!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 276-277
॥ఓమ్ తత్ సత్॥
వివేక చూడామణి 276-277 శ్లోకములు:
ముందు శ్లోకాలలో, దుర్గంధముతో కప్పబడిన
గంధముచెక్క ఉదాహరణ తో, అంటే ఎలాగైతే ఆ దుర్గంధములు
అరగదీసి అరగదీసి తొలగించినప్పుడు, గంధముచెక్క దివ్య
వాసనలు మనము అనుభవించగలుగుతామో - అలాగే - మానవుడికి
పూర్వజన్మ కృత పాప పుణ్యములవాసనలు ప్రజ్ఞతో ( అనేక
విధములుగా మనన ధ్యానాది ధ్యాసలతో ) తొలగించినప్పుడే
ఆత్మజ్ఞానము పరిమళించుతుంది , అని చెప్పాడు గురువు .
ఇప్పుడు 276/277 శ్లోకాలలో అదే మాట మళ్ళీ మళ్ళీ
ఉద్ఘాటిస్తాడు గురువు. ఇక్కడ పదాలు మారినా అర్థము అదే
మాట
శ్లోకము 276
అనాత్మవాసనాజాలైః
తిరోభూతాత్మ వాసనా।
నిత్యాత్మ నిష్ఠయా తేషాం
నాశే భాతి స్వయం స్ఫుటా॥
అనాత్మవాసనాజాలైః -
అనాత్మవాసన జాలములలో
అనాత్మవాసనములు అంటే లోకవాసనలు, దేహవాసనలు,
శాస్త్రవాసనలు. అవి ఏమిటి చేస్తాయి ఆత్మవాసనలను దూరము
చేస్తాయి. అంటే ఈ అనాత్మవాసన జాలములో చిక్కినమానవుడు
ఆత్మవాసనలకి దూరము అవుతాడు.
తిరోభూతాత్మ వాసనా -
చిక్కుకుపోయిన ఆత్మ వాసన
అంటే అనాత్మవాసనల జాలములో చిక్కుకొని పోయిన ఆత్మ వాసన
మానవుడికి దూరము అయిపోతుంది. మరి అలాఅయితే ఆత్మవాసనలు
అనుభవించడానికి మార్గములేదా అంటే, సమాధానము
తప్పకుండా మార్గము వుంది. పూర్వము కృష్ణుడు
చెప్పినమాట, ఆ ధ్వని, ఇక్కడ మళ్ళీ వినిపిస్తుంది.
అదే.." అభ్యాసేనతు కౌన్తేయ వైరాగ్యేణతు గృహ్యతే" అని.
అభ్యాసము వైరాగ్యము అన్నమాటలబదులు.. ఇక్కడ గురువు ఇంకో
పదము, నిష్ఠ, ఉపయోగిస్తాడు.
నిత్యాత్మ నిష్ఠయా తేషాం -
నిత్యమగు ఆత్మ నిష్ఠ ( బ్రహ్మ నిష్ఠ)చేత వాటి;
అంటే ఆ దుర్వాసనలు వస్తున్నా ( లోకవాసన, దేహవాసనా,
శాస్త్రవాసనా మున్నగు వాసనలు), నిష్ఠతో ఆత్మను
అనుసరించు వాడు, ఆ నిష్ఠతో ఆ వాసనలను దూరము చేయగలడు (
నాశనము చేయగలడు అని మనకి వినిపించే ధ్వని)
నాశే భాతి స్వయం స్ఫుటా
నాశనము చేయబడి ఆత్మ స్వయముగా ప్రకాశించును.
అంటే నిత్యమగు ఆత్మ నిష్ట ( బ్రహ్మ నిష్ఠ)చేత ఆ
దుర్వాసనలు ( లోకవాసన, దేహవాసనా, శాస్త్రవాసనా మున్నగు
వాసనలు) నాశనము చేయబడి ఆత్మ స్వయముగా ప్రకాశించును
276 వ శ్లోక తాత్పర్యము:
అనాత్మవాసన జాలములలో చిక్కుకుపోయిన ఆత్మ వాసన,
నిత్యమగు ఆత్మ నిష్ట ( బ్రహ్మ నిష్ఠ)చేత అనాత్మవాసనలు,
నాశనము చేయబడి ఆత్మ స్వయముగా ప్రకాశించును.
అంటే ఆ పూర్వజన్మ కృత పాప పుణ్యములవలన కలిగే అనాత్మ
వాసనలు వున్నా, వాటిని నిష్ఠతో అధిగమించవచ్చు. అలా
అధిగమించిన తరువాత, ఆత్మ స్వయముగా ప్రకాశించును.
నిష్ఠతో అధిగమించడము అన్నప్పుడు, అత్మ మీద ధ్యాస
పెరిగినకొద్దీ అనాత్మ ధ్యాసలు తగ్గుతో వస్తాయి.
ఎప్పుడైతే అనాత్మ ధ్యాసలు పూర్తిగా నిశ్శేషముగా పోతాయో
అప్పుడు అత్మానుభూతికి ఇంక ఏమీ అడ్డంకులు వుండవు.
అదే మనము 277 వ శ్లోకములో వింటాము.
శ్లోకము 277:
యథా యథా ప్రత్యగవస్థితం మనః
తథాతథా ముఞ్చతి బాహ్యవాసనా।
నిశ్శేష మోక్షే సతి వాసనానామ్
ఆత్మానుభూతిః ప్రతిబన్ధ శూన్యా॥
యథా యథా ప్రత్యగవస్థితం మనః -
ఎప్పుడు లోపలవున్న మనస్సు స్థిరముగావుండునో;
తథాతథా ముఞ్చతి బాహ్య వాసనా-
అప్పుడు బాహ్యవాసనలను (లోకదేహశాస్త్ర వాసనలను)
విడుచును;
అంటే మళ్ళీ ఆ అభ్యాసము ( practice) అనే ధ్వని
వస్తుంది. ఏప్పుడైతే నిష్టతో మనస్సు స్థిరముగా వుండునో
అప్పుడు బాహ్యవాసనల ప్రభావము క్షీణిస్తుంది అని ఇక్కడ
తాత్పర్యము. ఆ నిష్ఠ అభ్యాసముతో (practice తో)
పరాకాష్టపొందుతుంది. గీతలో అభ్యాసమే కాకుండా
వైరాగ్యముకూడా పెంపొందించినపుడు
అనాత్మవాసనలు ఇంకా త్వరగా దూరము అవుతాయి. . ఇక్కడ యథా
యథా తథా తథా అన్నమాటలో అర్థము ఇది అభ్యాస వైరాగ్యాలతో
కష్టపడితే మెల్లిమెల్లిగాూరము అవుతాయి, ఆత్మవాసనలు
పరిమళిస్తాయి.
నిశ్శేష మోక్షే సతి వాసనానామ్-
ఆ వాసనలన్ని నిశ్శేషముగా పోయినప్పుడు
ఆత్మానుభూతిః ప్రతిబన్ధ శూన్యా -
ఆత్మానుభూతికి ప్రతిబంధకములు అన్నీ తొలగిపోతాయి:
ఏప్పుడైతే నిష్టతో మనస్సు స్థిరముగా వుండునో అప్పుడు
బాహ్యవాసనల ప్రభావము క్షీణిస్తుంది - ఆ బాహ్య అనాత్మ
వాసనలన్ని నిశ్శేషముగా పోయినప్పుడు, ఆత్మానుభూతికి
ప్రతిబంధకములు అన్నీ తొలగిపోతాయి.
277 వ శ్లోక తాత్పర్యము - ఎప్పుడు లోపలవున్న మనస్సు
స్థిరముగావుండునో;అప్పుడు మనస్సు బాహ్యవాసనలను
(లోకదేహశాస్త్ర వాసనలను) విడుచును; అంటే ఏప్పుడైతే
నిష్టతో మనస్సు స్థిరముగా వుండునో అప్పుడు బాహ్యవాసనల
ప్రభావము క్షీణిస్తుంది; ఆ వాసనలన్ని నిశ్శేషముగా
పోయినప్పుడు, ఆత్మానుభూతికి ప్రతిబంధకములు అన్నీ
తొలగిపోతాయి
అంటే మనము భగవద్గీతలో చెప్పబడిన స్థితప్రజ్ఞుడి లాగా
మనస్సుని స్థిరపరచుకుని ఆత్మ ధాసలో నిమగ్నమైనప్పుడు -
అత్మానుభూతి కి అడ్డంకులు తొలగిపోతాయి అని అర్థము.
॥ఓమ్ తత్ సత్