!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 287-289
॥ఓమ్ తత్ సత్॥
వివేక చూడామణి 287-289 శ్లోకములు
శ్లోకము 287
నిద్రాయాః లోకవార్తాయాః
శబ్దార్దేరపి విస్మృతేః ।
క్వచిన్నావసరం దత్వా
చిన్తయ ఆత్మానం ఆత్మని॥ 287॥
1 నిద్రాయాః లోకవార్తాయాః -
నిద్రవలన లోకవార్తలవలన;
సాధకుడికి ,(మనకి) ఆధ్యాత్మ చింతన మరచిపోవడానికి చాలా
అవకాశాలు వున్నాయి. వాటిల్లో రెండు నిద్ర , లోక
సంబంధమైన వార్తలు. అవే గుర్తుచేస్తున్నాడు
గురువు
2 శబ్దార్దేరపి విస్మృతేః -
శబ్దాది విషయములవలన కూడా మరచిపోవడము;
నిద్ర, లోకవార్తలే కాదు , శబ్దాది విషయములవలన కూడా
అధ్యాత్మ చింతన మరచిపోతాము. ధ్యానములో నిద్ర, మౌనములో
లోక వార్తలు, చుట్టూవున్న పరివారముతో శబ్ద స్పర్శ రూప
రసగంధాలలో మునిగి తేలుతున్న మనకి పరమాత్మగురించి
అలోచించడానికి సమయము ఉండకపోవచ్చు.
మరి ఎందుకు గుర్తుచేస్తున్నాడు ? అలా ఆయా
లోకాల్లో పడి అధ్యాత్మ చింత మరచిపోవద్దు అని
చెప్పడానికి.
3 క్వచిన్నావసరం దత్వా - క్వచిత్ న అవసరం దత్వా-
కొంచెముకూడా అవసరము ఇవ్వకుండా;
గురువు చెప్పవలసిన మాట చెపుతున్నాడు - వాటికి chance
ఇవ్వకుండా - అధ్యాత్మికము మీద మతిమరుపు దూరము చెయ్యి
అని.
4 చిన్తయ ఆత్మానం ఆత్మని -
ఆత్మానం ఆత్మని చిన్తయ -
ఆత్మగురించి నీ మనస్సులో ఆలోచించుము.
తాత్పర్యము: నిద్రవలన లోకవార్తలవలన శబ్దాది
విషయములవలన అధ్యాత్మిక చింతన మరచిపోవడానికి
కొంచెముకూడా అవసరము ఇవ్వకుండా, ఆత్మగురించి నీ
మనస్సులో ఆలోచించుము
అధ్యాత్మ చింతన పక్కనపెట్టడానికి లేక మరచిపోవడానికి
కారణము అనాత్మ విషయాలే. అందులో దేహాభిమానము కూడా ఒకటి
ముఖ్యమైనది. ఆ దేహాభిమానము పోవడానికి , దేహము
మీదా అసహ్యము కలిగించడము ఒక మార్గము. గురువు ఆ
దేహము ఎలాంటిదో వర్ణిస్తున్నాడు 288 వ శ్లోకములో.
శ్లోకము 288
మాతాపిత్రోః మలోద్భూతమ్
మలమాంసమయం వపుః।
త్యక్త్వా చణ్డాలవత్ దూరమ్
బ్రహ్మీభూత కృతీ భవ॥ 288॥
1 మాతాపిత్రోః మలోద్భూతమ్ -
తల్లిదండుల దేహములలో వుండు మలములలో పుట్టిన;
2 మలమాంసమయం వపుః-
మలమాంసములతో నిండిన ఆ శరీరమును;
మనము పుట్టిన విధానము గుర్తు చేసుకుంటే, ఆ జీవుడు
తొమ్మిది నెలలు మల మూత్ర కూపములో వుండి బయట పడతాడు.
అట్టి దేహము మీద అభిమానము అక్కరలేదు అని భావము:
3 త్యక్త్వా చణ్డాలవత్ దూరమ్ -
అది చణ్డాలుని ( అంటరాని వాని) వలే దూరముగా
వుంచి;
అట్టి శరీరాన్ని ఛండాలుని లాగా దూరముగా వుంచి , నేను
బ్రహ్మముని అనే భావముతో, మనస్సుని పరమాత్మపై నిలుపుము
అని భావము;
4 బ్రహ్మీభూత కృతీ భవ-
బ్రహ్మత్వము తో కృతకృత్యుడవు కమ్ము.
బ్రహ్మత్వము తో అంటే బ్రహ్మముకు కల సద్భావములు
సద్వర్తన మనలో నిలుపుకున్నప్పుడు మనము కృత
కృత్యులము , జీవితములో సాధించ వలసినది సాధించిన వారము
అవుతాము. ఈ శ్లోకములో అలా కృతకృత్యుడవు కమ్ము అని గురు
ఆదేశము.
తాత్పర్యము:
'తల్లిదండుల దేహములలో వుండు మలములలో పుట్టిన
మలమాంసములతో నిండిన ఆ శరీరమును, చండాలుని దూరముగా
వుంచినట్లు, దూరముగావుంచి,బ్రహ్మత్వముతో కృతకృత్యుడవు
కమ్ము'.
మరి మనము బ్రహ్మత్వము పొందమని మన ఆత్మని పరమాత్మలో
విలీనము చేయమని చెప్పినప్పుడు, మరి అలాగ ఒకటి
ఇంకొకటిలో విలీనమయ్యే ఉదాహరణలు వున్నాయా అంటే, వెంటనే
ఘటము ఘటములో వుండే ఘటాకాశము గుర్తుకు వస్తాయి. ఘటములో
వుండే space ని ఘటాకాశము అంటారు. ఘటము వున్నప్పుడు
ఘటాకాశము మనకి ఘటరూపములోనే కనిపిస్తుంది.
ఘటములేనప్పుడు ఆ space కి ఘటరూపము వుండదు - ఆ
ఘటాకాశము, చుట్టూవున్న ఆకాశములో విలీనమౌతుంది. అదే
ముందు శ్లోకములో వింటాము. అలాగే మనము బ్రహ్మము లో
వీలీనమవ్వాలి అని .
శ్లోకము 289:
ఘటాకాశమ్ మహాకాశం
ఇవ ఆత్మానం పరమాత్మని।
విలప్యాఖండభావేన
తూష్ణీం భవ సదా మునే॥
1 ఘటాకాశమ్ మహాకాశం-
ఘటాకాశము మహాకాశములో ఇమిడినట్లు,
ఘటములో వుండే ఆకాశము, ఘటము ముక్కలు అయినప్పుడు - ఘట
రూపములో వుండదు కదా - అది అక్కడ చుట్టువున్న మహా
అకాశములో విలీనమౌతుంది. అలాగే తుది దశలో జీవుని
ఆత్మకూడా పరమాత్మరూపమైన ఆకాశములో కలిసిపోతుంది అని ఒక
హైందవ నమ్మకము. ఇక్కడ గురువు చెప్పబోయేది
ఆధ్యాత్మ జ్ఞాన సంపాదనలో - మన ఆత్మని పరమాత్మలో
నిలుపుము అని. మనమే బ్రహ్మము అయినప్పుడు అది అసాధ్యము
కాదు- కాని మనము మన లోకావర్తనములలో వుండడము వలన - ఈ
ప్రశ్న వస్తుంది - అందుకే అధ్యాత్మ చింతన మరచిపోకుండా
ఈ కార్యము చేపట్టమని గురువు ఆదేశము.
2 ఇవ ఆత్మానం పరమాత్మని।
నీ ఆత్మని పరమాత్మలో (నిలుపుము).
3 విలప్యాఖండభావేన - విలప్య అఖణ్డభావేన-
విలీనము చేసి అఖణ్డభావముతో
4 తూష్ణీం భవ సదా మునే -
ఓ మునీ తూష్ణీభావము గలవాడవు అగుము
అంటే: శ్లోకతాత్పర్యము:
ఓ మునీ, ఘటాకాశము మహాకాశములో ఇమిడినట్లు, నీ
ఆత్మని పరమాత్మలోవిలీనము చేసి, అఖణ్డభావముతో
తూష్ణీభావము ( మౌనము) గలవాడవు అగుము
మన ఆత్మని పరమాత్మలో విలీనము చేసినప్పుడు, మనకు మౌన
భావమే మిగలాలి - ఆ మౌనభావము కాక మరో ధ్యాసలోకి వెడితే
అప్పుడు మనము మన అత్మని పరమాత్మలో విలీనము చేయడములో
విఫలము అయ్యాము అన్నమాట.
॥ఓమ్ తత్ సత్॥
______________________________________________