దూలః స్వామిసందర్శనోత్సుకః అరిష్ఠం గిరిశ్రేష్ఠం అరిమర్దనః ఆరురోహ ||

||శ్లోకార్థములు||

తతః కపిశార్దూలః అరిమర్దనః-
అప్పుడు ఆ శత్రువులను సంహరించు కపిశార్దూలుడు
స్వామిసందర్శనోత్సుకః -
స్వామి సందర్శనోత్సాహముతో
అరిష్ఠం గిరిశ్రేష్ఠం ఆరురోహ -
గిరులలో శ్రేష్టుడైన అరిష్ఠ పర్వతమును ఎక్కెను

||శ్లోకతాత్పర్యము||

'అప్పుడు ఆ కపిశార్దూలుడు స్వామి సందర్శనోత్సాహముతో గిరులలో శ్రేష్టుడైన అరిష్ఠ పర్వతమును ఎక్కెను. ||56.09||

||శ్లోకము 56.10||

తుంగపద్మకజుష్టాభిః నీలాభిర్వనరాజిభిః |
సోత్తరీయమివాంభోదైః శృంగాంతరవిలమ్బిభిః ||56.10||

స|| తుంగపద్మకజుష్టాభిః నీలాభిః వనరాజిభిః శృంగాంతర విలమ్బిభిః అంబోధైః స ఉత్తరీయం ఇవ (అస్తి)||

||శ్లోకార్థములు||

తుంగపద్మకజుష్టాభిః -
ఎత్తైన పద్మక వృక్షములున్న
నీలాభిః వనరాజిభిః -
నల్లని వనములతో కూడిన (పర్వతము)
శృంగాంతర విలమ్బిభిః అంబోధైః -
శిఖరాలమధ్య లో వ్యాపించిన మేఘములతో
స ఉత్తరీయం ఇవ (అస్తి)-
అవి ఉత్తరీయము వలె ( ధరించినదా అన్నట్లు వున్నది)

||శ్లోకతాత్పర్యము||

ఎత్తైన పద్మక వృక్షములున్న, నల్లని వనములతో కూడిన ఆ పర్వతము, శిఖరాలమధ్య వ్యాపించిన మేఘములతో ఉత్తరీయము ధరించినదా అన్నట్లు ఉండెను. ||56.10||

గౌరవించతగిన వారిని గౌరవించడానికి, భుజము మీద ఉత్తరీయము వేసుకొని ఎదురు వెళ్ళదము ఒక ఆనవాయితీ. అదే భావనను ప్రకటిస్తూ ఆ పర్వతము శిఖరాలమధ్య వ్యాపించిన మేఘములతో ఉత్తరీయము ధరించినదా అన్నట్లు వుందిట.

||శ్లోకము 56.11||

బోధ్యమానమివ ప్రీత్యా దివాకరకరైః శుభైః |
ఉన్మిషన్తమివోద్దూతైః లోచనైరివ ధాతుభిః ||56.11||

స|| శుభైః దివాకరకరైః ప్రీత్యా బోధ్యమానం ఇవ (అస్తి) ఉద్ధూతైః లోచనైరివ ధాతుభీ ఉన్మిషన్తం ఇవ ||

||శ్లోకార్థములు||

శుభైః దివాకరకరైః-
శుభకరమైన దివాకర కిరణములు
ప్రీత్యా బోధ్యమానం ఇవ -
ప్రేమాస్పదముగా మేల్కొలపగా
ఉద్ధూతైః లోచనైరివ ధాతుభిః -
పైకి లేచిన కన్నులవలెనున్నధాతువులతో
ఉన్మిషన్తం ఇవ -
కన్నులు తెఱిచి చూచుచున్నదా అన్నట్లు

||శ్లోకతాత్పర్యము||

శుభకరమైన దివాకర కిరణములు ప్రేమాస్పదముగా మేల్కొలపగా, పైకిలేచిన గైరికాది ధాతువులు మెరుస్తూ ఆ పర్వతపు కన్నులవలె నున్నవి. ||56.11||

||శ్లోకము 56.12||

తోయౌఘనిస్స్వనైర్మంద్రైః ప్రాధీత మివ పర్వతమ్ |
ప్రగీతమివ విస్పష్టైః ర్నానాప్రస్రవణస్వనైః ||56.12||

స|| మన్ద్రైః తోయౌఘనిశ్వనైః ప్రాధీతం ఇవ విస్పష్టైః నానాప్రస్రవణ స్వనైః ప్రగీతం ఇవ పర్వతమ్ ||

గోవిన్దరాజ టీకాలో - తోయౌఘనిశ్వనైః గిరినదీఘోషైః ।మన్ద్రైః గంభీరైః। ప్రశ్రవణస్వనైః ప్రవత మూలాత్ బహిః ప్రవహన్తి జలాని ప్రస్రవణాని తేషాం స్వనైః ।

||శ్లోకార్థములు||

తోయౌఘనిశ్వనైః -
శిలలపై పారుతున్న జలప్రవాహ ధ్వనులతో
పర్వతమ్ - పర్వతము
విస్పష్టైః మన్ద్రైః ప్రాధీతం ఇవ -
స్పష్ఠముగా గంభీరముగా చదవబడుతున్న మంత్రములవలె
నానాప్రస్రవణ స్వనైః ప్రగీతం ఇవ -
గలగలపారే సెలయేళ్ళ ధ్వనులు పాడుచున్నవా అన్నట్లు

||శ్లోకతాత్పర్యము||

శిలలపై పారుతున్న జలప్రవాహ ధ్వనులతో పర్వతము స్పష్టముగా గంభీరముగా మంత్రములు చదువుతున్నవా అన్నట్లు, అనేకరకములైన ధ్వనులతో పాడుచున్నవా అన్నట్లు వుండెను. ||56.12||

||శ్లోకము 56.13||

దేవదారుభిరత్యుచ్చైః ఊర్ధ్వబాహుమివ స్థితమ్ |
ప్రపాత జలనిర్ఘోషైః ప్రాకృష్ట మివ సర్వతః ||56.13||

స|| అత్యుచ్చైః దేవదారుభిః ఊర్ధ్వబాహుం ఇవ స్థితం | ప్రపాత జలనిర్ఘోషైః సర్వతః ప్రాకృష్టం ఇవ |

||శ్లోకార్థములు||

అత్యుచ్చైః దేవదారుభిః -
ఆ పొడుగాటి దేవదారువు వృక్షములు
ఊర్ధ్వబాహుం ఇవ స్థితం -
పైకెత్తిన బాహువులతో నుంచిని వున్నట్లు
ప్రపాత జలనిర్ఘోషైః -
పారుచున్న జలపాతములతో
సర్వతః ప్రాకృష్టం ఇవ -
అంతటా వ్యాపించివున్నధ్వనులవలె

||శ్లోకతాత్పర్యము||

ఆ పొడుగాటి దేవదారువు వృక్షములు పైకెత్తిన బాహువులవలెను, శిఖరములలో పైనుంచి పడుచున్నజలపాతముల ధ్వనులు గొంతెట్టి అరుస్తున్నవా అన్నట్లు ఉన్నాయి. ||56.13||

||శ్లోకము 56.14||

వేపమాన మివ శ్యామైః కంపమానైః శరద్ఘనైః |
వేణుభిర్మారుతోద్దూతైః కూజన్తమివ కీచకైః ||56.14||

స|| శ్యామైః కంపమానైః శరద్ఘనైః వేపమానం ఇవ| వేణుభిః కీచకైః మారుతోద్ధూతైఃకీచకైః కూజంతం ఇవ ( అస్తి) ||

||శ్లోకార్థములు||

శ్యామైః శరద్ఘనైః కంపమానైః -
కంపించుచున్న నల్లని శరత్కాల మేఘములు
వేపమానం ఇవ -
(పర్వతమును) కదపు తున్నవా అన్నట్లు
వేణుభిః కీచకైః మారుతోద్ధూతైః -
గాలితో కొట్టబడిన వెదురు చేట్లు
కీచకైః కూజంతం ఇవ -
(పర్వతము) వేణువు ఊదుచున్నట్లు

||శ్లోకతాత్పర్యము||

నల్లని శరత్కాల మేఘములు ఆ పర్వతమును కదుపుచున్నవా అన్నట్లు ఉన్నాయి. గాలితో కొట్టబడిన వెదురు చెట్లధ్వనులు పర్వతము వేణువు ఊదుచున్నట్లు ఉంది. ||56.14||

||శ్లోకము 56.15||

నిశ్స్వసన్తమివామర్షాత్ ఘోరైరాశీవిషోత్తమైః |
నీహారకృతగంభీరైః ధ్యాయన్తమివ గహ్వరైః ||56.15||

స|| ఘోరైః ఆశీవిషోత్తమైః నిఃశ్వశంతం ఇవ| నీహారకృత గంభీరైః గహ్వరైః ధ్యాయన్తం ఇవ ||

||శ్లోకార్థములు||

ఘోరైః ఆశీవిషోత్తమైః -
ఘోర సర్పముల బుసలచేత
నిఃశ్వశంతం ఇవ -
(పర్వతము) నిట్టూర్పులు విడుచుచున్నదా అన్నట్లు
నీహారకృత గంభీరైః గహ్వరైః-
దట్టమైన మంచుపొగతో కప్పబడిన గుహలతో
ధ్యాయన్తం ఇవ -
( ఆ పర్వతము) ధ్యానములో వున్నదా అన్నట్లు

||శ్లోకతాత్పర్యము||

పర్వతము మీద ఘోర సర్పముల బుసలు, పర్వతము నిట్టూర్పులు విడుచుచున్నదా అన్నట్లు ఉన్నవి. ||56.15||

||శ్లోకము 56.16||

మేఘపాదనిభైః పాదైః ప్రకాన్తమివ సర్వతః |
జృంభమాన మివాకాశే శిఖరైరభ్రమాలిభిః ||56.16||

స|| మేఘపాదనిభైః పాదైః సర్వతః ప్రకాన్తమివ అభ్రమాలిభిః శిఖరైః ఆకాశే జృంభమాణం ఇవ ||

గొవిన్దరాజ టీకాలో- ప్రకాన్తమివ గన్తుం ఉద్యుక్తమివ । జృంభమాణమివ గాత్ర భఙ్గం కుర్వాణమివ।అభ్రమాలిభిః మేఘమాలావద్భిః ।

||శ్లోకార్థములు||

మేఘపాదనిభైః పాదైః -
మేఘములయొక్క పాదములవలె నున్న పాదములతో
సర్వతః ప్రకాన్తమివ -
అంతటా నడుచుచున్నదా అన్నట్లు
అభ్రమాలిభిః శిఖరైః -
మేఘమాలల వలె నున్న శిఖరములతో
ఆకాశే జృంభమాణం ఇవ -
ఆకాశమే గొంతుక సవరించుకుంటున్నదా అన్నట్లు

||శ్లోకతాత్పర్యము||

పాదపర్వతములు పర్వతము మీద సంచరించే మేఘముల పాదాలమల్లే ఉండడముతో, ఆ పర్వతమే నడుచుచున్నదా అన్నట్లు, మేఘమాలల వలె నున్న శిఖరములతో ఆకాశమే గొంతుక సవరించుకుంటున్నదా అన్నట్లు ఉండెను. ||56.16||

||శ్లోకము 56.17||

కూటైశ్చ బహుధా కీర్ణైః శోభితం బహుకన్దరైః |
సాలతాలాశ్వకర్ణైశ్చ వంశైశ్చ బహుభిర్వృతమ్ ||56.17||

స|| బహుధా కీర్ణైః బహుకందరైః కూటైశ్చ శోభితం | బహుభిః సాలతాలాశ్వకర్ణైశ్ఛ వంశైశ్చ వ్తతం ||

గోవిన్దరాజ టీకాలో - బహుధాకీర్ణైః హనుమత్ పాద స్పర్శేన శిథిలైః ఇత్యర్థః |

||శ్లోకార్థములు||

బహుధా కీర్ణైః కూటైశ్చ బహుకందరైః -
అనేక శిఖరములతో అక్కడక్కడ వున్న గుహలతో
శోభితం - శోభించుచున్న
వృత్తం - నిండియుండెను
బహుభిః సాలతాలాశ్వకర్ణైశ్ఛ -
సాల తాళ అశ్వకర్ణ వృక్షములతో
వంశైశ్చ - వెదురు చెట్లతో

||శ్లోకతాత్పర్యము||

ఆ పర్వతము అనేక శిఖరములతో అక్కడక్కడ వున్న గుహలతో శోభించుచుండెను. సాల తాళ వృక్షములతో దట్టముగా నిండి యుండెను'. ||56.17||

||శ్లోకము 56.18||

లతావితానైర్వితతైః పుష్పవద్భిరలంకృతమ్ |
నానామృగ గణాకీర్ణం ధాతునిష్యన్దభూషితమ్ ||56.18||

స|| వితతైః పుష్పవద్భిః లతావితానైః అలంకృతం నానామృగగణాకీర్ణం ధాతునిష్యందభూషితమ్ ||

||శ్లోకార్థములు||

వితతైః పుష్పవద్భిః లతావితానైః -
విరబూసిన పుష్పములతో వున్న లతలచేత
అలంకృతం - అలంకరింపబడిన
నానామృగగణాకీర్ణం -
అనేకరకముల జంతు సమూహములతో
ధాతునిష్యందభూషితమ్ -
ధాతుస్రవాలతో అలంకృతమైవున్న

||శ్లోకతాత్పర్యము||

ఆ పర్వతరాజము విరబూసిన పుష్పములు కల లతలతో, అనేకరకముల జంతు సమూహములతో, ధాతుస్రవాలతో అలంకృతమై శోభించుచుండెను. ||56.18||

||శ్లోకము 56.19||

బహుప్రస్రవణోపేతం శిలాసంచయసంకటమ్ |
మహర్షియక్షగంధర్వ కిన్నరోరుగసేవితమ్ ||56.19||

స|| బహుప్రశ్రవణోపేతం శిలాసంచయసంకటం మహర్షి యక్ష గంధర్వ కిన్నరః ఉరుగః సేవితమ్ ||

||శ్లోకార్థములు||

బహుప్రశ్రవణోపేతం -
అనేక సెలయేళ్ళు ప్రవహిస్తూ
శిలాసంచయసంకటం -
సంచారానికి ఆటంకము కలిగించు శిలల గుట్టలతో వున్న
మహర్షి యక్ష గంధర్వ-
మహర్షులు, యక్షులు, గంధర్వులు,
కిన్నరః ఉరుగః సేవితమ్ -
కిన్నరులు, ఉరగములతో సేవింపబడుచున్న

||శ్లోకతాత్పర్యము||

అనేక సెలయేళ్ళు ప్రవహిస్తూ సంచారానికి ఆటంకము కలిగించు శిలల గుట్టలతో వున్న ఆ పర్వతము, మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఉరగములతో సేవింపబడుచుండెను. ||56.19||

||శ్లోకము 56.20||

లతాపాదసంఘాతం సింహాధ్యుషితకన్దరమ్ |
వ్యాఘ్రసంఘసమాకీర్ణం స్వాదుమూలఫలద్రుమమ్ ||56.20||

స|| లతాపాదపసంఘాతం సింహాధ్యుషితకన్దరమ్ వ్యాఘ్ర సంఘ సమాకీర్ణం స్వాదుమూలఫలాద్రుమమ్ ||

||శ్లోకార్థములు||

లతాపాదపసంఘాతం -
అనేక లతల వృక్షముల సముదాయముతో
సింహాధ్యుషితకన్దరమ్ -
సింహములు ఆవాసముగా చేసుకొన్నగుహలతో
వ్యాఘ్ర సంఘ సమాకీర్ణం-
వ్యాఘ్రముల సముదాయముతో
స్వాదుమూలఫలాద్రుమమ్ -
మధురమైన ఫలములతో నిండిన వృక్షములతో

||శ్లోకతాత్పర్యము||

అనేక లతల వృక్షముల సముదాయముతో అలంకరింపబడిన ఆపర్వతపు గుహలను, సింహములు ఆవాసముగా చేసుకొన్నాయి. పర్వతము మీద వ్యాఘ్రముల సముదాయము సంచరిస్తున్నాయి. ఆ పర్వతము మధురమైన ఫలములతో నిండిన వృక్షములతో నిండియున్నది. ||56.20||

||శ్లోకము 56.21||

తం ఆరురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజః |
రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణాభిచోదితః ||56.21||

స|| పవనాత్మజః హనుమాన్ రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణ అభిచోదితః తం పర్వతం ఆరురోహ ||

||శ్లోకార్థములు||

పవనాత్మజః హనుమాన్ -
పవనాత్మజుడైన హనుమంతుడు
రామదర్శన శీఘ్రేణ -
శీఘ్రముగా రామదర్శనమునకై ఆతురతో
ప్రహర్షేణ అభిచోదితః -
రామదర్శనము అన్న సంతోషముతో
తం పర్వతం ఆరురోహ-
ఆ పర్వతము ఎక్కెను

||శ్లోకతాత్పర్యము||

పవనాత్మజుడైన హనుమంతుడు శీఘ్రముగా రామదర్శనమునకై ఆతురతో, రామదర్శనము అన్న సంతోషముతో, ఆ పర్వతము ఎక్కెను. ||56.21||

సుందరకాండలో వర్ణనలు అతి సుందరము. ఇక్కడ అరిష్ట పర్వతము వర్ణన ఆ వర్ణనలలో ఒక భాగము. ఇక్కడ అరిష్ట పర్వతముయొక్క వర్ణన ఒక సారి మననము చేద్దాము.

అరిష్ట పర్వతము ఎత్తైన పద్మక వృక్షములతో, నల్లని వనములతో కూడినది. ఆ పర్వతము, శిఖరాలమధ్య వ్యాపించిన మేఘములతో ఉత్తరీయము ధరించినదా అన్నట్లు ఉండెను. శుభకరమైన దివాకర కిరణములు ప్రేమాస్పదముగా మేల్కొలపగా, పైకిలేచిన గైరికాది ధాతువులు మెరుస్తూ ఆ పర్వతపు కన్నులవలె నున్నవి. ఆ పర్వతపు శిలలపై పారుతున్న జలప్రవాహ ధ్వనులు పర్వతము మంత్రములు చదువుతున్నవా అన్నట్లు వినపడుచున్నవి. ఆ పొడుగాటి దేవదారువు వృక్షములు పైకెత్తిన బాహువులలాను ,శిఖరములలో పైనుంచి పడుచున్నజలపాతముల ధ్వనులు, గొంతెట్టి అరుస్తున్నవా అన్నట్లు ఉన్నాయి. నల్లని శరత్కాల మేఘములు ఆ పర్వతమును కదుపుచున్నవా అన్నట్లు ఉన్నాయి. గాలితో కొట్టబడిన వెదురు చెట్లధ్వనులు, పర్వతము వేణువు ఊదుచున్నట్లు ఉంది. పర్వతము మీద ఘోర సర్పముల బుసలు, పర్వతము నిట్టూర్పులు విడుచుచున్నదా అన్నట్లు ఉన్నవి. పాదపర్వతములు పర్వతము మీద సంచరించే మేఘముల పాదాలమల్లే ఉండడముతో, ఆ పర్వతమే నడుచుచున్నదా అన్నట్లు ఉండెను. ఆ పర్వతము అనేక శిఖరములతో గుహలతో శోభించుచుండెను. ఆ పర్వతము సాల తాళ వృక్షములతో దట్టముగా నిండి యుండెను. ఆ పర్వతరాజము విరబూసిన పుష్పములు కల లతలతో, అనేకరకముల జంతు సమూహములతో, ధాతుస్రవాలతో అలంకృతమై శోభించుచుండెను. అనేక సెలయేళ్ళు ప్రవహిస్తూ సంచారానికి ఆటంకము కలిగించు శిలల గుట్టలతో వున్న ఆ పర్వతము, మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఉరగములతో సేవింపబడుచుండెను. అనేక లతల వృక్షముల సముదాయముతో అలంకరింపబడిన ఆపర్వతపు గుహలను, సింహములు ఆవాసముగా చేసుకొన్నాయి. పర్వతము మీద వ్యాఘ్రముల సముదాయము సంచరిస్తున్నాయి. ఆ పర్వతము మధురమైన ఫలములతో నిండిన వృక్షములతో నిండియున్నది

పవనాత్మజుడైన హనుమంతుడు శీఘ్రముగా రామదర్శనమునకై ఆతురతో, రామదర్శనము అన్న సంతోషముతో, ఆ అరిష్ట పర్వతము ఎక్కుతాడు.

||శ్లోకము 56.22||

తేన పాదతలాక్రాన్తా రమ్యేషు గిరిసానుషు|
సఘోషాః సమసీర్యన్త శిలాః చూర్ణీకృతాస్తతః||56.22||

స|| తతః రమ్యేషు గిరిసానుషు తేన పాదతలాక్రాంతాః శిలాః సుఘోషాః చూర్ణీకృతాః సమసీర్యన్త ||

||శ్లోకార్థములు||

తతః రమ్యేషు గిరిసానుషు -
అప్పుడు ఆ సుందరమైన పర్వతపు సానువులందు
తేన పాదతలాక్రాంతాః శిలాః -
హనుమంతుని పాదముల కింద నలిగిన శిలలు
సుఘోషాః చూర్ణీకృతాః సమసీర్యన్త-
పెద్ద ధ్వనులతో చూర్ణమై జారిపోయినవి'

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు ఆ సుందరమైన పర్వతపు సానువులందు ఉన్న శిలలు హనుమంతుని పాదముల కింద నలిగి పెద్ద చప్పుళ్ళతో చూర్ణమైపోయాయి. ||56.22||

||శ్లోకము 56.23||

స తం ఆరుహ్య శైలేంద్రం వ్యవర్థత మహాకపిః |
దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంభసః ||56.23||

స|| సః మహాకపిః లవణాంభసః దక్షిణాత్ ఉత్తరం పారం ప్రార్థయన్ తం శైలేంద్రం ఆరుహ్య వ్యవర్ధత ||

||శ్లోకార్థములు||

సః మహాకపిః - ఆ మహాకపి
లవణాంభసః దక్షిణాత్ ఉత్తరం పారం ప్రార్థయన్ -
సముద్రపు దక్షిణతీరమునుండి ఉత్తరతీరము చేరగోరి
తం శైలేంద్రం ఆరుహ్య - ఆ పర్వత శిఖరము ఎక్కి
వ్యవర్ధత - శరీరప్రమాణమును మరింత పెంచెను

||శ్లోకతాత్పర్యము||

ఆ మహాకపి ఆ సముద్రపు దక్షిణతీరమునుండి ఉత్తరతీరము చేరగోరి ఆ పర్వత శిఖరము ఎక్కి తన శరీరప్రమాణమును మరింత పెంచెను. ||56.23||

||శ్లోకము 56.24||

అధిరుహ్య తతో వీరః పర్వతం పవనాత్మజః |
దదర్శ సాగరం భీమం మీనోరగనిషేవితమ్ ||56.24||

స|| తతః వీరం పవనాత్మజః పర్వత్ం అధిరుహ్య మీనోరుగనిషేవితం భీమం సాగరం దదర్శ ||

||శ్లోకార్థములు||

తతః వీరం పవనాత్మజః -
అప్పుడు ఆ హనుమంతుడు
పర్వతం అధిరుహ్య -
పర్వత శిఖరము అధిరోహించి
మీనోరుగనిషేవితం -
మీనములతో సర్పములతో నిండియున్న
భీమం సాగరం దదర్శ-
భయము కొలుపుతున్న సముద్రమును చూచెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు ఆ హనుమంతుడు ఆ పర్వత శిఖరముపై నిలబడి మీనములతో సర్పములతో నిండియున్న భయము కొలుపుతున్న సముద్రమును చూచెను. ||56.24||

||శ్లోకము 56.25||

స మారుత ఇవాఽకాశం మారుతస్యాsత్మసంభవః |
ప్రపేదే హరిశార్దూలో దక్షిణాదుత్తరం దిశమ్ ||56.25||

స|| మారుతస్య ఆత్మసంభవః సా హరిశార్దూలః దక్షిణాత్ ఉత్తరం దిశం మారుతః ఇవ ఆకాశం ప్రపేదే ||

||శ్లోకార్థములు||

మారుతస్య ఆత్మసంభవః -
మారుతియొక్క తనయుడు
సా హరిశార్దూలః - ఆ వానరశ్రేష్ఠుడు
దక్షిణాత్ ఉత్తరం దిశం -
దక్షిణ దిశనుంచి ఉత్తరదిశగా
మారుతః ఇవ ఆకాశం ప్రపేదే -
వాయువేగముతో ఆకాశము లోకి ఎగిరెను

||శ్లోకతాత్పర్యము||

వాయుపుత్రుడు వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు దక్షిణ దిశనుంచి ఉత్తరదిశగా పయనించుటకు వాయువేగముతో ఆకాశము లోకి ఎగిరెను. ||56.25||

||శ్లోకము 56.26||

స తదా పీడితస్తేన కపినా పర్వతోత్తమః |
రరాస సహ తైర్భూతైః ప్రవిశన్ వసుధాతలమ్ ||56.26||
కమ్పమానైశ్చ శిఖరైః పతద్భిరపి చ ద్రుమైః |

స|| స తదా తేన కపినా పీడితః సః పర్వతోత్తమః భూతైః సహ వసుధాతలం ప్రవిశన్ కంపమానైః శిఖరైః పతత్భిః ద్రుమైః రరాస ||

||శ్లోకార్థములు||

స తదా తేన కపినా పీడితః -
ఆ పర్వతము అప్పుడు వానరునిచేత పైకి ఎగిరినప్పుడు ఏర్పడిన ఒత్తిడితో పీడింపబడి
సః పర్వతోత్తమః భూతైః సహ -
ఆ పర్వతోత్తమము సమస్త ప్రాణులతో
వసుధాతలం ప్రవిశన్ -
భూమిలోకి క్రుంగి పోసాగెను
కంపమానైః శిఖరైః -
కంపించుచున్న శిఖరములతో
పతత్భిః ద్రుమైః రరాస -
పడిపోయిన చెట్లతోధ్వనించెను

||శ్లోకతాత్పర్యము||

హనుమంతుడు పైకి ఎగిరినప్పుడు ఏర్పడిన ఒత్తిడికి ఆ పర్వతము అక్కడి ప్రాణులతో సహా భూమిలోకి క్రుంగి పోసాగెను. అప్పుడు పర్వత శిఖరాలు అన్నీ కంపించడముతో పడిపోయిన వృక్షములతో ధ్వనించెను. ||56.26||

ఆన్ని వేళ్ళతో సహా నేలకూలిపోడముతో, అందుండి బ్రహ్మాండమైన ధ్వని వెలువడినది అన్న మాట

||శ్లోకము 56.27||

తస్యోరు వేగోన్మథితాః పాదపాః పుష్పశాలినః ||56.27||
నిపేతుర్భూతలే రుగ్ణాః శక్రాయుధ హతా ఇవ |

స|| తస్య ఉరువేగాత్ మథితాః పుష్పశాలినః పాదపాః రుగ్ణాః శక్రాయుధహతా ఇవ భూతలే నిపేతుః ||

||శ్లోకార్థములు||

తస్య ఉరువేగాత్ మథితాః -
అతని ఊరువుల వేగధాటికి కోట్టబడి
పుష్పశాలినః పాదపాః -
విరబూసిన పువ్వులతో వున్న వృక్షములు
రుగ్ణాః శక్రాయుధహతా ఇవ -
ఇంద్రుని ఆయుధముతో కొట్టబడినట్లు
భూతలే నిపేతుః -
భూమిపై పడిపోయాయి.

||శ్లోకతాత్పర్యము||

అతని ఊరువుల వేగధాటికి, విరబూసిన పువ్వులతో వున్న వృక్షములన్నీ ఇంద్రుని ఆయుధముతో కొట్టబడినట్లు భూమిపై పడిపోయాయి. ||56.27||

||శ్లోకము 56.28||

కన్దరాన్తరసంస్థానం పీడితానాం మహౌజసామ్ ||56.28||
సింహానాం నినదో భీమో నభో భిన్దన్ స శుశ్రువే |

స|| కన్దరాన్తర సంస్థానమ్ పీడితానాం మహౌజసాం సింహానాం భీమః సః నినాదః నభః భిన్దన్ శుశ్రువే ||

||శ్లోకార్థములు||

కన్దరాన్తర సంస్థానమ్ -
గుహలలో ఉండి
పీడితానాం మహౌజసాం -
చిక్కుపడిపోయిన మహాశక్తిమంతమైన
సింహానాం భీమః నినాదః-
సింహముల భయంకర నినాదములతో
సః నభః భిన్దన్ శుశ్రువే -
ఆ ఆకాశము దద్దరిల్లిపోయెను

||శ్లోకతాత్పర్యము||

గుహలలో ఉండి చిక్కుపడిపోయిన మహాశక్తిమంతమైన సింహముల నినాదముతో ఆకాశము మిన్ను ముట్టినది. ||56.28||

||శ్లోకము 56.29||

స్రస్తావ్యావృత్త వసనా వ్యాకులీకృతభూషణాః ||56.29||
విద్యాధర్యః సముత్పేతుః సహసా ధరణీ ధరాత్ |

స|| విధ్యాధర్యః త్రస్తవ్యావృతవసనా వ్యాకులీకృత భూషణాః సహసా ధరణీ ధరాత్ సముత్పేతుః ||

||శ్లోకార్థములు||

విధ్యాధర్యః త్రస్తవ్యావృతవసనా -
విద్యాధరులు భయపడినవారై పక్కకి జారిన వస్త్రములతో,
వ్యాకులీకృత భూషణాః -
అస్తవ్యస్తమౌతున్న ఆభరణాలతో
సహసా ధరణీ ధరాత్ -
వెంటనే భూమి నుంచి ఆకాశమునకి
సముత్పేతుః - ఎగిరిరి

||శ్లోకతాత్పర్యము||

విద్యాధరులు భయపడినవారై పక్కకి జారిన వస్త్రములతో, అస్తవ్యస్తమౌతున్న ఆభరణాలతో, భూమి నుంచి ఆకాశమునకి వెంటనే కంగారుగా ఎగిరిరి. ||56.29||

||శ్లోకము 56.30||

అతిప్రమాణా బలినో దీప్తజిహ్వా మహావిషాః ||56.30||
నిపీడిత శిరోగ్రీవా వ్యచేష్టన్త మహాహయః |

స|| అతిప్రమాణః బలినః దీప్తజిహ్వాః మహావిషాః మహాహయః నిపీడితశిరోగ్రీవాః వ్యచేష్టన్త ||

||శ్లోకార్థములు||

అతిప్రమాణః బలినః-
అతిపెద్ద శక్తిమంతమైన
మహాహయః - మహా సర్పములు
దీప్తజిహ్వాః మహావిషాః -
మండుచున్ననాలికలతో మహావిషములతో
నిపీడితశిరోగ్రీవాః వ్యచేష్టన్త -
మెడలమీద తలమీద నొక్కబడి చుట్టలు చుట్టుకు పోసాగాయి

||శ్లోకతాత్పర్యము||

పెద్ద బలమైన పాములు అ వత్తిడికి నలిగి పోయి మహా విషములను విరజిమ్ముతూ చుట్టలు చుట్టుకోసాగాయి. ||56.30||

||శ్లోకము 56.31||

కిన్నరోరగ గంధర్వయక్షవిద్యాధరస్తదా ||56.31||
పీడితం తం నగరం త్యక్త్వా గగనమాస్థితాః |

స|| తదా కిన్నరోరగ గంధర్వయక్షవిద్యాధరః పీడితం తం నగవరమ్ త్యక్త్వా గగనం ఆస్థితాః ||

||శ్లోకార్థములు||

తదా కిన్నరోరగ గంధర్వయక్షవిద్యాధరః-
అప్పుడు కిన్నర ఉరగ గంధర్వ యక్షులతో కలిసి విద్యాధరులు
పీడితం తం నగవరమ్ త్యక్త్వా -
పీడింపబడుతున్న ఆ పర్వతమును వదిలి
గగనం ఆస్థితాః -
ఆకాశములోకి ఎగిరిరి

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు కిన్నర ఉరగ గంధర్వ యక్షులతో కలిసి విద్యాధరులు ఆ హనుమంతుని వత్తిడి చే పీడింపబడుతున్న ఆ పర్వతమును వదిలి ఆకాశములోకి ఎగిరిరి. ||56.31||

||శ్లోకము 56.32||

స చ భూమిధరః శ్రీమాన్ బలినా తేన పీడితః ||56.32||
స వృక్షశిఖరోదగ్రః ప్రవివేశ రసాతలమ్ |

స|| బలినా తేన పీడితః సవృక్షశిఖరోదగ్రః శ్రీమాన్ సః భూమిధరశ్చ రసాతలం ప్రవివేశ |

||శ్లోకార్థములు||

బలినా తేన పీడితః -
ఆ బలవంతునిచే నొక్కబడి
సవృక్షశిఖరోదగ్రః శ్రీమాన్ సః -
వృక్షములతో నున్న శిఖరాగ్రములు
భూమిధరశ్చ రసాతలం ప్రవివేశ -
భూమిలో ఒరిగి పాతాళంలోకి కుంగి పోసాగినవి.

||శ్లోకతాత్పర్యము||

ఆ బలవంతునిచే నొక్కబడి వృక్షములతో నున్న శిఖరాగ్రములు భూమిలో ఒరిగి పాతాళంలోకి కుంగి పోసాగినవి. ||56.32||

||శ్లోకము 56.33||

దశయోజనవిస్తారః త్రింశద్యోజనముచ్ఛ్రితః ||56.33||
ధరణ్యామ్ సమతాం యాతః స బభూవ ధరాధరః |

స|| దశయోజనవిస్తారః త్రింశత్ యోజనం ఉచ్ఛ్రితం ధరాధరః ధరణ్యాం సమతాం యాతః బభూవ ||

||శ్లోకార్థములు||

దశయోజనవిస్తారః -
పదియోజనముల విస్తారము కల
త్రింశత్ యోజనం ఉచ్ఛ్రితం -
ముప్పది యోజనముల ఎత్తుగల
ధరాధరః ధరణ్యాం -
పర్వతము భూమితో
సమతాం యాతః బభూవ -
సమతలమైనదిగా అయ్యెను

||శ్లోకతాత్పర్యము||

పదియోజనముల విస్తారము కల ముప్పది యోజనముల ఎత్తుగల ఆ పర్వతము పూర్తిగా నేలమట్టమయినది. ||56.33||

||శ్లోకము 56.34||

స లిలింగ యిషుర్భీమం సలీలం లవణార్ణవమ్ |
కల్లోలాస్ఫాల వేలాన్త ముత్పపాత నభో హరిః ||56.34||

స|| స హరిః భీమం కల్లోలాస్ఫాలవేలాం తం లవణార్ణవమ్ సలీలం లిలింఘయిషుః నభః ఉత్పపాత ||

||శ్లోకార్థములు||

స హరిః - ఆ వానరుడు
భీమం కల్లోలాస్ఫాలవేలాం -
భయంకరమైన కల్లోలమైన తరంగాలతోవున్న
తం లవణార్ణవమ్ ఆ సముద్రమును
సలీలం లిలింఘయిషుః -
అవలీలగా దాటుటకు
నభః ఉత్పపాత -
ఆకాశములోకి ఎగిరెను

||శ్లోకతాత్పర్యము||

ఆ వానరుడు కల్లోలమైన తరంగాలతోవున్న ఆ సముద్రమును అవలీలగా దాటగోరి అకాశములోకి ఎగిరెను. ||56.34||

అంటే హనుమంతుడు తిరుగు ప్రయాణము పట్టాడన్నమాట.

'తతో రావణ నీతాయాః " అంటూ రావణునిచే అపహరింపబడిన సీతమ్మను అన్వేషించడానికి, 'చారణా చరితే పథి'- దక్షిణ దిశలో చారణులు వెళ్ళిన మార్గములో వెళ్ళిన హనుమ,'దక్షిణాత్ ఉత్తరం దిశం ప్రపేదే' , దక్షిణము నుంచి ఉత్తరానికి అంటే తిరుగుముఖము పట్టాడన్నమాట.

నిజానికి ఈ తిరుగు ప్రయాణము గురించి ముప్పది ఎనిమిదవ సర్గ నుంచి వింటున్నాము. ముప్పది ఎనిమిదవ సర్గలో సీతమ్మ చూడామణి ఇచ్చిన తరువాత, కవి చెప్పినమాట, హనుమ అది తీసుకొని 'హృదయేన తు గతో రామం' అంటే మనస్సులో రాముని చేరిపోయాడుట. సంతోషమైన మనస్సుతో, 'ప్రతి సంక్రమం ప్రపేదే'- అంటే తిరుగు ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడుట. కాని అప్పుడు సీతమ్మ ప్రశ్నలతో ఆగిపోయాడు.

మళ్ళీ సీతమ్మ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి నలభైయవ సర్గలో 'ఇంకా 'అల్పావశేషం', అంటే కొంచము మిగిలిన కార్యము చూసి పోదాము అనుకుంటూ, 'దిశం హ్యుదీశం మనసా జగామ' అంటే మనస్సులో ఉత్తర దిశ చేరాడుట. కాని శరీరముతో అక్కడే ఉండి పోయాడు.

నలభై ఒకటి సర్గలో కథ కొంచెము మలుపు తిరుగుతుంది. ఒక సారి దండో పాయము ఉపయోగించి ,వెనక్కి వెళ్ళే ముందర శత్రువుల బలము పరిక్షిద్దామనుకున్న హనుమ అశోకవనము ధ్వంసము చేసి, పట్టుకోడానికి వచ్చిన రాక్షసులను హతమార్చి, రాక్షసరాజుని చూచి, లంకాదహనము గావించి, సురక్షితముగా వున్న సీతను చూచి, 'ప్రపేదే హరిశార్దూలః' - అప్పుడు మళ్ళీ ఉత్తరదిశగా బయలుదేరాడన్నమాట.

ఈ సారికూడా, హనుమ బయలుదేరుతున్నాడు అంటే సీతమ్మ కి ప్రశ్నలు మళ్ళీ మనస్సులో మెదలుతూనే ఉంటాయి. తన మనస్సులో ఉన్నమాట మళ్ళీ చెపుతుంది సీతమ్మ.

'కామం అస్య త్వమేవ ఏకః కార్యస్య పరిసాధనే', అంటే 'అసలు ఈ కార్యము సాధించడానికి నీవు ఒక్కడివే చాలు' అని. అయితే ఇంకేముందీ అనుకోవచ్చు, సీతమ్మ మనస్సులో మాట ఇంకోటి. అది రాముడే వచ్చి లంకలో సంకులము కావించి, తనని తీసుకుపోవాలి అని.

ఎందుకు ఆ కోరిక ? తన అంతస్తుకి తగినట్లుగా రాముడే రావాలా ?
కాదు. అది - 'తత్ తస్య సదృశం', అది ఆయనకి తగిన పని అని.

'సీతమ్మ ని రక్షించినది రాముడు', అని రామునికి కీర్తి రావాలి. హనుమంతుడు రక్షించి తీసుకుపొతే, ఆ అసమాన కీర్తి హనుమంతుడికే దక్కుతుంది.

ఈ మాట ముందు కూడా చెప్పినదే. కాని మళ్ళీ మళ్ళీ చెప్పడములో సీతమ్మకి భర్తయొక్క గౌరవవాభిమానముల మీద ఎంత భక్తి ఉందో మనకు తెలుస్తుంది. అదే ప్రతి భార్యకు భర్తమీద వుండవలసిన ఆదరాభిమానములు, అని సుందరకాండ మనకి చెపుతుంది.

అయితే మరి ప్రతి భర్తకి భార్యపై వుండవలసిన ఆదరాభిమానములు ఇక్కడ చెప్పలేదే అని అనిపించవచ్చు. అది ఉత్తరకాండలో రాముడిద్వారా వింటాము.

ఇంకో మాట. చివరి సర్గలో విన్నమాట - 'దగ్ధేయం నగరీ సర్వా'; 'జానకీ న చ దగ్ధేతి' అని. అంటే 'నగరమంతా దగ్ధమైంది కాని జానకి మాత్రము దగ్ధము కాలేదు' అని. దానికి హనుమ ప్రతిపాదించిన కారణాలు విన్నాము. అగ్నినే దహింపగల శక్తి వున్న సీతమ్మని, అగ్ని ఎలా దహించకలదు అన్నది ఒక కారణము. అలాగే ఇంకావున్నాయి కారణాలు.

అయితే ఇక్కడ లంకాదహనములో సీతమ్మ సురక్షితముగా వుండడములో, ఇంకో సంగతి మనకి తెలుస్తుంది.

సీతమ్మ అయోనిజ. అంటే ఆమె పుట్టుకలేనిది.

ఆత్మ కూడా పుట్టుకలేనిది. భగవద్గీతలో వింటాము - 'న జాయతే' - పుట్టుకలేనిది. 'మ్రియతేవా కదాచిత్', మరణించదు, అని కూడా వింటాము . అంటే జనన మరణములు లేనిది. అది ఆత్మ.

మళ్ళీ భగవద్గీత లో వింటాము.'న దహ్యతే దహ్యమానే శరీరే'.
శరీరము దహింపబడినా, ఆత్మ దహింపబడదు అని.

లంకా అనబడు శరీరము దహింపబడినా, ఆత్మ స్వరూపమైన సీతమ్మ దహింపబడకుండా వుండడముతో, శరీరము దహింపబడినా ఆత్మ దహింపబడదు అనే సత్యాన్ని నిరూపిస్తున్నాడు కవి.

సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి అయిననూ ఆత్మగా నటించి, జీవుని స్వరూపమును, ఆ జీవుడు బంధములో నుంచి బయటపడే విధానమును , జీవుడు మోక్షమునకై ప్రయత్నించవలసిన తీరును, మనకి సుండరకాండలో చూపించడమైనది.

హనుమ ఆచార్యుడిగా, మోక్షమందు కోరిక గల జీవుని ( శిష్యుని) అన్వేషించి, భగవంతునికి నివేదించుటకు వెనక్కి బయలుదేరెను అన్నమాట.

ఇక్కడ సాధకుడు కర్మయోగముచే పరిశుద్ధమైన అంతః కరణము కలవాడై, ఆత్మావలోకనము చేసి, విషయములను , ఇంద్రియములను మనస్సునూ బుద్ధినీ కామమునూ జయించి, భగవత్ ప్రాప్తికై అభిముఖుడు అగుట కూడా సుందరకాండలో స్ఫురిస్తుంది.

అంటే 'తతోరావణ నీతాయాః' అంటూ, మనస్సుచేత హరింపబడి
దారి తప్పిన ఆత్మ అన్వేషణకై బయలు దేరిన హనుమ, తన అన్వేషణ పూర్తి చేసికొని, భగవంతునికి నివేదించుటకు ఉత్తర దిశగా బయలుదేరడముతో, ఆచార్యుడిగా హనుమ కార్యక్రమము పూర్తి అయినది అన్నమాట. సుందరకాండలో ఇక ముందు జరిగేది కధా శేషమే.

ఈ మాటతో సుందరకాండలో ఏభై ఆరవ సర్గ సమాప్తము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షట్పంచాశస్సర్గః ||

|| ఓమ్ తత్ సత్||