!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 282-283
॥ఓమ్ తత్ సత్॥
వివేక చూడామణి 282-283 శ్లోకములు:
స్వ అధ్యాస అపనయం కురు - అంటే నీకు ధ్యాస లేకపోవడాన్ని
, అంటే చంచలత్వాన్ని తొలగించు అంటూ మళ్ళీ ఈ రెండు
శ్లోకాలలో చంచలత్వాన్ని తొలగించడము గురించి ఇంకా
చెపుతున్నాడు గురువు. ఇక్కడ రెండు విషయాలు
ప్రతిపాదిస్తాడు - గురువు: ఒకటి నీలో వున్న ఆత్మ
అందరిలో వున్న ఆత్మ ఒకటే అని తెలిసికొని, నీలో వున్న
భ్రాన్తిని తొలగించు అని; రెండవది ఎలాగైతే పరమేశ్వరుని
ధ్యానించే మునులకు అన్నము తినడము విసర్జించడము అనే
క్రియలతో ప్రమేయము లేదో - అలాగే నీవుకూడా
పరమేశ్వరునిపై నిష్ఠతో నీలో వున్న భ్రాన్తి తొలగించుము
అని.
శ్లోకము 282
శ్రుత్వా యుక్త్యా స్వానుభూత్యా
జ్ఞాత్వా సార్వాత్మ్యమాత్మనః।
క్వచిదాభాసతః ప్రాప్తః
స్వాధ్యాసాపనయం కురు॥282॥
శ్రుత్వా యుక్త్యా స్వానుభూత్యా-
శృతిచేతనూ యుక్తి చేతనూ స్వానుభవము చేతనూ
జ్ఞాత్వా సార్వాత్మ్యమాత్మనః -
అన్నీటిలో వున్న ఆత్మ నీ ఆత్మే అని తెలిసికొని
అన్నిటిలో వున్న ఆత్మ నీలో వున్న ఆత్మే అని తెలిసికొని
అని ప్రతిపాదిస్తున్నాడు గురువు - ఏలా తెలిసికుంటాము
అంటే శృతులద్వారా అని సమాధానము. అంటే శృతులలో
చెప్పబడిన మాటలద్వారాని. ఇక్కడ గురువు చెపుతున్నమాట -
ఉపనిషత్తులు చదివి అర్థము చేసుకున్నందువలన, లేక
తెలివిగా అలోచించి తర్కించడము వలన గాని, లేక
స్వయంగా అర్జించిన అనుభవము ద్వారా నీలోని ఆత్మయే
అందరిలోని ఆత్మ అని గ్రహించి - నీలో వున్న అధ్యాసని
తొలగించు అని.
క్వచిదాభాసతః ప్రాప్తః -
ప్రాప్తించిన భ్రాంతిని కొంచెమైనా సరే;
పూర్వజన్మపాప పుణ్య ఫలప్రాప్తివలన ప్రాప్తించిన
భ్రాంతిని కొంచెమైనా సరే , వెంటనే - స్వాధ్యాసాపనయం
కురు- నీలో వున్న అధ్యాస ను తొలగించుము అని ఆఖరిపాదము
లో వస్తుంది.
స్వాధ్యాసాపనయం కురు -
నీలోని భ్రమలను నశింపచేయుము
282 వ శ్లోకము తాత్పర్యము:
శృతిచేతనూ యుక్తి చేతనూ స్వానుభవము చేతనూ అన్నీటిలో
వున్న ఆత్మ నీ ఆత్మే అని తెలిసికొని;
ప్రాప్తించిన భ్రాంతిని కొంచెమైనా సరే నీలోని భ్రమలను
నశింపచేయుము:
శ్లోకము 283
అన్నదాన విసర్గాభ్యామ్
ఈషన్నాస్తి క్రియా మునేః।
తదేక నిష్ఠయా నిత్యం
స్వాధ్యాసాపనయం కురు॥283॥
అన్నదాన విసర్గాభ్యామ్ -
అన్నము తినుట విసర్జించుటలతో;
ఈషన్నాస్తి క్రియా మునేః -
మునులకు కొంచెమైననూ ప్రమేయము లేదు;
అన్నము తినడములో కాని , విసర్జించుటలో కాని మునులకు
ప్రమేయము లేదు. ఆక్రియలను మునులు పట్టించుకోరు. ఇక్కడ
భావము నీవు కూడా అలాగే వుండాలి; అలా వుండి ఎల్లప్పుడు
పరమేశ్వరుని పై నిష్ఠతో నీలో వున్న అధ్యాసని
తొలగించుఅని
తదేక నిష్ఠయా నిత్యం -
అందువలన ఆ పరమాత్మపై అదే నిష్ఠతో;
స్వాధ్యాసాపనయం కురు
నీలో వున్నా అధ్యాసను తొలగింపుము;
283 శ్లోకతాత్పర్యము:
మునులకు అన్నము తినుట విసర్జించుట అన్నక్రియలతో
ప్రమేయము లేదు. అందువలన (నీవు కూడా) ఆ పరమాత్మపై అదే
నిష్ఠతో నీలో వున్నా అధ్యాసను తొలగింపుము:
॥ఓమ్ తత్ సత్॥
____________________________________________