!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 290-292
॥ఓమ్ తత్ సత్॥
వివేక చూడామణి 290-292 శ్లోకములు
స్వప్రకాశం అధిష్ఠానం
స్వయం భూత్వా సదాత్మనా।
బ్రహ్మాణ్డమపి పిణ్డాణ్డం
త్యజతాం మలభాణ్డవత్॥ 290॥
స్వప్రకాశం అధిష్ఠానం -
స్వయం ప్రకాశమైన అధిష్టానముగా
స్వయం భూత్వా -
నీవే అయ్యి :
అంటే నీవే స్వయం ప్రకాశమైన ఆత్మగా అయ్యి, నీవే అనడములో
నీ దేహముకాదు, నీలో వున్న అంతరాత్మ - నీవే ఆ అంతరాత్మ
లాగా అయ్యి అని ; నీవే ఆ అంతరాత్మ అయితే - ముందు
శ్లోకములో చెప్పినట్లు - తల్లిదండ్రుల దేహములలో
వుండు మలములలో పుట్టిన మలమాంసములతో నిండిన ఆ శరీరమును,
చండాలుని దూరముగా వుంచినట్లు, దూరముగావుంచాలి అన్నమాట
. అదే మాట ఇంకో రూపములో మళ్ళీ గురువు చెపుతాడు ,
బ్రహ్మాణ్డమపి పిణ్డాణ్డం -
బ్రహ్మాండమును పిండరూపమైన స్వశరీరమును;
సదాత్మనా త్యజతాం -
ఆ సదాత్మనా అంటే సదౄపమైన ఆత్మతో వదిలి వేయుము;
బ్రహ్మాండము అంటే బ్రహ్మచేత సృష్టించబడిన సమస్త జగత్తు
,అలాగే పిండరూపమైన జగత్తుని వదిలి వేయుము అని. ఆ
వదిలేయడము ఎలా వదిలేయాలి. ఆ మాట కూడా ముందు శ్లోకములో
విన్నాము. మన దేహమును ( దేహ భ్రాన్తిని) చండాలుని
దూరముగా వుంచినట్లు దూరముగా వుంచుము అన్నాడు. ఇక్కడ
అలాంటి ఉపమానము చెపుతాడు
మలభాణ్డవత్ -
మలముతో కూడిన భాండమువలె అని
290 వ శ్లోక తాత్పర్యము:
స్వయం ప్రకాశమైన అధిష్టానముగా నీవే అయ్యి, అంటే
అంటే నీవే స్వయం ప్రకాశమైన ఆత్మగా అయ్యి - బ్రహ్మచేత
సృష్టించబడిన సమస్త జగత్తు ,అలాగే పిండరూపమైన జగత్తుని
మలముతో కూడిన భాండమువలె వదిలి వేయుము
శ్లోకము 291:
చిదాత్మని సదానన్దే
దేహారూఢాం అహం ధియం।
నివేశ్య లిఙ్గం ఉత్సృజ్య
కేవలో భవ సర్వదా॥ 291॥
దేహారూఢాం అహం ధియం -
దేహమునకు సంబంధించిన అహంకారమును :
చిదాత్మని సదానన్దే నివేశ్య
సదానందరూపమైన చిదాత్మయందు వుంచి:
అంటే మన అహంకారమును సదానందరూపమైన ఆత్మలో ( అదే
పరమాత్మలో) వుంచుము అని భావము. అలా అహంకారమును పక్కకి
తోసేస్తే మిగిలిది అపరిమితమైన శాంతి అని అనేక సార్లు
విన్నాము- ఇక్కడ గురువుగారు అలాంటి మాటే చెపుతాడు
లిఙ్గం ఉత్సృజ్య -
లింగస్వరూపమైన సూక్ష్మ శరీరమును విడిచి
కేవలో భవ సర్వదా-
ఎల్లవేళలా సంగరహితుడవు కమ్ము;
లింగస్వరూపమైన సూక్ష్మ శరీరమును విడిచి అన్న మాటలో
భావము సూక్ష్మ రూపముతో కూడిన మనస్సు బుద్ధిని వదిలి
అని. అలావదిలేస్తే నిస్సంగత్వము పొందడము అవుతుంది.
భజగోవిందములో - "నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే
నిశ్చలబుద్ధిః" అని విన్నాము. అంటే నిస్సంగత్వము తో
కోరికలు అటువంటి ఆలోచనలు పోయి, అటు ఇటూ తొణకని మనస్సు
కలవాడము అవుతాము. పరమాత్మే తప్ప ఇంకో ఆలోచన లేని
వాళ్ళము అంటే కైవల్యము పొందుతాము అన్నమాట.
291వ శ్లోకము తాత్పర్యము:
దేహమునకు సంబంధించిన అహంకారమును సదానందరూపమైన
చిదాత్మయందు వుంచి, లింగస్వరూపమైన సూక్ష్మ శరీరమును
విడిచి, ఎల్లవేళలా సంగరహితుడవు కమ్ము;
శ్లోకము 292:
యత్రైషా జగదాభాసః
దర్పణాన్తః పురా యథా।
తద్ బ్రహ్మం ఇతి జ్ఞాత్వా
కృతకృత్యో భవిష్యసి॥292॥
యత్రైషా జగదాభాసః -
యత్ర ఏషా జగత్ అభాసః -
ఎప్పుడు ఈ జగత్తుయొక్క మిథ్యాభావము కలుగుచున్నదో
దర్పణాన్తః పురా యథా-
దర్పణములోని (అద్దములోని) ప్రపంచములాగా
తద్ బ్రహ్మం ఇతి జ్ఞాత్వా -
అదే బ్రహ్మము అని గుర్తించి
కృతకృత్యో భవిష్యసి -
కృతకృత్యుడము అయ్యెదవు.
292 వ శ్లోకము తాత్పర్యము:
ఎప్పుడు అద్దములోని ప్రపంచములాగా, జగత్తుయొక్క
మిథ్యాభావము కలుగుచున్నదో, అదే బ్రహ్మము అని గుర్తించి
కృతకృత్యుడవుము అయ్యెదవు.
గురువు ఇక్కడ చివరి మాట - దేహాన్ని ప్రపంచాన్ని
మలపూరిత భాండము వలె దూరముగా చేసుకొని - ఈ జగమంతా
బ్రహ్మమే అని, కనిపించేది అద్దములోని బొమ్మలవలె మిథ్యా
మాత్రమే అని గ్రహించ గలగడమే సంగరహితము అదే
కైవల్యము.
___________________________________________