!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 354-356
వివేక చూడామణి 354-356
శ్లోకములు:
ఇక మూడు శ్లోకాలలో గురువు నిర్వికల్ప సమాధి వలన
కలిగే సుఖము లాభము చెపుతున్నాడు. (1) మనకు అజ్ఞానము
వలన కలిగే పీట ముళ్ళు విడిపోతాయి (2) ఆ పీట ముళ్ల
లోనే ఒకటి నువ్వు, నేను అనే భేదాలు, అవి కూడా నాశనమై
పోతాయి (3) ఆ సమాధిలో అహం బ్రహ్మాస్మి అన్న భావనతో
పరమ శాంతి లభిస్తుంది. ఈ మూడు మాటలు మూడు
శ్లోకాలలో వింటాము
శ్లోకము 354
అజ్ఞాన హృదయగ్రన్థేః
నిశ్శేషవిలయస్తదా।
సమాధినా వికల్పేన
యదాద్వైతాత్మ దర్శనమ్॥
1 అజ్ఞాన హృదయగ్రన్థేః -
అజ్ఞానము వలన కలిగిన హృదయ గ్రంథులు;
(గ్రంథులు అంటే ముళ్ళు )
2 నిశ్శేషవిలయస్తదా
అప్పుడు నిశ్శేషముగా నాశనమగును
ఇక్కడ గురువు అజ్ఞానము వలన హృదయములో కలిగిన
పీటముళ్ళు (గ్రంథులు) గురించి చెపుతున్నాడు.
ఏమిటా హృదయములో కలిగిన పీటముళ్ళూ? - అవి మనకి
తెలిసినవే - అనాత్మని అత్మగా భ్రాంతి పడేటట్టుగా
చేసే పూర్వజన్మ కృత వాసనలు- ఆ వాసనలు
ఎప్పుడు నాశనమౌతాయి? - అది కూడా మనకి తెలుసు -
ఆత్మజ్ఞానము లభించినప్పుడు; ఆ వాసనలు నాశనము
అవడము బ్రహ్మ జ్ఞానము లభించి నప్పుడు అని కూడా
అనవచ్చు. అదే మాట ఆఖరి పాదములో వస్తుంది.
3 సమాధినా వికల్పేన -
నిర్వికల్ప సమాధియందు;
4 యదాద్వైతాత్మ దర్శనమ్ -
యదా అద్వైత ఆత్మ దర్శనమ్ -
అద్వైత ఆత్మ దర్శనము అయినప్పుడు.
మొదటి పాదములో ఆ వాసనలు ఎప్పుడు నాశనమౌతాయి
అన్నమాటకి - ఇక్కడ సమాధానము; నిర్వికల్ప సమాధిలో
అద్వైత ఆత్మ దర్శనము అయినప్పుడు అజ్ఞానము వలన కలిగిన
హృదయ గ్రంథులు నిశ్శేషముగా నాశనమగును;
354 వ శ్లోక తాత్పర్యము:
నిర్వికల్ప సమాధిలో అద్వైత ఆత్మ దర్శనము అయినప్పుడు
అజ్ఞానము వలన కలిగిన హృదయ గ్రంథులు నిశ్శేషముగా
నాశనమగును
ఒక్కమాటు ఆ పీటముళ్ళుగురించి ఆలోచిద్దాము . అవి (1)
అవిద్య లేక అజ్ఞానము అంటే తన నిజస్వరూపము
తెలుసుకొనలేకపోవుట (2) కామము- కోరికలు (3) కర్మలు -
కోరికలు సాధించడానికి చేసే పనులు - ఇవే మనుష్యుడిని
బాహ్యప్రపంచములో పరిగెట్టిస్తాయి.
శ్లోకము 355
త్వమహమిదం ఇతీయం కల్పనా బుద్ధి దోషాత్
ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే।
ప్రవిలసతి సమాధావస్య సర్వో వికల్పః
విలయనముపగఛ్చేత్ వస్తు తత్త్వావధృత్యా॥
1 త్వం అహం ఇదం ఇతీయం కల్పనా బుద్ధి దోషాత్ -
నువ్వు- నేను ఇది- అది అనే కల్పన బుద్ధి దోషము వలన
2 ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే -
ప్రభవతి పరమాత్మని అద్వయే నిర్విశేషే -
అద్వయమైన నిర్విశేషమైన పరమాత్మలో ఏర్పడుచున్నవి;
అంటే బుద్ధి దోషమువలన అద్వయమైన నిర్విషేషమైన
పరమాత్మలో నువ్వు నేను ఇది అది అనే అలోచనలు
ఏర్పడుచున్నవి అని;
పరమాత్మ ఒక్కడే, బ్రహ్మము ఒక్కటే. బ్రహ్మలో రెండు
భావాలు లేవు (అద్వయము). కాని మన బుద్ధి
దోషమువలన - బుద్ధి దోషము వలన అంటే తద్ద్వారా
మనస్సులో వచ్చిన అనాత్మ ప్రభావము వలన,
అద్వయమైన నిర్విశేషమైన పరమాత్మలో నువ్వు నేను ఇది
అది అనే విపరీత కల్పనలు ఏర్పడుచున్నవి.
ఈ అనాత్మ భావము సమాధిలో వున్న ముముక్షువు కు
నాశనమౌతుంది.
(3&4)
ప్రవిలసతి సమాధావస్య -
ప్రవిలసతి సమాధౌ అస్య -
అతని (అ ముముక్షువు యొక్క ) సమాధి ప్రకాశించగా;
సర్వో వికల్పః విలయనముపగఛ్చేత్ -
సర్వో వికల్పః విలయనమ్ ఉపగఛ్ఛేత్ -
సమస్త వికల్పములు విలీనమైపోవును
వస్తు తత్త్వావధృత్యా-
వస్తు తత్త్వము యొక్క నిర్ధారణముచే;
"ఆ ముముక్షువు యొక్క సమాధి ప్రకాశించగా సమస్త
వికల్పములు, వస్తు తత్త్వము యొక్క నిర్ధారణముచే
విలీనమైపోవును" - ఇక్కడ వస్తు తత్త్వము అంటే
పరమాత్మ యొక్క నిజ తత్త్వము అని;
అంటే నిర్వికల్పసమాధిలో, పరమాత్మ యొక్క నిజ తత్త్వము
ఎరుకపడుటవలన, బుద్ధిదోషము వలన కలిగిన నీవు నేను అది
ఇది అనే విభిన్నత్త్వము తనలో విలీనమైపోవును.
విబిన్నత్త్వము విలీనమైపోవడము అంటే అన్ని విభేదములు
కరిగిపోవును.
355 వ శ్లోక తాత్పర్యము:
బుద్ధి దోషమువలన అద్వయమైన నిర్విశేషమైన
పరమాత్మలో నువ్వు నేను ఇది అది అనే కల్పనలు
ఏర్పడుచున్నవి. ఆ ముముక్షువు యొక్క సమాధి
ప్రకాశించగా పరమాత్మ యొక్క నిజ తత్త్వము ఎరుకపడుట
వలన, బుద్ధిదోషము వలన కలిగిన నీవు నేను అది ఇది అనే
విభిన్నత్త్వము తనలో విలీనమైపోవును;
ఇదే విషయము 356 వ శ్లోకములో బాగా విపులముగా
చెపుతున్నాడు గురువు.
శ్లోకము 356
శాంతో దాన్తః పరముపరతః క్షాన్తి యుక్తః సమాధిం
కుర్వన్నిత్యం కలయతి యతిః స్వ స్వ సర్వాత్మ భావమ్।
తేనావిద్యాతిమిరజనితాన్ సాధు దగ్ధ్వా వికల్పాన్
బ్రహ్మకృత్యా నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్పః ।
1 శాంతో దాన్తః పరముపరతః క్షాన్తి యుక్తః సమాధిం
శాంతో దాన్తః పరముపరతః -
మనస్సుని శాంతపరచి, ఇన్ద్రియములను నిగ్రహించి,
మనోబుద్దుల ఒత్తిడినుంచి బయటపడి;
క్షాన్తి యుక్తః సమాధిం -
తితీక్షతో కూడినవాడై సమాధిలో ( వున్నయోగి)
ముందు శ్లోకములో నిర్వికల్పసమాధిలో వున్నయోగికి
బుద్ధిదోశములవలనకలిగే వికల్పాలన్ని సమాధిలో
విలీనమైపోతాయి అని చెప్పిన గురువు - అదే మాట
విశదీకరిస్తున్నాడు. యోగీ సమాధిలో వెళ్ళే స్థితిని
వర్ణిస్తున్నాడు. యోగి మనస్సుని శాంతపరచి,
ఇన్ద్రియములను నిగ్రహించి,మనోబుద్దుల ఒత్తిడినుంచి
బయటపడి, తితీక్షతో కూడినవాడై సమాధిలో
నిలబడతాడు. మనస్సుని శాంతపరచి, ఇన్ద్రియములను
నిగ్రహించి, మనోబుద్దుల ఒత్తిడినుంచి బయటపడి,
తితీక్షతో కూడినవాడై సమాధిలో వున్నాడు అంటే అది
నిర్వికల్ప సమాధి; ఆ యోగి కి ఆ నిర్వికల్ప
సమాధిలో సర్వాత్మ భావము ఏర్పడుతుంది.
2 కుర్వన్నిత్యం కలయతి యతిః స్వ స్వ సర్వాత్మ భావమ్।
కుర్వన్నిత్యం యతిః -
ఎల్లప్పుడు చేయుచున్న యోగి;
స్వ స్వ సర్వాత్మ భావమ్ కలయతి -
తనయొక్క సర్వాత్మ భావమును అనుభవించును;
అలా ఎల్లప్పుడు నిర్వికల్ప సమాధి లో వున్న యోగి
తనయొక్క సర్వాత్మ భావమును అనుభవించును; ముందు
శ్లోకములో విన్నది బుద్ధి దోషమువలన కలిగే వికల్పాలు
ఆ సమాధిలో కరిగిపోతాయి అని. ఇక్కడ గురువు అలాంటి
మాటే చెపుతాడు;
3 తేనావిద్యాతిమిరజనితాన్ సాధు దగ్ధ్వా వికల్పాన్-
తేన అవిద్యాతిమిరజనితాన్ సాధు దగ్ధ్వా వికల్పాన్ -
దానిచే ( నిర్వికల్పసమాధిచేత) అవిద్యాంధకారముచే
జనించిన వికల్పములను బాగుగా భస్మము చేసి;
ఆ నిర్వికల్పసమాధి, అవిద్య అనే అంధకారము వలన పుట్టిన
అనాత్మ భావలను పూర్తిగా నాశనము చేయును అన్నమాట.
4 బ్రహ్మకృత్యా నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్పః:
బ్రహ్మకృత్యా నివసతి సుఖం-
బ్రహ్మాకారముతో సుఖముగా నివశించును;
నిష్క్రియో నిర్వికల్పః-
క్రియాశూన్యుడై, ఎట్టి వికల్పములు లేకుండా
ఆ నిర్వికల్పసమాధిలో ఉన్నయోగి నేనే బ్రహ్మమును
అనే భావనతో, క్రియాశూన్యుడై వికల్పములు లేని వాడై
సుఖముగా నివశించును
356 వ శ్లోకతాత్పర్యము:
మనస్సుని శాంతపరచి, ఇన్ద్రియములను
నిగ్రహించి,మనోబుద్దుల ఒత్తిడినుంచి బయటపడి,
తితీక్షతో కూడినవాడై ఎల్లప్పుడు నిర్వికల్ప సమాధిలో
వున్న యోగి, తనయొక్క సర్వాత్మ భావమును అనుభవించును;
ఆ నిర్వికల్పసమాధిలో , అవిద్య అనే అంధకారము వలన
పుట్టిన అనాత్మ భావలను పూర్తిగా నాశనము చేసి, ఆ
నిర్వికల్ప సమాధిలో వున్న యోగి నేనే
బ్రహ్మమును అనే భావనతో, క్రియాశూన్యుడై వికపల్పములు
లేని వాడై సుఖముగా నివశించును.
ఇక్కడ నిర్వికల్పసమాధిలో యోగి అనుభవించే స్థితిని
గురించి చెప్పాడు గురువు.
॥ఓం తత్ సత్॥
__________________________________