||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- నలభై ఎనిమిదవ సర్గ||

||'తేజోబలసమాయుక్తం తపంతమివ భాస్కరమ్'!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.

అథ అష్టచత్త్వారింశస్సర్గః||


తత్త్వదీపిక

నలభై ఎనిమిదవ సర్గ

’తేజోబలసమాయుక్తం తపంతమివ భాస్కరమ్’



’తేజోబలసమాయుక్తం’ అంటే తేజస్సు బలముతో కూడి యున్నాడుట.

’తపంతమివ భాస్కరమ్’ అంటే సూర్యుడిలాగా వెలుగుతున్నాడుట.

ఎవరు? 

రావణుడు.

ఇది రావణుని చూస్తున్న హనుమ అనుకున్నమాట.

అంటే ఎలాగైనా రావణుని కలవాలి అనే ఆలోచనతో, 

దండోపాయము ఉపయోగించిన హనుమ,

చివరికి తన లక్ష్యము సాధించి రావణుని సభకు చేరుతాడు.

అది ఎలాజరిగినది అన్నదే ఈ సర్గలో మనము వినే మాట.


హనుమంతునిచేత అక్షకుమారుడు హతమార్చబడగా 

ఆ రాక్షసాధిపతి రావణుడు, అలజడబడిన మనస్సును సమాధానపరచుకొని,

కోపముతో పరాక్రమములో దేవులతో సమానమైన ఇంద్రజిత్తునికి ఈ విధముగా ఆదేశిస్తాడు. 


’నీవు అస్త్రజ్ఞానము తెలిసిన వారిలో వరిష్ఠుడవు. 

సురులకు అసురులకు శోకము ప్రదానము చేయుగలవాడవు. 

ఇంద్రుడు మున్నగు సురలలు సైతము నీ పరాక్రమము చూసిన వారు. 


నీవు బ్రహ్మదేవుని ఆరాధించి అనేక శస్త్రములను సంపాదించినవాడవు. 

నీ అస్త్రబలమును చూచి అసురులు కాని మరుద్గణములు కాని 

సురేశ్వరుడుగాని యుద్ధములో నీ ఎదురుగా నిలబడలేరు. 

నీతో యుద్ధములో కష్టపడని వాడు ముల్లోకములలో లేడు. 


నీవు నీ భుజబలముచే తపోబలముచే రక్షింపబడుతున్నవాడవు. 

దేశకాలానుసారము కార్యసాధనలో నీవే ప్రజ్ఞాశాలివి. 

సమరములో నీకు శక్యముకాని పనిలేదు. 

బుద్ధికౌశల్యములతో నీచేత సాధింపబడని కార్యము లేదు. 

నీ అస్త్రపాటవము బలము గురించి తెలియనివాడు ముల్లోకములలోను లేడు.

 

తపోబలములో  యుద్ధములో పరాక్రమములో రణములో

 శస్త్ర అస్త్ర ప్రయోగ కౌశలములో నీవు నాతో సమానము. 

నీవు నిలబడితే నా మనస్సు నిశ్చయముగా నిశ్చింతగా ఉంటుంది’.

 

అవి రావణుని మాటలు.

 అక్ష కుమారుడు హతమార్చబడడము తో, 

’చకార రక్షోధిపతేర్మహత్ భయమ్’ అని విన్నాము 

అలాగ భయము కలిగించిన హనుమంతుని ఎదురుకొనడానికి 

తపోబలములో  యుద్ధములో పరాక్రమములో రణములో 

శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలములో తనతో సమానమైన, 

తన పుత్రుడగు ఇంద్రజిత్తునే యుద్దానికి పంపడానికి సిద్ధపడ్డాడన్నమాట. 


ఇంద్రజిత్తు గురించి ఉత్తరకాండలో చాలా వింటాము. రాములవారి పట్టాభిషేకము అయినతరువాత , రాములవారిని  అభినందించడానికి వచ్చిన అగస్త్యాది మునులు , రావణుని సంహారమే కాక , రావణ కుమారుడగు ఇంద్రజిత్తుయొక్క సంహారముతో విస్మయాశ్చర్యలతో దేవతలందరూ అత్యంత ఆనందము పొందారు అంటారు. ఆ మాట విని రామలక్ష్మణులు ఆశ్చర్య పోతారు.


 అలా అశ్చర్యపోయిన రామలక్ష్మణులకు, ఆగస్త్యమహాముని,  రావణుని పుత్రుడు  మేఘనాధుడు , ఇంద్రుని ఓడించి బందీ చేసిన వృత్తాంతము,  బందీ చేయబడిన ఇంద్రుని విడిపించుటకు బ్రహ్మ వచ్చి , మేఘనాధునికి కావలసిన వరములిచ్చిన వృత్తాంతము, వరములతో పాటు  ఇంద్రుని జయించినవాడు కనక ఇంద్రజిత్ అనే సార్ధక నామధేయము తో ఇకనుంచి గుర్తింపబడతాడు అని చెప్పి , ఇంద్రుని విడుదల చేయించిన వృత్తాంతము చెపుతాడు.  అప్పటినుంచి బ్రహ్మ ఇచ్చిన వరాల ప్రభావముతో  సురాసురులందరికీ అవధ్యుడుగా,  లోకకంటకుడిగా వున్న ఇంద్రజిత్తు మరణము , రావణుని మరణముకన్న దేవలోకములో అత్యంత ఆనందదాయకమైనది అని చెప్పిన అగస్త్యులవారి మాటతో రామ లక్ష్మణులు ఇంకా ఆశ్చర్య పోతారు. ఇది  ఉత్తరకాండలో వచ్చే కథ. 


రావణుని ఆదేశము ఇంకా విందాము.

 

’ కింకరులు అలాగే జంబుమాలి , అమాత్యపుత్రులు,

 ఇంకా వీరులైన పంచ సేనాగ్రనాయకులు, 

అనేక అశ్వములు ఏనుగుల తో కూడిన బలములు అన్నీహతమార్చబడినవి. 

నీ సహోదరుడు అక్షకుమారుడు కూడా హతమార్చబడెను’. 

’ఓ శత్రు సంహారకా! నీ బలము పై నున్న నమ్మకము నాకు ఇంకెవరి లోనూ లేదు. 


ఓ బుద్ధిమంతుడా ! నీవు ఆ కపి యొక్క మహత్తరమైన బలము ప్రభావము పరాక్రమము, 

నీ యొక్క బలము పరిగణించుకొని,  

నీ బలానుసారముగా పరివర్తించుము. 

అస్త్రవిద్యలలో వరిష్ఠుడా! అక్కడకి వెళ్ళి శత్రుబలము తెలిసికొని 

మనబలములకు నష్టముకాని రీతిలో యుద్ధము ఆరంభింపుము’. 


’ఓ వీరుడా సేనాగణములు అనవసరము. 

వజ్రాయుధము కూడా అతని పై పనిచేయదు. 

అతడు మారుతివేగము కలవాడు. 

అతడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాంటివాడు’. 


ఐదుగురు సేనానాయకులను యుద్ధానికి పంపుతున్నప్పుడు,

వాళ్ళని రథగజతురగసేనాసమూహములతో వెళ్ళమని ఆదేశించిన రావణుడికి, 

ఇప్పుడు ఈ సేన సమూహములు వ్యర్థము అనితెలిసి పోయింది

రావణుడు ఇంద్రజిత్తుకి ఇంకా చెపుతాడు.


’సాధారణమైన పద్దతులు వ్యర్థము. 

నేను చెప్పిన విషయములు బాగుగా ఆలోచించి, 

ఆత్మస్థైర్యముతో ఏమి చేయవలెనో ఆలోచించుకొని, 

దివ్యాస్త్రములను స్మరించి పోరాటమునకు ఉద్యమించుము’.


’నేను నిన్ను పంపుచున్నాను అన్నమాట 

నాకు సముచితముగా కనపడుటలేదు. 

కాని ఇది రాజధర్మము క్షత్రియుల ధర్మము. 

ఓ అరిందమ సంగ్రామములో అనేక శస్త్రముల ఉపయోగించురీతులు 

పూర్తిగా అవగాహనలో ఉండవలెను. 

రణములో విజయమే  కోరతగినది కదా’.


పిమ్మట దక్షుని పుత్రునితో సమానమైన ప్రభావము కలవాడు అగు ఆ ఇంద్రజిత్తు,  

తండ్రి వచనములను విని భయములేని వాడై,

 రణమునకు సిన్నద్ధుడై తండ్రికి ప్రదక్షిణము చేసెను. 


అప్పుడు యుద్ధమునకు తయారైన ఇంద్రజిత్తు 

తనవారిచే పూజింపబడి ఉత్సాహము కలవాడై బయలు దేరెను. 

శ్రీమంతుడు పద్మరేకుల వంటి కళ్ళు గలవాడు 

మహాతేజము గలవాడు రాక్షసాధిపతి పుత్రుడు అగు ఇంద్రజిత్తు 

పర్వ దినములలో ఉండు సముద్రమువలె ఉప్పొంగుతూ యుద్ధమునకు వెడలెను.


గరుత్మంతునితో సమానమైన వేగము కల, వాడి అయిన కోరలుగల,

 నాలుగు వ్యాఘ్రములచేత లాగబడిన రథమును ఇంద్రజిత్తు ఎక్కెను. 


ఆ రథము ఎక్కి ధనస్సు ధరించిన శ్రేష్ఠుడు, శస్త్రవిద్యా పారంగతుడూ, 

అస్త్రవిద్యలు నేర్చిన వారిలో శ్రేష్ఠుడు అగు ఇంద్రజిత్తు,

త్వరగా తన రథములో హనుమంతుడు ఎచట ఉండెనో అచటికి పోయెను.

 

హనుమంతుడు, ఇంద్రజిత్తు రథఘోషలను , 

ధనస్సులాగిన శబ్దములను విని మరింత సంతోషము కలవాడయ్యెను. 

రణములో పండితుడు  అయిన ఇంద్రజిత్తు,

వాడి అయిన శరములను మహత్తరమైన ధనస్సు తీసుకొని 

హనుమంతుని ఎదురుకొనుటకు సిద్ధపడెను. 


ఇంద్రజిత్తు సమరోత్సాహ జనిత సంతోషము కలవాడై, 

ధనస్సు చేతిలో పట్టుకొని రణమునకు వెళ్ళగానే అన్ని దిశలు కలుషమయ్యెను. 

రౌద్రమైన మృగములు వికృతమైన స్వరముతో అరవసాగెను. 

అక్కడ చేరిన నాగులు యక్షులు మహర్షులు సిద్ధులు 

ఆకాశములో అమిత సంతోషముతో గుమిగూడిరి. 

పక్షి సంఘములుగట్టిగా అరవసాగినవి.

 

ఆ వానరుడు రథములో వేగముగా వచ్చుచున్న ఇంద్రజిత్తుని చూచి

 పెద్ద నాదము చేసెను. త్వరగా తన కాయమును పెంచెను. 

ఆ దివ్యమైన రథముపై నున్న ఇంద్రజిత్తు కూడా, 

తన అద్భుతమైన ధనస్సు చేతబట్టి ధనస్సుతో ధనుష్ఠంకారము చేసెను. 


అప్పుడు తీక్ష్ణవేగము కలవారు మహాబలులు అగు 

ఆ వానరుడు మరియు రాక్షసాధిపతి సుతుడు,

 బద్ధవైరులైన ఇంద్రుడు రాక్షసేంద్రులవలె

రణమున పోరాడసాగిరి.

 

అప్రమేయుడు, తనశరీరము పెంచుకొనిన వాడు అయిన హనుమంతుడు 

ఇంద్రజిత్తు ప్రయోగించిన శరపరంపరలను నిర్వీర్యము చేస్తూ,

 తన తండ్రి మార్గమైన ఆకాశములో తిరగసాగెను. 


అప్పుడు శత్రుసంహారకుడు వీరుడు  అగు ఇంద్రజిత్తు

పొడుగుగా వాడి అయిన రెక్కలుగల బంగారముతో చేయబడిన, 

కొంచెము వంగిన అగ్రభాగము కలవి, 

వజ్రపాతము వంటి వేగము కలవి, 

అయిన బాణములను హనుమంతుని పై ప్రయోగించెను. 


అప్పుడు హనుమంతుడు రథము యొక్క ధ్వని, 

మృదంగములు భేరీలు పటహముల ధ్వని, 

ఆ ఇంద్రజిత్తు ధనస్సుచేసిన ధ్వని, 

విని, ఆకాశములో ఇంకా పైకి ఎగిరెను. 


లక్ష్యము ఛేదిస్తూ బాణ ప్రయోగములో నిష్ణాతుడైన ఇంద్రజిత్తుయొక్క,

లక్ష్యసంగ్రహమును వ్యర్థము చేస్తూ, హనుమంతుడు అంతరిక్షములో తిరగసాగెను. 

మారుతాత్మజుడైన హనుమంతుడు అతని శరములకు అందకుండా 

ముందు సాగుతూ  తన చేతులను చాచి పైకి ఎగిరిపోయెను. 


వారిద్దరూ రణకర్మలో విశారుదులు. 

వారిద్దరూ వేగము కలవారు. 

వారు సమస్త భూతముల మనస్సు హరించే విధముగా యుద్ధము చేయసాగిరి.


రాక్షసునకు హనుమంతుని అంతు తెలియుట లేదు. 

మారుతికి కూడా ఆ రాక్షసుని అంతు తెలియుట లేదు. 

దేవసమాన విక్రమము గల వారిద్దరూ 

ఒకరికొకరు లొంగకుండా యుద్ధము చేయసాగిరి. 


అప్పుడు లక్ష్యమును సంపాదించలేకపోయిన,  

శరపరంపరను ఏకాగ్రతో వదిలిన ఆ ఇంద్రజిత్తు ఆలోచనలో పడెను. 

ఇంద్రజిత్తు ’ఈ వానరుడు చంపబడడు ’ అని నిశ్చయించుకొని 

ఇతనిని ఎట్లు బంధించవలెనా అని ఆ వానరుని గురించి ఆలోచించెను.


ఆ వానరుడు అవధ్యుడు అని గ్రహించిన ఇంద్రజిత్తు, 

ఆ వానరోత్తముని మీద పితామహుని బ్రహ్మాస్త్రము సంధించెను. 

ఆ అస్త్రముల తత్త్వము ఎరిగిన ఇంద్రజిత్తు 

మారుతాత్మజుని ఆ బ్రహ్మాస్త్రముతో బంధించెను.

 

ఆ విధముగా  ఆ రాక్షసునిచేత బ్రహ్మాస్త్రముతో బంధింపబడి, 

హనుమంతుడు చేష్టలు లేని వాడై భూమిపై పడెను. 


అప్పుడు హనుమ ఆ బంధించిన అస్త్రముయొక్కప్రభావము తెలిసికొని, 

వేగము లేనివాడై తనకు బ్రహ్మదేవుడిచ్చిన అనుగ్రహము గురించి ఆలోచించసాగెను. 

తనకున్న విమోక్షణ శక్తిపై పితామహుని అనుగ్రహమును గుర్తుతెచ్చుకొని,

ఆ బ్రహ్మాస్త్రమునుండి విమోక్షణా శక్తి వున్ననూ, 

పితామహుని అస్త్రమును అనుసరించుటకు నిశ్చయించుకొనెను. 


’ఈ అస్త్రముచే బంధింపబడినప్పటికీ నాకు భయము లేకున్నది. 

బ్రహ్మదేవుడు ఇంద్రుడు వాయుదేవులచే నేను రక్షింపబడుతున్నాను కాబోలు. 

రాక్షసులచేత బంధింపబడి రాక్షసేంద్రునితో మాట్లాడు అవకాశము కలుగును. 

అందువలన వారు నన్ను బంధింతురుగాక’ అని హనుమంతుడు అనుకొనెను.


శత్రువులను హతమార్చగలవాడు, 

కార్యములను సమీక్షించి కార్యములను చేయువాడు, 

ఈ విధముగా నిశ్చయము చేసికొనినవాడై, 

చేష్టలు ఏమీ లేకుండా ఉండెను. 


అప్పుడు శత్రువులను నాశనము చేయగల ఆ హనుమంతుడు చేష్టలు లేకుండా వుండుట చూచి ,

ఆ రాక్షసులు హనుమంతుని నారచీరలతో తాళ్లతో మరల బంధించిరి.  

హనుమంతుడు ’ఆ రాక్షసేంద్రుడు కుతూహలముకొలదీ నన్ను చూచుటకు వచ్చును’ అని తలచి, 

నిశ్చయమైన మనస్సు కలవాడై రాక్షసులు తనను బంధించుచున్ననూ ఏమీ చేయక ఊరకుండా ఉండెను.


అలాగ వల్కలములచేత బంధింపబడిన హనుమ ఆ బ్రహ్మాస్త్రమునుండి విడివడెను. 

బ్రహ్మ అస్త్రము ఇంకొక బంధనముఉన్నచో తన బంధమును విడిచి పెట్టును. 

ఇది అస్త్రముల తత్త్వము ఎరిగిన ఇంద్రజిత్తు కు తెలుసును.

అప్పుడు ఇంద్రజిత్తు తాళ్లతో కట్టబడి, 

బ్రహ్మాస్త్రమునుండి విడుదలపొందిన వానరుని చూచి ఆలోచనలో పడెను.

 

’ఇతర బంధనములు ఉన్నచో బ్రహ్మాస్త్రము బంధించదు. 

అయ్యో మహత్తరమైన కర్మ నిరర్ధకమైనది. 

ఈ రాక్షసులకు మంత్రవిధానము తెలియదు. 

అటుల మంత్రమునుంచి విడుదలపొందినచో మరియే మంత్రము పనిచేయదు’. 

ఇంద్రజిత్తు ఇక ఏమి చేయవలెనా అని  సంశయములో పడెను.


హనుమంతుడు తను బ్రహ్మాస్త్రమునుండి విడివడెను అని ఎవరికి తెలియనివ్వలేదు. 

ఆ రాక్షసులచేత బంధింపబడినవాడై, 

బంధములతో బాధింపబడినప్పటికీ అలాగే ఉండిపోయెను. 


అప్పుడు ఆ వానరుడు కౄరులైన ఆ రాక్షసులచేత పిడికలతో పీడింపబడి 

కర్రలతో కొట్టబడి రాక్షసేంద్రుని సమీపమునకు తీసుకుపోబడెను. 

ఆ విధముగా తాళ్లతో కట్టబడిన, ఆ బ్రహ్మాస్త్రమునుండి విడుదల అయిన హనుమంతుని 

మహాబలుడైన ఇంద్రజిత్తు రాజునకు రాక్షసగణములకు చూపించెను.  

  

ఆ రాక్షసులు మదించిన మాతంగము వలె బంధింపబడిన వానరోత్తముని 

రాక్షసుడు రాక్షసాధిపతి అగు ఆ రావణునికి సమర్పించిరి. 

’ఇతడు ఎవడు? ఎవరివాడు? ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చిన వాడు? 

ఏ కార్యము కొరకు? ఇతడి వెనక ఎవరు ఉన్నారు?’, 

అని రాక్షస వీరులు తమలో తాము అనుకొనిరి. 

ఇంకా కొంతమంది రాక్షసులు కోపోద్రిక్తులై 

ఇతనిని ’హతమార్చండి’, ’ దహనము చేయండి’, ’భక్షించండి’ 

అని ఒకరికొకరు చెప్పుకొనసాగిరి,

  

మహాతేజము గల ఆ రావణుడు వికృతాకారముకల 

రాక్షసులచేత అక్కడికి తీసుకు రాబడిన కపిసత్తముని చూచెను. 

ఆ వానరోత్తముడు కూడా తేజో బలములతో 

భాస్కరుని వలె విరాజిల్లు చున్న రాక్షసాధిపతిని చూచెను.

 

అ దశాననుడు రోషముతో ఎఱ్ఱబడిన కళ్ళుగలవాడై ఆ కపిని చూచి, 

ఉపావిశులైన అనుభవశీలులైన మంత్రి ముఖ్యులను ఆ వానరుని గురించి అడిగెను. 


వారిచేత యథాక్రమముగా వచ్చినకార్యము దాని మూలము గురించి అడగబడగా 

ఆవానరుడు " కపిరాజు యొక్క కార్యము వలన వచ్చిన వాడను " అని పలికెను.

 

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఎనిమిదవ సర్గ సమాప్తము. 


|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||