!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 361-363
వివేక చూడామణి 361-363 శ్లోకములు:
నిర్వికల్ప సమాధి లో ఆత్మ తత్త్వము గ్రహించడము గురించి
చెపుతూ గురువు, సూక్ష్మమైన ఆత్మ తత్త్వము తెలిసికోవడము
స్థూలశరీరములో నిలబడిన వారికి సాధ్యముకాదు. అది
సూక్ష్మ బుద్ధి కల ముముక్షువులకే సాధ్యము అనిచెపుతాడు.
దానికి ఉదాహరణగా గురువు ఎలా పుటము పెట్టిన బంగారము
మాలిన్యములను వదులునో అలాగే మనస్సులోని సత్త్వ రజో తమో
గుణముల రూపములో వున్న మాలిన్యములు, నిరంతర ధ్యానములో
పోవును అని చెపుతాడు. మాలిన్యములు పోవడముతోనే జీవుడు
బ్రహ్మానంద రసానుభూతి కూడా అనుభవించును అని
గురూపదేశము.
శ్లోకము 361
అతీవ సూక్ష్మం పరమాత్వ తత్త్వం
న స్థూల దృష్ట్యా ప్రతిపత్తు మర్హతి।
సమాధినాత్యన్త సుసూక్ష్మవృత్యా
జ్ఞాతవ్యమార్యైః అతి శుద్ధ బుద్ధిః॥
1 అతీవ సూక్ష్మం పరం ఆత్మ తత్త్వమ్ -
అతి సూక్షమైన పరమోత్కృష్ఠమైన ఆత్మ తత్త్వము
2 న స్థూల దృష్ట్యా ప్రతిపత్తు మర్హతి-
స్థూల దృష్టితో గ్రహించుటకు సాధ్యము కాదు;
ఆత్మ తత్త్వము నిర్గుణ నిరాకారములతో సూక్ష్మమైనది.
ఆత్మ తత్త్వము, 'పరం' అంటే అన్నిటికి అతీతమైనది
అనడములో భావము ,పంచకోశములకు అతీతమైనది అని. అటువంటి
ఆత్మ భావము, స్థూల శరీరము యొక్క భావముతో , అంటే
అహంకారము ఇత్యాది అనాత్మ లక్షణాలతో
పెంపొందిచడానికి సాధ్యము కాదు. వివేక చూడామణిలో ఇప్పటి
దాకా గురువు చెప్పినది, మనకి అర్థమైనది కూడా అదే.
స్థూలదృష్ఠితో సాధ్యముకాని ఆత్మతత్త్వము ఎవరికి
తెలుస్తుంది?
4 జ్ఞాతవ్యం ఆర్యైః అతి శుద్ధ బుద్ధిః-
అతి శుద్ధ బుద్ధిః ఆర్యైః జ్ఞాతవ్యం -
అతి శుద్ధ బుద్ధి గల ఆర్యులచేత తెలిసికొనబడ గలిగినది;
అంటే అత్యంత పరి శుద్ధమైన బుద్ధిగల పవిత్ర అంతః కరణ గల
ఆర్యులు తెలిసికొనగలరు - వాళ్ళు కూడా ఎలా తెలిసి
కుంటారు?
3 సమాధినా అత్యన్త సుసూక్ష్మవృత్యా -
అత్యంత సుసూక్ష్మవృత్యా సమాధినా-
అత్యంత సూక్ష్మముగా చేయడిన వృత్తి ద్వారా
సమాధితో ( లో)
అంటే ఆర్యులు కూడా, అతి సూక్షమైన భావనద్వారా అంటే
సవికల్ప సమాధిలో ఆత్మ తత్త్వము తెలిసికొనగలరు. ఇక్కడ
ఆర్యులు అంటే ముముక్షువులు అని.
అంటే అత్యంత పరి శుద్ధమైన బుద్ధిగల పవిత్ర అంతః కరణ గల
ముముక్షువులు అతి సూక్షమైన భావనద్వారా, అంటే సవికల్ప
సమాధిలో ఆత్మ తత్త్వము తెలిసికొనగలరు అని భావము.
361 వ శ్లోక తాత్పర్యము:
అతి సూక్షమైన పరమోత్కృష్ఠమైన ఆత్మ తత్త్వము స్థూల
దృష్టితో గ్రహించుటకు సాధ్యము కాదు;
అత్యంత పరి శుద్ధమైన బుద్ధిగల పవిత్ర అంతః కరణ గల
ఆర్యులు అతి సూక్ష్మమైన భావనద్వారా అంటే సవికల్ప
సమాధిలో ఆత్మ తత్త్వము తెలిసికొనగలరు.
అత్యంత పరి శుద్ధమైన బుద్ధిగల పవిత్ర అంతః కరణ గల
ఆర్యులు, మాలిన్యములు లేని పరిశుద్ధత్వము ఎలా వస్తుంది
అన్నది మళ్ళీ గురువు ఉదాహరణ రూపముగా చెపుతాడు.
శ్లోకము 362
యథా సువర్ణం పుటపాక శోధితమ్
త్యక్త్వామలమ్ స్వాత్మ గుణం సమృచ్ఛతి।
తదా మనః సత్త్వరజః తమోమలమ్
ధ్యానేన సంత్యజ్య సమేతి తత్త్వమ్॥
1 యథా సువర్ణం పుటపాక శోధితమ్ -
ఏ విధముగా పుటము పెట్టిన బంగారము
2 త్యక్త్వా అమలమ్ స్వాత్మ గుణం సమృచ్ఛతి।
మాలిన్యను వదిలేసి తన స్వగుణము ( స్వర్ణత్వము)
పొందునో:
పుటము పెట్టిన బంగారము, అంటే మంటలో కరిగించి
శుద్ధి చేయబడిన బంగారము. ఎలాగ బంగారము తన మాలిన్యమును
విడివి పరిశుద్ధమైన బంగారము అయినట్లు అని చెప్పడములో
భావము, - అలాగే మనలో వున్న మాలిన్యములు కూడా ఒక
క్రియతో పోతాయి. ఆ క్రియ ధ్యానము. అదే గురువు మూడు
నాలుగొవ పాదములో చెపుతాడు.
3 తదా మనః సత్త్వరజః తమోమలమ్-
అలాగే మనస్స్సులోని మాలిన్యమైన అయిన సత్త్వ రజో
తమో గుణములు
4 ధ్యానేన సంత్యజ్య సమేతి తత్త్వమ్-
ధ్యానముతో మాలిన్యము కోల్పోయి ఆత్మ తత్త్వము పొందును.
అలాగే ధ్యానముతో మనస్సులోని మాలిన్యమైన
అయిన సత్త్వ రజో తమో గుణములు మాలిన్యము కోల్పోయి ఆత్మ
తత్త్వము పొందును.
362 వ శ్లోక తాత్పర్యము:
ఏ విధముగా పుటము పెట్టిన బంగారము అంటే మంటలో కరిగించి
శుద్ధి చేయబడిన బంగారము , తన మాలిన్యమును విడివి
పరిశుద్ధమైన బంగారము అగులనో అలాగే ధ్యానముతో
మనస్స్సులోని మాలిన్యమైన అయిన సాత్త్వ రజో తమో
గూణములు మాలిన్యము కోల్పోయి మనస్స్సు ( జీవుడు) ఆత్మ
తత్త్వము పొందును.
ఈ శ్లోకములో సత్త్వ గుణము కూడా మలము అని
చెప్పబడినది.ముముక్షువు యొక్క ఆత్మాన్వేషణ అనే
ప్రయాణములో సత్త్వ గుణ ప్రయోజనము చాలావుంది.
మోక్షము పొందే స్థితి చేరడములో - తమో రజో గుణములను
త్యజించడములో సత్త్వగుణము చాలా అవసరము - అదేమాట
బంధములు వదలడానికి - నిర్ద్వందో నిత్య సత్వస్థో భవ -
ద్వంద్వాలకి అతీతముగా వుండు, ఎల్లప్పుడూ రజో తమో
గుణములను వదిలి సత్త్వస్థితిలో వుండుము అని కూడా
భవద్గీతలో వింటాము. సత్త్వగుణముతో బంధములను సన్యశించిన
తరువాత - అన్నిటిని త్యజించడానికి ఉపయోగించిన
సత్త్వగుణము కూడా త్యజించాలి అని వేదాలలో చెప్పిన మాట.
"యేన త్యజసి తత్ త్యజ" ; అంటే దేని సహాయముతో
అన్ని త్యజించావో దాన్ని కూడా త్యజించు అని ; అంటే
సత్త్వ గుణముకూడా చివరికి వదలవలసినదే. ఈ శ్లోకములో
మూడు గుణాలు ధ్యానములో నాశనమౌతాయి అనడములో అదే భావము.
మోక్షము పొందడములో, అత్మానుభవము పొందడానికి
అన్ని గుణాలకి ( మూడింటికి) ఆతీతుడు అవ్వాలి.
భవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో -
"నిస్త్రైగుణ్యో భవ"- అనడములో అదే భావము.
ధ్యానము నిరంతరము చెయ్యాలి. అప్పుడే జీవుడు ముందుకు
సాగగలుగుతాడు. నిరంతర ధ్యానము గురించి ముందు
శ్లోకములో.
శ్లోకము 363
నిరన్తరాభ్యాస వశాత్ తదిత్థమ్
పక్వం మనోబ్రహ్మణి లీయతే యదా।
తదా సమాధిః సవికల్పవర్జితః
స్వతో ఽద్వయానన్ద రసానుభావకః॥
1 నిరన్తరాభ్యాస వశాత్ తద్ ఇత్థమ్ -
తద్ ఇత్థమ్ నిరన్తరాభ్యాస వశాత్ -
అది( ఆ పరి శుద్ధమైన మనస్సు) ఈ విధముగా నిరంతర
అభ్యాసము వలన
2 పక్వం మనోబ్రహ్మణి లీయతే యదా-
ఎప్పుడు పక్వమైన మనస్సు బ్రహ్మములో లీనమగునో;
3 తదా సమాధిః సవికల్పవర్జితః
అప్పుడు సకల్ప స్థితిని విడిచి (నిర్వికల్ప)
సమాధిని పొంది
4 స్వతో ఽద్వయానన్ద రసానుభావకః-
స్వతః అద్వయానన్ద రసాను భావకః -
తనంతట తానే అద్వితీయమైన ఆనంద రసమును
అనుభవించును;
నిరంతర అభ్యాసముతో (పుటము పెట్టిన బంగారము
మాలిన్యములను వదిలినట్లు), మనస్సు మాలిన్యములన్ని
వదిలేసి బ్రహ్మము లో లీనమగును. అప్పుడు తనంతట తానే
అద్వితీయమైన ఆనంద రసమును అనుభవించును. అ రసానుభూతి
పొందడమే సవికల్ప సమాధి వదిలేసి నిర్వికల్ప సమాధి
పొందడము కూడా.
తాత్పర్యము:
అది( ఆ పరి శుద్ధమైన మనస్సు) ఈ విధముగా నిరంతర
అభ్యాసము వలన ఎప్పుడు పక్వమైన మనస్సు బ్రహ్మములో
లీనమగునో; అప్పుడు మనస్సు సకల్ప స్థితిని విడిచి
(నిర్వికల్ప) సమాధిని పొంది తనంతట తానే అద్వితీయమైన
ఆనంద రసమును అనుభవించును.
॥ఓం తత్ సత్॥
_________________________________________________
__________________________________