!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 268-269
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి 268-269 శ్లోకములు:
గురువు తత్త్వజ్ఞానము అంటే "నీవే బ్రహ్మము" అన్న మాటని
చాలా విశదముగా చెప్పాడు. అది అత్యంత సులభముగా అర్థము
అయ్యేటట్లు చెప్పాడు. మనకి చదివితే అర్థము అవుతుంది.
ఇంక మిగిలినది అర్థమైనది (practical గా) అంతర్గతము
చెయ్యడమే.అది సులభము కాదు. భగవద్గీతలో అదే విషయము
గురించి అర్జునుడు అడిగితే, కృష్ణుడు కూడా అదే చెప్పి
భగవద్గీతలో ( "అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహమ్ చలమ్.
అంటూ 6వ అధ్యాయములో), దానికి మార్గము కూడా చెప్పాడు.
ఇక్కడ గురువు కూడా practical గా వచ్చే సమస్యలు గురించి
చెప్పి దానికి సాధనము కూడా చెపుతాడు.
శ్లోకము 268:
జ్ఞాతే వస్తున్యపి బలవతీ వాసనాదిరేషా
కర్తా భోక్తాపి అహమితి దృఢాయాస్య సంసారహేతుః ।
ప్రత్యగ్ దృష్టాత్మని నివసతా సాపనేయా ప్రయత్నాత్
ముక్తిం ప్రాహుః తదిహ మునయో వాసనాతానవమ్ యత్ ॥
1 జ్ఞాతే వస్తున్యపి బలవతీ వాసనాదిః ఏషా -
వస్తుజ్ఞానము తెలిసినాకాని , బలవత్తరమైన అనాది అయినా
వాసనలు (వున్నాయి);
వస్తుజ్ఞానము అంటే వస్తువులవైపు పోకూడదు అనే జ్ఞానము
అని పదార్థము తీసుకోవచ్చు, లేక వస్తుజ్ఞానము అన్నమాటకి
ఆత్మజ్ఞానము తెలిసినా అని పండితులు చెపుతారు ;
ఎలాచెప్పినా ఇక్కడ ప్రస్తావన - ఆ జ్ఞానానికి అడ్డుపడే
పూర్వజన్మ కృత పాప పుణ్య వాసనలు; అవి చాలా బలవంతమైనవి.
2 కర్తా భోక్తాపి అహం ఇతి దృఢాయా అస్య సంసారహేతుః -
కర్తా భోక్తా నేనే అనే దృఢమైన అలోచన ఈ సంసారము అనబడే
సముద్రానికి కారణము;
అహంకారము మనలని ముందుకుపోనీయదు. ఇది ఇప్పుడె చెయ్యాలి,
ఆ తరువాత ఆత్మజ్ఞానము గురించి ఆలోచిద్దాము అని మనలని
ఆపుతుంది. ఈ అహంకారము పూర్వజన్మ కృత పాప పుణ్య
వాసనాఫలము.
మరి వాసనలు పూర్వజన్మ కృత పాప పుణ్యాలవలన కదా, మరి మన
కర్మ దాటి ఇంకేమి చేయగలము అనిపించవచ్చు. దానికి
భగవద్గీతలో కృష్ణుడి సమాధానము విన్నాము. "అభ్యాసేనతు
కౌన్తేయా వైరాగ్యేణతు గృహ్యతే.. " అభ్యాసముతో
వైరాగ్యముతో అంటూ. గురువు కూడా ఆదే ధోరణిలో చెపుతాడు
3 ప్రత్యగ్ దృష్టాత్మని నివసతా సా అపనేయా
ప్రయత్నాత్ -
(i)ప్రత్యగ్ దృష్టా ఆత్మని నివసతా -
మనస్సు లోపలికి వేళ్ళే దృష్టితో ఆత్మలో నే
నివశించువానికే
(ii)సా అపనేయా ప్రయత్నాత్ -
దానిని తొలగించ వలనను అనే ప్రయత్నముతో
ఇక్కడ వాసనలను దాటడానికి రెండు మాటలు చెప్పాడు గురువు.
(i) మనస్సును బయట దృశ్యరూపమైన జగత్తునుంచి మరలించి ,
అంతర్ముఖముగా చేసి , అంటే ధ్యాన మననాది కార్యములతో
ఆత్మలో నివశించడము, అలాచేసిన వానికి - ఆ వాసనలు
అధిగమించడము సులభము ( ఎందుకు సులభము అన్నప్రశ్నలేదు ..
అట్టివాడు ప్రపంచములో కోరికలపై పరిగెడటల్లేదు కనుక )
(ii) ఆ వాసనలు అధిగమించాలి అనే ప్రయత్నముతో - వాటిని
దాటాలి అనే పట్టుదల లేకపోతే ఆ వాసనలు పోనే పోవు.
అందుకని ఆ ప్రయత్నము కావాలి అని గురువు సూచన.
4 ముక్తిం ప్రాహుః తదిహ మునయో వాసనాతానవమ్ యత్ -
వాసనాతానవమ్ యత్ -
ఏదైతే వాసనలను భగ్నము చేయగలదో ( నాశనము చేయగలదో)
దానిని;
ముక్తిం ప్రాహుః తదిహ మునయో -
తదిహ మునయో ముక్తిం ప్రాహుః -
మునులు అది ఇక్కడే ముక్తి పొందడము అంటారు.
మనస్సును బయట దృశ్యరూపమైన జగత్తునుంచి మరలించి ,
అంతర్ముఖముగా చేసి , అంటే ధ్యాన మననాది కార్యములతో
ఆత్మలో నివశించు వానికి, ఆ వాసనలు అధిగమించాలి అనే
ప్రయత్నము చేయాలి. అలా వాసనలు భగ్నము చేసుకోవడానినే ,
మునులు అది ఇక్కడే ముక్తి పొందడము అంటారు.
శ్లోక తాత్పర్యము:
వస్తుజ్ఞానము తెలిసినాకాని , బలవత్తరమైన అనాది అయినా
వాసనలు,
కర్తా భోక్తా నేనే అనే దృఢమైన అలోచన, ఈ సంసారము అనబడే
సముద్రానికి కారణము; దానిని దాటడానికి, మనస్సు లోపలికి
మళ్ళీంచి ఆత్మలో నే నివశించుచు, దానిని తొలగించ వలనను
అనే ప్రయత్నము చేయాలి.
వాసనలను భగ్నము చేయగల (నాశనము చేయగల) స్థితి ఏదో,
దానిని ;
మునులు ఇక్కడే ముక్తి పొందడము అంటారు. ఆ స్థితి
పొందడానికి వున్న ప్రతిబంధాలు ప్రయత్నముతో తొలగించాలి
అని కూడా చెప్పాడు.
అయితే పూర్వజన్మ కృత పాప పుణ్యాల వాసనలు
తొలగించడానికి కలిగే ప్రతిబంధాలు ఏమిటి, వాటిని
తొలగించే మార్గము ఏమిటి అన్నది ఇంకాకొంచెము
అర్థము అయ్యేటట్లు గురువు ముందు శ్లోకాలలో చెపుతాడు.
శ్లోకము 269:
అహం మమేతి యో భావో
దేహాక్షాదావనాత్మని।
అధ్యాసోఽయం నిరస్తవ్యో
విదుషా స్వాత్మ నిష్ఠయా॥
1 అహం మమేతి యో భావో -
నేను నాది అను ఏ భావము కలదో (అది)
2 దేహాక్షాదావనాత్మని
దేహాక్షాదౌ అనాత్మని - అనాత్మయైన దేహేన్ద్రియములందు:
అనాత్మయైన దేహేన్ద్రియములందు నేను నాది అను ఏ భావము
కలదో ,(అది ఒక ప్రతిబంధకము) అని ఇక్కడి భావము ;
ఆ ప్రతిబంధకము ఎలా తొలగించాలి , అన్నది ముందు
వాక్యాలలో గురువు చెపుతాడు.
3 అధ్యాసోఽయం నిరస్తవ్యో -
అధ్యాసముతో సమూలముగా నశింపచేయ తగినది
(తొలగించబడతగినది)
4 విదుషా స్వాత్మ నిష్ఠయా -
తన ఆత్మ ధ్యాసలో నిలబడగలిగిన పండితులచే
తన ఆత్మ ధ్యాసలో నిలబడగలిగిన పండితులచే ( ఆ ప్రతి
బంధకము సమూలముగా నశింపచేయ తగినది (తొలగించబడతగినది)
269వ శ్లోకతాత్పర్యము:
అనాత్మయైన దేహేన్ద్రియములందు నేను నాది అను ఏ భావము
కలదో అది, తన ఆత్మ ధ్యాసలో నిలబడగలిగిన పండితులచే
సమూలముగా నశింపచేయ తగినది (తొలగించబడతగినది)
మొదటి శ్లోకములో చెప్పిన మోక్షము పొందే స్థితికి
ప్రతిబంధకము గురించి, రెండవ శ్లోకములో , నేను
నాది అను ఏ భావము కలదో అదే ఆ ప్రతిబంధకము అని
గురువు చెప్పాడు. అయితే ఆ భావము ఎలా సమూలముగా
నశింపచేయాలి అన్నది ముందు శ్లోకములో వస్తుంది.
॥ ఓమ్ తత్ సత్॥
_____________________________________________