!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 367-370
వివేక చూడామణి 367-370 శ్లోకములు:
"నిర్వికల్పక సమాధినా స్ఫుటం" అంటూ ముందు 366వ
శ్లోకములో, నిర్వికల్పసమాధిలో బ్రహ్మ తత్త్వము
స్ఫుటముగా అంటే స్పష్ఠముగా అవగాహన అవడము నిశ్చయము అని
చెప్పాడు గురువు. ఇక్కడ మూడు శ్లోకాలలో మనస్సుని
నిర్వికల్ప సమాధిలోకి ఎలా తరలించాలో గురువు
విశదీకరిస్తాడు.
శ్లోకము 367
అతః సమాధత్స్వ యతేన్ద్రియః సన్
నిరన్తరః శాన్తమనాః ప్రతీచి।
విధ్వంసయధ్వాన్తమనాద్యవిద్యయా
కృతం సదేకత్వ విలోకనేన॥367॥
1&2 పాదములు
అతః యతేన్ద్రియః సన్ -
అందువలన ఇన్ద్రియములను నిగ్రహించి;
నిరన్తరమ్ శాన్తమనాః -
ఎల్లప్పుడును ప్రశాంతమనస్కుడవై;
సమాధత్స్వ ప్రతీచి -
మనస్సును ప్రత్యగాత్మయందు నిలుపుము;
అందువలన, ఇన్ద్రియములను నిగ్రహించి, ఎల్లప్పుడును
ప్రశాంతమనస్కుడవై, మనస్సును ప్రత్యగాత్మయందు నిలుపుము
అని భావము.
అందువలన అనడములో ముందు శ్లోకాలలో చెప్పిన మాటలు
గుర్తుకి తెస్తాడు గురువు.
నిర్వికల్పసమాధిలో బ్రహ్మ తత్త్వము స్ఫుటముగా
అంటే స్పష్ఠముగా అవగాహన అవడము నిశ్చయము అని చెప్పాడు
ముందు శ్లోకములో గురువు. అందువలన బ్రహ్మ తత్త్వము
స్ఫుటముగా తెలియుటకై - నిర్వికల్పసమాధిచేరడానికి
ఇన్ద్రియములను నిగ్రహించి, ఎల్లప్పుడును
ప్రశాంతమనస్కుడవై, మనస్సును ప్రత్యగాత్మయందు నిలుపుము
అని గురువు చెపుతున్నాడు.
3&4 పాదములు
సదేకత్వ విలోకనేన -
అన్నీ ఒకటే అన్న జ్ఞానముతో విలోకించుచు
అనాద్య అవిద్యయా కృతం -
అనాదియైన అవిద్యతో ( అజ్ఞానముతో) చేయబడిన
ద్వాన్తం విధ్వంసయ -
అంధకారమును నశింపచేయుము
ఇన్ద్రియములను నిగ్రహించి, ఎల్లప్పుడును
ప్రశాంతమనస్కుడవై, మనస్సును ప్రత్యగాత్మయందు నిలిపిన
ముముక్షువు, అన్నీ ఒకటే అన్న జ్ఞానముతో,
అంధకారమయమైన అజ్ఞానాన్ని నశింపచేయాలి. అన్నీ ఒకటే అన్న
జ్ఞానము అంటే సకలభేద రహితమైన బ్రహ్మ సాక్షాత్కారము.
నిర్వికల్ప సమాధిలో బ్రహ్మ తత్త్వము అవగాహన అవుతుంది
అని విన్న మాట. బ్రహ్మతత్త్వము అంటే సకలభేద రహితమైన
బ్రహ్మ సాక్షాత్కారమే. ఆ జ్ఞానముతో అజ్ఞానాన్ని (
దానితో కూడిన అంధకారమును) నశింపచేయాలి అన్నమాట.
367 వ శ్లోకము తాత్పర్యము:
అందువలన అంటే బ్రహ్మ తత్త్వము స్ఫుటముగా తెలియుటకై,
ఇన్ద్రియములను నిగ్రహించి, ఎల్లప్పుడును
ప్రసాన్తమనస్కుడవై, మనస్సును ప్రత్యగాత్మయందు
నిలుపుము. అప్పుడు అన్నీ ఒకటే అన్న జ్ఞానముతో అంటే
సకలభేద రహితమైన బ్రహ్మ సాక్షాత్కారముతో విలోకించుచు,
అనాదియైన అంటే అఖిలసంసారభూతమైన అజ్ఞానముతో కలిగింపబడిన
అంధకారమును నశింపచేయుము అని
ముందు శ్లోకములో నిరివికల్ప సమాధి లో బ్రహ్మతత్త్వము
అవగాహన అవుతుంది కనక ఆ యోగస్థితి సంపాదించడానికి
మార్గాల గురించి ముందు శ్లోకములో చెపుతాడు గురువు
శ్లోకము 368
యోగస్య ప్రథమం ద్వారం
వాజ్నిరోధోఽపరిగ్రహః।
నిరాశాచ నిరీహా చ
నిత్యమేకాన్త శీలతా॥368॥
1 యోగస్య ప్రథమం ద్వారం -
యోగము యొక్క మొదటి ద్వారము
2 వాజ్నిరోధోఽపరిగ్రహః - వాక్ నిరోధః అపరిగ్రహః -
వాక్ నిరోధము, అపరిగ్రహము;
వాక్ నిరోధము అంటే వాక్ అలాగే అన్ని కర్మేన్ద్రియాలను
నిరోధించుట అని. అపరిగ్రహము అంటే తనకొరకై వస్తువులను
సమకూర్చుకొనకుండుట. అంటే ఆ యోగస్థితి చేరడానికి ప్రథమ
సోపానము , కర్మేన్ద్రియాల పనులని నిరోధించాలి,
అలాగే తనకోసము వస్తువులను సమకూర్చుకొనకుండా
వుండాలి. యోగ స్థితి చేరడానికి చేయవలసినవి ఇంకా
వున్నాయి . అవి మూడు నాలుగొవ పాదాలలో.
3 నిరాశాచ నిరీహా చ -
వాంఛలు లేకుండావుండుట, కామ్య కర్మలను విడిచి పెట్టుట;
వాంఛలు లేకుండా వుండుట అంటే విషయవాంఛలందు ఆసక్తి
లేకుండుట; కామ్యకర్మలను త్యజించుట.
4 నిత్యమేకాన్త శీలతా-
ఎల్లప్పుడు ఏకాన్తముగా వుండుట;
ఏకాన్తము అంటే ఒకే లక్ష్యముతో ( బ్రహ్మయందే నిలిపిన
మనస్సుతో) వుండుట అని.
వాంఛలు లేకుండావుండుట అంటే విషయవాంఛలందు ఆసక్తి
లేకుండుట; కామ్యకర్మలను త్యజించుట, ఎల్లప్పుడు
ఏకాన్తముగా వుండుట ఆ యోగ స్థితి చేరడానికి సోపానములు.
368 వ శ్లోక తాత్పర్యము:
యోగము యొక్క మొదటి ద్వారము వాక్ నిరోధము, అపరిగ్రహము,
వాంఛలు లేకుండావుండుట, కామ్య కర్మలను విడిచి
పెట్టుట;ఎల్లప్పుడు ఏకాన్తముగా వుండుట.
శ్లోకము 369
ఏకాన్తస్థితిః ఇన్ద్రియోపరమణే హేతుర్దమశ్చేతసః
సంరోధే కరణం శమేన విలయం యాయాదహం వాసనా।
తేనానన్దరసానుభూతి రచలా బ్రాహ్మీ సదా యోగినః
తస్మాత్ చిత్తనిరోధ ఏవ సతతం కార్యః
ప్రయత్నాన్మునేః॥369॥
1&2 పాదములు
ఏకాన్తస్థితిః ఇన్ద్రియోపరమణే హేతుః-
ఏకాంత స్థితి వలన ఇన్ద్రియముల నిగ్రహించవచ్చును;
దమశ్చేతసః సంరోధే కరణం- దమః చేతసః సంరోధే కరణం-
ఇంద్రియ నిగ్రహము మనస్సుని శాంతపరచును;
శమేన విలయం యాయాత్ అహం వాసనా-
శమేన అహం వాసనా విలయం యాయాత్ -
శమముతో అహంకారవాసనలు విలయమును పొందును;
ఏకాంత స్థితి వలన ఇన్ద్రియముల నిగ్రహించవచ్చును.
ఇంద్రియ నిగ్రహము మనస్సుని శాంతపరచును. శాంతపడిన
మనస్సుతో అహంకారవాసనలు అణిగి పోవును.
ఇక్కడ గురువు యోగస్థితి పొందే మార్గము
విశదీకరిస్తున్నాడు.
3 తేన ఆనన్దరసానుభూతిః అచలా బ్రాహ్మీ సదా యోగినః -
తేన యోగినః అచలా బ్రాహ్మీ ఆనన్దరసానుభూతిః -
దానితో అచంచలమైన నిశ్చలమైన యోగికి బ్రహ్మ సంబంధమైన
అనుభూతి కలుగును
దానితో మొదటి రెండు పాదములలో చెప్పిన రీతిగా చిత్త
నిరోధనము సంపాదించిన యోగికి ఏమి లభిస్తుంది. అట్టి
యోగికి అచంచలమైన నిశ్చలమైన యోగికి బ్రహ్మ సంబంధమైన
అనుభూతి కలుగును అని భావము.
4 తస్మాత్ మునేః ప్రయత్నాత్ సతతం చిత్తనిరోధఏవ కార్యః
అందువలన మునులు ఎల్లప్పుడు చిత్త నిరోధమే చేయతగును.
369వ శ్లోకతాత్పర్యము:
ఏకాంత స్థితి వలన ఇన్ద్రియముల నిగ్రహించవచ్చును.
ఇంద్రియ నిగ్రహము మనస్సుని శాంతపరచును. శాంతపడిన
మనస్సుతో అహంకారవాసనలు అణిగి పోవును. దానితో(
చిత్తనిరోధనము సాధించిన) నిశ్చలమైన యోగికి బ్రహ్మ
సంబంధమైన అనుభూతి కలుగును. అందువలన మునులు ఎల్లప్పుడు
చిత్త నిరోధమే చేయతగును.
శ్లోకము 370
వాచం నియచ్ఛాత్మని తం నియచ్ఛ
బుద్ధౌ ధియం యచ్ఛవ బుద్ధి సాక్షిణి।
తం చాపి పూర్ణాత్మని నిర్వికలే
విలాప్య శాన్తిం పరమాం భజస్వ॥370॥
1&2 వ పాదాలు
వాచం నియచ్ఛాత్మని -
వాగిన్ద్రియమును మనస్సులో నిరోధింపును
తం నియచ్ఛ బుద్ధౌ -
దానిని అంటే అ సంకల్పవికల్పములు లేని మనస్సుని,
బుద్ధిలో నిలుపుము
ధియం యచ్ఛ బుద్ధి సాక్షిణి -
ఆ విధముగా శాంతిపొందిన బుద్ధిని సాక్షి అయిన
చైతన్యమునందు నిలుపుము
వాగిన్ద్రియమును మనస్సులో నిరోధింపుము, అప్పుడు అ
సంకల్పవికల్పములు లేని మనస్సుని బుద్ధిలో నిలుపుము. ఆ
విధముగా శాంతిపొందిన బుద్ధిని సాక్షి అయిన
చైతన్యమునందు నిలుపుము అంటే ప్రత్యగాత్మ యందు నిలుపుము
అని. వాగిన్ద్రియములను నిరో ధించడముతో మనస్సు సంకల్ప
వికల్పములు లేకుండా నిర్మలమౌతుంది. ఆ మనస్సుని
బుద్ధిలో నిలుపుము అంటే బుద్ధికూడా శాంతపడుతుంది
అన్నమాట. ఆ శాంతించిన బుద్ధిని ప్రత్యగాత్మలో నిలుపుము
అని గురూపదేశము.
3&4
తం చాపి - దానిని కూడా
పూర్ణాత్మని నిర్వికల్పే విలాప్య -
నిర్గుణమైన పూర్ణాత్మలో అంటే బ్రహ్మమునందు విలీనము
చేసి
శాన్తిం పరమాం భజస్వ -
పరమ శాంతిని పొందుము
దానిని కూడా అంటే ప్రత్యగాత్మలో నిలిపిన మనస్సుని ,
నిర్గుణమైన పూర్ణాత్మలో అంటే బ్రహ్మమునందు విలీనము
చేసి పరమ శాంతిని పొందుము:
అంటే ఈ శ్లోకములో గురువు పరమశామ్తి పొందడానికి ఎక్కే
సోపానములను ( మెట్లని) మనికి అవగతము చేశాడన్నమాట.
370 వ శ్లొక శ్లోకతాత్పర్యము:
వాగిన్ద్రియమును మనస్సులో నిరోధింపును, అప్పుడు అ
సంకల్పవికల్పములు లేని మనస్సుని బుద్ధిలో నిలుపుము. ఆ
విధముగా శాంతిపొందిన బుద్ధిని సాక్షి అయిన
చైతన్యమునందు నిలుపుము అంటే ప్రత్యగాత్మ యందు నిలుపుము
అని. దానిని కూడా అంటే ప్రత్యగాత్మలో నిలిపిన మనస్సుని
, నిర్గుణమైన పూర్ణాత్మలో అంటే బ్రహ్మమునందు విలీనము
చేసి పరమ శాంతిని పొందుము
॥ఓం తత్ సత్॥
__________________________________________________________
__________________________________